ఒక అందమైన దృశ్యాన్ని చూస్తే హృదయం పరవశిస్తుంది.ప్రకృతి అందాలకు మనసు మురిసిపోతుంది. పైరగాలి పాటకు ప్రాణం లేచి వస్తుంది.బోసినవ్వుల పసిపాపను చూస్తే అప్రయత్నంగా మన పెదవుల పై చిరునవ్వు ప్రత్యక్షం అవుతుంది. ఎవరయినా మనల్ని పలకరిస్తే ముఖం విప్పారుతుంది.ఏదయినా ప్రశ్న వేస్తే జవాబిస్తాం. అడగాలనిపిస్తే ప్రశ్నిస్తాం.హాస్యానికి నవ్వులతో హారతి పడతాం.క్లిష్టమైన సమస్యలకు తర్కాన్ని అన్వయిస్తాం. తోటివారు చూపే ప్రతిభా నైపుణ్యాలను అభినందిస్తాం. ఇలా ఎన్నో విధా లుగా ప్రతిస్పందిస్తుంటాం. ఇది మానవ సహజ లక్షణం. కానీ ప్రస్తుతం ఒక కొత్త తరహా మానసిక స్థితి ఏర్పడుతుంది. దేనికీ స్పందించకపోవటం. Online or offline మనకెందుకు లే అనే భావన. ఇది ప్రత్యక్ష సంభాషణల్లోను పరోక్ష social మీడియాలోనూ గమనించవచ్చు. FB లో చాలా మంది అసలు active గా ఉండరు. Active గా ఉన్నవాళ్లలో ఎక్కువ మంది ఒక paragraph అయినా చదవరు. చదివిన వారు స్పందించరు. ఇక whatsapp లో మరీను.256 మంది ఉన్న group లో ఏ కొద్ది మందో post లు పెడుతుంటారు. ఒక్కరు లేదా కనీసం ఇద్దరు కూడా స్పందించరు.ఇక చాలామంది వారికి ప్రత్యక్షంగా whatsapp కి పంపిన సమాచారానికి కూడా స్పందించరు. పంపేవారు కూడా అవసరం లేనివికూడా ఎక్కువ సందేశాలు పంపుతుంటారు.whatsapp ఓ రకంగా మనం మరిచిపోయిన ఉత్తరాలు వ్రాసుకోవడానికి ఆధునిక రూపం. ఏదయినా మాట్లాడు కుంటేనే మాటలు, స్నేహం కుదురుతుంది. స్పందిస్తుంటేనే మన మనస్తత్వం ఎదుటివారికి అర్ధమవుతుంది. Social media ను మనం ఇంతకుముందు వ్రాసిన ఉత్తరాలకు బదులుగా చక్కగా ఉపయోగించుకోవచ్చు.ఎంత మంచి విషయం post చేసినా కనీసమైన స్పందన ఉండటం లేదు.communication gap భయంకరం గా కనిపిస్తుంది. పరస్పర మానవ సంబంధాల్లో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు ఎవరితో వివరంగా ఏదీ చెప్పరు. చెప్పినా దానికి సరిఅయిన సమాధానం ఇవ్వరు.ఇలా కుటుంబంలో,బయట స్పష్టత స్పందన కరువై ఎన్నో సమస్యలు సంక్లిష్టం గా మారుతున్నాయి.మానవ సంబంధాల పటిష్టతకు కనీసం ఒక ఫోన్ కాల్, లేదా ఒకసారి ఆత్మీయులను కలవడం చేయాలి. అవతలి వారి బాధలు వినాలి.సహానుభూతి(empathy )కలిగి ఉండాలి. స్పందించే గుణం కోల్పోతే సగం జీవితం కోల్పోయినట్లే..... ఒద్దుల రవిశేఖర్.
Monday 28 March 2022
Sunday 20 March 2022
Heal Paradise(అనాధ పిల్లల పాఠశాల ) village సందర్శన
ఎప్పటినుండో అనుకుంటూ వెళ్లలేకపోయిన ప్రదేశం ఇది. ఓ సారి CA PRASAD గారి పిలుపు మేరకు నయీ తాలీమ్, మానవతా మిత్రమండలి సమావేశానికి 2018 లో వెళ్లలేకపోయిన ప్రాంతం. కరోనా కష్టాలు తొలగి పోయిన తరువాత ఇక వెళ్లకుండా ఉండలేక పో యాను. ప్రసాద్ గారు అందులో పనిచేసే కరుణ బాబు, మణికుమారి ఫోన్ numbers ఇవ్వడం తో వారి తో సంప్రదించగా రమ్మన్నారు.మణికుమారి గారయితే అమెరికా నుండి ఫోన్ చేసి campus incharge ప్రసాద్ గారి నెంబర్ ఇచ్చారు.vijayawada city bus stand నుండి 308 అగిరపల్లి bus ఎక్కి గంట ప్రయాణం తరువాత దిగాను. నూజివీడు రూట్ లో 30 కి. మీ ఉంటుంది. ముందుగానే నాకోసం wait చేస్తున్న Blind school incharge అబ్రహాం గారు నన్ను అక్కడనుండి 5km దూరంలోనున్న పాఠశాలకు తీసుకెళ్లి సంజన madam గారికి పరిచయం చేశారు. ఆమె ఈ మధ్యనే అక్కడ చేరారట.B.Tech పూర్తి చేసి వాలంటీర్ గా అక్కడ చేరారు. ఆమె campus అంతా చూపిస్తూ వివరంగా చెప్పారు. పాఠశాలలో సుమారు 700 మంది అనాధ, పేద పిల్లలకు 1 నుండి 12 తరగతి వరకు CBSE విధానం లో ఉచిత విద్య నందిస్తున్నారు.మొదట ఆర్గానిక్ ఫార్మింగ్ చూసాము. దానికి వెనుకగా పెద్ద సరసు.ప్రకృతి అంతా పిండారబోసినట్లు. తరువాత blind school చూసాము incharge అబ్రాహాం గారు. ఎవరయినా పిల్లలు ఉంటే refer చెయ్యమన్నారు. తరువాత జైపూర్ పాదం తరహాలో ఇక్కడ కూడా 18ఏండ్ల లోపల వయసు గలవారికి చెయ్యి కాలు రెండూ అమర్చుతారు. Great service. అక్కడ నుండి సోలార్ పవర్ తో నడిచే కిచెన్ చూపించారు.శక్తి వనరులు ఆదా చేయడం ఎలాగో ప్రత్యక్షంగా చూడొచ్చు. భవనం పై ఏర్పాటు చేసిన సౌరఫలకల తోనే మొత్తం campus అంతా కరెంటు అవసరాలు తీరుతున్నాయి. మిగిలిన విద్యుత్ ను ప్రభుత్వానికి అమ్ముతారు. మంచి రుచికరమైన పోషకాహారం పిల్లలకు అందిస్తున్నారు. తరువాత ప్రిన్సిపాల్ శ్రీదేవి గారితో, campus incharge ప్రసాద్ గారితే మాట్లాడి HEAL SCHOOL గురించి వివరంగా తెలుసుకున్నాను. వారు తమ సమయాన్ని నాకు కేటాయించి ఎంతో ఆదరంతో మాట్లాడారు. ఏదయినా విద్యార్థులకు నా వంతు సహాయం చేయగలనని తెలిపాను.science labs అద్భుతంగా తీర్చి దిద్దారు. ఆధునిక మైన డిజిటల్ classrooms, computer lab ఉన్నాయి. పిల్లలకు అన్ని రకాల ఆటలు ఆడుకోవడానికి విశాలమైన ఆటస్థలం ఉంది.ఎవరికయినా సహాయం చేయాలనుకుంటే అత్యంత అర్హులు అనాధ పిల్లలే. ఇంత గొప్ప సేవకు అంకురార్పణ చేసి అనాధపిల్లల కు భువిపై స్వర్గాన్ని సృష్టించిన పాఠశాల వ్యవస్థాపకులు శ్రీ సత్యప్రసాద్ కోనేరు గారు వారి మిత్రులు ఎంతయినా అభినందనీయులు. మనం ధనం,కాలం, జ్ఞానం, ప్రేమ ల్లో ఏదయినా ఆ అనాధపిల్లలకు అందించ వచ్చు. ఒకసారి మీరు చూసి నిర్ణయం తీసుకోండి... ఒద్దుల రవిశేఖర్
Thursday 10 February 2022
మనపై మనకు ప్రేమ.
మనం ఎన్నో పనుల్లో నిమగ్నమవుతుంటాం. ఉద్యోగం,వృత్తి, వ్యాపారం,సేవ, ఇంకా ఎన్నో.నిజంగా ఆయా పనులను సంపూర్ణమైన ఇష్టంతో, ప్రేమతో చేస్తున్నామా ఆలోచించండి.ఎంతో మందిని అభిమానిస్తుంటాం. సినిమాలు, రాజకీయం,ఆటలు వంటి విభాగాల్లో ప్రసిద్దులను అభిమానిస్తుంటాం, ఇష్టపడుతుంటాం.ఒక్కోసారి ఈ ఇష్టం ఎంత వరకు వెడుతుందంటే తమ తల్లిదండ్రులను ఇష్టపడే కంటే,తమనితాము ఇష్టపడే కంటే, తమనితాము ప్రేమించే కంటే ఎక్కువగా ఉంటుంది.ఎవరినైనా అభిమానించవచ్చు. కానీ అది తమ విలువైన కాలాన్ని ఎంత హరిస్తుందోతెలుసుకోరు,పైగా తమ లక్ష్య సాధనకు అడ్డంకి గా కూడా మారొచ్చు. తాము ఎదగాలి అనుకున్న రంగాల్లో కానీ లేదా విభిన్న రంగాల్లో ప్రసిద్దులైన వారి జీవిత చరిత్రలు చదివి లేదా వారి సందేశాలు విని ప్రేరణ పొందవచ్చు. ఆ అభిమానం, ప్రేమ, ఇష్టం తమపై, తాము చేసే పనులపై పెడితే ఎన్నో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. ఉదాహరణకి తమ పై తమకి ప్రేమ ఉన్నవారు ఆహార అలవాట్లలో, ఆరోగ్యవిషయాల్లో, వ్యాయామం చేయడం లో శ్రద్ద పెడతారు.... ఒద్దుల రవిశేఖర్.
