Friday 16 November 2012

ప్రాధమిక విద్యకు బాలల హక్కుల చట్టం - 2009(రెండవ భాగం)


గత వ్యాసం తరువాయి భాగం )
       ఈ తీర్పు ద్వారా 1996 ఆగస్టులో ప్రాథమిక విద్యను ప్రాధమిక హక్కుగా రూపొందించడం లోని సాధ్యాసాధ్యా లను పరిశీలించడానికి సైకియా కమిటీని నియమించింది.ఆదేశిక సూత్రాలలో ఉన్నంతవరకు ఇది కేవలం Nonjusticiable fundamental right గా  ఉంది .దీన్ని  ప్రాధమిక  హక్కుల్లో  చేర్చి  Justiciable fundamental right గా మార్చాలన్న అవసరాన్ని గుర్తించారు.1997 సం :లో అధికారం లో ఉన్న United Front ప్రభుత్వం  రాజ్యాంగానికి  83 వ సవరణను ప్రతిపాదిస్తూ రాజ్య సభలో బిల్లు పెట్టింది. ఈ బిల్లులోని లోపాలతో వచ్చిన ప్రజా ప్రతిఘటనతో బిల్లు అటకెక్కింది.1997 సం : లో సైకియా   నివేదిక ను అధ్యయనం చేసి సూచనలు ఇవ్వటానికి తపస్ మజుందార్ ఆధ్వర్యం లో విద్యా వేత్తల బృందాన్ని నియమించింది.1999 జనవరిలో  ఆ  కమిటీ  నివేదిక  సమర్పించింది ..budjet లో విద్యకు అదనంగా 1,37,000 కోట్లు అదనంగా కేటాయిస్తే లక్ష్యాన్ని చేరుకోవచ్చని సూచించింది.2001 లో NDA ప్రభుత్వం రాజ్యాంగానికి 86 వ సవరణ ప్రతిపాదిస్తూ లోక్సభలో బిల్లు ప్రవేశ పెట్టింది.దీనిలో కూడా లోపాలు ఉన్నాయి.అయినప్పటికీ 86 వ సవరణ రాజ్యంగ సవరణ జరిగింది.
         UPA ప్రభుత్వం కపిల్ సిబాల్ నేతృత్వం లో కమిటీ(2005)ని నియమించింది.ఈ కమిటీ తయారు చేసిన బిల్లును CABE BILL 2005 అంటారు.అప్పటినుండి ఎన్నో మీటింగ్స్ జరిగి చర్చలు అయిన తర్వాత ప్రస్తుత స్థితిలోని ఈ బిల్ 2009 వచ్చింది.20/7/09 న రాజ్య  సభలో ,4/8/09 న  లోక్ సభలో  ఆ  బిల్లు  ఆమోదం  పొందటం  జరిగింది..26/8/09 న  రాష్ట్ర  పతి  సంతకం  పెట్టారు .27/8/09 న gazette notification లో ప్రచురించారు.2010 april 1 నుండి  అమలు చేస్తామని  రాష్ట్రపతి  ప్రకటించారు .
ఈ ప్రాధమిక విద్యా  హక్కు   చట్టం-2009 లోని ముఖ్యాంశాలు.
1)ప్రాధమిక విద్యలో నమోదు చేయించు కొని   లేదా పూర్తీ   చెయ్యని బాలలకు ప్రత్యేక ఏర్పాట్లు
2)వేరే బడికి బదిలీ హక్కు
3)బడిని స్థాపించడం  సంబంధిత స్థానిక ప్రభుత్వ భాద్యత ,ఆర్ధిక ఇతర బాధ్యతలను పంచుకోవడం
4)తల్లిదండ్రుల సంరక్షకుల బాధ్యతలు
5)పూర్వ పాటశాల విద్యనూ సంబందిత ప్రభుత్వం చూసుకోవాలి.
