Friday 29 June 2012

స్నేహం మొదలయ్యే క్రమం(3)


   ( మార్చ్ నెలలో స్నేహం(1),స్నేహం ఓ ఆహ్లాదం (2)తరువాత స్నేహం పై వ్యాసాలలో ఇది మూడవది.)
                స్నేహం  చేసుకుందామని  ఎవరూ  ప్రయాణం  మొదలెట్టరనుకుంటా ! ఎందుకో  రెండు  హృదయాలు  ట్యూన్ అవుతాయి.ఇద్దరు మగ అయినా ఇద్దరు ఆడ అయినా ,ఒక మగ ఒక ఆడ అయినా స్నేహితులు కావచ్చు చిన్నపిల్లలు కూడా ఒకరిద్దరితో స్నేహం చేస్తారు.వారితోనే ఎక్కువ మాట్లాడటం,వారి ఇళ్ళకు వెళ్ళటం వారితో       ఎక్కువగా ఆడటం పరస్పర అభిప్రాయాల్ని పంచుకోవటం ఇలా స్కూల్ స్థాయి నుండి కాలేజీ వరకు తరువాత జీవి తంలోను స్నేహం ఓ భాగమయి పోతుంది.
        అసలు స్నేహం చేయటం ఎందుకు?స్నేహానికి జీవితం లో ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి.జీవితం చివరి వరకు అవ సరమా!అవసరాలతో స్నేహాన్ని కోలుస్తామా!ఆస్తులు,అంతస్తులను స్నేహం చూస్తుందా!అలా చూస్తే అది స్నేహం అవుతుందా!అంతస్తులను చూసి స్నేహితులుగా వుంటే దాన్లో ప్రయోజనాలను ఆశిస్తారు కదా!ప్రయోజనాన్ని ఆశిం చేది స్నేహం ఎలా అవుతుంది?
      ప్రాథమిక స్థాయి నుండి 10 వ తరగతి వరకు కనుక కలిసి చదువుకుంటే ఆ స్నేహం జీవితంలోగట్టి పడి చివరి దాకా ఉంటుందేమో!స్నేహంలో సాంద్రత ఎక్కువగా ఉంటుంది కనుక.చిన్ననాటి స్నేహితులు ఆ ముచ్చట్లు ఇచ్చిన త్రిల్ మరేదీ ఇవ్వదేమో!చిన్నప్పుడు ఆడిన ఆటలు,చేసిన అల్లరి పెద్దయిన తర్వాత గుర్తు చేసుకుంటే ఆ తన్మయ త్వం ఆ ఆనందం వర్ణించనలవికాదు.
        కాలేజీ నుండి ఉద్యోగం వచ్చే వరకు  మిత్రులు ఓ రకం.పరిపక్వత కలిగిన స్నేహం.ఒకరి భావాలు ఒకరు పంచుకోవటం,సాంత్వన పొందటం,పరస్పరం సహాయం చేసుకోవటం జరుగుతుంది.ఒక రకంగా కుటుంబం లోని వారికంటే ఎక్కువ స్నేహంగా ఉంటారు.ఇదంతా చూస్తుంటే చిత్రంగా ఉంటుంది.అన్నదమ్ములకి అక్కా చెల్లెళ్లకి అమ్మనాన్నలకి చెప్పుకోలేని సంగతులన్నీమిత్రులతోనే కదా పంచుకునేది.జీవితంలో 25 సం :వరకు అంటే పెళ్ళ య్యే వరకు స్నేహమొక ఆపాత మధురం.ఓ సజీవ స్రవంతి.ఓ భావ ప్రకంపనా ప్రపంచం.తరువాత జీవితంలో మన ఉద్యోగం లో మంచి స్నేహితులు తారస పడతారు .పరస్పర అవగాహ నతో కుటుంబ స్నేహితులు గా మారతారు ఇలా జీవన పయనం లో స్నేహం ప్రాధాన్యత ఎంత ఉందో!    