Tuesday 8 February 2022
యాగంటి సందర్శన
27 ఏండ్ల నుండి నంద్యాల వస్తున్నా, మహానంది చాలా సార్లు చూసినా యాగంటి చూడటం కుదర్లేదు. ఇన్నాళ్ళకి కుదిరింది. నంద్యాల నుండి బనగానపల్లికి ₹35 టికెట్ ఉంటుంది. మధ్యలో పాణ్యం వస్తుంది. బనగానపల్లి నుండి ఆటో లో ₹30 ఛార్జ్.10కిమీ ఉంటుంది. మధ్యలో KC canal వస్తుంది.ప్రఖ్యాతి గాంచిన బేతంచెర్ల బండల గనులు కనపడతాయి. రెండు కొండల నడుమ కోనేరు, శివాలయం ఉన్నాయి.కోనేరు చాలా అద్భుతంగాఉంది.ప్రస్తుతం ప్రవేశం లేదు.కోనేరు చుట్టూ చక్కటి నిర్మాణం తో గోడ ఉంది.ఆలయం ప్రక్కనే కొండమీద నుండి నిరంతరం వచ్చే నీరు ఈ కోనేటిలోకి వస్తాయి. మహానంది లో కూడా ఇలానే నీళ్లు వస్తుంటాయి. ఈ నీళ్లతోనే 500 ఎకరాల్లో అరటి సాగు చేస్తుంటారు రైతులు.వేసవి లో కూడా తగ్గకుండా వస్తూనే ఉంటాయట. ఇప్పటికీ అర్ధం కానీ రహస్యం ఇది.ఇక యాగంటి లో గుడి ప్రక్కనే ఉన్న కొండలో ఒక గుహ ఉంది. ఇక్కడే అగస్త్యమహాముని తపస్సు చేశారట.గుహను చూస్తే సంభ్రమాశ్చర్యాలకు గురవుతాము.సహజంగా ఏర్పడ్డట్లే ఉన్నాయి. మెట్లు ఎక్కి పైకి వెళ్లాలంటే పెద్దవారికి వీలు కాదు. గుహ పైన చీలిక ఉంది. దాని ద్వారా చక్కటి వెలుతురు వస్తుంది. ఈ గుహ ప్రక్కనే ఇంకో గుహలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. మహానంది లాగా ఇక్కడ అంతగా అభివృద్ధి జరగ లేదు. చెట్లు ఎక్కువగా కనపడలేదు. కొండల మీద చెట్లే మీ లేవు. కొండల మీద, గుడి ముందు మొక్కలు నాటి పెంచితే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది.బనగానపల్లి లోనే బ్రహ్మం గారు పశువులను కాస్తూ రవ్వలకొండ లో సహజసిద్ధంగా ఏర్పడ్డ గుహలో కాలజ్ఞానం వ్రాసారట. తాడిపత్రి కి వెళ్ళేదారి లోనే ప్రసిద్ధిచెందిన బెలుం గుహలు ఉంటాయి. మరోసారి వాటిని చూడాలి.
Sunday 2 January 2022
ఒక వైపు.....ఇంకోవైపు.
కాలం చెక్కిన గాయాన్ని మాన్పటానికి ప్రయత్నం ఒకవైపు,నిర్లక్ష్యపు చేష్టలతో ప్రాణం మీదకు తెచ్చుకునే మనుషులొక వైపు, ఇది జరుగుతున్న వర్తమానం. ప్రకృతిలో ఎప్పుడూ పరస్పర విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణ అనివార్యం.చరిత్ర మొత్తం మనకు కనిపిస్తున్నదిదే. విధ్వంసక ఆయుధాల కుప్పలపై కూర్చున్న రాజ్యాలొక వైపు,నిస్సహాయంగా చూస్తున్న ఐక్యరాజ్య సమితి మరో వైపు ,నడుస్తున్న నాటకమిదే. మనిషికి రక్షణ ఛత్రంలా ప్రకృతి ఒక వైపు,దాన్ని ఛిద్రం చేస్తూ కాలుష్యం మరోవైపు మనం నిత్యం చూస్తున్నదిదే. అయస్కాంత మేదో ఆకర్షించినట్లు సంపద కేంద్రీకృతం ఒకవైపు,కోట్ల మంది దరిద్రనారాయణుల జీవితమొకవైపు , కఠిన వాస్తవమిదే. సృష్టికి ప్రతిసృష్టి చేసే విజ్ఞానం ఒక వైపు,జీవితాలను దుర్భరం చేసుకునే అజ్ఞానం మరోవైపు. ప్రజాస్వామ్యం ఇచ్చిన స్వేచ్ఛ ఒక వైపు,నియంతృత్వపు పరిపాలనలోని దైన్యం మరో వైపు. బంగారం లాంటి భూమిని మరుభూమిగా మారుస్తున్న వైనం ఒక వైపు,అంగారకుడి ఉపరితలంపై ఆవాసం కోసం ఆరాటం మరో వైపు. నాణ్యమైన,సుఖప్రదమైన జీవితాలొక వైపు,క్షణ క్షణం బ్రతుకు నరకం మరొక వైపు. అధిక ఆహారంతో ఊబకాయ ప్రపంచం ఒకవైపు,ఆకలితో డొక్కలంటుకుపోయిన ప్రజలొక వైపు. వేలకోట్ల ఆకాశ హర్మ్యాలొక వైపు,నిత్యం రాత్రి ఆకాశం చూసే కోట్లాది బ్రతుకులొక వైపు. ఈ ఘర్షణకు అంతం ఎప్పుడో, లేదా అంతమే పరిష్కారమా! కాలమే సమాధానం ఇవ్వాలి..... ఒద్దుల రవిశేఖర్.
Saturday 1 January 2022
నూతన సంవత్సరం(2022)... నూతన ఆలోచనలు
ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోను స్థానిక కాలమాన పరిస్థితుల్ని బట్టి వారి క్రొత్తసంవ త్సరాలు జరుపుకుంటారు.కానీ ప్రపంచీకరణ జరిగిన తరువాత ఆంగ్లసంవత్సరాన్ని నూతన సంవత్సరంగా జరుపుకునే సంస్కృతి గత 30 సం. నుండి విస్తృతమైంది.ఇక అందరు గతం నుండి బయటపడి నూతన సం.లో సంతోషంగా,ఆరోగ్యంగా ఉండాలని ఇతరులకు శుభాకాంక్షలు చెప్పుకోవడం అలవాటయ్యింది.నిజంగా ప్రపంచంలోని మనుషులందరు ఆశించినట్లు ఇతరుల మేలు కోరే సమాజం ఈ రోజు బాగా కనిపిస్తుంది.ఇతరులగే కాక మనకు మనం శుభాకాంక్షలు చెప్పుకుంటే మరింత బాగుంటుంది.ఎందుకంటే మన ఆలోచనల్లో వచ్చే మార్పులు,నూతన ఆలోచనలు మనకు మేలు జరగడంతో పాటు ఇతరులకు కూడా ఉపయోగపడాలి,లేదా నష్టం కలిగించకుండా ఉండాలి.అలాగే మనకు నష్టం కలిగించే అసూయ,ద్వేషం,కోపం,బద్దకం,నిర్లక్ష్యం లాంటి వాటినుండి విముక్తి పొంది ప్రేమ,కరుణ,స్నేహం,శాంతి మన మనసులో విరబూయాలని మనకు మనం కోరుకుందాం . ఏ వృత్తిలో ఉన్న వారయినా తాము చేసే పనులతో తమలో నైపుణ్యాలు పెంచుకుంటూ,ఇతరులకు ఉపయోగపడేలా ప్రవర్తించాలి.ఉదాహరణకు ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు చక్కని విద్యను అందించాలని,ఒక వైద్యుడు రోగులకు మరింత మెరుగైన సేవలందించాలని,రాజకీయనాయకులు ప్రజలజీవితాల్లో మార్పులు తీసుకురావాలని,ఉద్యోగులు ప్రజలకు బాధ్యతగా ఉండాలని,వ్యాపారవేత్తలు నాణ్యమైన వస్తువులు తయారుచేయాలని ఇలా ఎవరికివారు తమకి తాము శుభాకాంక్షలు చెప్పుకోవాలి.మనలో వచ్చే మార్పే బయట ప్రతిఫలిస్తుంది.ఇలా ఎవరికి వారు మారితే బయటి ప్రపంచం సుఖసంతోషాలతో ఉంటుంది.నూతన ఆలోచనలతో మనలో వచ్చేమార్పు అందరికి శుభం కలిగిస్తుంది.అందరికి నూతన సం. శుభాకాంక్షలు.......ఒద్దుల రవిశేఖర్.