6)బడి ప్రవేశానికి ఎంపిక విధానం ,capitation రుసుం ఉండకూడదు.
7)అదే తరగతిలో కొనసాగించడం,పేరు తీసివెయ్యటం నిషేధం.
8)రికగ్నిషన్ లేకుండా బడిని ప్రారంభించ కూడదు.
9)బడులకు,నియమాలు,ప్రామాణికాలు
10)బడి యాజమాన్య సంఘం,బడి అభివృద్ధి ప్రణాళిక
11)టీచర్ గా నియామకానికి అర్హతలు,ఉద్యోగ షరతులు,నిబంధనలు,టీచర్ల విధులు,సమస్యల పరిష్కారం
12)విద్యార్ధి టీచర్ల నిష్పత్తి,టీచర్ల ఖాళీలను భర్తీ చెయ్యటం,విద్యే తర పనులకు టీచర్లను పంపటం పై నిషేధం,టీచర్ల private tutions పై నిషేధం
13) పాట్య ప్రణాళిక,మూ ల్యాంకన విధానం
14)విద్యకు బాలల హక్కుల పర్యవేక్షణ,ఫిర్యాదుల పరిష్కారం
15)రాష్ట్ర జాతీయ సలహా సంఘాల ఏర్పాటు
16)ఆదేశాలు జారీ చేసే అధికారం,ప్రాశిక్యూశన్ కు ముందస్తు అనుమతి
పై అంశాలతో పాటు ఉపాధ్యాయులు గ్రహించ వలసిన అంశాలను ఈ క్రింద గుర్తించటం జరిగింది.
1)ఉచిత విద్య
2)నిర్బంధ విద్య అందించటం రాజ్యాంగం యొక్క బాధ్యత
3)రాజ్యంగా విలువలతో కూడిన పాట్య ప్రణాళిక
4)ఉపాధాయుల గునాత్మకత
5)) పాట శాలకు  గుణాత్మక నియమాలు
6)సామాజిక సంస్కరణల తోడ్పాటు
7)పిల్లల సంరక్షణ బాధ్యత
8)అమలులో నియమ నిబంధనలు కుదించడం
9)పౌరుల పాత్ర చట్టబద్దం చేయడం
10)పరీక్షల ఒత్త్జిడులు తొలగించటం
ఈ చట్టం అమలు పరిచే క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు,స్థానిక సంస్థలు,విద్యార్థులు,తల్లిదండ్రులు పాటశాలలు,ఉపాధ్యాయులు కొన్ని బాధ్యతలను నిర్వర్తించటం జరుగుతుంది.ఈ చట్టం పర్యవేక్షణ బాలల హక్కుల రక్షణకు ఒక నిర్దిష్ట యంత్రాంగం ఉంటుంది.గవర్నమెంట్,పంచాయతీరాజ ,మున్సిపల్,ఎయిడెడ్ ప్రైవేటు పాటశాలలు విధిగా పాటించాలి.
విద్యా హక్కు బిల్లు లోని సందేహాలు,వివాదాలు
1)6  ఏళ్ళలోపు,14 సం: పైబడిన వారి పరిస్థితి ఏమిటి
2)ప్రైవేటు పాటశాలలు బలహీన వర్గాల వారికి 25% సీట్లు కేటాయింపు వారి ఖర్చు ప్రభుత్వం భరించుట
3)పర్యవేక్షణ యంత్రాంగం పటిష్టత
4)ఫీజుల పై నియంత్రణ
5)neighbourhood స్కూల్స్
పై విషయాలపై స్పష్టత లేదు.ఏది ఏమైనప్పటికీ స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ఈ రక మైన బిల్లు వచ్చి వుంటే దేశం ఎంతో ముందడుగు వేసేది.ఇప్పటికయినా ఈ బిల్లు రావటం  దేశం లోని కోట్లాది చిన్నారులకు ఆశా జ్యోతిగా పరిగణించ వచ్చు.

