Tuesday, 24 February 2026

భైరవ కోన

 భైరవకోన (కనిగిరి, మార్కాపురం జిల్లా ):

కనిగిరి కి 60 కి.మీ దూరం లో చంద్రశేఖర పురం (CS puram) మండలంలో కొండల నడుమ ప్రకృతి రామణీయతతో అలరారుతుంది ఈ పుణ్య క్షేత్రం. శివరాత్రి పండుగ రోజు అత్యంత మనోహరం గా ఉందీ ప్రాంతం. సంవత్సరం అంతా ఈ గుడి తెరిచి ఉంచినప్పటికి పండుగల సమయం లో మాత్రమే RTC బస్సుల సదుపాయం ఉంటుంది. మిగతా సందర్భా ల్లో సొంత వాహనాలు లేదా ఆటో మాట్లాడుకొని వెళ్ళాల్సిందే. వర్షాకాలం వెళితే అద్భుతమైన జలపాతాన్ని చూడవచ్చు.చుట్టూ ఉన్న కొండలు తిరుమల కొండల్ని తలపిస్తాయి. వందల వృక్షాలతో అలరారుతుంటాయి ఇక్కడి కొండలు. ఒకే రాతిలో చెక్కిన గుడులు ఇక్కడి ప్రత్యేకత. ఇది శైవ క్షేత్రం. భైరవ కోన కు దగ్గర్లో బెంగుళూరు, విజయవాడ జాతీయ రహదారి నిర్మాణం లో ఉంది. ఇది పూర్తయితే భక్తులకు మరింత సౌకర్య వంతంగా ఉంటుంది. ఇక్కడ వసతి గృహాలు కూడా ఉన్నాయి.అభివృద్ధి చేస్తే ప్రకృతి నడుమ ఉన్న ఈ క్షేత్రం చక్కని సందర్శనీయ స్థలం అవుతుంది.

Tuesday, 13 January 2026

ఐ న్ స్టీన్ జీవితం కృషి

 ఐ న్ స్టీన్  జీవితం కృషి 

రచయిత్రి :కేతరిన్ ఓవెన్స్ పియర్ 

అనువాదం :బెల్లంకొండ రాఘవరావు 

మానవులు స్వతః ఒకరి నొకరు ద్వేషించుకోరని నా విశ్వాసం. ఎవరేనా పని కట్టుకుని ప్రేరేపిస్తే తప్ప, ప్రజలు అందరితోటి సామరస్యంతో సుఖంగా బ్రతుకుతారు.. Einstein 

   అన్ని యుగాల లోని ప్రపంచం లోని మహోన్నతులయిన పద్నాలుగు మంది విజ్ఞాన శిఖామణుల శిలా ప్రతిమ లను న్యూయార్క్ లోని రివర్ సైడ్ చర్చి ప్రాంగణం లో ప్రతిష్టించారు. అందులో ఒక ప్రతిమ Einstein ది. ఆయనను కోపర్నికస్, న్యూటన్ తో పోల్చి ప్రస్తావించేవారు.

ఇందులో ఆయన బాల్యం లో పాఠశాల లో ఎదుర్కొన్న ఇబ్బందులు, చిన్న ఉద్యోగం నుండి ఆచార్య పదవికి ఎదిగిన తీరు జర్మనీ లో ప్రాణ భయం తో బ్రతికిన తీరు, పలు దేశాల్లో ఆయన పొందిన గౌరవాలు, హిట్లర్ విజృంభణ తో ఇతర దేశాల్లో తల దాచుకున్న తీరు ఇన్ని సమస్య ల మధ్య ఆయన సాధించిన విజయాలు, ప్రయోగ శాల లేకుండా తన మేధస్సు తో సాపేక్ష సిద్దాంతాన్ని ప్రచురించి నోబుల్ బహుమతిని పొందిన విధం, ప్రపంచ శాంతి కొరకు ఆయన ప్రయత్నాలు, ఆయన పరిశోధనలు వంటి ఎన్నో అంశాలు సామాన్యులకు కూడా అర్థం చేసుకొనే రీతిలో రాయబడింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పని సరిగా చదువ వలసిన పుస్తకం.... ఒద్దుల రవిశేఖర్

Saturday, 20 December 2025

కరవది గ్రామం ( ఒంగోలు )

 