Thursday 30 December 2021
వెళ్ళు, నీ కలను వేటాడు(Go,Hunt your dream)
https://www.fearlessmotivation.com/2019/06/29/go-hunt-your-dream-official-music-video-and-lyrics/. (Thanks to "fearless motivation" William Hollis and Chris's Ross) పై లింక్ లో వీడియో చూడండి.Powerful motivation. *కల ....అది అత్యంతశక్తివంతమైన పదం. *నీ కలలను వేటాడే క్రమంలో నీవు చాలాసార్లు పడిపోయి ఉండవచ్చు. *తిరిగి ప్రయత్నించడానికి నీకు శక్తి లేదని భావించవచ్చు. *తిరిగి లేవడానికి నీకు బలం లేకపోవచ్చు *ఇక వదిలివేయడం ఒక్కటే మార్గం అనిపించవచ్చు *జీవితం కొట్టే ఎదురుదెబ్బలకు నీవు పడిపోవచ్చు *అదే సరైన సమయం తిరిగి కొట్టటానికి. *చాలా మంది జీవితం కొట్టే దెబ్బలకు ఎదురుతిరిగి పోరాడలేరు. *నీవు అలాగే క్రిందనే ఉండిపోతావా లేదా తిరిగిలేచి పోరాడటానికి సిద్ధంగా ఉన్నావా *నీ మీద ఎవరికీ నమ్మకం లేనప్పుడు తిరిగి పోరాడటానికి ధైర్యం కావాలి.నమ్మకం కావాలి.బలమైన మనస్తత్వం కావాలి. *మనందరిలో ఒక సింహం ఉంటుంది. *కొంతమంది ఆ సింహాన్ని ఎప్పుడూ లేపరు. *చాలా మంది ఆ సింహాన్ని బోనులో పెట్టి తాళం వేస్తారు. *నీ కలను సాధించటానికి ఆకలిగొని ఉన్నావా *ఆ కలను నెరవేర్చుకోవడానికి పోరాటం చేస్తావా *ఆ సింహాన్ని బయటకు రానీయండి.నీ కలను సాధించే ఆకలి గొనండి. *వెళ్ళు వేటాడునీ కలను సాధించడానికి *ఆ కల గురించి మాట్లాడటం నిన్ను ముందుకు తీసుకు వెళ్లదు. *పని చేయడం మాత్రమే నిన్ను ముందుకు తీసుకు వెడుతుంది. *నిన్ను సందేహించేవాళ్ళు వాస్తవికంగా వెళ్లమంటారు. *నిన్ను ద్వేషించేవాళ్ళు వైదొలగమంటారు. *కానీ ముందుకురికి ఆ కలను సాధించగలిగేది నువ్వే *అది నీ కల.దాన్ని ఎవరూ వెంటాడరు *ఎవరు నీ కోసం దాన్ని వేటాడరు *నీ కలకు ఎవ్వరూ మద్దతివ్వరు,నీవు తప్ప. *ఒక సామెత లో ఇలా ఉంది"ప్రతి ఒక్కరికి తినాలని ఉంటుంది.కొంతమంది మాత్రమే వేటకు సిద్ధంగా ఉంటారు.ప్రతి ఒక్కరికీ విజయం సాధించాలని ఉంటుంది.కానీ కొంతమందే అందుకవసరమైన పనిలోకి దిగుతారు. *మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోవద్దు. *మీ కలలను మీరు నిజాలుగా మార్చుకోగలరు. *కానీ అది సాధ్యపడుతుందని ఒక్కరు మాత్రం విశ్వసించాలి.ఒక్కరు మాత్రం పనిలోకి దిగాలి. ఆ వ్యక్తి నువ్వే *నీ కంటే ముందు చాలా మంది,వారు కలగన్న జీవితాలను జీవించారు.పెద్ద పెద్ద విజయాలు సాధించారు. *వారు సాధించారు.అదే సాక్ష్యం నువ్వు సాధించగలగడానికి. *నువ్వు నిజంగా కోరుకుంటే నీ కలను నిజం చేసుకోగలవు. *నీ కలలకు నువ్వే భయంకరమైన శత్రువువి. ఎందుకంటే నీ కలను ఎప్పుడు విడిచిపెట్టాలో,నువ్వే నిర్ణయిస్తావు కనుక,నువ్వే నిర్ణయిస్తావు నీ కలలను ఎప్పుడు చంపుకోవాలో *నీ గురించి నీకు తెలిసిన దానికంటే నీవు ఎక్కువ శక్తివంతుడివి/రాలివి. *నీ కలతో ప్రపంచాన్ని మార్చగలవు. *కానీ దానికి నువ్వు కావాలి. నీ అనువయిన స్థితి నుండి బయటకు రావడానికి,నీలో ఉన్న సింహాన్ని కట్టువిప్పటానికి,ఆ సింహాన్ని బోనులో నుండి నువ్వు మాత్రమే బయటకు విడువగలవు.నువ్వు మాత్రమే నీ కలలను వెంటాడగలవు. *బలహీనమైన మనస్తత్వం ఉన్నా,ఆపదలను ఎదుర్కోవడానికి భయపడినా జీవితంలో ఎప్పుడూ ముందుకుపోలేవు *బలహీనమైన మనస్తత్వంతో నువ్వెప్పుడు నీ కలను సాధించుకోలేవు *ఇతరులు వదిలివెడుతున్నా ముందుకే వెళ్లే మనస్తత్వాన్ని సృష్టించుకో *జీవితం ఎప్పుడూ ఉహించినవిధంగా ఉండదు.అది ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది నువ్వు ఆలోచించే విధం కన్నా నీ కలకు నువ్వు దగ్గరగా ఉంటావు. *నువ్వు వదిలివెయ్యకుండా ఉంటే నీ కల వాస్తవం అవుతుంది. *సింహం లా ఉండండి.నువ్వెదుర్కొనే సవాళ్లనుండి ఎప్పుడూ వెనక్కి వెళ్లొద్దు. *సింహం ఎప్పుడూ దాని ఆహారాన్ని వేటాడటం ఆపదు,అది దొరికే వరకు. *నీ కలను నిజం చేసుకునేంత వరకు వేటాడటం ఆపవద్దు. *పెద్ద కలలు కను,నువ్వు కలలు సాధించలేవని చెప్పే అల్పమనస్కుల మాటలు నమ్మొద్దు. *అవి వాళ్ళు సాధించలేనివి,కానీ నీకు బాగా తెలుసు *నిన్ను నువ్వు నమ్ము. *నా లక్ష్యాల,కలల దారిలో నువ్వు కూడా ఉంటే కదులు, ముందుకు కదులు.(అనువాదం:ఒద్దుల రవిశేఖర్)
Sunday 26 December 2021
స్టూడెంట్ నంబర్ 1
స్టూడెంట్ నంబర్ 1 రచన:విశేష్,భరత్ పుస్తక పరిచయం:ఒద్దుల రవిశేఖర్ విద్యార్థుల తల్లిదండ్రులకు అంకితం ఇవ్వటంతోనే ఈ పుస్తక ప్రాధాన్యతను చెప్పకనే చెప్పారు రచయితలు. పైగా ముందు మాట కూడా లేకుండా వచ్చిన పుస్తకం ఈ మధ్య కాలంలో లేదు. మీరు రాసి పంపిస్తే ప్రచురిస్తాం అన్న మాటలతో పాఠకుల దృష్టి పుస్తకం మీదకు వెళ్లేలా చేస్తుంది.
ఈ పుస్తకం లో 12 అంశాలు ఉన్నాయి. ఇంతవరకు ఏ తెలుగు పుస్తకంలో రాని విధంగా సంభాషణల రూపంలో పుస్తకంలోని అన్ని అంశాలను రూపొందించడం, పాఠకుడితో మాట్లాడినట్టు ఉంది ఈ పద్ధతి. తనను తాను identify చేసుకుని లీన మయ్యేలా చేస్తుంది. ఇందులోని అంశాలు..
1) బాగా చదవడమంటే ఏమిటో ఏమిటో విద్యార్థులకు ఎవరూ సరిగా చెప్పకపోవడం అనే అంశాన్ని ప్రస్తావిస్తూ ముందు, ముందు topic లలో వాటికి సమాధానాలుంటాయని ఉత్సుకతను లేపారు.
2)విద్యార్థుల్లో బలమైన నమ్మకాలను పెంపొందించాలని అప్పుడే విజయం సాధ్యమవుతుందని విద్యావ్యవస్థలో అదే లోపించిందని దాన్ని సరిదిద్దాలని ఇందులో తెలియజేస్తారు. 3)పాఠాలు ఎలా వినాలో, ప్రతి పాఠం శ్రద్ధగా వింటే అది మన జీవితాలకు ఎలా పెట్టుబడిగా మారుతుందో మన సంపాదనా స్థాయి ఎలా పెరుగుతుందో ఇందులో ఆసక్తిగా వివరిస్తారు.
4)తరగతి లో చెప్పే పాఠ్యాంశాల్ని ఎలా notes రాసుకోవాలో, mindmaps ఎలా తయారు చేసుకోవాలో ఇందులో వివరణాత్మకంగా చెబుతారు.
5)బాగా చదవడం అంటే ఏమిటో 7 steps ద్వారా ఇందులో వివరిస్తారు.అన్నీ సాధన చేస్తే అలవాటయ్యేవే!
6)సంగీతం వింటూ ఆల్ఫాస్థితికి చేరి మరింత ఏకాగ్రతను పొంది బాగా చడవవచ్చని, చదివింది, విన్నది,అలాగే గుర్తుండి పోతుందనే వినూత్న విషయాన్ని ఇందులో పరిచయం చేస్తారు.
7)విద్యార్థులకు challenging గా ఉండే "గుర్తుంచుకోవడం" అనే అంశం చదివి తెలుసుకుని ఆచరిస్తే వారి జ్ఞాపక శక్తి అనూహ్యంగా పెరుగుతుంది.
8 ) మనం marks, grades, ranks సాధించిన వారినే తెలివైనవారని అనుకుంటాము. తెలివితేటల్లోని విభిన్నమైన రకాలను పరిచయం చేసి, ప్రతి ఒక్కరికీ ఏదో ఒకదానిలో ప్రావీణ్యం ఉంటుందని చెబుతారు.
9)మెలకువలు పాటిస్తే ఎవరయినా ఏకాగ్రతను సాధించవచ్చు అని ఇందులో వివరిస్తారు.
10) విద్యార్థుల పై ఒత్తిడిని పెంచే పరీక్షలకు ప్రణాళికా బద్దంగా ఎలా తయారు కావాలో తెలియజేస్తారు
11)పరీక్షలంటే విద్యార్థుల్లో ఉండే భయాన్ని ఎలా అధి గమించాలో practical గా వివరిస్తారిందులో.
12) ఇక చివరి అంశం లో విద్యార్థులకు ఉండాల్సిన skills ను వివరిస్తూ జీనియస్ లా మారాలంటే ఏ రకమైన ఆలోచనా తీరు కలిగి ఉండాలి,దానికి ఎలాంటి, training తీసుకోవాలో Genius gym లో విద్యార్థులకు ఎటువంటి శిక్షణ ఇస్తారో తెలుపుతూ ఈ పుస్తకాన్ని ముగిస్తారు.
విద్యార్థులు,వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా చదవ వలసిన practical way of conversation ఇందులో వివరించబడింది. తరువాత Genius Gym లో శిక్షణ పొంది genius లుగా మారటానికి ఈ పుస్తకం పునాదిలాగా పనిచేస్తుంది. విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పక చదవ వలసిన పుస్తకం ఇది.
-ఒద్దుల రవిశేఖర్
👉 స్టూడెంట్ నెంబర్-1 పుస్తకం హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో 50, 101 నెంబర్ స్టాల్స్ లో దొరుకుతుంది.
