Saturday 25 June 2022

మానసిక అనారోగ్యాన్ని గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి...దీపిక (హిందీ సినీనటి )

 

2013,2014 సంవత్సరాల్లో నాకు సినిమా పరిశ్రమలో మంచి విజయాలు దక్కాయి. నాకు వచ్చిన సమస్యను మీ అందరితో పంచుకుంటాను. మొదట్లో ఉదయం లేవగానే కడుపులో ఏదో తెలియని ఇబ్బందిగా అనిపించేది అదేంటో ఎందుకు వస్తుందో అర్ధమయ్యేది కాదు. ఇంత వరకు ఎప్పుడూ ఈ పరిస్థితి నాకు ఎదురు కాలేదు జ్వరం, జలుబు వచ్చినప్పుడు వచ్చే మార్పులు మనకు తెలిసిపోతాయి. కానీ ఈ ఇబ్బంది నన్ను తీవ్రంగా బాధించేది. నాలో నేనే ఏడ్చుకునే దాన్ని అవి నా పాలిట చీకటి రోజులు. గమ్యరహితంగా,వెలితిగా ఉండేది  నా జీవితం.                                      *మా అమ్మ నన్ను చూడటానికి వచ్చినప్పుడు నా లక్షణాలు గమనించి అన్నా అనే సైకాలజిస్ట్ కు ఫోన్ చేసింది. ఆమె నన్ను నిపుణుడి సహాయం తీసుకోమంది. దీనికి సరయిన వైద్యం ఉందని, దాని ద్వారా నయమవుతుందని నమ్మమని కోరింది. మొదట్లో మందులు తీసుకోవడానికి వ్యతిరేకించాను. ఎక్కువ మందులు మింగడం ఆరోగ్యానికి మంచిది కాదు అనుకునే దాన్ని. నా మానసిక స్థితి చాలా హెచ్చు తగ్గులుగా ఉండేది. ఒకో సారి చాలా ఉన్నతంగా, మరో సారి పాతాళం లోకి తోసి వేసినట్లు అనిపించేది.లోలకం ఊగినట్లు నా మనసు ఊగేది. నా మనసుకు, నా శరీరానికి ఏమవుతుందో అర్ధమయ్యేది కాదు. తీవ్రమైన నిరాశ లో కూరుకు పోయేదాన్ని. అప్పుడు నాకు మందులు ఇవ్వడం మొదలు పెట్టారు డాక్టర్.           *Function లకు, party లకు వెళ్ళినప్పుడు అందరి ముందు చిరునవ్వుతో అంతా బాగున్నట్లు ఉన్నా ఏదో తీరని వెలితి లోపల. డాక్టర్స్ చెప్పిన దాన్ని బట్టి నాకు clinical depression ఉందని తెలిసింది. ఒక్క సారి సమస్య అర్ధమయ్యాక దాన్ని అంగీకరించాను. ఈ విషయాన్ని సన్నిహితులతో పంచుకున్నాను. నేను నిజాయితీ గా ఈ విషయాలు చెబుతున్నప్పుడు నా చుట్టూ ఉన్నవారు నన్ను అర్థం చేసుకుని సహకరించే వారు. అప్పటినుండి నా సమస్యను అందరికీ చెబుతుండే దాన్ని అప్పుడర్ధమయ్యింది ఇండియాలో ఈ సమస్యలు చాలా మందికి ఉన్నాయని.ఈ విధంగా అందరికీ చెప్పుకోవడం వల్ల నా career దెబ్బతింటుందనుకోలేదు. అసలు ఈ సమస్యను అందరికీ చెప్పుకోవడం వలననే నేను కోలుకోగలిగాను.                                       *జాతీయ టెలివిజన్ లలో ఇంటర్వూ లు ఇచ్చే దాన్ని. అలా చెబుతున్నప్పుడు స్వేచ్ఛ పొందినట్లు భావించేదాన్ని. మనం నిజాయితీగా ఉంటే మన చుట్టూ ఉన్న వారు అర్థం చేసుకొని అంగీకరిస్తారని తెలిసింది.నేను అనుభవించే బాధను,ఎలా అధిగమించానో తెలుసుకుంటే మిగతా వారికి మేలు జరుగుతుందని భావించేదాన్ని.  ఒక విలేఖరి నన్ను ఏదయినా మందుల కంపెనీ కి ఏజెంట్ గా పని చేస్తూ ఇదంతా చెబుతున్నావా అని అనుమానించింది.                                   *విచారంగా ఉండటం వేరు,వ్యాకులంగా ఉండటం వేరు మనం వ్యాకులాన్ని గుర్తించలేం కూడా. మానసిక అనారోగ్యం దాని లక్షణాలు అర్థం చేసుకోవాలి. కొంత మంది ఎలా ఉన్నావు అని అడిగితే బాగాలేను అంటారు. వారు కోలుకోవడానికి అటువంటి వారి పట్ల సహానుభూతి చూపడం అత్యంత అవసరం  అవతలి వారిపట్ల శ్రద్ద చూపడం వారిపట్ల జాగ్రత్త వహించడం ఉదాత్త లక్షణం       *2013-14 సంవత్సరాలు నా జీవితంలో అత్యంత కఠినమైనవి.నా హృదయం ముక్కలై పోయిందా అన్న భావన. ఆ స్థితిని తెలుసుకుని వైద్య సహాయం తీసుకోవడం నా జీవితాన్ని మార్చేసింది. అలాగే శారీరక అనారోగ్యం గురించి అందరికీ ఏదో ఒక మేరకు అవగాహన ఉంటుంది. కానీ రాబోయే 10 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరూ తమ మానసిక ఆరోగ్యాన్ని గురించి తెలుసుకుంటారని ఆశిస్తాను. (అనువాదం :ఒద్దుల రవిశేఖర్ )

Saturday 11 June 2022

సురభి గౌతమ్ :IAS ఆఫీసర్ అయిన విధం

 

నమస్తే అందరూ ఈ రోజు నా  విజయాల గురించే మాట్లాడుకుంటున్నారు. అన్ని ప్రఖ్యాతి గాంచిన పోటీ పరీక్షలు ఉత్తీర్ణత అయినట్లు నా  బయోడాటా లో మీకు కనిపిస్తుంది. కానీ మిత్రులారా  నేను పొందిన తిరస్కారాలు,నా పట్టుదల, మానసిక సామర్ధ్యము నా విజయాలకు కారణం.                               *మధ్య ప్రదేశ్ లోని మారుమూల కుగ్రామం మా ఊరు.1000 జనాభా కలిగిన చిన్న పల్లెటూరు. ఒక వర్షా కాలం ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో ఒక చిన్న పాప జన్మించింది. 30 మందితో కూడిన పెద్ద ఉమ్మడి కుటుంబమది.25 ఏళ్ళు గడిచాయి. అదే అమ్మాయి, అదే ఊరు. పూల దండలతో స్వాగతం. ఉమ్మడి కుటుంబంలో ఎవరినీ ప్రత్యేక శ్రద్ధతో చూడరు.మా ఊరి హిందీ మీడియం పాఠశాలలో చదివాను.5 వ తరగతి గణితంలో 100/100 మార్కులు సాధించాను. ఆ రోజు నాకు మొదటి ప్రశంస,గుర్తింపు లభించాయి.నా హృదయం విభిన్న అంశాలపై దృష్టి పెట్టమని కోరుతుంది.చిత్ర కళ,రంగులు వేయడం,ఎంబ్రా యిడరి మొదలు పెట్టాను.                                *కానీ నా దేహంలో కలుగుతున్న నెప్పిని గమనించలేకపోయాను. నా మోచేతి భాగం మరియు నా శరీరంలోని ప్రతి కీలులో విపరీతమైన బాధతో మంచానపడ్డాను. హాస్పిటల్ లో డాక్టర్ రుమాటిక్ జ్వరం అని చెప్పారు. ప్రమాదకర మైన జ్వరమని ప్రతి 15 రోజులకొకసారి నిపుణుడయిన డాక్టర్ తో పెన్సిలిన్ ఇంజక్షన్ వేయించాలని చెప్పారు. మా ఊర్లో కరంట్ లేదు కిరోసిన్ వెలుగులో చదువుకోవాలి. ఎటువంటి ట్యూషన్ లు లేవు.అయినప్పటికీ నా 10 వ తరగతి పరీక్షల్లో maths, science ల్లో 100/100 మార్కులు సాధించాను.నన్ను వార్తపత్రికలు ఇంటర్వూ చేసాయి. భవిష్యత్తులో ఏమవుతావని అడిగారు. Dancer ను singer ను అవుతానని చెప్పాను. కానీ ఆ విలేఖరి నువ్వు బాగా చదివి ఏమవుదామనుకుంటున్నావు అని అడిగారు. అప్పుడు మెరుపులా నా  మనసులో ఓ ఆలోచన వచ్చింది."