Sunday 11 November 2012

ప్రాధమిక విద్య కు బాలల హక్కుల చట్టం 2009


          {జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా వ్రాసిన ఈ వ్యాసం ప్రాధమిక విద్య కు బాలల హక్కుల చట్టం        తయారు చేసిన కమిటి లో సభ్యులయిన ప్రొఫెసర్ శాంతా సిన్హా (chairman National child rights commission) ప్రోఫెసర్ నళినీ జునేజా,R.వెంకట రెడ్డి(సెక్రెటరీ M.V Foundation) ల Seminars కు హాజరయి రూపొందించినది.వారికి ధన్యవాదాలు.}
   పరిచయం:విద్యా ప్రాధమిక హక్కుపై చర్చ భారత దేశానికి కొత్త గాదు.ఈ అంశాలు గత 130 సంవత్స రాలుగా చర్చించ బడుతున్నాయి.1882 సం:లో మహాత్మా జ్యోతీరావు పూలే indian education commission(hunter commission) కు సమర్పించిన నివేదికలో బ్రిటిష్ ప్రభుత్వం విద్యా వ్యాప్తికి సమకూర్చే నిధులు అగ్ర వర్ణ విద్యా వ్యాప్తికి మాత్రమే సహకరిస్తూ దళితులకు ,బలహీన వర్గాలకు ఈ విద్య అందకుండా ఎలా దూరం చేస్తున్నయో వివరించారు.1911 సం:లో బొంబాయి assembly లో గోపాల కృష్ణ గోఖలే ప్రాధమిక విద్యా హక్కు బిల్లును లేవనెత్తి నప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్త మయింది.1937 సం :లో  వార్డా జాతీయ  విద్యా  సదస్సులో  గాంధీ ప్రాధమిక విద్యకు అధిక నిధులు కేటాయించాలని కోరినా ఆనాటి మంత్రులంతా నిధులు లేవన్న వాదనతో తోసి పుచ్చడం జరిగింది.
        april 1947 లో వల్లభాయి పటేల్,కృష్న స్వామి కమిటీ విద్య ప్రాధమిక హక్కుగా మార్చటం గురించి చర్చించింది.గోబింద్ వల్లభ పంత్ దీనిని వ్యతిరేకించి Non justiciable fundamental right list లోనికి పంపించమన్నారు.అనగా ఆదేశిక సూత్రాలలో (Directive principles of state policy)చేర్చమన్నారు.
K.TShah దీనిని వ్యతిరేకించారు.ఆదేశిక సూత్రాలలో పెడితే ఒరిగేది ఏమీ లేదు.L.C jain తన రిపోర్ట్ లో బడ్జెట్ లో విద్య గురించి ఆర్దిక మంత్రులు మాట్లాడలేదు అన్నాడు.14 సం:వరకు నిర్బంధ ఉచిత విద్య అందించడానికి ఉద్దేశించిన ముసాయిదాబిల్ article 45  ను 11 సం:కు కుదించాలని 1948-49 లో రాజ్యాంగ సభ చర్చల్లో పాల్గొన్న ఒక సభ్యుడు అంబేద్కర్ తో వాదించాడు.అంబేద్కర్ వ్యతిరేకిం చక పోతే సవరణ జరిగేది.అలా జరిగి ఉంటె 11 సం:ల వయస్సు పిల్లలు పనులలో చేరి ఉండే వారు.అందులోని  మెజారిటీ  సభ్యులు  article 45 ను రాజ్యాంగపు మూడవ భాగంలో చేర్చకుండా అంబేద్కర్ ను నిరోధించారు.