👉పోస్ట్ ద్వారా పొందాలనుకునే వారు ఈ కింది లింక్ క్లిక్ చేయండి. పోస్ట్ ద్వారా మీ ఇంటికి పంపిస్తాం.
https://imjo.in/sX2DmY
Friday 17 December 2021
వ్యాసరచన
ఏదయినా ఒక విషయాన్ని గురించి సమగ్రంగా వివరంగా అన్ని కోణాల్లో వ్రాయడాన్ని వ్యాసం అంటారు.మనకున్న జ్ఞానానికి,సృజనాత్మక శక్తికి,తార్కిక శక్తికి వ్యాసం నిదర్శనం.స్వాతంత్ర్యోద్యమ కాలంలో గాంధీ,నెహ్రూ తమ భావాలను వ్యాసాల రూపంలో ప్రజలకు తెలియజేసేవారు. పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తుంటారు.అలాగే కొన్ని సంస్థలు కూడా వ్యాసరచన పోటీలకు ఆహ్వానిస్తుంటాయి.విద్యార్థి ఏదయినా అంశాన్ని లోతుగా పరిశీలించడానికి, విషయాన్ని సేకరించడానికి తన స్వంత భాషలో అభివ్యక్తీకరించడానికి ఈ ప్రక్రియ ఎంతో దోహదం చేస్తుంది.మన మాతృభాష అయిన తెలుగుతో పాటు హిందీ ,ఇంగ్లీష్ లలో కూడా పాఠశాల స్థాయిలో విద్యార్థులను వ్యాసరచనలో ప్రోత్సాహించాలి.కేవలం పాఠ్యపుస్తకాలలో ఉన్న విషయాలను నేర్చుకుని పరీక్షలు వ్రాయడం కాకుండా ప్రపంచంలోని విభిన్న విషయాలను తెలుసుకోవడానికి వ్యాసరచన పోటీలు దోహదం చేస్తాయి.ఒక భాష మనకు బాగా వచ్చు అంటే ఆ భాషలో బాగా మాట్లాడటం తో పాటు వ్రాయడం కూడా వస్తే పరిపూర్ణత వచ్చినట్లు. ఇక విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలైన సివిల్స్,గ్రూప్ 1 స్థాయి పరీక్షలు వ్రాయడానికి చిన్నప్పటినుంచి వ్యాసరచన ప్రక్రియ ఎంతో దోహదం చేస్తుంది.పరీక్షల కోసం నేర్చుకుని రాయడం కాకుండా ఏ విషయాన్ని అయినా విశ్లేషించి మన అభిప్రాయాలను వ్యక్తీకరించడం విద్యార్థుల ఉన్నతికి దోహదం చేస్తుంది. ప్రస్తుతం పాఠశాలల్లో మార్కులు గ్రేడుల మాయాజాలం లో పది వ్యాసరచన ప్రక్రియను ప్రక్కకు పెట్టారు.కనీసం నెలకు ఒక అంశంలో నైనా తెలుగు,హిందీ ,ఇంగ్లీష్ భాషల్లో వ్యాసరచన పోటీలను పాఠశాలల్లో నిర్వహిస్తే విద్యార్థుల భవితకు బంగరు బాటలు వేసినట్లే. విద్యార్థులు ఏదైయినా అంశంపై తమ స్వంత అనుభవాలను,అభిప్రాయాలను వ్రాసే విధంగా కూడా ప్రోత్సాహిస్తే వారికి రచనా శక్తి అలవడుతుంది.సమాజంలో తాము గమనించే అంశాలపట్ల తమకు వచ్చే ఆలోచనలను,మనిషి జీవితం మరింత సౌకర్యవంతంగా,ఉన్నతంగా మారడానికి అవసరమయ్యే వినూత్న సంస్కరణలను వ్యాసాలరూపంలో వ్రాసి వార్తాపత్రికలు, సోషల్ మీడియా ద్వారా కూడ ప్రజలకు తెలియజేయవచ్చు. పైన తెలిపిన విధంగా పాఠశాల స్థాయినుంచే వ్యాసరచన పట్ల ఆసక్తిని,ఇష్టాన్ని,విద్యార్థుల్లో కలిగించడం ప్రతి ఒక్క ఉపాధ్యాయుని బాధ్యత.....ఒద్దుల రవిశేఖర్.
Saturday 11 December 2021
తెలుగు కోసం
తెలుగు కోసం రచయిత:డా.జి.వి.పూర్ణచందు. పుస్తక పరిచయం:ఒద్దుల రవిశేఖర్. భాష,సాహిత్యం, సంస్కృతి,చరిత్ర ల అనుశీలన అన్న శీర్షికలోనే పుస్తకం లోని విషయాలు ఏంటో తెలుస్తాయి.1)సంస్కృతి చరిత్ర:ఈ విభాగంలో వినాయకుడు,గణపతి ల గురించి వ్రాస్తూ వినాయకచవితిని పర్యావరణ పరిరక్షణ పండుగగా జరుపు కొమ్మని పిలుపివ్వడం బాగుంది.తొలి తెలుగు దేవతలు గురించి ఆసక్తికర విషయాల్లో ఆసక్తికర విషయాలెన్నో.ఆంధ్ర్ర మహావిష్ణువు, మురుగ స్కంధ ,సుబ్రహ్మణ్యం ల వివరణ,అలెగ్జాండర్ దాడి కథల్లో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి మనకి.సుశ్రుతుని వైద్య విధానాలు,బౌద్ధయుగంలో సభాసంప్రదాయాలు,వైదికుల పరిభాషలో విశేషాలెన్నో.,2) మన ఆహారం భాష సంస్కృతి : అన్నమయ్య వంటకాలు, తెలుగు పచ్చళ్ళ ముచ్చట్లు చదువుతుంటే నోరూరాల్సిందే.తినే ఆహారాన్ని అన్నం అనేది తెలుగు వారే. పంచదార చెరకు పండించిన తొలి రైతులు తెలుగు వారే 3) మన భాష:పాణిని వ్యాకరణానికి చేసిన సేవను గూర్చి చక్కగా వివరించారు.కోడింగ్ పద్ధతిని కంప్యూటర్ లో ఒక భాషను వ్రాయటానికి పాణిని పేరు కూడా చేర్చి పాణిని బాకస్ నౌర్ పద్ధతి అనే వ్యవహార నామం వ్యాప్తి లో ఉంది.భాషను పరిశోధించడం ద్వారా చరిత్రను ఎన్నో విధాలుగా మనం తెలుసుకోవచ్చు .ద్రావిడ కుటుంబంలో తెలుగే తొలిభాష అనే ఆశ్చర్యం గొలిపే తెలుస్తుంది.సింధు నాగరికత ద్రావిడుల నాగరికత.అందులో తెలుగు వారి పాత్ర ఎంతో ఉందని తెలుస్తోంది.దక్షిణ భారతీయ కులాలు,జాతులలో ఆఫ్రికన్,ఆసియన్ మూలాలు ఉన్నట్లు mt DNA పరీక్షలో నిర్దారణ అయింది.ఈ జాతులు ప్రస్తుతం తెలుగు నేలమీద నివసిస్తున్నారు.వైదిక యుగం కన్నా ముందు పూర్వ ముండా భాష మాట్లాడిన నాగరిక ప్రజలు ఉండేవారని నిరూపణ అయింది.వరి స్పష్టమైన తెలుగు పదం.పూర్వ ద్రావిడ భాషకు దగ్గరగా కనిపించేది తెలుగు భాషే.పాళీ భాషలో తెలుగు వ్యవసాయ పదాలు కలిసి ఉన్నాయి.ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి తెలుగు భాషకు ప్రాచీన హోదాకై విశేష కృషి చేసారు4)భాషోద్యమం-భాషాభివృద్ది.కంప్యూటర్ లో తెలుగు భాషాభివృద్ది ప్రపంచ భాషగా తెలుగును తీర్చటానికి ఇది మొదటి అడుగు.5) మన భాష మన చారుత్ర:అమెరికా మెక్సికో లోని రెడ్ ఇండియన్లు ,'ఇంకా' మయా అనే రెండు ప్రధాన తెగలు కూడా మూల ద్రావిడ భాషకు సంబంధీకులే అన్న విషయం సంభ్రమానికి గురిచేస్తుంది.మూలా ద్రావిడ భాష మాట్లాడిన ప్రజలు ప్రపంచ దేశాలన్నింటా విస్తరించి ,దక్షిణ భారతదేశంలో తెలుగువారిగా స్థిరపడినట్లు అనిపిస్తుంది.ఇప్పటికి 2700 సం. క్రితం తెలుగు నేలను అస్మకులు పరిపాలించారు.15 వ శతాబ్దానికి ప్రపంచం లోనే అత్యధిక ధనిక సామ్రాజ్యంగా విజయనగర సామ్రాజ్యాన్ని తొలుత గుర్తించినవారు పోర్చుగీస్ లు.రాయల కాలం లో వజ్రాల గనులు నిర్వహించారు.ఆంధ్రవిశ్వ విద్యాలయ స్థాపన గురించి వివరంగా ఇచ్చారు.తొలి ద్రావిడ ప్రజలు సుమేరియా మీదుగా బంగాళా ఖాతం గుబడా కృష్ణా,గోదావరి ముఖద్వారాల్లోంచి తెలుగు నేల మీద మొదటగా పాదం మోపారని భారతదేశం లో తొలి ద్రావిడులు తెలుగు ప్రాంతీయులేనని ప్రాంక్లిన్ సి సౌత్ వర్త్ ప్రకటించారు.6) మన సాహుత్యం:పాల్కురికి సోమనాధుని తెలుగు పద ప్రయోగాలను సోదాహరణంగా వివరిస్తారు.రాయల నాటి పాలనా భాష గురించి వివరించారు.తొలి తెలుగు నిఘంటువు "ఆంధ్రదీపిక" మామిడి వెంకటార్య పండితులు రూపొందించారు.తొలి తెలుగు పత్రికల గురించి సవివరంగా వివరిస్తారు.1831 లో తొలి పత్రిక 'తెలుగు జర్నల్' అనే పత్రిక వెలువడింది.స్వాతంత్ర్యోద్యమ కాలంనాటి పత్రిక "ఆంధ్రపత్రిక" 1908 లో ప్రారంభమయి 1991 లో మూత పడింది.తెలుగు భాష మీద విపరీతమైన ప్రేమ గలా డా.జి వి.పూర్ణచందు గారి విస్తృత పరిశోధనా గ్రంధం ఇది.తెలుగు వారి చరిత్రను పెక్కు ఆధారాలతో వివరించిన వారికి తెలుగు జాతి ఎంతగానో ఋణ పడిఉంటుంది.తెలుగు భాషాభిమానులు,తెలుగు వారి చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి గలవారు,విద్యార్థులు,మరీ ముఖ్యంగా తెలుగు ఉపాధ్యాయులు,అధ్యాపకులు తప్పక చదవవలసిన పుస్తకమిది.
Thursday 2 December 2021
సిరివెన్నెల కురియని రాత్రి.