Monday 25 June 2012

త్రిశంకు నరకం


                                                           
   నిర్లక్ష్యం నిలువెత్తు నిలబడి  పిలుస్తుంటే
   మృత్యువు రారమ్మని ఆహ్వానిస్తుంటే
   లేత పాదాలు అటువైపే దారితీస్తుంటే
   ఏ ప్రకృతి శక్తులు ఆపలేదు వాణ్ని 
   అగ్నిపర్వతం క్రేటర్లో మునగపోతున్నట్లు
   తుఫాన్ కన్నులో కాలు మోపబోతున్నట్లు 
   కాళ్ళ క్రింద భూమి చీలబోతున్నట్లు 
   ఏ సంకేతాలు వాడికి అందలేదు 
   ఆటలోని ఆనందం 
   కుతూహలం లోని ఉత్సాహం 
   వాడిని మరణం అంచుల్లోకి 
   వెళ్ళకుండా ఆపలేదు 
   అన్వేషణ అంతమయ్యే లోపు 
   వాడు త్రిశంకు నరకం లోకి 
   జారుతున్నాడు 
   కన్నులు పొడుచుకున్నా  
   కానరాని గాడాంధకారం  
   ఒళ్లంతా చీరుకుపోయి కారుతున్న రక్తం  
   ఏదో బండరాయి వాని చావుకు అడ్డుపడింది 
   అప్పుడు మొదలయ్యింది ప్రత్యక్ష నరకం 
   ఉచ్చ్వాస,నిశ్వాసలు భారంగా మారుతూ 
   కంటి నిండా దుమ్ముతో చీకటి ఆవరిస్తూ 
   గొంతు నిండా మట్టితో ఉక్కిరిబిక్కిరవుతూ 
   క్షణక్షణం భయంకరమైన క్షోభ అనుభవిస్తుంటే 
   సమాంతర బోరుకు సన్నాహాలు 
   ఆక్సిజన్ గొట్టాల జారవేత 
   గంటలతరబడి వేలమంది కన్నీటి ధారలతో 
   గుండెలవిసేలా ఏడుస్తున్న తల్లిదండ్రుల రోదనలతో 
   మార్మోగుతున్న ఆ ప్రాంతంలో 
   ఒక్కసారిగా శ్మశాన నిశ్శబ్దం 
   బయటకు తీసిన వాడి శరీరంలో 
   కొన ఊపిరయినా ఉందేమోననే ఆశ 
   నిరాశగా మారిన ఆ క్షణం 
   దిక్కులు పిక్కటిల్లేలా శోకం 
   ఎన్ని ప్రాణాలు గాల్లో కలవాలో 
   రక్కసిలా నోరు తెరిచిన ఈ బోరు బావుల్లో 
   యుద్ధం ప్రకటించండి వీటి పూడ్చివేతకు 
   చిన్నారుల చిరునవ్వుల కోసం                                                                                                                                                               

Saturday 23 June 2012

అమ్మా! నన్ను ఇక్కడే ఉండనీ!


       
రాత్రి ముసుగును భూమి కప్పుకున్నవేళ
నేను రక్త మాంసాల దోసిళ్ళలో నిదరోతున్నాను
                  ఉచ్చ్వాస ,నిశ్వాసాల్లోఉన్ననాలో కదలిక
                 అందుకే  అమ్మ ఆర్తనాదాల ధ్వనులిక
                 నా చిన్ని గుండె తడబడుతుంది
                 నా లోన ఆవేదనే రగులుతోంది
ఎక్కడో అరుపులు,బాధామయ రోదనలు
ప్రసవ వేదనలు,ఆకలికేకల శోధనలు
అమ్మ పీల్చే గాలిలో మిళితమై ప్లవిస్తూ
నా శ్రవణేంద్రియాలలో ధ్వనిస్తూ
నన్ను ఆందోళనలో ముంచెత్తుతున్నాయి
                       ఓ వెన్నెల కిరణం
              నా తనువును స్పర్శిస్తున్నట్లుంది
             శశి నిశి పరదాలను తొలగిస్తున్నట్లుంది
               ఓ భయ విహ్వలత కంఠద్వానం
ఓ అంతరాల సమాజ వికృత పదఘట్టనలు
మరో శ్మశాన విషాద గీతాల ఆర్తారావాలు
శతకోటి దరిద్రనారాయణుల దీనాలాపాలు
అనారోగ్యంతో మరణించే పసివాళ్ళ ఆక్రందనలు
ప్రకృతీ వికటాట్టహాస వైపరీత్యాలు
         మత మూఢత్వాలపైశాచిక ఆనందపు డోలికలో
          తేలిపోతూ తూలిపోతు ఒకరినొకరు నరుక్కునే
         సుందర ప్రపంచాన్నానేను చూడబోయేది  
         ఇదేనా నా తడబడు అడుగులు పడబోయే ధరిత్రి
అణుధూళి విరామమెరుగక నిండబోయే రోజులు
సర్వమానవ వినాశ హేతువుల కారణభూత రాజ్యాలు
ఇవేనా నాకగుపించే  భవిష్యత్ సుందర్ దృశ్యాలు
          నా కొద్దు ఆ రాబోయే పరిణామాల ఫలితం
          ఇక్కడే ఆనందంగా,ఆహ్లాదంగా వుంది
          నా మనుగడకు ప్రాణం పోస్తూ తన మమకార
          మాధుర్యాలను నాలోన పొందుపరుస్తున్న
          అమ్మ ఆనంద బృందావనంలో
          ఇలానే ఉండాలనివుంది
          అందుకే అమ్మా! నన్ను ఇక్కడే ఉండనీ!        