కలెక్టర్ ను అవుతానని చెప్పాను. పేపర్ లో అదే హెడ్డింగ్ తో వార్త వచ్చింది. అందరూ అభినందించారు. కానీ కలెక్టర్ కావాలంటే ఏమి చెయ్యాలో తెలియదు. సమాజానికి కలెక్టర్ ఎంత ముఖ్యమో తెలీదు.                                             * ఇంటర్ లో మాథ్స్ గ్రూప్ తీసుకున్నాను. మా  ఊరిలో విద్యుత్ శక్తి,ఆసుపత్రి లేని దయనీయ స్థితిని మార్చాలనుకున్నాను. కానీ ఎలానో తెలీదు.12 వ తరగతిలో సైన్స్ లో ఎక్కువ మార్కులు రావడంతో అబ్దుల్ కలాం స్కాలర్ షిప్ వచ్చింది. మంచి గుర్తింపు వచ్చింది.               *తరువాత భోపాల్ వచ్చి ఇంజనీరింగ్ లో చేరాను. మా ఊరి నుండి వచ్చిన ఏకైక అమ్మాయిని నేనే. నేను నా ఆశయాలు సాధించక పోతే మిగతా అమ్మాయిల ఆశలు సమాధి చేసినట్లే. కాలేజీలో మొదటి రోజే చేదు అనుభవం. కెమిస్ట్రీ ల్యాబ్ లో మేడం నన్ను చూసి ఆ టెస్ట్ ట్యూబ్ తీసుకుని టైట్రేషన్ చేయమన్నది. అసలు హిందీలో దాని అర్ధమేంటో తెలీదు. టెస్ట్ ట్యూబ్ పట్టుకోగానే జారి క్రింద పడింది. ఇక రెండవ పీరియడ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్. అందరు ఇంగ్లిష్ లో ధా రాళంగా మాట్లాడుతూ పరిచయం చేసు కుంటున్నారు.నాకు ఇంగ్లీష్ రాదు. హిందీ మీడియంలో చదివాను. అందరు చెప్పిన పదాలు పేర్చుకుని ఎలాగోలా చెప్పగలిగాను. మా ఫిజిక్స్ సార్ పొటెన్షియల్ అంటే ఏంటని అడిగారు.అర్థం తెలిసినా ఇంగ్లీష్ లో చెప్పలేక మౌనంగా ఉన్నా. సార్ వచ్చి నువ్వు నిజంగా ఇంటర్ పాస్ అయ్యావా, ఇంత చిన్న ప్రశ్న చెప్పలేవా అన్నారు. రూమ్ కు వచ్చి తనివి తీరా ఏడ్చాను. బ్యాగ్ సర్దుకొని ఇంటికి వెళ్లి పోదామనుకున్నా. మా  అమ్మానాన్న కు ఫోన్ చేసాను. హనుమంతుడికి అతని గొప్ప తనాన్నిజాంబ వంతుడు ఎలా గుర్తు చేసాడో నాకు అమ్మా నాన్న అలా ధైర్యం చెప్పారు అప్పుడు నిర్ణయించుకున్నా మొదటి సెమిస్టర్ అయిపోయేలోగా ఇంగ్లీష్ లో ధారాళంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నా. ఇంజనీరింగ్ పుస్తకాల్లోని పదాలను గోడలపై వ్రాసుకున్నా. నా మెదడులోకి బాగా ఎక్కించుకున్నా. నా  కలలు కూడా అప్పటినుంచి ఇంగ్లీష్ లోనే సాగాయి. మొదటి సెమిస్టర్ లో యూనివర్సిటీ లోనే మొదటి స్థానం సాధించాను. ఛాన్సలర్ స్కాలర్ షిప్ అందుకున్నా. సాధించాలని బలంగా నిర్ణయించుకుంటే ఏదయినా సాధించగలమని అప్పుడర్ధయింది. ఏకోచింగ్ లేకుండా ఇంగ్లీష్ లో మాట్లాడాగలిగాను.విశ్వం ఏ విధంగా తలచిందో మీ ముందు TED talk లో ఇలా నిలబడ్డా.20 ఏండ్ల 6 నెలలకు నా B. Tech డిగ్రీ పూర్తయింది.                     *సివిల్స్ వ్రాయాలంటే 21 సం నిండాలి. ఈ 6 నెలల్లో GATE, ISRO,BARC , SAIL,PPSC, IES ఇలా అన్ని ఇంజనీరింగ్ ఉద్యోగ పరీక్షలు వ్రాసా అన్నింట్లోనూ అర్హత సాధించా. ముంబై BARC నుండి ఇంటర్వూ కి పిలుపు వచ్చింది. మిత్రులంతా చాలా కష్టమని నిరాశ పరిచారు. ఇంటర్వూ లో విజయం సాధించి న్యూక్లియర్ సైంటిస్ట్ అయ్యాను.IES లో దేశం లో మొదటి ర్యాంక్ వచ్చింది. కానీ నేను ఏ IIT, NIT ల నుండి వచ్చిన దాన్ని కాదు. నేను ఇంజనీరింగ్ సర్వీస్ పరీక్షలో first వచ్చిన మొదటి మహిళను. ఇప్పటివరకు నా మార్కులు ఎవరూ దాటలేదు. BARC కు రాజీనామా ఇచ్చి రైల్వే ఇంజనీర్ గా చేరాను. హైదరాబాద్ లో శిక్షణ కోసం వెళ్ళా.                                  *ఇక చదవాల్సిన పని లేదు జీవితాన్ని సంతోషం గా గడుపుదా మనుకున్నా .కానీ ఎందుకో ఈ వృత్తి ఆనందాన్ని ఇవ్వడం లేదు.అమ్మని అడిగా ఎందుకు ఇలా అనిపిస్తుంది అని.అమ్మ ఇలా అన్నది "10 వతరగతి అయ్యాక పేపర్ కు ఇచ్చిన ఇంటర్వూ లో కలెక్టర్ అవుతానని, ఊరికి ఏదో మేలు చేస్తావని చెప్పావు కదా "అన్నది. అప్పుడు సివిల్స్ వ్రాద్దామని నిర్ణయించుకున్నా.సివిల్స్ ఇండియా లోనే కాదు, ప్రపంచంలోనే అతి కఠినమైన పరీక్ష.4,5 సార్లు వ్రాస్తేనే గాని విజయం సాధించలేని పరీక్ష.24 గంటలు చదువుతుంటారు ఈ పరీక్ష కోసం. కానీ నా రైల్వే శిక్షణ తీసుకుంటూనే రోజుకు మిగిలిన  3 లేదా 4 గంటలు చదివే దాన్ని చాలా ఒత్తిడికి గురయ్యేదాన్ని. వదిలేద్దా మనుకున్నా. మళ్ళీ అమ్మకు ఫోన్ చేసాను. ఆమె నాకు ఎప్పుడూ మంచి మెంటార్ గా ఉండేది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక కూడా నాకు జీవితం చాలా కష్టంగా ఉంది చిన్నప్పటినుండి కష్టపడుతూనే ఉన్నా. జీవితం లో ఆనందించేదెప్పుడూ సివిల్స్ పాస్ అవుతానోలేదో తెలీదు. అన్నాను అమ్మతో. అమ్మ అన్నది "నీ  వయసు 23, నేను నీ వయసులో ముగ్గురు బిడ్డల తల్లిని.30 మంది ఉన్న ఉమ్మడి కుటుంబానికి భోజనం తయారు చేసి 10 కి. మీ  వెళ్లి పని చేసి వచ్చే దాన్ని అయినా నేను ఎవరిపై ఫిర్యాదు చేయలేదు. కానీ నీకు ఎటువంటి కుటుంబ సామాజిక బాధ్యతలు లేవు. నీ కలను సార్ధకం చేసుకో, నిన్ను నువ్వు నిరూపించుకో ఇతరుల కోసం కూడా సాధించు, అదే నీ లక్ష్యం. నీ కళ్లద్దాలను కొద్దిగా సవరించుకో". ఇక నేను మిషన్ మోడ్ లో చదవడం మొదలు పెట్టాను. ఎన్ని ఆటంకాలు ఎదురయినా అంతే దృఢoగా మారిపోయాను.2016 లో సివిల్స్ లో దేశ స్థాయిలో 50 వ ర్యాంక్ సాధించాను.                                                                *ఈ క్రింది వాక్యాలు నేను నమ్ముతాను "కష్టపడటానికి మించి వేరే మార్గం లేదు. విజయానికి దగ్గరి దారి లేదు.సాధించలేని వాటి గురించి ఆలోచించకు.విధితో మొండిగా పోరాడి ఏదయినా సాధించు,ముందుకే వెళ్లాలని బలంగా నిర్ణయించుకో. అదే మన గమ్యాన్ని చేరడానికి గల రహస్యం." ధన్యవాదాలు. 🙏. (అనువాదం :ఒద్దుల రవిశేఖర్ )

Saturday 4 June 2022

మనమంతా పరిపూర్ణమైన అపరి పూర్ణులం....మునాబ్ మజారి.