10 వ తరగతి ముగిసిన వేసవి.కె.విశ్వనాధ్ గారి సినిమా "సిరి వెన్నెల"పేరే ఎంత మనోహరంగా ఉందో .సినిమా చూస్తున్నంత సేపు గుండె స్పందనలు కళ్ళు పలికిస్తున్నాయి.పాటల్లో అప్పటివరకు వినని సాహితీ సొబగులు,మరోలోకానికి తీసు కెళ్లిన వేణుగానం. అప్పుడు పరిచయమయ్యారు సీతారామ శాస్త్రి.అప్పుడే ఇష్టం పెరిగింది వేణుగానం పై.సిరివెన్నెల లోని "విధాత తలపున"ఎన్ని సార్లు పాడుకున్నానో .ఇక అర్ధరాత్రి నెల్లూరు అర్చన థియేటర్ లో "రుద్రవీణ" సినిమా చూసి అందులోని "చెప్పాలని ఉంది ,గుండె విప్పాలని ఉంది" పాట స్ఫూర్తి తో అర్ధరాత్రి ఒంటి గంటకు ఓ కవిత వ్రాసుకున్నా .ఇక నెల్లూరు VR College లో ఏదో function కు వచ్చిన సిరివెన్నెల గారు "త్రిశంకు స్వర్గం లో త్రివర్ణ పతాకం"అన్న ఒక పాట స్వయంగా పాడారు. తరువాత ఏదో పత్రికలో ఆ పాట వస్తే వ్రాసుకుని ట్యూన్ గుర్తు పెట్టుకుని చాలా వేదికల మీద పాడా.National science fair( రాంచీ,జార్ఖండ్) లో పాడి అక్కడి కలెక్టర్ ప్రశంస లందుకున్నా. ఈ పాట గాయం సినిమా లో వచ్చింది.ఇక "ఎటో వెళ్ళిపోయింది మనసు" జామురాతిరి జాబిలమ్మ" "నిగ్గదీసి అడుగు",తరలి రాద తనే వసంతం" "జగమంత కుటుంబం నాది " నాకు బాగా ఇష్టమై పాడుకునే ఆయన పాటలు.మా తరపు ఊహలకు భావుకత అద్దిన పాటల రేడు సిరివెన్నెల."నీవు లేవు నీ పాట ఉంది"మాకు తోడుగా.శ్రద్ధాంజలి వారికి....ఒద్దుల రవిశేఖర్.
Monday 29 November 2021
సంగీత మేరు శిఖరాలు
రచయిత:Dr. జానమద్ది హనుమత్ శాస్త్రి. హృదయం లోని వివేకమే సంగీతం....కన్ఫ్యూషియస్. పుస్తక పరిచయం:ఒద్దుల రవిశేఖర్ సామవేదం యొక్క ఉపవేదమనబడు గాంధర్వ వేదం సంగీతమయం.భరతుని నాట్య శాస్త్రం,మతంగుని బృహద్దేశి సంగీతానికి సంబంధించిన ప్రాచీన గ్రంధాలు.నాదం నుండి శృతులు,శృతుల నుండి స్వరాలు,స్వరాల నుండి రాగాలు పుడతాయి.సంగీతం విశ్వజనీనమైన భాష. Music: If you know and understand it is the best and easiest way for concentration. .Swami Vivekananda 45 మంది శిఖరప్రాయులైన గాయనీ గాయకుల జీవిత చరిత్ర ఇది. సంగీత సాగరాన్ని మధించిన గాన గంధర్వులు వారు.1) శ్యామ శాస్త్రి(1762౼1827): 2)త్యాగరాజ స్వామి(1767౼1847) 3)ముత్తుస్వామి దీక్షితులు(1775౼1835) వీరు ముగ్గురు సంగీత త్రిమూర్తులు. 4)సంగీత సార్వభౌమ స్వాతి తిరుణాల్ దీక్షితులు (1813౼1846) 5)వైణిక శిరోమణి వీణ శేషన్న(1852౼1926) 6) ఆధునిక హిందూస్థానీ సంగీత పితామహుడు పండిట్ విష్ణు నారాయణ భాట్కండే(1860౼1936) 7) వైణిక ప్రవీణ వీణ సుబ్బన్న(1861౼1939) 8)సరోద్ వాద్య విద్యా నిధి ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్(1862౼1972) 9) సంగీత కళానిధి మైసూరు వాసుదేవాచార్యులు (1865-1961) 10)తాళ బ్రహ్మ,గాన విశారద బిడారం కృష్ణప్ప (1886-1939) 11) గాయక శిఖామణి ముత్తయ్య భాగవతార్ ( 1877-1945) 12) టైగర్ వరదా చార్యులు (1876-1976) 13)త్యాగరాజభక్త శిరో మణి బెంగళూరు నాగరత్నమ్మ (1878-1952) 14) సంగీత కళానిధి శ్రీమాన్ రాళ్లపల్లి ఆనంతకృష్ణ శర్మ (1893-1979) 15) సంగీత కళానిధి ద్వారం వెంకటస్వామి నాయుడు( 1893-1964) 16) సంగీత రత్న టి.చౌడయ్య (1895-1967) 17) గాన గాంధర్వ ఓంకార్ నాధ్ ఠాగూర్( 1897-1967) 18) సంగీత కళానిధి ముసిరి సుబ్రమణ్య అయ్యర్ (1899-1975) 19) స్వర భూషణ ఉస్తాద్ బడేగులామ్ అలీఖాన్(1901-1969) 20)సంగీత కళానిధి సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ (1908-2003) 21)గాయనగంగ గంగుభాయ్ హానగల్ (1913-2009) 22)షెహనాయ్ నవ్వాజ్ ఉస్తాద్ బిస్మిల్లాఖాన్( 1916-2006) 23) సంగీత రత్న సంధ్యావందనం శ్రీనివాస రావు (1918-1994) 24) భారతరత్న గా వెలిగిన భక్తి సంగీత సుధా తరంగం యం. యస్.సుబ్బులక్ష్మి (1916-2004) 25) తబలా వాద్య విశారదుడు ఉస్తాద్ అల్లారఖా (1919- 2000) 26) డి.కె.పట్టమ్మాళ్ (1919-2009) 27)జయచామరాజేంద్ర ఒడయర్ (1919-1974) 28) వైణిక శిరోమణి వి.దొరై స్వామి అయ్యంగార్ (1920-1997) 29) సితార్ వాద్య విశారద పండిట్ రవిశంకర్ (1920) 30) గానలోల ఘంటసాల వెంకటేశ్వరరావు (1922-1974) 31) విఖ్యాత వైణికుడు ఈమని శంకర శాస్త్రి (1922-1987) 32)20 వ శతాబ్ది తాన్ సేన్ పండిట్ భీమ్ సేన్ జోషి (1922) 33) మహామహో పాధ్యాయ నూకల చిన సత్యనారాయణ ( 1923) 34) మహోత్తమ గాయకుడు యం. డి.రామనాధన్(1923-1984) 35) మంగళ వాద్య విశారద షేక్ చిన మౌలానా (1924-1999) 36) వేణు నాద మాంత్రికుడు టి.ఆర్ .మహాలింగం (మాలి) (1926-1986) 37) వైణిక శిరో భూషణ ఎస్.బాల చందర్ ( 1927-1990) 38)అమృత గాన వర్శిని యం. ఎల్.వసంతకుమారి ( 1928-1990) 39) మహా గాయని,భారతరత్న లతా మంగేష్కర్(1929) 40) గానంతో శిలలనే కరిగించగల పండిట్ జస్ రాజ్ (1930) 41) సంగీత శిఖరం మంగళం పల్లి బాల మురళీ కృష్ణ (1930) 42) సంగీత కళానిధి పద్మభూషణ్ డా:శ్రీపాద పినాక పాణి గారి జీవితానుభవాలు (1913) 43)వేణు వాదన మాంత్రికుడు హరిప్రసాద్ చౌరాసియా (1938) 44) సుమధుర గాయకుడు కె.జె.ఏసుదాసు(1940) 45) ఘటం వాద్య విశారద టి.హెచ్.వినాయక్ రామ్ (1942) తమ జీవితాలనే తపస్సుగా మలిచి సంగీత సాగరాలను మధించి మనకు అమృతరాగాలను పంచిన మహనీయుల గురించి పేర్లు మాత్రమే ప్రస్తావించాను,ఈ పుస్తకాన్ని చదివి మరిన్ని వివరాలు తెలుసుకుంటారని.ప్రతి దినం కొంత సమయాన్ని సంగీతం పాడటం ,లేదా వినడం అలవాటు చేసుకుంటే మనసు నిర్మలంగా ఉంటుందని,విద్యాలయాల్లో సంగీత సాధన ఏర్పాటు చేయటం అత్యావశ్యకం అణా రచయిత సందేశం తో ఈ పుస్తకం ముగుస్తుంది.చివర్లో రాగాలు -రోగాలు శీర్షికన ఏ రాగం ఎప్పుడు వింటే ఏ రోగం తగ్గుతుందో వివరించడం మరింత ప్రయోజనకరంగా ఉంది.సంగీత త్రిమూర్తుల్లో ఒకరైన త్యాగరాజు పూర్వీకులు ప్రకాశం జిల్లా మార్కాపురం దగ్గరలోని కాకర్ల గ్రామం కావడం విశేషం.వారి పూర్వీకులు క్రీ.శ 1600 ప్రాంతం లో తంజావూరు సమీపంలోని తిరువారూరు కుతరలివెళ్లారు.సంగీత ప్రియులకు ఈ పుస్తకం చదవడం మరింత ఆనందం కలిగిస్తుంది.హనుమత్ శాస్త్రి గారు సరళంగా చదువగలిగేలా వారి జీవిత చరిత్రలు అందించారు.ఆ రకంగా ఆ గాన గంధర్వులను ఇప్పటి తరానికి పరిచయం చేసారు...ఒద్దుల రవిశేఖర్
Monday 22 November 2021
The secrets of INDUS VALLEY
The secrets of INDUS VALLEY by R.Rajagopalan illustrated by R.Ashish Bagchi చరిత్ర మీద ఆసక్తి ఉన్నవారికి,పరిశోధకులకు ఇండస్ వాలీ నాగరికత(హారప్పా మొహంజదారో) ఇప్పటికీ రహస్యమే.ఈ ప్రాంత ప్రజలు ఎక్కడనుండి వచ్చారు?వారి వ్రాత అక్షరాలు దొరికాయి కానీ వాటి అర్ధం ఇప్పటికి సరిగ్గా తెలీదు.వారి భాష పేరేమిటి?పరిపాలకులు ఎవరు?ఈ నాగరికత ఎలా నశించింది? ఈ ప్రశ్నలు వెంటాడే ప్రశ్నలు? వీటికి పూర్తి సమాధానం ఇవ్వకపోయినా కనుగొన్న ఆధారాలను ప్రస్తావిస్తూ రచన సాగింది.త్రవ్వకాల్లో దొరికిన నగరాల ఆనవాళ్లను బట్టి ఉన్నతమైన నాగరికత అని అలాగే పరిపాలన కూడా ఆధునికమైన ప్రజాస్వామ్యానికి తీసిపోనిదని అర్ధమవుతుంది.చక్కటి ప్రణాళికతో కట్టిన నగరాలు, ఆధునిక వసతులతో కూడిన గృహాలు అప్పటి అభివృద్ధిని చెబుతాయి.దొరికిన అద్భుతమైన చిత్రాలతో మనల్ని ఆకాలానికి లాక్కెడుతుంది రచన.Rosetta stone గురించి దాని decode గురించి జరిగిన ప్రయత్నాలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి.archaeologist,epigraphist లాంటి వృత్తుల గురించి కూడా పరిచయం చేసి విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సాహించారు.ఐరావతం మహదేవన్ ఇండస్ లిపి పై చేసిన పరిశోధన ఆసక్తి గొల్పుతుంది.అంతా చదివాక 5000 సం. రాల క్రితం జరిగిన చరిత్ర కోసం ఇప్పుడు మనం తలలు ఎందుకు బ్రద్దలు కొట్టుకోవాలి? అన్న ప్రశ్న ఉదయిస్తుంది.మన చరిత్ర గురించి మనం తెలుసుకుంటేనే ప్రస్తుత మనదేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం అర్ధమవుతుంది.ఇండస్ నాగరికత కాలం లోనే శాస్త్రీయ వైఖరి ఉంది.ప్రస్తుతం అది లోపిస్తున్న తీరును అర్ధం చేసుకోవాలి.కానీ ఆ కాలం లో చెట్లు విపరీతంగా నరికి నగరీకరణ జరగడం వారి పతనానికి కారణం అయింది.మరి ప్రస్తుతం మనమదేగా చేస్తుంది. చెట్లు నరకడం,నదుల కాలుష్యం,పర్యావరణ నాశనం ,భూతాపం ఇవన్నీ మనకు ప్రమాద సంకేతాలు.ప్రస్తుత మన నాగరికత కూడా ఆ దిశలో పయనిస్తుంది ,అన్న ఆలోచనాత్మక సందేశంతో పుస్తకం ముగించిన రచయిత రాజగోపాలన్ అభినందనీయులు....ఒద్దుల రవిశేఖర్.