ఫలితంగా ఆధునిక భారత దేశం లో విద్య ప్రాధమిక హక్కు కాలేక పోయింది.1986 సం :కొత్త విద్యా విధానం రూపొందుతున్న సమయానికి 5-14 సం :ల వయస్సు కలిగిన మొత్తం పిల్లలలో సగం మంది ఆడపిల్లలయితే మూడింట రెండు వంతుల మంది బడి బయటే ఉన్నారు.s.c,s.t,మైనారిటీలు వికలాంగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది.80-85% s.c బాలికలు ,90%s.t బాలికలు  10 వ  తరగతి  వరకు  చేరటం  లేదు .రిజర్వేషన్ ఫలాలు వారికందటం లేదు.ప్రైవేటీకరణ పెరగడం వలన సమాన నాణ్యత కలిగిన విద్య నందించే విషయం లో సమాజం లోని ఉన్నత వర్గాలకు,పేదలకు మధ్య అంతరాలు మరింత పెరుగుతున్నాయి.
    J.P.unnikrishanan versus A.P Govt మరియు  ఇతరులు (S.C2178,1993) కేసులో సుప్రీం కోర్టు తన చారిత్రాత్మక తీర్పులో ఈ పెడ పోకడలను తీవ్రంగా నిరసించింది.రాజ్యాంగం మనకు ప్రాధమిక హక్కులుగా భావ ప్రకటనా స్వేచ్చ జీవించే  హక్కు  (article 21) దేశంలో ఎక్కడయినా నివసించే హక్కు వంటివి కల్పించింది.వీటికి భంగం కలిగితే మనం కోర్టు ను ఆశ్రయించ వచ్చు.ప్రభుత్వం ఖచ్చితంగా ఈ హక్కులు మనకు కల్పించాలి.అదే విధంగా రాజ్యాంగం లో మనకు ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. ప్రభుత్వా లు వీటిని ఖచ్చితంగా పాటించాల్సిన పని లేదు.వీటిలో పిల్లల గురించి 24,39,45  అధికరణాల్లో వివరిం చారు.
అధికరణం  24:  14 సం : లోబడిన పిల్లలను వారికి ప్రయోజనకరమైయిన వృత్తులలో పరిశ్రమలు,గనులు వంటిచోట నివసిం చకూడదు.
అధికరణం 39: ప్రభుత్వాలు  పిల్లల  పసితనాన్ని  పరిరక్షిస్తూ ,వారు  పరువుగా  స్వేచ్చగా  ఆరోగ్యకర మయిన  వాతావరణంలో  ఎదిగేలా  అవకాసం  కల్పించాలి .
అధికరణం 45: రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి  10 సం :లోపు  పిల్లలందరికీ  14 సం : నిండే వరకు  ఉచితంగా  నిర్భందంగా  విద్య  నందించే  ప్రయత్నం  చేయాలని  ప్రభుత్వానికి  నిర్దేశించ  బడింది .
       45 వ ఆర్టికల్ దృష్ట్యా 21 వ ఆర్టికల్ ను(జీవించే హక్కు)ను పరిశీలిస్తే పిల్లలందరికీ విద్యా ప్రాధమిక హక్కును రాజ్యాంగం కల్పించినట్లు తెలుస్తుంది."అని సుప్రీం కోర్టు తన నిర్ణ యాత్మకమైన తీర్పులో స్పష్టం చేసింది.ఆదేశిక సూత్రాలు(నాలుగవ  భాగం)ప్రభుత్వం సాధించ వలసిన లక్ష్యాల యితే ప్రాధమిక హక్కులు (మూడవ భాగం)అందుకు అనుసరించవలసిన మార్గాలుగా సుప్రీం కోర్టు రూలింగ్ ఇచ్చింది. 45 article లో సవరణ జరిగినా ఆరు సం: లోపు పిల్లలకు పూర్వ ప్రాధమిక విద్య 45 article ను అనుసరించి 14  సం:దాటిన  వారు కూడా ప్రభుత్వ ఆర్ధిక సామర్ధ్యాలననుసరించి  విద్యా ప్రాధమిక హక్కును కలిగి ఉంటారని సుప్రీం కోర్టు పేర్కొంది.
(మిగతా భాగం తరువాతి వ్యాసం లో )