ఊరు ముంగిట రైలు గేటు, దాన్ని అనుకొని ఊరికి వడ్డాణంలా చిన్న చెరువు ఉంటుంది. మొదట్లోనే నారాయణ వనం ఆహ్వానిస్తుంటుంది. పచ్చని చెట్ల మధ్య ఓ భవంతి.పండ్ల తోట, ఆవులు దర్శన మిస్తుంటాయి.అందులో ఆదర్శ దంపతులు సాయి బాబు, గీత గార్లు నివసిస్తూ శివానంద స్వామి శిష్యులు గా ఉంటూ ఆయన పేరుతో సేవాభావం తో ఓ పాఠశాల నిర్వహిస్తున్నారు.పాఠశాల పచ్చని పర్ణశాల. అందులో PGNF సహకారం తో Robotics work shop జరుగుతుంటే వచ్చాను.

ఊర్లో 4 గుడులు ఉన్నాయి. ఊరి మధ్యలో ఉన్న గుడి విశాలంగా ఉంది. దాదాపు 10,000 జనాభా ఉంటుందట. పొగాకు, శనగ జామాయిల్ పంటలు వేస్తుంటారు. బోర్ల తో వ్యవసాయం లేదు. సముద్రం దగ్గర్లో ఉండటం తో బోర్ వేస్తే ఉప్పు నీళ్లు పడతాయట. గుండ్ల కమ్మ నుండి వచ్చే నీరు రామతీర్ధంలో ఆగుతాయి. అవే వీరికి మంచి నీరు.

ఈ ఊరికి 1000 ఏండ్ల చరిత్ర ఉంది అంటారు. ఇదో బ్రాహ్మణ అగ్రహారమట. శర్మ గారని ఒక ఆయన గ్రామ పెద్దగా ఉంటూ 3000 ఎకరాలు కలిగి ఉండే వారట.ఇప్పుడు వారికి పొలాలేమీ లేవట. వీళ్ళు ఊరి ఖాళీ చేసి వెళ్ళారట ఆయన మనుమరాలే సినిమా నటి కాంచన.

శివానంద పాఠశాల వ్యవస్థాపకులు సాయిబాబు గారు Airforce లో పనిచేసి retire అయ్యి స్వంత గ్రామంలో స్థిరపడాలని నిర్ణయించుకొని మిత్రుల సహకారం తో పాఠశాల స్థాపించారు. దంపతులిద్దరు పాఠశాలను విలువలు, ఆదర్సా లతో నడుపుతున్నారు.చెట్ల పై, గోవులపై వారికున్న మక్కువ వారి ఇల్లు, పాఠశాల చూస్తే అర్థమవుతుంది. ఒక లేగ దూడను కుక్కలనుండి రక్షణ కోసం వారి ఇంట్లో ఉంచారు. సాయిబాబు గారి నాన్న గారు ఆయుర్వేద వైద్యులు. వారి పూర్వీకులు 10 తరాలనుండి అదే వృత్తి లో ఉన్నారట. వారి అన్నలు, అన్న కొడుకు హైదరాబాద్ లో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు గా కొనసాగుతున్నారు. వీరి గురువు గారయిన శివానంద స్వామి వారికి హిమాలయాల్లోని ఋషికేష్ లో ఆశ్రమం ఉన్నదట. కరవది చుట్టు ప్రక్కల ఊర్లలో 600 మంది శిష్యులు ఉన్నారట. ఒకప్పుడు కరవది లో వేదాలు, ఉపనిషత్ లు అభ్యసించే వారట.ఒక విశేష ప్రాధాన్యమున్న ఊరిని సందర్శించి నందుకు చాలా సంతోషం కలిగింది...... ఒద్దుల రవిశేఖర్

Sunday, 23 November 2025

ఆచార్య N.G రంగా

 స్వాతంత్ర్యం కోసం (రంగా ఆత్మ కథ)

ప్రముఖ  స్వాతంత్ర్య సమరయోధుడు ఆచార్య N. G. రంగా గారు

ఆంగ్లంలో రచించిన Fight for freedom అనే పుస్తకానికి జక్కంపూడి సీతారామారావుగారి తెలుగు అనువాదం ఇది.