Friday 22 June 2012

ఆధిక్యతా భావన (2)


               ఈ బంధాలు నిలబెట్టుకోవాలంటే ఏమి చెయ్యాలి?మొదట అన్న తమ్ముళ్ళకి ,అక్కాచెల్లెళ్లకి తాము ఎలా పెరిగారు?చిన్నప్పుడు తల్లిదండ్రులు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ?తాము ఎలా కలిసి పెరిగారు?అప్పటి ప్రేమ ఆప్యాయ తలు మనసులో ఉంచుకోవాలి.ఎవరు ఏ స్థాయిలో వున్నా పరస్పరం సహకరించుకోవాలి. ఒకరి బాధ మరొకరు పంచుకోవాలి.ముఖ్యంగా ఒకరు చెప్పేది మరొకరువినాలి.అప్పుడు బంధువులయి నా స్నేహం ఉంటుంది.ఆ స్నేహం లో అర్థం చేసుకునే గుణం ఉంటుంది.ఆ గుణమే బంధాలను నిలబెడుతుంది.ఆర్ధిక హోదా నుండి,చదువుల వలన వచ్చిన కీర్తి నుండి,హోదా నుండి వచ్చిన పేరు నుండి కలిగిన ఆధిక్యతను మిగతా వారిపై చూపటం వలన బంధాలు విచ్చిన్నమవుతాయి.సమాజంలో చాలా మంది ఈ బంధాలను నిలబెట్టుకుంటున్నారు.అంతే స్థాయిలో ఇవి బలహీనమవుతున్నాయి.
         సరే ఇవి కలవలేనంతగా తెగిపోయాయి అనుకుందాము.అప్పుడెలా?ఏముంది ఎవరి జీవితాలు వారు మిగ తా వారితో పోల్చుకోకుండా ,ఈర్ష్య పడకుండా తమకున్న అవకాశాల మేరకు సంతృప్తిగా ఆనందంగా జీవించ టమే కోపం,ద్వేషాలు పెంచుకోకుండా పరస్పరం నష్ట పరిచే చర్యలకు పాల్పడకుండా ఎవరి పరిధులలోవారు ఉండటమే!ఇది ఎంతో ఉత్తమమైన విధానం.
      అలాకాకుండా ఆస్తులు పంచుకోవటంలో వచ్చిన తగాదాలు,మాట జారటంలో వచ్చిన కక్షలు కొనసాగుతూ
తాము నాశన మవుతు కుటుంబాలను నాశనం చేసుకుంటూ ఉంటారు.ఇది అనాగరికమైన చర్య. వారి కక్ష్యల కు,ద్వేషాలకు పిల్లల జీవితాలు బలి అయి పోతాయి.ఇంకో తరం అభివృద్ది ఆగిపోతుంది.ఎన్నో జీవితాలు ఇలా ధ్వంసం  అయినవి మనకు కన్పిస్తాయి.
    పై అన్ని అంశాలను విశ్లేషిస్తే కుటుంబ సంబంధాలు అద్భుతంగా మారాలన్నా ,సంబంధాలు కలకాలం నిలవా లన్నా ఆ భావన ఇరువైపులా వుండాలి.అలా లేక పోయినా అవి నిలబడకపోయినా  ఘర్షణలు లేని వాతావరణంలో జరగాలి.

Tuesday 19 June 2012

ఆధిక్యతా భావన (1)