Sunday 21 November 2021
చిన్న చిన్న ఆనందాలు మూటగట్టుకోవడం.
జీవిత పయనంలో లక్ష్యాల సాధనలో పడి మనకిష్టమైన పనులు చేయడం మరిచిపోయివుంటాం.ఉద్యోగం, వివాహం,పిల్లలు,వారి చదువులు,ఆరోగ్యం,ఇల్లు కట్టుకోవడం ,పిల్లల వివాహాలు మళ్లీ వారికి పిల్లలు ఇలా విభిన్న దశల్లో జీవితం కొనసాగుతుంది.మనం మనకోసం కాక ఇతరుల కోసం బ్రతుకుతుంటాం.పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేస్తాం.కాలం గడిచిపోతుంది.చివర్లో వారేదో మనకు చేస్తారనుకుంటాం.వారి కుటుంబాల తో వారు బిజీ. ఆయా దశల్లో మన అభిరుచులు,మన కిష్టమైన కళలు, ఆటలు,కొత్త ప్రదేశాలు చూడటం,మొక్కలు నాటడం,పెంచడం,ప్రకృతిని పరిశీలించడం ఇవన్నీ చేయడం సాధ్యం కాకపోవచ్చు.కానీ అన్ని బాధ్యతలు తీరాక ఇవన్నీ చేయాలంటే మన మానసిక,శారీరక ఆరోగ్యం బాగుండకపోవడంతో మనం చేయాలనుకున్నవి చేయలేకపోవడంతో జీవితం అసంతృప్తిగా ముగుస్తుంది.మొన్నటి కరోనా కాలంలో ఎంతమంది చిన్న వయసులో చనిపోయారో కదా!ఎన్ని అనుకుని ఉంటారు వాళ్ళు జీవితంలో ఏదో చేయాలని.అలాగే ఆకస్మిక ప్రమాదాలు,గుండెపోటులతో మరింతమంది మరణిస్తున్నారు.పునీత్ రాజ్ కుమార్(48) మరణం ఎంత విషాదం. అందుకే సమయం లేదు మిత్రమా! జీవితం లో మీరు ఏ దశలో ఉన్నా మీ కిష్టమైన వ్యాపకాలకోసం కొంత సమయం కేటాయించండి.సంగీతం వినడం,నేర్చుకోవడం,పాటలు పాడడం చిత్రలేఖనం,పుస్తకాలు చదవడం,స్నేహితులతో మాట్లాడటం,వ్యాయామం ....ఇలా ఎన్నో పనులు చేస్తూ ఎప్పటికప్పుడు చిన్న చిన్న ఆనందాలు మూటగట్టుకుంటూ జీవితం కొనసాగిద్దాం.ఇక జీవిత చరమాంకంలో ఆ జ్ఞాపకాల దొంతరాలను నెమరువేసుకుని తృప్తిగా జీవితయాత్ర చాలించవచ్చు.....ఒద్దుల రవిశేఖర్.
Thursday 15 July 2021
యువతతో జగతి ముందుకు(Better India Better world)
రచయిత:N.R.నారాయణమూర్తి. అనువాదం:వసుంధర. పుస్తక పరిచయం:ఒద్దుల రవిశేఖర్ ఇండియాలో ఉపాధి కల్పనకు,పేదరిక నిర్ మూలనకి వ్యాపారదక్షతను సాధనం చేసుకోవాలన్న ఆలోచన నుండి ఉదయించిందే ఇన్ఫోసిస్ అని ,యువతతో పనిచేస్తున్నప్పుడు తన మెదడు బాగా పనిచేస్తుంది అని ముందుగా చెప్పడం ద్వారా పుస్తక ఉద్దేశ్యాన్ని,ఆయన ఇచ్చే సందేశాలను గూర్చి తెలియజేసారు రచయిత.మన దేశం సాధించిన విజయాలు తక్కువేమీ కావంటూ దేశంలో పేదరికం,నిరక్షరాస్యత, వ్యాధులు,విద్య వంటి విషయాల్లో మనం ఉన్న స్థాయిని వాస్తవికంగా తెలియజేసారు.నిజాయితీ పరులు ఉన్నత లక్ష్యాలతో కృషి చేస్తే ఏ దేశమైనా ఎన్ని అడ్డంకులనైనా అధిగమించి గొప్పతనాన్ని సాధించగలదు.ఉన్నత లక్ష్యాల కోసం కలలు కనాలి.వాటి సాఫల్యాని కి త్యాగాలు చేయాలంటారు. విద్యార్థులారా అన్న వ్యాసం లో మనం ఉత్పత్తి చేసిన సంపద కారణంగా గుర్తింపు వస్తుంది.మనకున్నది నిర్భాగ్యులతో పంచుకోవడమే మన సంపదకు సద్వినియోగం అని యువతకు గొప్ప సందేశమిచ్చారు.మనదేశ ప్రజల దయనీయ స్థితులు వివరిస్తూ 1000 సం. రాల బానిసత్వం వల్ల వచ్చిన ఉదాసీనత ను వదిలి పెట్టాలని,నమ్రతను అలవర్చుకోవాలని పిలుపిస్తారు.రేపు నేను కనిపించకపోతే,నేనేమయ్యానని నా వాళ్ళు వెతుక్కునేందుకు నేనేం చెయ్యాలి?అని అంతర్మధనం చెందుతారు.మార్పొక్కటే నేటి ప్రపంచం లో నిత్యం .ఏ రంగం లో నైనా ప్రావీణ్యత సాధించటం మొక్కటే విజయానికి మార్గం అని దిశానిర్దేశం చేస్తారు.ఎందుకూ అని కాదు,ఎందుక్కాదు అని ప్రశ్నించుకోవాలంటారు. పాశ్చాత్యుల నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అన్న వ్యాసం లో తనకంటే ఎక్కువ సాధించినవారిపట్ల గౌరవభావం ఉండాలని,పూచీ పడే స్వభావముండాలని,నిజాయితీతో,సమయపాలన పాటిస్తూ ఉండాలంటారు.1991 లో మన దేశానికి ఆర్ధిక స్వాతంత్ర్య0 వచ్చింది.హరిత,శ్వేత విప్లవాలు ,1991 ఆర్ధిక సంస్కరణలు రోదసీ విజ్ఞానం,అణుశక్తి,software విప్లవం దేశ స్వరూపాన్ని మార్చివేశాయి అంటారు.జ్ఞానాన్ని నవీకరణకు ఉపయోగించుకునే దేశం లాభపడుతుంది అంటారు.ఉన్నత విద్యారంగం లో సంస్కరణలు రావాలని ఆశిస్తారు.నాయకుల స్థాయిని బట్టి దేశాలు అభివృద్ధి చెందుతాయి అంటారు.తను స్థాపించిన ఇన్ఫోసిస్ యాత్రాక్రమాన్ని వివరిస్తూ లాభాల్ని చట్టబద్ధంగా నైతికంగా సాధించాలి అంటారు.ఇందులో ఇంకా వాణిజ్య సంస్ధ పాలన,వ్యాపార దక్షత,ప్రపంచీకరణ వంటి ఎన్నో అంశాలపై స్పూర్తిదాయక,సందేశాత్మక వ్యాసాలున్నాయి.యువతను తీవ్రంగా ప్రభావితం చేసే పుస్తకం ఇది.ముఖ్యంగా సృజనాత్మకంగా ఆలోచిస్తూ ఎదగాలనుకున్న యువత చదివితీరాల్సిన పుస్తకం ఇది.