 అందరికీ ధన్యవాదాలు. నన్ను నేను ప్రేరణాత్మక వక్తగా కాక ఒక కథకురాలిగా భావిస్తా ఎక్కడి కెళ్ళినా ఒక కథ చెబుతా, మాటలకున్న శక్తి విలువ నాకు తెలుసు. పదాలు మిమ్మల్ని తయారు చేయవచ్చు, మీ మనసును గాయ పరచవచ్చు, గాయాన్ని మాన్ఫవచ్చు.అందుకే నేను ఆశావాదంతో మాట్లాడుతుంటా వాళ్ళు దాన్ని నా బలహీనతగా భావిస్తే నేను అది బలంగా భావిస్తా, వారు నన్ను వికలాంగురాలిగా భావిస్తే నేను విభిన్న ప్రతిభా వంతురాలిగా భావిస్తా, నా సామర్ధ్యాన్ని చూస్తా. మీ జీవితం లో జరిగే కొన్ని సంఘటనలు మీ DNA ను మార్చేంత శక్తి కలిగి ఉంటాయి మీ దేహాన్ని ముక్కలు చేసినా మీ ఆత్మలో పరివర్తన కలిగిస్తాయి.అవి మిమ్మల్ని మరింత ఉన్నతీకరిస్తాయి. నాకు అలాగే జరిగింది.18 ఏళ్లప్పుడే నాకు పెళ్లి అయింది మాది చాలా సంప్రదాయ కుటుంబం వివాహం అయిన 2 ఏండ్ల కు నాకు కార్ ప్రమాదం జరిగింది. నా భర్త ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. నాకు తీవ్ర గాయా లయ్యాయి.కుడి భుజం మణికట్టు విరిగాయి. ఊపిరి తిత్తులు, కాలేయం దెబ్బతిన్నాయి గాలి పీల్చలేక పోయేదాన్ని, మూత్రము మీద నియంత్రణ కోల్పోయాను. నా వెన్నెముక పూర్తిగా దెబ్బతిన్నది. జీవితాంతం ఇక నడవ లేనని తెలిసింది ఈ గాయాలు నా జీవితాన్ని పూర్తిగా మార్చేసాయి కొంత మంది రక్షించి ఒక జీప్ వెనుక భాగంలో తీసుకెడుతుంటే మిగిలిన ఎముకలు కూడా విరిగాయి. అప్పుడు నా కర్ధమైంది. సగం దేహం విరిగిపోయింది, మిగతా సగం చలనం లేకుండా మారిందని. రెండున్నర నెలలు ఆసుపత్రి లో ఉన్నాను. నాకు చాలా శ స్త్ర చికిత్సలు జరిగాయి. నా శరీరం లో చాలా టైటానియం అమర్చారు అందుకే పాకిస్థాన్ లో నన్ను అందరూ ఉక్కుమహిళ అంటారు.ఒక రోజు డాక్టర్ వచ్చి నీవు ఇక చిత్రకారిణి కాలేవని చెప్పారు. మరుసటి రోజు వచ్చి నీ వెన్నెముక బాగా దెబ్బ తిన్నదని ఇక నీవు నడవ లేవని, బిడ్డలను కనలేవని చెప్పడం తో నా కర్ధమయింది పూర్తిగా నా జీవితం నాశనమయిందని. మా అమ్మను అడిగాను నేను ఎందుకు బ్రతికి ఉండాలని, నా జీవితానికి అర్థం ఏముందని? పిల్లలు కలగక పోతే జీవితమంతా అసంపూర్ణం గా మిగిలిపోవాల్సిందేనా అని. దేవుడు నీ కేదో గొప్ప భవిష్యత్తును వ్రాసి పెట్టాడేమో అని అమ్మ అన్నది. అంత బాధలోనూ అమ్మ మాటలు నా మీద మంత్రం లా పనిచేసాయి నన్ను ఆసుపత్రి నుండి తీసికెళ్ళమని అమ్మను, తమ్ముడిని కోరాను నేను మొదటి చిత్రాన్ని నా మృత్యు పాన్పు మీద వేసాను అదే నా హృదయానికి నేను చేసుకున్న చికిత్స. ఆసుపత్రి నుండి ఇంటికొచ్చాను. నా గాయల వల్ల 2 సంవత్సరాలు ఇంట్లోనే బెడ్ పైనే  ఉండవలసి వచ్చింది,కిటికీ గుండా పక్షుల కిలకిలా రావాలు వింటూ.