                                                       
             మానవుడి మనస్సు స్నేహాన్ని,ప్రేమను అద్భుతంగా స్వీకరిస్తుంది.కోపాన్నిద్వేషాన్నిఆధిక్యతా భావనను వ్యతిరేకిస్తుంది.ఏ వయసు వారయినా దీనికి అతీతం కాదు.చిన్నపిల్లల్నిగమనిస్తే మనం ప్రేమ పూర్వకంగా వ్యవహ రిస్తున్నామా ,వారిపట్ల కోపంతో ,దయ లేకుండా ప్రవర్తిస్తున్నామా!అన్నవిషయాన్ని వారు గమనించి వారి వ్యతిరేక తను ఏడుపు రూపంలో,లేదా కోపం రూపంలోవ్యక్తపరుస్తారు.ఇక మిగిలిన వారి గురించి చెప్పేదేముంది.
      మానవ సంబంధాలను ఆధిక్యతా భావన విచ్చిన్నం చేస్తుంది.ఒక కుటుంబాన్నిగమనిస్తే భార్యా భర్తల మధ్య చక్కటి అవగాహన ఉండి,పరస్పరం అభిప్రాయాలను గౌరవించుకుంటూ చిన్నచిన్నభేదాభిప్రాయా లను సర్దుబాటు చేసుకుంటూ ఉంటె అక్కడ ఆనందం వెల్లివిరుస్తుంది.అలాకాకుండా భర్త,భార్యపై ఆధిక్యత ప్రదర్శిస్తుంటే కొన్నాళ్ళ పాటు దానిని భరిస్తుంది.ఏదో ఒక సమయంలోఅది తిరుగుబాటుగా మారుతుంది.అలాగే భార్య భర్తలపై ప్రదర్శించే ఆధిక్యత కూడా ఇలాంటిదే.అక్కడ ఇద్దరి మధ్య ఉండవలసింది ముఖ్యంగా స్నేహం.స్నేహం ఇద్దరినీ కలిపి ఉంచు తుంది.ఆధిక్యతా భావన వేరుచేస్తుంది.అలాగే అక్క చెల్లెళ్ళ మధ్య అన్న తమ్ముల మధ్య ఎన్నోభేదాభిప్రాయాలు వస్తుంటాయి.వీటిల్లోముఖ్యంగా ఆర్ధిక హోదా,చదువులో తేడాలు,మాటలు ముందుగా జారటం ఇవన్నీఈ బంధాలు తెగిపోవటానికి కారణమవుతున్నాయి.
        ఒక్కో కుటుంబంలో అందరిని తండ్రి చదివించలేక కొంత మంది వ్యవసాయంలో,చిన్న ఉద్యోగాల్లో ఉండిపోతారు మిగిలిన వారు చదువుకొని ఉన్నతస్థానాలకు వెళతారు.ఇంకో కుటుంబంలోతండ్రి అందరిని చదివించినా తెలివిలో తేడాలుండటం వలన ఒకరు ఉన్నత స్థానానికి వెళ్లి మిగిలిన వారు సాధారణ జీవితం గడుపుతుంటారు.మరికొన్ని కుటుంబాలలో తండ్రికి గల ఆర్ధిక సమస్యలవలన ఒకరిని ఖర్చుపెట్టి ఉన్నత చదువులు చదివిస్తాడు.రెండవ వారికి (తెలివి వున్నాకూడా)డబ్బులేక సాధారణ కోర్సులు చదివిస్తాడు.అలాగే అక్క చెల్లెళ్ళ మధ్య కూడా మంచి చదువు, మంచి సంబంధాలు కుదరటం(ఇక్కడ అందం కూడా ప్రాముఖ్యత వహిస్తుంది)సాంఘికంగా ఉన్నత  స్థానంలో కొంద రు,సాధారణ స్థాయిలో మరికొందరు ఉండటం జరుగుతుంది.ఇక్కడే ఒకరిపై మరొకరికి భేదభావాలు ఏర్పడతాయి ఆర్థికంగా ఉన్నతస్థానంలో ఉన్నవారు లేనివారితో సరి అయిన మానవ సంబంధాలు కొనసాగించలేక పోవటం, వారి పై  ఆధిక్యత ,ఆధిపత్య భావజాలం ప్రదర్శించటం వలన ఆ సంబంధాలు క్షీణిస్తాయి.అదే విధంగా వారు ఉపయోగించే బాష వ్యవహార శైలి,సంభాషణ తీరు తక్కువ స్థాయిలో వున్నవారిని బాధించే విధంగా ఉన్నాఆ బంధాలు బలహీన మవుతాయి.
      పై వాటినన్నింటిని గమనించిన తరువాత తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆర్ధికపరంగా చదువులపరంగా, ఆస్తుల పరంగా సమాన అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఎంతయినా వుంది.సమాన అవకాశాలను కల్పించినా వారు ఉన్నత స్థానాలకు వెళ్ళకపోతే అది వారి సామర్థ్యాలను బట్టి ఉంటుంది .కాబట్టి తరువాత ఆక్షేపించే అవకాశం వారి కుండదు,
     ఒకప్పుడు ఎక్కువమంది సంతానం ఉండేది కాబట్టి అందరికి సరి అయిన సమాన అవకాశాలను తల్లిదండ్రులు కల్పించలేక పోయేవారు.కాని చిన్నకుటుంబాల(ఇద్దరు కలిగిన)లో సమానంగా పెంచటం, సమాన అవకాశాలను కల్పించటం తల్లిదండ్రుల ప్రాథమిక బాధ్యత.
(మిగతా భాగం తరువాత వ్యాసంలో )

Sunday 17 June 2012

నేనే మీకు సజీవ సాక్ష్యాన్ని!


అస్పష్ట చిత్రాలు
సంక్లిష్ట దృశ్యాలు
స్పష్టత లేని చూపు
భవిష్యత్ ప్రమాదాన్ని సూచించలేదేవ్వరు?
నాకు కూడా అనిపించలేదు
కత్తుల వంతెన పై కాలం సాగుతుందని
బోర్డు కనపడదు మరి
విన్న దాన్నివిశ్లేషించుకోవడం
మిత్రులతో చదివించుకోవడం
వారికి తిరిగి వినిపించడం
జీవితమంతా సంఘర్షణల రణం
లక్ష్యం ఘనం గా ప్రతిష్ఠించుకున్నా
ప్రతి పరీక్షలో విజయం సాధించా
కీలకమైన జీవన గమనానికి
అనర్హుడివని తీర్మానించారు
నాలుగు రోడ్ల కూడలిలో జీవితం
ఆటంకాల మధ్య ప్రయాణం
అవకాశాలకై వెతుకులాట
నన్ను నడిపించింది ఆశావాదం
అంతులేని ఏకాగ్రత నాకు వరం
గణితాన్ని అవపోసన పట్టా
ఉద్యోగం సాదించా
ఇది నా పోరాటం
ఇది గొప్ప విషయమేం కాదు
కానీ నాలాంటి పిల్లలను గుర్తించండి
బాల్యంలోనే వారికి సహాయపడండి
ఇంత కష్టం! ఇంత నష్టం!
కలగకూడదు ఎవ్వరికి
అర్థం కావటం లేదు అన్న
 నా  విద్యార్థులకు చెబుతుంటా
నేనే మీకు సజీవ సాక్ష్యాన్నని
ఎవరు ఏమైనా సాధించగలరని
దేన్నైనా నేర్చుకోగలరని
నిరాశతో ఉన్నవారికి చెబుతుంటా
"నన్ను చూసి మీ జీవితాన్ని ప్రేమించండి
 ఆశావాదాన్ని మనసు నిండా నింపండి"  