Wednesday 14 July 2021
ఆర్థిక చరిత్ర (The worldly philosophers)
పుస్తక రచయిత:రాబర్ట్ హెల్బ్రోనర్ అనువాదం:జాస్తి జవహర్ లాల్. పుస్తక పరిచయం:ఒద్దుల రవిశేఖర్. ఆర్థిక సమస్యల మీద చర్చలు ఒక సిద్ధాంతానికి,ఇజానికి కట్టుబడక,ప్రతి ఇజం లోను ఎంతో కొంత నిజం ఉంటుందని,ఏ విషయాన్నయినా,ఇతరుల దృక్పధాన్ని అర్ధం చేసుకోవడానికి నిష్పాక్షికత అవసరం.దీన్ని రాబర్ట్ చక్కగా సమతౌల్యం చేశారని అనువాదకులు ముందుమాటలో చెప్పటం తో పుస్తకం చదవాలన్న ఉత్సుకత కలుగుతుంది. ఆర్థిక దృక్పధం:ఉమ్మడి అవసరాలు తీర్చుకోవడానికి ఆర్థికశాస్త్రం అవసరమైంది.17 వ శతాబ్దం వరకు కూడా అమెరికాలో లాభం ఒక నేరంగా పరిగణించేవారు అని తెలిసుకుంటే ఆశ్చర్యమేస్తుంది.లాభాపేక్ష ఆధునిక మానవుడితోనే వచ్చింది.16 శతాబ్దం చివరివరకు ఇంగ్లాండ్ లో ఎక్కడ చూసినా బీదలే ఉండేవారు.పారిశ్రామిక విప్లవం తర్వాత మనిషి ఆర్థిక వ్యక్తిగా అవతరించాడు. ఆర్థిక శాస్త్రవేత్తలలో ఆద్యుడు ఆడమ్ స్మిత్.ఈయన నైతిక భావ సిద్ధాంతం ప్రతిపాదించారు.విపణిని నియంత్రించే సూత్రాలు వివరించాడు. మాల్తస్ రికార్డో: జనాభా గుణశ్రేడి లో వనరులు,ఉత్పత్తులు అంక శ్రేడి లో పెరుగుతాయి.ఆహార లభ్యత మానవుల సంఖ్యని శాసిస్తుంది.ఇంకా ఇందులో సోషలిస్టులు అయిన రాబర్ట్ ఓవెన్, సైంట్ సైమన్,చార్లెస్ పౌరియర్,జాన్ స్టువర్ట్ మిల్ ల గురించి వివరించారు. కార్ల్ మార్క్స్:కమ్యూనిస్టు మేనిఫెస్టో అనేది మార్క్స్,ఏంగెల్సులు తయారు చేసిన కార్యాచరణ ప్రణాళిక.హెగెల్ ప్రతిపాదించిన గతి తార్కిక భౌతిక వాదం మార్క్స్ ఏంగెల్స్ లను ఆకర్షించింది.సాంఘిక మార్పులకు,రాజకీయ విప్లవాలకు అప్పటి ఆర్థిక పరిస్థితులే కారణం.ఫ్యాక్టరీలు కార్మిక వర్గాన్ని సృష్టిస్తే,విపణి విధానం వ్యాపార వర్గాన్ని సృష్టించింది అంటారు మార్క్స్.డార్విన్ జీవ పరిణామాన్ని కనుగొన్నట్లుగా మార్క్స్ చరిత్రలో సంఘ పరిణామాన్ని కనుగొన్నారు అంటారు ఏంగెల్స్.ఇంకా ఇందులో వెబ్లెన్,మేవర్ట్ జోసెఫ్ షాంపెటర్ వంటి వారి గురించి వివరిస్తారు. గతం లో సంపద అన్న ధ్యాసగాని,దాచిపెట్టుకోవాలన్న తపన గాని లేవు.కొన్ని పనులు చెయ్యడం లో లాభం ఉన్నదనుకొన్నప్పుడు పెట్టుబడిదారుడు అవతరించాడు.ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలతో కూడిన పుస్తకం ఇది.ఆర్ధిక శాస్త్రం మీద ఇష్టం ఉన్న వ్యక్తులు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.
Monday 12 July 2021
ప్రకృతితో స్నేహం చేద్దాం రండి.
ఆహారసేకరణ కోసం ప్రతి రోజు 40 కి.మీ నడిచి ఎంతో శ్రమ కోర్చి ఆహారం సంపాదించే దశ నుండి కూర్చున్నచోట నుండి లేవకుండా కోరిన తిండి తినే దశకు వచ్చిన మానవుడు శ్రమకు,ప్రకృతికి దూరమయ్యాడు.దానితో ఎన్నో జబ్బులు చుట్టుముట్టి విలవిలలాడుతున్నాడు.తిరిగి ప్రకృతి మూలాల్లోకి వెళ్లకుండా ఈ తప్పును సరిదిద్దుకోలేం.మొక్కలతో,చెట్లతో,ప్రకృతితో స్నేహం చేస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.మన ఇంటి ముందు,వెనుక మొక్కలు నాటి పెంచడం దగ్గరనుండి,రహదారుల వెంట,ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి పెంచడం వరకు ఎవరికి వీలయిన విధంగా వాళ్ళు ప్రతి ఒక్కరు భూమికి మనం చెల్లించే బాకీగా భావించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలి.అలాగే పిల్లలకు చిన్నప్పటినుండే ఈ అలవాటు నేర్పిస్తే వారి జీవితం ఎంతో ఆనందంగా మారుతుంది.ఇంకా ఈ కరోనకాలం లో తమ సొంత గ్రామాలకు,పట్టణాలకు చేరిన యువకులు మొక్కలు నాటి పెంచే కార్యక్రమం తో పాటు తమ వ్యవసాయక్షేత్రాల్లో తండ్రికి పొలం పనుల్లో సహాయం చేస్తే శ్రమ విలువ తెలుస్తుంది.అలా పొలం అందుబాటులో లేని వాళ్ళు తమ బంధువులు రైతులయితే వారి పొలాల్లోకి వెళ్లి చిన్నపాటి పనులు చేయండి.నీరు కట్టడం,కలుపు తీయడం,మట్టిపనులు చేయండి.చెమట పడుతుంటే కలిగే ఆనందాన్ని అనుభవించండి.మట్టి వాసన,నీటి పలకరింపులతో పులకరించండి.మొక్కలు రోజు పెరుగుతుంటే పరిశీలించడం అద్భుతమైన అనుభవం.ఇవన్నీ చేస్తున్నవాడిగా చెబుతున్నా,ప్రయత్నించండి.ఒక ముఖ్య విషయం ఆరోగ్యం కోసం ఉదయపు,సాయంత్రపు నడకలు,వ్యాయామాలు చేస్తుంటాం.చెమట చిందిస్తుంటాం.కానీ పైన చెప్పిన పనులు చేస్తుంటే దాని వల్ల ప్రకృతికి మేలు చేయడం తో పాటు సహజానందం కలుగుతుంది.మన శ్రమ ఓ పుష్పంగా,ఓ కాయగా,ఓ కూరగాయగా,నీడ నిచ్చే చెట్టుగా మారుతుంటే కలిగే ఆనందం వెలకట్టలేనిది.ప్రకృతి తో స్నేహం చేద్దాం,రండి....ఒద్దుల రవిశేఖర్.
Monday 10 May 2021
అన్వేషి....Dr పొనుగోటి కృష్ణారెడ్డి (పుస్తక పరిచయం:ఒద్దుల రవిశేఖర్)
ఇది రచయితచే రచింపబడి ఆదరణ పొందిన 3 పుస్తకాల కలయిక. 1)బుద్ధుడు-బౌద్ధ ధర్మం 2)జనం మనిషి 3)విరాట్ 1) బుద్ధుడు -బౌద్ధ ధర్మం. బుద్ధుడి జీవితాన్ని,బోధనలను అతిసరళంగా వివరిస్తారు రచయిత ఇందులో.ఇందులో ముఖ్యాంశాలు. * *జ్ఞానోదయం పొందినప్పటి నుండి మహాపరి నిర్వాణం వరకు నిర్భయంగా బ్రతికిన మహా పురుషుడు బుద్ధుడు. *ఆత్మదీపోభవ(నీకు నీవే దీపం కావాలి) *ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారి స్వేచ్ఛ,సమానత్వం గురించి బోధించిన వాడు బుద్ధుడు.ప్రేమను,కరుణను,అహింసను ప్రపంచానికి మొదటి సారి బోధించినవాడు బుద్ధుడు. *ఆయన చివరి మాటలు:సృష్టిలో ప్రతిదీ నశించేదే.బాధ పడకండి.మీరు శ్రద్ధగా ధర్మాన్ని ఆచరించి నిర్వాణాన్ని సాధించండి. *మనసును అదుపులో ఉంచుకోవడానికిపంచశీల,చతురార్య సత్యాలు,అష్టాంగ మార్గం దశపారమితలు బోధించారు.బుద్ధుడు క్రీ. పూ 563 లో పుట్టి 80 ఏళ్ల పాటు జీవించి 45 ఏండ్ల పాటు ధర్మప్రచారం చేశారు. 2)జనం మనిషి:ఒక డాక్టర్ మరణం,2 లక్షల మంది అంతిమ యాత్రలో పాల్గొనడం,ఇది కదా జీవితం.పుచ్చలపల్లి సుందరయ్య గారి తమ్ముడు,పుచ్చలపల్లి రామ్ గారి జీవితాన్ని చదువుతుంటే ఇటువంటి మనుషులు ఈ భూమిమీద జీవించారా అనిపిస్తుంది.మనిషిని ప్రేమించడం,పేదలకు ఉచిత వైద్యం,దాతృత్వం,ప్రజాసేవ,స్నేహ తత్వం,ప్రజల తరపున పోరాడడం ఆయన్ని ఒక విశిష్ట మైన వ్యక్తిగా నిలబెడతాయి.పుస్తక ప్రేమికుడు,జ్ఞానాన్వేషి,అత్యంత ప్రతిభావంతుడైన వైద్యుడు,అత్యంత ధైర్యవంతుడు,కరుణామయుడు,గాంధీజీలా తను నమ్మిన విషయం ఆచరించినవాడు రామ్.ఒక డాక్టర్ గా ఉంటూ నిరంతరం ప్రజాసేవలో తరించే వ్యక్తిత్వం అత్యంత అరుదు.చదివి తీరవలసిన జీవితం ఆయనది. 3) విరాట్ (మూల రచయిత: stephan thysvk) బుద్ధుడి కంటే ముందు జీవించిన ఒక గొప్ప యోధుడు,తాత్వికుడి జీవిత చరిత్ర ఇది. యుద్ధం వద్దనుకుని,సర్వ సైన్యాధ్యక్షుడి పదవిని కాదని న్యాయాధికారిగా నియమించబడిన ' విరాట్' కథ ఇది.తన తీర్పును ప్రశ్నించిన దోషి పాత్రలోకి ప్రవేశించి అతని శిక్షను తాను అనుభవించి,న్యాయాధికారి పదవిని త్యజించి,గృహస్థు జీవితాన్ని వీడి,అడవులలోకి వెళ్లి ఏకాంతంగా జీవించిన ఒక ఋషి కథ ఇది.చివరకు ఒక ఇల్లాలి ప్రశ్న తో మళ్లీ ప్రజల మధ్యకు వచ్చి ఒక కుక్కల కాపరిగా జీవితాన్ని ముగిస్తాడు.హృదయాన్ని మెలిపెట్టే కథనం తో సాగుతూ గొప్ప జీవితసత్యాలను,తత్వాన్ని మనకందిస్తుంది ఆయన జీవిత గమనం.