స్వాతంత్ర్య కాలం నాటి విశేషాలు తెలుసుకోవాలి అన్న ఆసక్తి

ఉన్న వాళ్లకు ఈ పుస్తకం బాగా నచ్చు తుంది. గాంధీ గారి

అనుచరునిగా,విధానాల పరంగా నెహ్రూ ను వ్యతిరేకించిన

నాయకునిగా కృషికార్ లోక్ పార్టీ, స్వతంత్ర పార్టీ ల

వ్యవస్థాపకునిగా ప్రసిద్ధులు.

జీవితాంతం రైతులు, కార్మికుల కోసం అహర్నిశలు

శ్రమించిన నాయకులు. ఎన్నో దేశాలు తిరిగి ప్రపంచ స్థాయి

నాయకులతో పరిచయాలున్న వారు. మద్రాస్ ఉప ముఖ్యమంత్రి,

కేంద్ర మంత్రి పదవులను తిరస్కరించారు. పిల్లలు ఉంటే స్వార్ధం

ఏర్పడుతుంది అని వద్దనుకున్నారు. వీరు ఆంగ్లం లో 35

, తెలుగు లో 6 పుస్తకాలు రచించారు.జీవితం చివరి వరకు

నిస్వార్ధంగా జీవించిన నిజాయితీ పరుడు, అసలు సిసలు

గాంథేయ వాది ఆచార్య N. G. రంగా గారు.

భగత్ సింగ్

 పుస్తకం :భయమెరుగని ధీరుడు భగత్ సింగ్  రచయిత :కోడూరి శ్రీరామ మూర్తి

24 సంవత్సరాల చిన్న వయసులో స్వాతంత్ర్య సముపార్జన కోసం విప్లవ పంధాలో పోరాడుతూఉరి తీయబడ్డ దేశభక్తుడు భగత్ సింగ్. 1930 లలో గాంధీజీ తో సమానంగా దేశప్రజల గుండెల్లో చోటుచేసుకున్న విప్లవ వీరుడు.ఎన్నో గొప్ప పుస్తకాలు చదివి వాటిని అర్థం చేసుకున్న మేధావి. తనకు నచ్చిన విషయాలు తన Notebook లో వ్రాసుకున్నాడు. Victor Hugo, రూసో ల పుస్తకాల ద్వారా  ప్రేరణ పొందారు.జైలు జీవితం అంతా విపరీతంగా పుస్తకాలు చదువుతూ తన అభిప్రాయాలను వ్యాసాల రూపంలో తెలియబరి చారు. జైలులో ఉన్నప్పుడు ఖైదీల సమస్యలపై భగత్ సింగ్ చేసిన నిరాహార దీక్ష కు దేశమంతా కదిలిపోయింది."ఇంక్విలాబ్ జిందాబాద్ " అనే నినాద రూప కర్త. దేశ స్వాతంత్ర్యం కోసం మృత్యువును చిరునవ్వు తో ఆహ్వానించిన ధీరుడు భగత్ సింగ్. వారి త్యాగాల పునాదుల మీద నిలబడ్డ భారతదేశం వారి ఆశయాల సాధనకు అంకితం కావాలి.

*పుట్టిన ప్రతివాడు మరణించవలసిందే, అయితే ఆ మరణం గొప్ప మరణంలా ఉండాలి. మనం ఎంతకాలం బ్రతికాం అన్నది ముఖ్యం కాదు. మనం మనిషిగా ఎంతకాలం జీవించాం అన్నది ముఖ్యం 

*మేం జీవితాన్ని ప్రేమిస్తాం 

మరణాన్నీ ప్రేమిస్తాం 

మేం మరణించి ఎర్ర పూల వనంలో

పూలై పూస్తాం

నిప్పు రవ్వల మీద నిదురిస్తాం

                      - భగత్ సింగ్

Saturday, 25 October 2025

సత్యం ఒక్కటే, దర్శనాలు వేరు

 


సత్యం ఒక్కటే దర్శనాలు వేరు

 సేకరణ, సంకలనం : ఆర్కే ప్రభు, రవీంద్ర కేలేకర్ అనువాదం: వాడ్రేవు చిన్న వీరభద్రుడు. 

ఈ పుస్తకం గాంధీ ఠాగూర్ల మధ్య జరిగిన లేఖల ఆధారంగా  వ్రాయబడింది. 