     ఇది ఒక  అంధ ఉపాధ్యాయుని అంతరంగ ఆవిష్కరణ.ఆయన పేరు ఆంజనేయులు.ప్రకాశం జిల్లా మార్కాపూర్ దగ్గర సానికవరం ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తుంటారు.ఆయనకు చిన్నతనంలోనే వచ్చిన అరుదైన రెటీనా జబ్బు వలన చూపు క్రమేపి కోల్పోవటం, ఆయన ఎదుర్కొన్నకష్టాలు ఉపాధ్యాయ శిక్షణ కార్య క్ర మంలో చెబుతుండగా ఈ కవిత వ్రాసి అందరి ఎదుట దానిని చదివి ఆయనకు అందించటం ఎంతో త్రుప్తి నిచ్చింది ఆయనను చూసి మనిషెంత ఆశావాదిగా ఉండాలో నేర్చుకోవచ్చు.  

Sunday 10 June 2012

జీవితాన్ని తృప్తిగా జీవించటానికి 10 సూత్రాలు(2)


గత భాగం తరువాయి
           వీటన్నింటికి డబ్బు ఎక్కడనుండి వస్తుంది.డబ్బు సంపాదించటం కోసం ,అదనపు ఆదాయం కోసం సులభంగా డబ్బు సంపాదించే మార్గాల వైపు ప్రయాణం చేస్తారు.ప్రధానంగా ఉద్యోగుల్లో నైతే అవినీతి, మిగ తావారు వ్యాపారాల్లో విపరీతమైన లాభాలకోసం మోసాలు చేయటం,షేర్లు కొనటం ,అమ్మటం, రియల్ ఎస్టే ట్ ,పేకాట,పందాలు కట్టటం, అధిక వడ్డీలకు ఆశపడి ప్రభుత్వ గుర్తింపు లేని సంస్థల్లో deposites కట్టటం 10000 లకు  60,000 రూపాయలిస్తామని చెప్పే కంపెనీల మాటలు నమ్మి కష్టపడి సంపాదించిందంతా పోగొట్టుకోవటం(ఈ మధ్య india లోని 3 రాష్ట్రాల్లో 2000 కోట్లు జనం పోగొట్టుకున్నారు.) networkmarketing సంస్థల్లో చేరటం ఇలా విభిన్న మార్గాల్లో మోసపోతుంటారు.మరల ఆ కోల్పోయిన డబ్బును సంపా దించటం కోసం పలు అక్రమ మార్గాల వైపు ప్రయాణిస్తుంటారు.మనిషికి ఇదంతా నిత్యకృత్య మయింది.
          వీటన్నింటికి కారణం మనిషికున్న కోరికలు,వస్తువులు విచ్చల విడిగా కొనే సంస్కృతి,అత్యాశ కార ణంగా చెప్పవచ్చు.కోరికలు దుఃఖానికి కారణమని 2500 సం: క్రితం గౌతమ బుద్ధుడు చెప్పాడు కోరికలను పరిమితం చేసుకోవాలి.మనకున్న ఆదాయాన్ని బట్టి మన ఆలోచనలుండాలి .అత్యాశకు పోకూడదు. ఎక్కువ వడ్డీ,ఎక్కువ డబ్బులు ఇస్తామన్నారంటే అందులో ఏదో మోసం ఉంటుందని అంచనా వేయలేక పోవటం జనం యొక్క బలహీనత.బ్యాంకు, పోస్టల్ వడ్డీల కంటే ఎక్కువ వస్తుందంటే రిస్క్ పెరిగినట్లే.
      ఇక విద్య,వైద్యం వ్యాపారమయంగా మారిపోయాయి.ప్రైవేటు స్కూ ల్స్ ,కాలేజీల ఫీజులు పేద మధ్య తరగతి వారిని అప్పులపాలు చేస్తున్నాయి.అలాగే వైద్యం ఖర్చులు మనిషిని పీల్చి పిప్పి చేస్తున్నాయి. జబ్బులు రాకముందే ముందు జాగ్రత్త తీసుకునే అలవాటు మనుషులకుండటం లేదు.విద్య,వైద్యం తప్ప ని సరి అయినవి కాబట్టి సరి అయినవి ఎన్నుకోవటం చాలా అవసరం.లేక పోతే ఫలితం రాకపోగా ఎంతో డబ్బును, విలువైన కాలాన్ని, జీవితాన్ని కోల్పోతాము.వస్తువులు విపరీతంగా కొనే సంస్కృతిని పరిమి తం చేసుకొని తమ పిల్లలకు మంచి విద్యను అందింప చేయటం,చక్కని ఆరోగ్య పరిరక్షణకు తమకున్న వనరులు ఖర్చు చేయటం సరి అయిన ఆర్ధిక ప్రణాళిక.ఇన్ని ఒత్తిడుల మధ్య మనిషి తన ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాడు.మానసిక సమస్యలు,B.P,SUGAR,గుండెపోటులకు గురవుతున్నాడు వ్యసనాలకు బానిస కావటం చివరకు అప్పులతో ఆత్మహత్యలకు పాల్పడటం జరుగుతుంది.
      ఆడంబరం లేని సరళమైన జీవితాన్నిఎలా జీవించాలో తెలుసుకోవాలి.జీవితం తృప్తిగా ఆనందంగా గడిచి పోవాలంటే ఏమి కావాలో తెలుసుకోవాలి.అందుకు కొన్ని మార్గాలు
 1) కోరికలను పరిమితం చేసుకోవటం
2) అవసరం లేని వస్తువులను కొనే సంస్కృతిని తగ్గించుకోవటం
3) ఆరోగ్యం పట్ల ముందస్తు జాగ్రత్తలు
4) ప్రాధమిక అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వటం
5) అత్యాశకు పోకుండా వుండటం
6) కష్ట  పడకుండా  సులభంగా సంపాదించాలనే ఆశకు పోకుండా వుండటం
7) పొదుపు మంత్రాన్ని పాటించటం
8) సరళమైన జీవితాన్ని గడపటం
9) ఇతరులతో పోటీని ,పోలికను మానుకోవటం
10) వ్యసనాల బారిన పడకుండా వుండటం
ఈ 10 సూత్రాలతో చాలావరకు జీవితాన్ని తృప్తిగా ఆనందంగా జీవించవచ్చు.        