Saturday 1 May 2021
మానవ ఆరోహణ(The Ascent of Man)....మూలం:జేకబ్ బ్రోనోస్కీ.పరిచయం:ముక్తవరం పార్థసారధి
మానవ పరిణామ క్రమాన్ని వివరించే పుస్తకాల్లో ఇది 4 దశాబ్దాల క్రితంది అయినా మనకు ఈ మధ్యనే పరిచయం చేసారు పార్ధసారధి గారు.ఏదేమైనా ఈ అంశం పై ఏ పుస్తకమైనా నన్ను కుతూహలానికి గురిచేస్తుంటుంది. ప్రకృతి పరిణామం కన్నా భిన్నమైన విషయం "మానవారోహణ".జ్ఞానమెప్పుడు పరిణామక్రమం లో ఒక దశ మాత్రమే.ప్రతి పరిణామ దశలో కీలకమైన మలుపు ఒకటి ఉంటుంది.అదే ప్రపంచాన్ని అర్ధం చేసుకునే దృష్టికోణం అన్న వాక్యాల ద్వారా రచయిత తను చెప్పదలచుకొన్న అంశాలకు పూర్వరంగం సిద్ధం చేసుకున్నాడు.మానవ మేధస్సు వివిధ రంగాలలో వికసించిన క్రమం ఇందులో ప్రస్తావించారు.1859 లో అచ్చయిన The origin of spices తో,1871 నాటి " the descent of man" తో చార్లెస్ డార్విన్ మనకు ఆదర్శం కావడాన్ని ప్రస్తావిస్తూ ఒక్కొక్క అంశాన్ని చెబుతూ ఆసక్తి కలిగిస్తూ వెడతారు.20 లక్షల సంవత్సరాల క్రితం లభించిన పిల్ల వాడి పుర్రె ను విశ్లేషించి ఆస్ట్రలో పితికస్ దానికి పేరు పెట్టారు.తొలి రాతి పనిముట్టు తయారు చేసిన కాలం ఇది.10 లక్షల సంవత్సరాల క్రితం Homoerectus ఆవిర్భవించాడు.2 లక్షల సం. నాడు Neanderthal Man దర్శనమిస్తాడు.తరువాత దశలో వచ్చినవారు Homo sapien (మనం).మానవ చరిత్రలో మౌలికమైన ఆవిష్కరణ నిప్పును రాజెయ్యటం.అగ్నిని తయారు చేసిన మనిషి జీవితమే మారిపోయింది.ఈ విషయాలతో మొదలు పెట్టి తరువాత దొరికిన కుడ్య చిత్రాల ఆధారంగా 20,000 ఏళ్ల క్రితం మనిషిని విశ్లేషిస్తారు.గత 12,000 ఏళ్ల క్రితం నుండి జరిగిన మానవ చరిత్ర మీద దృష్టి సారించారు రచయిత.10,000 ఏళ్ల క్రితం కొన్ని ప్రాంతాల్లో కొన్ని జంతువులను మచ్చిక చేసుకొని మొక్కల్ని పెంచడం ప్రారంభించాడు.మంచుయుగం చివరి దశలో వ్యావసాయిక విప్లవం(జీవ విప్లవం)ప్రారంభమైంది.మానవారోహణలో తొలిమెట్టు సంచారజీవితం మాని ఒక చోట స్థిరపడి వ్యవసాయం ప్రారంబించటమే.ప్రకృతి లో జరిగిన జన్యు సంయోగ ఫలితాల ద్వారా ఏర్పడిన గోధుమ ఏర్పడిందనే ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేయడం ద్వారా మనల్ని రచనలోకి మరింత ముందుకు వెళ్లేలా చేస్తారు.ప్రకృతి సహజంగా ఏర్పడిన వీటిని తరువాత పంట లాగా పండించడం నేర్చుకున్నాడు.క్రీ.పూ 6000 సం నాడు జెరికో వ్యవసాయ క్షేత్రంలో వీటిని పండించారు.తరువాత కొడవలి,నాగలి,చక్రం ఆవిష్కరించారు.కుక్క,గాడిద,ఎద్దు,గుర్రం వంటి జంతువులను పెంచుకుని వాటి సహాయం తో అదనపు సంపద సృష్టించిన విషయం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.ఈ విధంగా లభించిన ఆధారాల ఆధారంగా పనిముట్లు,నిర్మాణాలు చేయడం,లోహాలను వాడటం,గణిత అవిష్కరణలతో ఉదాహరణలతో మనకు ఆసక్తి కలిగిస్తూ ముందుకు సాగుతారు.ఇక 16 వ శతాబ్దం లో మొదలయిన పారిశ్రామిక విప్లవాన్ని గెలీలియో తో మొదలు పెట్టి న్యూటన్,leebnitz einstein,నీల్స్ బోర్ దాకా కళ్ళకు కట్టినట్లు వివరిస్తారు.ఆవిరి యంత్రం కనుగొన్న జేమ్స్ వాట్,చార్లెస్ డార్విన్ ల కృషిని తలచుకుంటారు.కాంతి కిరణాల పై ప్రయోగాలు,రాంట్ జెన్ x రే కిరణాలు,లియో జిలార్డ్ అణు విచ్చిత్తి ప్రక్రియలను ప్రస్తావిస్తారు.గ్రెగరీ మెండల్ పరిశోధనలు,DNA ఆవిష్కరణ,క్లోనింగ్ వంటి ఆధునిక పరిశోధనల వరకు వివరిస్తారు.సైన్స్ నైతికతను పెంచాలని,మేధో ప్రజాస్వామ్యం అవసరమని చెబుతారు.what is man అనే రహస్యం తెలుసుకోవడానికి కొనసాగాలి ఆరోహణ అంటారు.జ్ఞానం వెనుక బాధ్యత,నిజాయితీ,విచక్షణ ఉంటుంది.మానవ జాతి మూలాలు, చరిత్ర ఆరోహణ క్రమం ప్రతి స్కూలు పుస్తకం లోను భాగం కావాలని అభిలషిస్తారు రచయిత.మనిషికి తన పరిణామ క్రమాన్ని గురించిన జ్ఞానమే ఆలోచన కలిగిస్తుంది.అనుభవం,ఆలోచనను కలగలిపి ఆచరణను నిర్ణయించుకోవాలని చెబుతారు. జ్ఞానాన్ని లాటిన్ భాషలో సైన్స్ అంటారు.చరిత్ర అంటే గతం కాదు,ఈనాడు,ఈ క్షణం మనం తీసుకునే నిర్ణయాల వెనుక ఉన్న జ్ఞానమే చరిత్ర .దీని ఆధారంగా మనిషి ఆత్మవిశ్వాసం తో ముందడుగు వేయడమే మానవారోహణ అన్న ముగింపు తో మనలో కొత్త ఆలోచనల్ని రేకెత్తిస్తాడు. సైన్స్ ఉపాధ్యాయులు,అధ్యాపకులు,విద్యార్థులు,చరిత్రపట్ల అభిరుచి ఉన్న వారందరు చదవతగ్గ పుస్తకం ఇది....ఒద్దుల రవిశేఖర్.
Friday 30 April 2021
ఆనందో బ్రహ్మ.....యండమూరి.
కాలాన్నివెనక్కి ముందుకు నడిపించిన సుందరకావ్యం ఇది.భవిష్యత్ లో జరగబోయే పరిణామాలు ముందుగా అంచనావెయ్యడం కొంతమందికే సాధ్యం,ముఖ్యంగా రచయితలకి.యండమూరి ఆ విషయంలో పరాకాష్టకు చేరుకున్నారిందులో ఉదాహరణకు సోలార్ శాటిలైట్.ఇంకో 100 ఏండ్లు పోయినా సాంకేతికత ఎలా మారినా ప్రేమ ప్రతి మనిషి హృదయాన్ని కదిలిస్తూ ఉంటుంది అన్న అంశాన్ని ప్రధానంగా చేసుకొని వ్రాసిన అపురూపమైన నవల ఇది. మంచినవల:ఉన్న పరిస్థితులు ఉన్నట్టు వ్రాసి పాఠకుడి ఆలోచన్లని విస్తృతం చేయడం ద్వారా నిర్దుష్టమైన అభిప్రాయాల్ని కలుగజేసేది మంచినవల. నవల:మనిషి జీవితంలో అనుభవాలకి అందమైన అల్లికే నవల....యండమూరి విశ్వనాథ సత్యనారాయణ,జంధ్యాలపాపయ్య శాస్త్రి,దేవులపల్లి కృష్ణశాస్త్రి ఎంత గొప్ప కవులో స్మరించుకుంటారు. గోదావరి నది వర్ణించడం విషయానికి వస్తే కవి విశ్వరూపం కనిపిస్తుంది.తెలుగు భాషలో రచయిత వాడే కొన్నిపదాలు నిఘంటువు చూసి తెలుసుకోవాల్సిందే,కొన్నింటి అర్ధం వివరిస్తుంటారు.పల్లెటూరిని వర్ణిస్తుంటే అటువంటి ఊర్లలో కొంత కాలం గడుపుదామనిపిస్తుంది. "భూదేవి కొత్త పెళ్లికూతురయితే బంతిపూలు పసుపు!మిరప పంట కుంకుమా!" ఎంత చక్కని పోలిక.సాహిత్యమన్నా,గతకాలపు కవుల కావ్యాలన్నా రచయితకి ప్రాణం.వారి పేర్లను, వారి పద్య,గద్యాలను సందర్భం వచ్చినప్పుడల్లా ప్రస్తావించకుండా ఉండరు.సంక్రాంతికి పల్లె ఎలా ఉంటుందో చదివి తీరవలసిందే. *"అధ్యయనం చేయాలంటే మనిషి జీవితం కన్నా గొప్పవేదం లేదు".ఆణిముత్యం లాంటి మాట. పద్యాలంటే రచయితకు చాలా ఇష్టం.మనం చదవని, మరిచిన,కావ్యాల్లోని పద్యాలను పరిచయం చేస్తూ తన్మయత్వం చెందుతూ మనల్ని పరవశించి పోయేలా చేస్తారు.ఇక స్త్రీని వర్ణించడం లో ప్రబంధకవులైన కాళిదాసు,ముక్కుతిమ్మన,శ్రీనాధుడు,అల్లసాని పెద్దనల కే మాత్రం తీసిపోని శైలిలో మనకర్ధమయ్యే వచనంలో వ్రాస్తారు. మందాకిని పాత్రను అత్యద్బుతంగా మలిచిన తీరు తెలుగు నవలా చరిత్రలో కలికుతురాయి.అలాంటి వ్యక్తి ఒకరయినా జీవితంలో సరయిన దశలో మార్గదర్శకత్వం చేస్తే ప్రతివ్యక్తి జీవితం మారిపోతుంది. సోమయాజితో పలికించిన పద్యం రచయిత వ్రాసిన అద్భుత మైన పద్యం.కార్తెలను వర్ణిస్తూ మందాకిని వ్రాసుకున్న డైరీ లో ప్రకృతిలో మనం కలిసిపోవాలని పిస్తుంది.మరిచి పోతున్న తెలుగు భాష ,సంస్కృతిమీద తీవ్రమైన ఇష్టం పుట్టించే నవల ఇది.గుండెను వీణ మీటినట్లు మీటిన నవల ఆనందోబ్రహ్మ. "వేదాంతమే ఋష్యత్వమైతే ఆనందమే బ్రహ్మత్వం".యండమూరి ......ఒద్దుల రవిశేఖర్.