ఒకసారి బయటికెళ్లి ప్రకృతి సంగీతాన్ని వినాలని కోరిక కలిగింది, అప్పుడనిపించింది ప్రజలెంత అదృష్టవంతులో కాని వారది గుర్తించరు. రెండున్నర సంవత్సరాల తర్వాత చక్రాల కుర్చీ పై కూర్చో గలిగాను. అప్పుడు నాకు పునర్జన్మ లభించినట్లనిపించింది. ఇక జీవితమంతా నడవ లేనని గుర్తు కొచ్చింది. అద్దముందు నిలబడి అనుకున్నా ఏ అద్భుతం జరిగి నేను నడవలేనని, ఏడ్చుకుంటూ మూలన కూర్చునే బదులు, ఎవరి దయ కోసమో ఎదురు చూసే బదులు నా స్థితిని అంగీకరించాలని నిర్ణయించుకున్నా! నా కోసం నేను జీవించాలనుకున్నా, అప్పుడే నిర్ణయించుకున్నా నా భయాలను గెలవాలని కానీ నా పెద్దభయం ఏంటంటే విడాకులు. నా అవసరం లేని వ్యక్తికి నేను ఎందుకు? అతనికి స్వేచ్చ ఇచ్చి నేను స్వేచ్ఛను పొందటం మేలు కదా!అతను వివాహం చేసుకున్నాడు అని తెలియగానే అభినందనలు తెలియజేసా రెండవ పెద్దభయం నాకు పిల్లలు కలగరని! కానీ ప్రపంచంలో ఎంతో మంది అనాధలున్నారు. వారిలో ఒకరిని దత్తత తీసుకోవచ్చు కదా అనిపించింది, అదే చేసాను. ఇక  3 వ భయం  జనాలను ఎలా ఎదుర్కోవాలి అని ఇంట్లో బెడ్ మీదున్న ఆ రెండు సంవత్సరాలు తలుపులు వేసుకొని ఎవరిని పలకరించటానికి ఇష్టపడే దాన్ని కాదు. వారు ఒక లాగా సానుభూతి చూపడం నాకు నచ్చదు ఇప్పుడు ఇలా మీ అందరి ముందు నా కథ పంచుకోవడం నా అదృష్టం. అలాగే పెయింట్ వేయడం మొదలు పెట్టాను. మోడలింగ్ చేస్తున్నాను. అందువలన  మనల్ని మనం ముందు అంగీకరిస్తే ప్రపంచం మనల్ని గుర్తిస్తుంది. పాకిస్థాన్ తరపున ఐక్యరాజ్యసమితికి రాయబారిగా వ్యవహరిస్తూ స్త్రీ ల  పిల్లల  హక్కుల గురించి  లింగ సమానత్వం గురించి  మాట్లాడుతున్నా.2015 BBC ఎన్నుకొన్న 100 మంది స్త్రీల లిస్ట్ లో నేను ఉన్నా, Forbes ఎన్నుకొన్న 30 సంవత్సరాల లోపు వయసు  గల  30 మంది స్త్రీల లిస్ట్ లో ఉన్నా. మీ వృత్తి లో మీరు  ఎంతో ఉన్నతస్థానం చేరుకోవాలని మీకు ఉండవచ్చు. కానీ దానికి ఒకటే  సూత్రం నేను అనుకోకుండా మనం అనుకోవాలి. నీ ఒక్కడివే విజయాలు సాధిస్తావు అనుకోవద్దు. నీ  వెనుక ఒకరుండాలి. నీకు మద్దతిస్తూ ఒకరుండాలి అటువంటి వ్యక్తిని కోల్పోవద్దు. నా  వెనుక  మా అమ్మ ఉంది నేను ఇలా ఉన్నానంటే ఆమే కారణం. మనం జీవితం నుంచి ఎంతో ఆశిస్తుంటాం కానీ జీవితం నన్నిక్కడ నిలిపింది. ఇది నాకు పరీక్షా కాలం. దాన్ని మనం  అర్థం  చేసుకుంటే  చాలు ఓటమి  ఒక అవకాశం, మళ్ళీ మళ్ళీ లేచి నిలబడి ప్రయత్నించాలి కానీ ఎప్పుడూ వదిలి పెట్టకూడదు. మనకు అంతా దోషం లేకుండా ఖచ్చితంగా, సంపూర్ణం గా ఉండాలనుకుంటాం. జీవితం, వృత్తి సంబంధాలు డబ్బు ఇలా అన్నింట్లో సంపూర్ణతను ఆశిస్తాం ఏదీ ఈ ప్రపంచం లో పరిపూర్ణంగా ఉండదు. మనమంతా పరిపూర్ణంగా అసంపూర్ణులం.