ఏ విషయం పైన అయినా చర్చించుకోవడం ప్రజాస్వామ్య సంప్రదాయం విభిన్నమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ చర్చించుకుంటే ఒక ఏకాభిప్రాయానికి రావచ్చు రాకపోనూవచ్చు అంతమాత్రాన వ్యక్తిగతంగా విభేదించుకోవాల్సిన పనిలేదు

గాంధీ,ఠాగూర్ ల మధ్య కూడా ముఖ్య మైన విషయాలపై అభిప్రాయ బేధాలు ఉన్నాయి. వారి ఆలోచనలలో స్పష్టత ప్రత్యర్థి ఆలోచనలపై అవగాహనలతో సహా విచక్షణా జ్ఞానం సంయమనం పటిష్టంగా ఉండాలి. ఇంగ్లాండ్ యూరప్ అమెరికా దేశాలలో తరచూ ముఖ్యమైన విషయాలు చర్చించుకుంటూ ఉంటారు.ప్రాచీన భారతదేశంలో ఇలాంటి చర్చ సంస్కృతి మనం గుర్తిస్తాం కానీ ప్రస్తుతం ఇది అంతరించి ప్రవచనాలు ప్రబలుతున్నాయి. వేదాలలో ఉపనిషత్తులలో సత్యాన్వేషణ ఎక్కువ నచికేతుడు -యముడు, గార్గి -యాజ్ఞవల్క్యుడు మధ్య జరిగిన సంవాదాలు ఇందుకు ఉదాహరణలు.

గాంధీ ఠాగూర్ లు భిన్న ధ్రువాలు కానీ వారి ఆత్మ ఒక్కటే ఠాగూర్ చింతనాపరుడైన మానవుడు కవీశ్వరుడు. గాంధీజీ కర్మయోగి మహాత్ముడు. ఇద్దరూ సత్యం కోసం ఒకరితో ఒకరు తీవ్రంగా తల పడ్డప్పటికీ వారి మధ్య వ్యక్తిగత సంబంధాలు కానీ ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమ సుహృద్భావాలు కానీ ఈషన్మాత్రం చెక్కుచెదరలేదు.వారి లేఖల్లోని కొన్ని విషయాలు ఎవరు వ్రాసారో తెలియజేస్తూ పరిచయం చేస్తున్నాను. వాటి అంతరార్ధం పూర్తిగా తెలుసుకోవాలంటే పుస్తకం తప్పనిసరిగా చదవాల్సిందే.

 ఠాగూర్ 

 ఎవరైతే మమకారాన్ని  ప్రత్యేక అస్తిత్వాన్ని పోగొట్టుకోగలరో వారు అనంతత్వాన్ని అందుకోగలుగుతారు.ఎవరైతే అనంతత్వాన్ని కనుగొంటారో వారు అమృతులవుతారు.ఎవరి ఆత్మ అయితే విముక్తి చెంది అన్ని ఆత్మల్లోనూ తననే దర్శిస్తుందో అతడే మహాత్ముడు.ఎవరు అందరి హృదయాల్లో నిలిచి ఉంటాడో ఎవరి కార్యక్రమాలు అపరిమితాలో ఆ అనంతాత్ముడే మహాత్ముడు. మనుషులు ఆత్మ త్యాగమయ పూర్వకమైన జీవితం జీవించినప్పుడు అనంతత్వాన్ని అందుకుంటారు.

గాంధీజీ విజయ రహస్యం ఆయన ఆధ్యాత్మిక శక్తి లోను నిర్విరామ ఆత్మ బలిదానాలలో ఉంది ఆయన త్యాగమూర్తి ఇతరులకు ఏదైనా ఇవ్వడం కోసమే ఆయన ఆత్మ ఎప్పటికీ ఆరాటపడుతూ ఉంటుంది ఆయన విముక్తాత్ముడు పసి పిల్లవాడి తరహా నిరాడంబరత్వం ఉంది సత్యం పట్ల ఆయన  విధేయత చెక్కుచెదరనిది. మానవాళి పట్ల ఆయన ప్రేమ తీవ్రమైనది రుజువైనది ఇది క్రీస్తు స్వభావం.ప్రాచ్య ప్రపంచపు ఆత్మకు గాంధీ విలువైన ప్రతీక.