Wednesday 17 October 2012

బంగారు కథలు (గత యాభై ఏళ్లలో వచ్చిన అద్భుత కథలు)


            మన దేశ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాల సందర్భంలో గత ఏభై ఏళ్లలోతెలుగులో వచ్చిన వేల కథల్లో అత్యుత్తమ మయిన అరవై కథలను కేంద్ర సాహిత్య అకాడమీ "బంగారు కథలు" పేరుతో అచ్చు వేసింది దీనికి సంకలన కర్తలు వాకాటి పాండు రంగారావు గారు,వేదగిరి రాంబాబు గారు.ఈ పుస్తకం అన్ని శాఖా గ్రందాలయాలలో దొరుకుతుంది దాదాపు ఆరువందల పేజీల ఈ పుస్తకాన్ని చదవటానికి నాకు ఓ నెల సమయం పట్టింది.ఒక్కో కథ ఆనాటి సామాజి క జీవనాన్ని,అప్పటి వాస్తవ పరిస్థితులను అద్భుతంగా వర్ణించింది.ఇందులోవ్యక్తీ,సమాజం,సంప్రదాయం,విప్లవం అంతరంగ మధనం, బాహ్యజగతి, ప్రేమ,అశాంతి,అయోమయం,సమన్వయము దాకా వీటి పరిధి విశాలంగా విస్తరిం చింది.సమకాలీన సమస్యలకు సంఘటనలకు ఆయా రచయితలు,రచయిత్రులు అద్భుతంగా స్పందించి తెలుగు కథా సాహిత్యాన్ని సుసంపన్నం చేసారు.తెలుగు భాష ఉన్నంత వరకు తెలుగు కథా బంగారం మెరుస్తూనే ఉంటుం ది.మురిపిస్తునే ఉంటుంది.
       ఈ కథలు చదివి నేను అనిర్వచనీయమైన అనుభూతిని పొందాను.మీరూ చదవటానికి ప్రయత్నించండి.నా వంతు వారికి కృతజ్ఞతగా వారి పేర్లు,కథలు ఈ దిగువ ఇస్తున్నాను.
1)చాగంటి సోమయాజులు (ఎంపు)
2)కొడవటిగంటి కుటుంబరావు (చెడిపోయిన మనిషి)
3)పాలగుమ్మి పద్మ రాజు(పడవ ప్రయాణం)
4)విశ్వనాధ సత్య నారాయణ(కపర్ది )
5)చలం ( ఓ పువ్వు పూసింది)
6)బుచ్చి బాబు (కాగితం ముక్కలు,గాజు పెంకులు)
7)మునిపల్లె రాజు (బిచ్చగాళ్ళ జెండా)
8)మల్లాది రామ క్రిష్ణ శాస్త్రి (మంత్ర పుష్పం)
9)గోపీచంద్ (సంపెంగ పువ్వు)
10)రావిశాస్త్రి(మోక్షం)
11)దేవరకొండ బాల గంగాధరతిలక్(ఊరిచివర ఇల్లు )
12)ముల్లపూడి వెంకట రమణ (కానుక)
13)హితశ్రీ (గులాబి పువ్వు-సిగరెట్టూ)
14)స్మైల్ (ఖాళీ సీసాలు)
15)పెద్దిభొట్ల సుబ్బరామయ్య(నీళ్ళు)