Saturday 9 June 2012

జీవితం తృప్తిగా జీవించాలంటే!1


            ప్రతి మనిషి ఏదో ఒక ఉద్యోగం ,లేదా వ్యాపారం ,వ్యవసాయం వృత్తి పనులు ,స్వయం ఉపాధి మార్గాలు ఎన్ను కొని జీవితాన్ని గడుపుతుంటాడు.తరువాత వివాహం చేసుకొని కుటుంబ జీవితాన్ని ప్రారంబిస్తాడు ఇక్కడ నుండి ఎంతోముందుచూపు,చక్కని ఆర్ధిక ప్రణాళిక ఉంటె కానీ అతని జీవితం సరి అయిన దారిలో నడవదు.
      కుటుంబం గడవటానికి అవసరమైన డబ్బు సంపాదన అన్వేషణాక్రమంలో మనిషి ఎన్నో మార్గాలను వెతుకుతుం టాడు.చట్టబద్ధంగా,న్యాయబద్దంగా అయితే ఫర్వాలేదు.తన అవసరాలు,కోర్కెలు తీర్చు కోవ డం కోసం అవసరమైన ధన సంపాదన మనిషిని  ప్రస్తుతం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
          ముందుగా మనిషి అవసరాలు ఏమిటి? అని ఆలోచిస్తే ఇల్లు,ఆహార పదార్థాలు బట్టలు,విద్య వైద్యం వీటిని మ నం ప్రాధమిక అవసరాలుగా పరిగణిస్తాం.సొంత ఇల్లు కట్టాలంటే స్థలము ఎంతో ముందుగా కొని పెట్టుకోవాలి.ఇల్లు కట్ట టానికి అయ్యే ఖర్చును లెక్కించి ఎంతో చక్కని ఆర్ధిక ప్రణాళికతో ముందడుగు వెయ్యాలి.అలా కాకుండా మన స్నేహి తులో బంధువులో కట్టారని అప్పు చేసి ఇల్లు కట్టటం తరువాత తీవ్ర ఆర్ధిక ఇబ్బందులుకు లోను కావడం మంచిది కాదు పరిస్థితులు అనుకూలించేంతవరకు వరకు అద్దె ఇంట్లో వుంటూ దీర్ఘకాలిక ప్రణాళికతో ఇల్లు కట్టాలి. మనకు వచ్చే ఆదాయం ఎంత మన ప్రాధమిక అవసరాలకు దాన్ని ఏవిధంగా ఖర్చు పెట్టాలి?అన్నపూర్తి అవగాహనతోనడచుకో వాలి.
        మనం తినే ఆహార పదార్థాలలో పోషకాహారాలకు ఖర్చు పెట్టాలి.చాలా మంది ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థా ల కు ఎక్కువ ఖర్చు పెడుతుంటారు .బట్టలు కూడా విలువైనవి పోటీ పడి కొంటుంటారు. ఇందులో ఎక్కువగా మిగ తావారిని చూసి వారి కంటే మిన్నగా వుండాలని కొంటుంటారు.ఒక మనిషికి స్త్రీ అయినా పురుషుడు అయినా ఐదు లేక పదిజతలు అవసరమవుతాయి.కానీ ప్రస్తుతం ఇంతకు ఎన్నోరెట్లు కొంటున్నారు.
        ఇక ఇంటికి అవసరమయ్యే వస్తువులు కొనే సంస్కృతి ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది.ప్రతి ఒక్కరి ఇంట్లో డబు ల్ కాట్ ,టి.వి ,ఫ్రిజ్ కూలర్, సోఫా సెట్,dyning table, ఖరీదయిన కుర్చీలు,కంప్యూటర్ లాంటి పరికరాలు కొంటు న్నారు .ఇవన్నీ ఉంటేనే మిగతా వారికి సరితూగ గలమని భావిస్తున్నారు.తమ ఆదా యానికి మించి అప్పులు చేసి మరీ కొన టం జరుగుతుంది.అలాగే బంగారం మీద విపరీతమైన వ్యామోహం తో ఖరీదయిన ఆభరణాలు చేయించుకో వటం ఒక fashion గా మారిపోయింది.మిగతా వారితో పోలిక ఈ వస్తువులను కొనే సంస్కృతిని పెంచుతుంది
         అలాగే cell phones అత్యంత ఖరీదయినవి కొనటం,విపరీతం గా వాటి ద్వారా మాట్లాడటంతో ఎంతో డబ్బు వృధా చేస్తున్నారు.చిత్తూర్ జిల్లాలో ఒక పరిశీలన ప్రకారం గత సం:సెల్ ఫోన్ బిల్ 500 కోట్లు అయి నట్లు తేలింది.జిల్లా మొత్తం వాడిన పాల బిల్ 450 కోట్లు.గమనించండి.కాలేజీ పిల్లలకు కూడా వీటిని కొనిచ్చివారి జీవితాలను పాడుచేస్తున్నారు ఇక ద్విచక్ర వాహనాలు లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి లేదు. ప్రతి చిన్న పనికి వాహనాలు వినియోగిస్తూ పెట్రోలు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు.అందుకే చైనాలో సైకిల్ ను దేశమంతా వారంలో ఒకరోజు వాడేలా ప్రోత్సాహిస్తున్నా రు.ఇక విందులు,వినోదాలు,ఫంక్షన్లకు పోటీలు పడి ఖర్చు పెడుతున్నారు.కోట్ల మంది ఆకలితో అల్లాడుతుంటే ఫంక్షన్ల లో ఆహారపదార్థాలు ఎంతో వృధా అవుతుంటాయి.ఒకరిని మించి మరొకరు తమ ఆడంబరాన్ని చూపటానికి ఈ ఫంక్షన్స్ కి ఖర్చు పెడుతున్నారు.మధ్య తరగతి ,పేదవారు కూడా అప్పులు చేసి మిగతావారితో పోటీలు పడి వ్యయం చేస్తున్నారు.
      (మిగతా భాగం తరువాతి వ్యాసం లో )