 అధికారం అన్ని రూపాల్లోనూ అహేతుకంగానే ఉంటుంది. అది శకటాన్ని గుడ్డిగా ఈడ్చుకుపోయే గుర్రం లాంటిది ఆ ప్రయాణంలో నైతిక పార్శ్వం అంటూ ఉంటే అది ఆ గుర్రాన్ని నడిపే మనిషి లోనే ఉంటుంది.కోపాన్ని కోపం లేకుండా చేయించు.చెడుని మంచితో  జయించు.తమకు ఓటమి నిశ్చయమని  తెలిసి కూడా తమ ఆదర్శాలకు కట్టుబడి ఉండడం లోనే నిజమైన విజయం దాగివుంది. అత్యున్నతమైన ప్రేమ సాహసం నా కందివ్వు మాట్లాడగలిగే చేసి చూపించగలిగే వ్యధ చెందగలిగే,అన్నిటినీ వదులుకోగలిగే సాహసం ఒంటరిగా ఉండగలిగే సాహసం మృత్యుముఖంలో బ్రతుకుపట్ల విశ్వాసం, ఓటమి సమక్షంలో గెలుపు గురించిన నమ్మకం, సౌందర్య దుర్భలత్వంలో దాగిన అమేయశక్తి అవమానా న్ని అంగీకరించగలిగే వేదనలోని హుందాతనం, తనకి అవమానం జరిగినా ప్రతీకారం తీర్చుకోవాలనుకోని హృదయం..... వీటినే నాకివ్వు 

ప్రేమ ఒక్కటే ఆధ్యాత్మిక చరమ సత్యం. నిరాకరించే మనః స్థితి సదా విభజనను కోరుకుంటుంది. అంగీకరించే మనఃస్థితి ఏకత్వాన్ని అభిలషిస్తుంది. మానవుడి మనస్సు సత్యాన్ని వివిధ పార్శవాల్లో, వివిధ కోణాల్లో సమీపించే ప్రయత్నమే చేస్తుంది.

తటస్థ వైఖరితో వైజ్ఞానిక సహకారంతో మనం పాశ్చాత్య ప్రపంచాన్ని సమీపిస్తే ఈ మానవ ప్రపంచ యదార్థ పరిస్థితిని అవగాహన చేసుకోగలుగుతాం.కబీర్ నానక్ తాత్కాలిక అవరోధాలను అతిక్రమించి శాశ్వతత్వపు సంపూర్ణ దిగంతాన్ని చూడగలిగిన సమ్యక్ దృష్టి వారిది. సర్వ విషయాల్లోని అంతరంగంలోకి మనం ప్రవేశించడానికి కావలసిన ఆధ్యాత్మిక దృష్టిని ఇవ్వగలిగే మంత్రం భారతీయ మంత్రం శాంతి మంచితనం ఏకత్వాల మంత్రం. 

మనిషి అంతఃపూర్వ ప్రపంచంలో లేని సంభావ్యతల్ని సంభవం చేయడం కోసం నడుంబిగించాడు.తన స్వీయ శక్తి సామర్థ్యాలతో అసాధ్యాన్ని సుసాధ్యంగా చేయడమే మానవుడి యదార్ధ కర్తవ్యం మనిషి జీవించేది ప్రధానంగా తన అంతరంగిక ప్రకృతి మీద. సత్యం గుణాత్మకం అది మన ఆత్మ నిర్ధారణ వాక్యం మనిషి తన సంకల్పంతో వివేకంతో తన ప్రేమతో తన కార్యాచరణతో నిర్మించగలిగే దేశమే అతని నిజమైన దేశం అనిపించుకుంటుంది తమ కోపాన్ని యదేచ్చగా వ్యక్తం చేయడం అనేది ఒక రకమైన ఆత్మ దుబారా. మన దేశాన్ని మన స్వీయ సృజనాత్మక సాధ్యంతో నిర్మించాలనే పిలుపు గొప్ప పిలుపు

మన హృదయం ప్రేమ సత్యాన్ని అంగీకరించినట్టే మన మనసు జ్ఞాన సత్యాన్ని అంగీకరిస్తుంది అసత్యం కన్నా అపరిశుద్ధమైంది మరి ఏదీ లేదు.