16)ఆదివిష్ణు(కుర్చీలు)
17)బీనాదేవి(డబ్బు)
18)కాళీ పట్నం రామారావు(హింస)
19)కొలకలూరి ఇనాక్(ఊరబావి)
20)నాయని కృష్ణ కుమారి (ఎండు చేపలు)
21)పోతుకూచి సాంబశివరావు(మామ్మ నడిపిన విప్లవం)
22)వి.రాజా రామమోహనరావు(వరద)
23)వాసిరెడ్డి సీతాదేవి(తమసోమా జ్యోతిర్గమయ )
24)డి.కామేశ్వరి (కన్నీటికి విలువెంత)
25)ఇచ్చాపురపు జగన్నాధ రావు (మనిషి-మమత )
26)ఆర్.ఎస్ .సుదర్శనం (ఎరుపు)
27)దేవరాజు మహారాజు .బి.విద్యాసాగర రావు(పాలు ఎర్రబడాయి)
28)వేదగిరి రాంబాబు(సముద్రం)
29) చాగంటి తులసి(యాష్ ట్రే )
30)సదానంద్ శారద (జాడీ)
31)ఆర్.వసుందరాదేవి(గడియారం)
32)కేతు విశ్వనాధరెడ్డి(నమ్ముకున్ననేల )
33)వాకాటి పాండు రంగారావు(ప్లసీబో)
34)రావులపాటి సీతారామారావు(మనసా తుల్లిపడకే)
35)విహారి(గోరంత దీపం)
36)బి.ఎస్.రాములు(అడవిలో వెన్నెల)
37)ఓల్గా (ఆర్తి)
38)పాపినేని శివశంకర్(మట్టి గుండె )
39)స్వామీ(సావుకూడు)
40)శ్రీ పతి (చెట్లు కూలుతున్న దృశ్యం)
41)అల్లం రాజయ్య (మనిషి లోపలి విధ్వంసం )
42)సింగమనేని నారాయణ(అడుసు)
43)తుమ్మేటి రఘోత్తమ రెడ్డి(చావు విందు)
44)ఆర్ .ఎం.ఉమా మహేశ్వర రావు (బిడ్డలు గల తల్లి )
45)భూపాల్(అంబల్ల బండ)
46)పులికంటి కృష్ణారెడ్డి (బంగారు సంకెళ్ళు )
47)అబ్బూరి చాయాదేవి(ఆఖరికి అయిదు నక్షత్రాలు )
48)కలువ కొలను సదానంద(నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు)
49)తురగా జానకి రాణి(యాత్ర)
50)బలివాడ కాంతారావు(చక్రతీర్ధ)
51)తోలేటి జగన్మోహనరావు (మార్పు)
52)మధురాంతకం రాజారావు(రాతిలో తేమ)
53)శ్రీ రమణ(బంగారు మురుగు)
54)మధురాంతకం నరేంద్ర(నాలుగు కాళ్ళ మండపం)
55)ఆవుల మంజులత(నిన్ను ప్రేమించలేదు)
56)కాలువ మల్లయ్య(ఆంబోతు)
57)యర్రం శెట్టి శాయి(సర్కస్
58)పి.సత్యవతి(పెళ్లి ప్రయాణం)
59)బోయ జంగయ్య(చీమలు)
60)అయితా చంద్రయ్య(మంచు ముద్ద  )