Tuesday 5 June 2012

శబ్ద సౌందర్యం


                                                                  ఓ స్వరం
                                                                  ఓ పిలుపు
                                                                ఒక విభ్రమం
                                                               ఒక సంభ్రమం
                                                           ఉఛ్ఛ్వాసం మరచిన
                                                            నిశ్వాసం నిలిచిన
                                                        ఆ క్షణం సుదీర్ఘ నిరీక్షణం
                                                  నిశ్శబ్దాన్ని చేధించిన శబ్ద సౌందర్యం
                                                 జ్ఞాపకాల పుటలపై పుప్పొడి పరిమళం
                                                  అనంత అంతరం అంతరించిన  వేళ
                                                  మనసంతా వెన్నెల ప్రసరించినట్లు
                                                 ఆశ్చర్యం ఆనందం ఉత్తేజం ఉల్లాసం
                                                       చేజారిన అమృత కలశం
                                                        చిక్కిన చక్కని భావన
     

Monday 4 June 2012

ప్రకృతికే సరికొత్త భాష్యాన్నిద్దాం


నీలి  సంగీతాన్ని  పరచుకొని ఆకాశం
శశి కోసం ఎదురుచూస్తున్నట్లు
నీరెండ చాయలో నిలబడి నీకోసం
నాలో నేనే పల్లవి పలికిస్తుంటా
సంధ్య యాత్రను ముగించుకొని తన ఒడిలో
ఒదిగే దినకరుని కోసం చూసే పర్వతాల్లాగా
నింగిని రంగులతో అద్ది ముగ్గులతో ముద్దిడి
ఇంద్ర ధనుస్సు తో అలంకరించి వేచి చూస్తుంటా
మల్లెలు మత్తుగా పిలుస్తున్నాయి మరి
జాబిలి ఎందుకో ఈ రోజు రెచ్చగొడుతుంది
భావ విహంగాలు నా నుండి నీకు చేరటం లేదా
నా గాన మకరందాన్ని నింపుకొని గాలిలో
అలలై తేలి నా విరహాన్ని వినిపించటంలేదా
పూల పల్లకిని సిద్ధం చేసి పండు వెన్నెలను రంగరించి
మంచు ముత్యాల తోరణాలు కట్టి
తెల్ల మబ్బుల అల్లరి చిత్రాల కాన్వాసులను
నీవు వచ్చేదారుల్లో స్వాగతానికి పెట్టా
మాటలు రాని చుక్కలకు పలుకులను
పాటలు రాని ఉరుములకు గీతాలు నేర్పించా
దారంతా పున్నమి కాంతులు వున్నా నీకోసం
మెరుపుల చమక్కులను సిద్ధం చేసా
ఏంటో నా పిచ్చిగానీ నీకివన్నీ ఇచ్చే తృప్తి  కంటే
నా సాంగత్యం లోనే నీ హృదయ సరస్సులో
ప్రేమ పుష్పాలు విరుస్తుంటాయి
కానీ ఎందుకో నీ కోసం ఈ ఆకాశపు చిత్రాలన్నీ
భువి పైకి తెచ్చి నీ కందించాలనిపిస్తుంటుంది
నీవు నాదరికొస్తే మనం  ఈ
ప్రకృతికే సరికొత్త   భాష్యాన్నిద్దాం  