మానవుడు ఒక మానసరహిత శిలా ప్రతిమ ఈనాడు మన దేశాన్ని పూర్తిగా పీల్చిపిప్పి చేస్తున్న ఈ దారిద్ర్యం నుంచి బయటపడాలంటే అది విజ్ఞాన శాస్త్రాన్ని వదిలిపెట్టి కేవలం చేతులకు పని చెప్తే సరిపోదు మానవుడి జ్ఞానకాండ ఆగిపోయి అతని కర్మకాండ మాత్రం కొనసాగుతూ ఉండాలను కోవడం కన్నా మించిన గౌరవ విహీన ప్రయాస మరొకటి ఉండబోదు.

విష్ణువు చేతిలో పద్మం చక్రం ఉంటాయి పద్మము పరిపూర్ణతలోని పరమాదర్శం చక్రము నిరంతర చలన ప్రక్రియ.విష్ణుశక్తి పరిపూర్ణతను కోరుకునే నిరంతర క్రియాశక్తి.విజ్ఞాన శాస్త్రం చేస్తున్నది విష్ణు చక్ర మహిమను విస్తరింప చేయడమే

గాంధీ 

ఇంగ్లీష్ మీడియం విద్య భారతీయుల్ని అనుకరణ వాదులుగా మార్చింది చదువుకున్న భారతీయుణ్ణి నిర్వీర్యం చేసింది.

దుఃఖం అనే యదార్ధాన్ని ఎత్తిచూపుతూ దాన్ని దూరం చేయవలసిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు బుద్ధుడు. బ్రహ్మవిద్యలో ఆనందమనే యదార్థాన్ని ఎత్తిచూపుతూ దాన్ని పొందవలసిందిగా ఉద్బోధిస్తూ ఉంటారు.ఒక విషయాన్ని స్వీకరించడం ఏ విధంగా ఒక ఆదర్శం కాగలదో దాన్ని పరిత్యజించడం కూడా అంతే ఆదర్శం కాగలదు.మనిషికి తన దేహవ్యావృత్తి నుండి విమోచన లేదా దేహం పట్ల దాస్యం అంతరించడమే ఆనందానికి శాశ్వత అనుగ్రహానికి దారి తీస్తుంది అసహజమైన అధార్మికమైన హింస సిద్ధాంతం బదులు తమకు హాని కలిగించని సహజమైన ధార్మికమైన సహాయం నిరాకరణ సిద్ధాంతాన్ని జాతి స్వీకరించింది.

 నా భావాలతో వేధించినంత మాత్రాన ఆ విభేదం నాకు అప్రియమెలా అవుతుంది కేవలం అభిప్రాయ భేదమే అసంతోషకారకమైతే ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు మనుషులు కూడా ఒక్కలానే ఆలోచించరు స్నేహితుల మధ్య అభిప్రాయ భేదం కటువుగా ఉండకపోవడం.ప్రకృతిలో అద్భుతమైన అనూ హ్య మైన వైవిధ్యం వెనుక ధ్యేయంలో వ్యూహంలో ఆకృతిలో ఒక ఏకత్వాన్ని చూడగలగాలి...... సేకరణ :ఒద్దుల రవిశేఖర్




Tuesday, 2 September 2025

వినూత్నంగా సన్మానాలు

 సన్మానాలు 

దండలు,శాలువాలు బదులు

మొక్కలు పుస్తకాలు ఇద్దాం 

      ప్రస్తుతం సన్మానం ఏదయినా  శాలువాలు, దండలు ఉండాల్సిందే!retire అయిన వారు జరుపుకునే functions కి ఇక చెప్పాల్సిన పని లేదు. August 15,September 5,January 26 ఇలా ఏ సందర్భంగా awards గెలుచుకున్నా ఇక శాలువాల,దండలు తప్పని సరి. రెండూ పునర్వినియోగించేవి కావు, దండలు అయితే కొద్ది సేపటికే అక్కడే వదిలేస్తారు,శాలువాలు అయితే ఇంటికి తీసుకెళ్లి బీరువాలో పెడతారు.మళ్ళీ వాటిని ఉపయోగించరు.