Sunday 14 October 2012

సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ ప్రయత్నం ఎలా ఉంటుంది?


              ప్రస్తుతం మానవుడు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ,జబ్బుల బారిన పడకుండా ఉండటం ఎలా? అన్నవి అత్యంత ప్రధానమైనవని భావించవచ్చు.మనుష్యులకు ఆరోగ్యం ఎలా దెబ్బ తింటుంది? జబ్బులు ఎందుకు వస్తాయి?వంశ పారంపర్యంగా వచ్చే జబ్బులు,అంటు వ్యాధులు,విభిన్న రకాల కాలుష్యాల వలన వచ్చేవి,పొగాకు,మద్యం  తీసుకోవటం వలన వచ్చే జబ్బులు ఇంకా ఎన్నో రకాలు గా మనిషిని జబ్బులు పట్టి పీడిస్తు న్నాయి.వంశ పారంపర్యంగా వచ్చే జబ్బులు తప్ప మిగతా వాటినన్ని టిని ముందు జాగ్రత్తలు తీసుకుంటే నివారణ చాలా వరకు సాధ్య మవుతుందని డాక్టర్స్ అంటుంటారు. అలాగే జబ్బులు వచ్చిన తర్వాత విభిన్న వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి.
                ఆరోగ్య పరిరక్షణకు,జబ్బుల నివారణ కొరకు మనకు అందుబాటులో ఉన్న వాటిలో1) ప్రకృతి వైద్యం, యోగ(BNYS) 2)ఆయుర్వేద(BAMS) 3)హోమియోపతి(BHMS),4)అల్లోపతి(MBBS,MD,MS) 5) యునాని ఇలా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇంకా ఎన్నో విధానాలు అవలంబిస్తుంటారు.కానీ ప్రతి ఒక్క దానికి దేని పరిధులు దానికున్నాయి.కొన్ని జబ్బులు కొన్ని విధానాల్లో బాగా నయ మవుతాయి.కొన్ని విధానాల్లో side effects వస్తాయి ఒక రంగంలో పనిచేసే వారు మరొక రంగం లో పనిచేసే వైద్యులతో ఏకీభవించరు.ఎవరి విధాన్నాన్ని వారు బలంగా నమ్ముతారు.
         అలా కాకుండా మనిషి సంపూర్ణ ఆరోగ్య వంతుడు కావటానికి జబ్బులు రాకుండా రక్షింప బడటానికి ,వచ్చిన తర్వాత వాటిని తగ్గించుకోవటానికి ,ఏ విధానంలో ఏ జబ్బులు బాగా తగ్గుతాయి,.ఏ విదాన్నాన్ని అవలంబిస్తే జబ్బు లు రాకుండా చూసుకోవచ్చు అన్న అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసి అన్ని వైద్య విధానాలలోని పరిమితు లను వివరిస్తూ ప్రామాణిక మైన పుస్తకాలు వ్రాస్తే ఎలా ఉంటుంది.పై విధానాలు ప్రాక్టీసుచేసే వైద్యులుకొంత మంది కలిసి మానవుడి సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ఎటువంటి స్వార్ధం లేకుండా ఏ వైద్య విధానం పట్ల పక్షపాత  వైఖరి లేకుండా ఆరోగ్యము అనే సత్యాన్ని దర్శించే విధంగా ఒక ప్రయత్నం చేస్తే ఎలా వుంటుంది?ఈ దిశలో ఈ వ్యాసాన్ని చదివిన వారందరూ ఇంకా ఇంతకంటే మంచి సలహాలు,సూచనలు ఏవైనా ఉంటె తెలియ జేయగలరు అన్ని వైద్య విధానాలు ఒకే గొడుగు క్రిందకు తీసుకు వచ్చి,వచ్చిన రోగికి దేనిలో పరిపూర్ణంగా నివారణ సాధ్య మవుతుందో దాని లో వైద్యం ఇచ్చే విధంగా ఒక హాస్పిటల్ ఉంటె ఎలా ఉంటుంది ?ఆలోచించండి.

Sunday 7 October 2012

Art Of Listening(కళాత్మకంగా వినడం)