Friday 1 June 2012

కోపాన్ని జయించటం ఎలా?3


             ఆరోగ్య పరంగా కలిగే నష్టం గురించి చెప్పాలంటే అడ్రినలిన్ అనే హార్మోన్   కోపం వచ్చిన సమయం లో రక్తం లోకి ఎక్కువ గా విడుదల అవుతుంది.ఇది చాలా సేపటి వరకు రక్తం లోనే ఉండిపోతుంది.దీని వలన గుండెకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశం వుంది.కోపంలోమన భాష అదుపు తప్పుతుంది.అలాగే కొంత మంది ఈ కోపాన్ని గుర్తుపెట్టుకొని ద్వేషంగా మార్చుకొని అవతలి వారికి నష్ట పరిచే చర్యలు కూడా చేపడతారు.అప్పుడు ఇంకా మరిన్ని సమస్యలు వస్తాయి.మానవ సంబంధాలను దారుణం గా దెబ్బ తీసే ఈ కోపాన్ని జయించటం ఎలా?
      ఇది ఒక్క సారిగా కోపం రాకుండా వుండాలని నిర్ణయించుకొని రేపటినుండి ఆపాలి అంటే ఆగిపోయేది కాదు.మరి ఎలా?కోపాన్ని అణచి వేయకుండా మీ ప్రతి స్పందనని కొద్దిసేపు వాయిదా వేయండి.కొంత మంది ఒకటి నుండి పది వరకు లెక్క పెట్ట మంటారు.అంటే మాటల ద్వారా మీ స్పందన తెలియజేయ కుండా కొంత విరామం తీసుకుంటే ఈ లోపు కోపం కొంత తగ్గుతుంది. అప్పుడు మన బాష కొంత మృదువుగా వస్తుంది.కాని మీకు జరిగిన అన్యాయాన్ని ,అవమానాన్ని భరించమని చెప్పటం లేదు.మీరు స్పందించదలచుకున్న అంశానికి కోపాన్ని జత జేయకుండా అవే ప్రశ్నలను సహనం తో అవతలి వ్యక్తిని ప్రశ్నించండి.ఆ లోపు అతను కూడా తేరుకుని మారవచ్చు.లేదా మీకు తన వివరణ ఇవ్వవచ్చు.ఇక్కడ స్పందన ప్రతి స్పందన లకు మధ్య విరామాన్ని ఇస్తే సమస్య చాలా వరకు తేలికౌతుంది. నిర్మాణాత్మకమైన ప్రశ్నలు వేయటం ద్వారా అవతలి మనిషి ప్రవర్తన మారే అవకాశం ఎక్కువ.మనం గొంతు పెంచి అరిస్తే అవతలి వారు బలహీనులైతే కొంత సేపు సహిస్తారు.సమానులు,లేదా బలవంతులైతే అంతకంటే ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తారు.
          మీ కోపానికి కారణం అవతలి వారి ప్రవర్తన అయితే వారి ప్రవర్తన ఎందుకు నచ్చలేదో మృదువైన మాటలతో చెప్పటానికి ప్రయత్నించండి.ఫలితముంటుంది.ఇలా మీకు అనువైన మార్గాలను అన్వేషించండి.దీనికి పెద్ద జ్ఞానం అక్క ర్లేదు.పెద్ద చదువులు అక్కర్లేదు.పల్లెటూర్లలో చదువు రాని  నిరక్షరాస్యులు సైతం సహనంతో,నింపాదిగా సమస్యలను పరిష్కరిస్తూ వుంటారు.ఇదంతా అనుభవాల ఆధారంగా మనిషి నేర్చుకుంటాడు.ఒక సారి కోపగించుకుంటే కలిగిన నష్టాన్ని అంచనా  వేసుకొని  ఇంకో సారి అలా కోపాన్ని ప్రదర్శించకుండా ఉంటె చాలు.రెండు,మూడు అనుభవాలతో మనకు పూర్తిగా  అర్థమయిపోతుంది,కోపం ద్వారా సాధించేదేమీ లేదని.
         కోపగించుకున్నారు.పొరపాటును గుర్తించి మీ కంటే పెద్ద వారయితే విచారాన్ని వ్యక్తం చేయండి.చిన్న వారయితే అభిమానాన్ని,ప్రేమను మృదువైన మాటలతో ప్రదర్శించండి.సమస్య సర్దుకుంటుంది.