             ఇలా కాకుండా ఇంకేదైయినా మంచి సన్మానం ఉందా! అక్కడక్కడా ఈ పాటికే అటువంటి సన్మానాలు చేస్తున్నారు.APNGC meetings లో అయితే మొక్కలు ఇస్తారు. కొన్ని సాహిత్య సమావేశాల్లో పుస్తకాలు ఇస్తారు. మరి అన్ని సన్మానాలకు మొక్కలు లేదా పుస్తకాలు ఇస్తే బాగుంటుంది కదా! మొక్కలు ప్రకృతి పరిరక్షణకు,పుస్తకాలు జ్ఞానసముపార్జనకు పనికి వస్తాయి కదా!

         సన్మానం ఘనంగా చేయాలి అనుకుంటే పెద్ద మొక్కలు, గ్రంధాలు ఇవ్వవచ్చు. గుర్తుగా ఒక జ్ఞాపికను ఇచ్చుకోవచ్చు.పుస్తకాలు ఇవ్వడం ద్వారా సమాజంలో చదివే అలవాటు అభివృద్ధి అవుతుంది. అలాగే మొక్కలు నాటే సంస్కృతి పెరుగుతుంది.

           ప్రభుత్వమే రాబోయే september 5 న ఇచ్చే ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానాల నుండే ఇలా చేయొచ్చు. తరువాత వారికి పాఠశాల స్థాయిలో మొక్కలు,పుస్తకాలు ఇవ్వడం ద్వారా వారిని అభినందించవచ్చు.ఏదయినా ఒక మంచి ఎక్కడో ఒకచోట మొదలు కావాలి.

       ప్రభుత్వ,ప్రైవేట్ ఉద్యోగులు,రాజకీయ నాయకులు, నూతనంగా పదవులు పొందే వారు ఇలా మొక్కలు పుస్తకాలు ఇవ్వడం మొదలు పెడితే సామాన్య ప్రజలు కూడా ఈ అలవాటును ఆచరిస్తారు. కనుక ఈ దిశగా సమాజం అంతా ఆలోచిస్తుందని, మొదటగా ఉపాధ్యాయులుగా మనం ఇందుకు మార్గదర్శకులుగా ఉందామని కోరుకుంటున్నాను 

ఒద్దుల రవిశేఖర్

స్వచ్ఛ అక్ష్యరాస్యత(Clean literacy)

 Clean literacy (స్వచ్ఛ అక్షరాస్యత )

FA1 పరీక్షల మార్కులు upload చేసి cluster meetings కు హాజరవుతున్న ఉపాధ్యాయ మిత్రులందరికి నమస్తే 

      FA1 పరీక్షా పత్రాలు దిద్దే క్రమంలో విద్యార్థులు వ్రాసిన భాషను గమనించి ఉంటారు కదా అందరు.అన్ని subject లలో విద్యార్థులు తప్పులు లేకుండా వ్రాయగలిగారా! తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల పరిస్థితి ఏంటి? ఇక ఇంగ్లీష్ మీడియంలోకి మారిన Maths, P.S N.S, Social పరిస్థితి ఏమిటి? ఎంత మంది అక్షరాలు, పదాలు, వాక్యాలు తప్పుల్లేకుండా సరిగా వ్రాయగలిగారు.

మన చదువుల విషాదం ఏంటంటే ధారాళంగా చదవడం, శుద్ధంగా వ్రాయడం విషయంలో విద్యార్థులు ఇంకా సమస్యలు ఎదుర్కోవడం.అసలు పాఠం అర్ధం కావాలన్నా, నేర్చుకోవాలన్నా పై రెండు ప్రక్రియలు రాక పోతే ఎలా సాధ్యం?మనకున్న syllabus, exams,వివిధ కార్యక్రమాల నడుమ ప్రాధమిక ప్రక్రియలైన చదవడం, వ్రాయడం ప్రక్రియల పై దృష్టి పెట్టడం కష్టం అవుతుంది.కానీ ఈ సమస్య ను గుర్తించే FLN కి ప్రాధమిక స్థాయిలో ప్రాధాన్యత పెంచారు. మరి ఇప్పటి ఇంగ్లీష్ మీడియం ఉన్న పరిస్థితిలో పిల్లలు english లో ప్రశ్న చదవడం,దాన్ని అర్థం చేసుకోవడం, నేర్చుకొని వ్రాయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ఇలాగే పట్టించుకోకుండా వదిలేస్తే 10 వ తరగతి కి వచ్చే సరికి ఆ విద్యార్థులు పూర్తిగా వెనుక బడిపోతారు.అప్పటికి ఎలాగోలా బయట పడ్డ తరువాత చదువు కొనసాగించ లేక మానేస్తారు.