ఇతరులకు మనం మంచిగా పరిపూర్ణంగా కనిపించాలనుకోవద్దు. నీ లోపల నీకు  ఆ పరిపూర్ణత ఉంటే చాలు. ఈ సమాజం మనం సంపూర్ణులుగా ఉండటానికి చాలా నిబంధనలు పెట్టింది. స్త్రీ పురుషులకు అవి విభిన్నంగా ఉంటాయి. మనం ఎదుటివారు చెప్పిన దానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తాం. మనల్ని మనం తక్కువ వింటాం.ఇతరుల మేలు కోసం నీవు ఏదయినా చేస్తే నీవు సంపూర్ణంగా ఉన్నట్లు. ఇతరుల బాధను మనం అనుభవించి నట్లయితే ఆ బాధే మనల్ని ఇతరులతో అనుసంధానం చేస్తుంది. బాధ తప్ప ఏదీ ఇతరులతో మనల్ని అనుసంధానించదు. అందుకే చెబుతుంటా నేను బాధ లో ఉన్నానని. నా కదే ఆశీర్వాదం. చక్రాల కుర్చీలో ఉన్నాను కాబట్టే పిల్లలకోసం పనిచేస్తున్నా. వైద్య సహాయం అందని మారుమూల ప్రాంతాల పిల్లలకు వైద్యం అందిస్తున్నా. అలాగే హిజ్రా లకు  సహాయం అందిస్తున్నా. ఇలా అసంపూర్ణమైన వ్యక్తులు మనతో అనుబంధం ఏర్పరచు కోవడానికి కారణం నేను అసంపూర్ణురాలుని కాబట్టి. జనం అడుగుతుంటారు ఎప్పుడూ నవ్వుతూ ఉండటంలో మీరు అలసట చెందరా అని. నీవు కోల్పోయిన వాటి గురించి, వ్యక్తుల గురించి ఆలోచించవద్దు. నీవు ప్రస్తుతం పీల్చే ప్రతి శ్వాసను ఆస్వాదించు.జీవితాన్ని ఉత్సవం లా జరుపుకో.జీవించు, మరణానికంటే ముందే చావకు. అందరం మరణించే వాళ్ళమే.75 ఏళ్ళు ఒకేలా బ్రతికి మనం దాన్ని జీవితమంటాం. ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తారు అది కాదు జీవితం అంటే. బయటికెళ్లి నీ సహాయం కావలిసిన వారిని గుర్తించు. వారి జీవితాలకు రంగులద్దు. వారి జీవితాలకు విలువనివ్వు. అన్ని నిరాశా వాదపు భావనలు తొలగించే స్పాంజ్ లా మారు అందమైన ఆశావాదపు భావనలు వెదజల్లగలిగితే ఇతరులను మార్చగలవు. నేను నవ్వుతుంటేనే ఇతరులను ఆనందపరచగలను. నీకు ఉన్న వాటి పట్ల గొప్పగా భావించు. మనకు లేని వాటిపట్ల ఎక్కువగా ఆలోచించ వద్దు. జీవితాన్ని పూర్తిగా జీవించండి. నీవు ఉన్న స్థితిని అంగీకరించు.నీ పట్ల నీవు దయకలిగి ఉండు అప్పుడే ఇతరుల పట్ల దయ కలిగి ఉంటావు.నిన్ను నువ్వు ప్రేమించు ఆ ప్రేమను వ్యాపింపజెయ్యి. జీవితం చాలా కఠినంగా ఉంటుంది.అలజడి, పరీక్షలు ఉంటాయి. అవే నిన్న ద్రుడంగా గా తయారు చేస్తాయి. ఎప్పుడూ దేన్నయినా  మధ్యలో వదిలి వేయవద్దు. నిజమైన ఆనందం డబ్బులో, విజయం లో కీర్తిలో ఉండదు.