కనుక అందరు ఉపాధ్యాయులు తమ తమ subject లలో చదవడం, వ్రాయడం విషయం లో పిల్లలను వర్గీకరించుకొని, group leaders సహాయంతో పదాలు,వాక్యాలను ధారాళంగా చదవడం, శుద్ధంగా వ్రాయడంలో  నైపుణ్యం సంపాదించే టట్లు విద్యార్థులను తీర్చి దిద్ది  స్వచ్ఛ అక్షరాస్యత సాధించేందుకు ముందుకు రావలసినదిగా అభ్యర్థిస్తున్నాను..... ఒద్దుల రవిశేఖర్ 

Sunday, 20 July 2025

చదవడం, వ్రాయడం నేర్పిద్దాం (3)

 చదవడం, వ్రాయడం నేర్పిద్దాం (3)

గత రెండు వ్యాసాల సారాంశం:గణితం, సైన్స్, సోషల్ subject లు english medium లో మాత్రమే ఉండటంతో వాటిని కూడా ధారాళంగా చదవడం, శుద్ధంగా వ్రాయడం నేర్చుకోవడానికి అందులోని పాఠాల్లోని పదాలను అక్షరాల సంఖ్య కు అనుగుణంగా విభజించి వ్రాయించి group leaders సహకారంతో నేర్పించడం.ఈ ప్రక్రియ రెండు తెలుగు రాష్ట్రాలలోని చాలా మంది ఉపాధ్యాయులను ఆకర్షించడం, చాలా మంది ఉపాధ్యాయులు స్పందించడం జరిగింది. ఇంకో వ్యాసంలో వారిని గురించి వివరిస్తాను.

         ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1 నుండి 5 వ తరగతి పిల్లలకు నేర్పించడానికి FLN( Foundational Literacy and Numeracy ) శిక్షణను ఉపాధ్యాయులకు అందిస్తూ ఈ దిశగా పెద్ద ప్రయత్నమే చేస్తుంది. NEP 2020 లో FLN కు విశేష ప్రాధాన్యత ఇస్తున్నారు.ఉన్నత పాఠశాలల్లో 6 వ తరగతికి readiness program  కూడా అమలు చేస్తున్నారు. వీటి లక్ష్యం ఒక్కటే భాషలు చదవడం, వ్రాయడం రావాలి అని.

         కనుక ఉన్నత పాఠశాలల్లో ని అన్ని subject ల ఉపాధ్యాయులు  తమ తరగతి లోని పిల్లల్లో చదవడం, వ్రాయడం తాము చెప్పే పాఠాల్లో ఎలా ఉందో పరీక్షించుకుంటే అర్థం అవుతుంది. అప్పుడు పిల్లల్ని groups గా విభజించి group leaders ను నియమించి చదవడం, వ్రాయడం రాని వారికి నేర్పించే లాగా చేయాలి.      ఉపాధ్యాయులు ఈ కార్యక్రమాన్ని follow up చేయాలి. మొదటి 3 పాఠాలు ఇలా చేస్తే పిల్లలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ గణితం, సైన్స్, సోషల్ పాఠాలను తప్పుల్లేకుండా చదవడం,వ్రాయడం నేర్చుకుంటారు. అప్పుడు ఆయా పాఠాలు వారికి అర్థం అవుతాయి. తరువాత వాటిని నేర్చుకోవడానికి ఆత్మ విశ్వాసం కలుగుతుంది.    ఈ విధానం నేను ఆచరిస్తున్నాను. చక్కని ఫలితాలు వస్తున్నాయి. మీరు కూడా ఆచరిస్తారని, మీరు ఇంకా వినూత్నంగా ఆచరిస్తే తెలియజేస్తారని పిల్లల్లో ఈ సమస్యను నివారించడానికి మనమందరం కృషి చేద్దాం అని కోరుకుంటున్నాను. మొదటి రెండు వ్యాసాలను క్రింది link లలో ఉన్న నా blog లో చదవండి.

1)https://ravisekharo.blogspot.com/2025/06/blog-post.html

2)https://ravisekharo.blogspot.com/2025/07/blog-post.html

ఒద్దుల రవిశేఖర్ SA(PS) 9492124454