నిజమైన ఆనందం కృతజ్ఞతలో ఉంటుంది. ప్రతి క్షణం జీవించడానికి ప్రయత్నించండి.(అనువాదం :ఒద్దుల రవిశేఖర్ )

Wednesday 1 June 2022

రేనాటి సూర్య చంద్రులు

 రచయిత :తంగిరాల సుబ్బారావు                   పుస్తక పరిచయం :ఒద్దుల రవిశేఖర్                    ఉయ్యాలవాడ నారసింహారెడ్డి యుద్ధ వీరగాధ (విప్లవ కాలము క్రీ. శ 1845-1847) బుడ్డా వేంగళ రెడ్డి దాన వీర గాధానిక (జీవిత కాలము:క్రీ. శ  1822-1900) చిరంజీవి " సైరా నరసింహా రెడ్డి " చిత్రం విడుదల కాగానే ఒక్క సారి అందరి దృష్టి ఉయ్యాలవాడ నారసింహారెడ్డి పై పడింది. ఆచార్య తంగిరాల వేంకట సుబ్బారావు గారు ఎంతో శ్రమకోర్చి సేకరించి గుడిగుచ్చి అందించిన ఈ పుస్తకం లో నారసింహా రెడ్డిని సూర్యుడిగాను, వేంగళ రెడ్డిని చంద్రునిగాను వర్ణించారు రచయిత. చరిత్ర ఎప్పుడూ వ్రాసే వారి అభిప్రాయాలను బట్టి ఉంటుంది అందుకే చరిత్రపై ఎన్నో భే ధాభిప్రాయాలు ఉంటాయి. నారసింహారెడ్డి విషయం లో అదే జరిగింది. కానీ రచయిత బ్రిటిష్ ప్రభుత్వం భద్రపరిచిన రికార్డులను, జనపదాల్లో పాడుకునే పాటలను, వీరగాధలను పరిగణన లోకి తీసుకొని ఆయన బ్రిటిష్ వారిపై విప్లవ శంఖం పూరించారని అర్ధమవుతుంది అంటారు. ఆయననను భారత ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామ వీరుడిగా రచయిత పేర్కొన్నారు. అలాగే 1866 లో రాయలసీమ ప్రాంతం లో వచ్చిన ఎర్రగాలి కరవు, ధాత కరవుల కాలంలో 3 నెలల పాటు కొన్ని వేల మందికి అన్నదానం చేసిన అపర దానకర్ణుడిగా ఖ్యాతి గాంచారు బుడ్డా వేంగళ రెడ్డి. ఆయన తన జీవితమంతా తన ఆస్థి పాస్తులను దాన ధర్మాలకే ఖర్చు చేశారు.చారిత్రక ప్రాంతాలపై ఆసక్తి ఉన్నవారు పుస్తకం మొదట్లో, చివర్లో ఇచ్చిన చిత్రాలు చూసి ఆయా ప్రాంతాలను సందర్శించవచ్చును. గిద్దలూరు దగ్గర కొత్త కోటపై ఉన్న ఫిరంగులను మేము విహార యాత్రలో చూసాము. ఈ పుస్తకం లో బండి గోపాలరెడ్డి, కలవటాల జయరామారావు బందుమియ్య రచనలను పొందు పరచారు. చివరలో బ్రిటిష్ ప్రభుత్వం వారు జరిపిన ఉత్తర ప్రత్యుత్తరములు ఇవ్వడం వలన రచనకు మరింత విశ్వసనీయత కలిగింది. గ్రంధాలయం లో ఎప్పటినుండి ఉందో ఈ పుస్తకం ఇప్పటికి చదివింది నేనే. ఆసక్తి గల వారు అన్ని ప్రభుత్వాగ్రంధాలయాల కెళ్ళి చదువ వచ్చును.