          మనం చిన్నప్పుడు అమ్మ,అమ్మమ్మ,తాతయ్య కథలు చెబుతున్నప్పుడు ఎంతో శ్రద్ధగా విన్నాం.ఉపాధ్యా యులు పాఠాలు చెబుతున్నప్పుడు ఇంతే శ్రద్ధగా విన్నామా!అదేవిధంగా మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు ఎలా వింటాం.అమ్మా,నాన్నలు,పెద్దలు మన మేలు కోరి చెబుతున్నప్పుడు ఎలా వింటున్నాము.అలాగే మన సంసారం లో భార్య మాట,మన పిల్లలు చెబుతున్నప్పుడు ,అలాగే ఆఫీసుల్లోసహచరులతో,ఈ వినడం అనే ప్రక్రియ మనలో ఎలా నడుస్తుంది.ఇంతకీ ప్రస్తుతం మనం ఏదైయినా విషయాన్ని ఎలా వింటున్నాం.అలాగే మనం చెబుతున్నప్పుడు ఎదుటి వారు ఎలా ఆలకిస్తున్నారు.ఈ విషయం గురించి ఎప్పుడయినా ఆలోచించారా!
            సహజంగా మనకు ఏ విషయం అయినా వింటున్నప్పుడు  ఏమి జరుగుతుంది.మన మనసు మనకున్న పూర్వ జ్ఞానంతో విన్న ఆ విషయాన్ని విశ్లేషించి వెంటనే మనదయిన  అభిప్రాయాన్ని చెప్పమంటుంది.మనకు తెలి సిన అంశాల ఆధారం గా మనదైన ప్రతిస్పందనను తక్షణం తెలియ జేయాలనిపిస్తుంది.అంటే ఇక్కడ వినడం అనే ప్రక్రియ జరగక మనం చెప్పడం అనే ప్రక్రియలోకి వెళ్ళిపోయాము.ఎప్పుడూ చెప్పటానికి అలవాటు పడ్డ మనసు పూర్తిగా వినడాన్ని నిరాకరిస్తుంది.ప్రకృతి పరంగా కూడా మనకు రెండు చెవులు,ఒక నోరు ఉండటానికి కారణం ఎక్కువ విని తక్కువ మాట్లాడటానికి అంటారు.మనమందరం మనం చెప్పేది అవతలి వారు వినాలని కోరుకునే వారమే!మరి అదే సూత్రం మనకి మనం అన్వయించుకోము. కుటుంబంలో,స్నేహితుల మధ్య నయినా ఆఫీసుల్లో నయినా సమాజంలో ఎక్కడయినా ఇదే జరుగుతుంటుంది.మనం ఎదుటివారి నుండి ఏమి ఆశిస్తామో వారు మననుండి అదే ఆశిస్తారు.
              మరి దీన్ని మనం ఎలా ఆచరణ లోకి తెచ్చుకోవాలి.ఎవరితో మాట్లాడుతున్నాఅవతలి వారి మాటలను ఎంతో శ్రద్ధతో,దయతో,వాత్సల్యం తో వినడం చేస్తే వారు మీకు చెప్పేది తప్పయినా ఒప్పయినా ఆ విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది.వింటున్నప్పుడు ఎటువంటి ఖండనలు,విమర్శలు,ఆలోచనలు లేకుండా కేవలం వినడం మాత్రమే జరిగితే అప్పుడు ఎదుటివారికి తాము చెప్పినది విన్నాడు అనే త్రుప్తి కలుగుతుంది. ఆ త్రుప్తితో మీరు చెప్పేది వారు అదేవిధంగా వినడం మొదలు పెడతారు.ఎప్పుడయితే మీరు శ్రద్ధగా విన్నారో వారికి మీ అభిప్రాయం కూడా అంతే సున్నితంగా వ్యక్తం చేస్తారు.ఆ సున్నితత్వంలోని సహ్రుదయతను అవతలి హృదయం గ్రహించి మీ సంభాషణను అంతే స్థాయి అవగాహనతో వింటుంది.
               అప్పుడు రెండు మనసుల మధ్య,రెండు హృదయాల మధ్య ఒక అద్భుతమయిన భావ ప్రసారం జరుగు తుంది.అందులో స్నేహం,ప్రేమ,దయ,అవగాహన,వాత్సల్యం వంటి మాటల కందనిదేదో ఇద్దరి మధ్యా ప్రవహిస్తుంది.                                               

Tuesday 2 October 2012

మహాత్మా గాంధి -సత్యం,అహింస



              ఐక్యరాజ్య సమితి మహాత్మాగాంధీ పుట్టిన రోజును అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచంలోని అన్ని దేశాలు స్వాతంత్ర్యం పొందటానికి ఎంతో రక్తపాతాన్ని చవిచూసాయి.మన దేశంలో మాత్రమే మహాత్మా గాంధి నాయకత్వంలో అహింసాయుతంగా పోరాడి స్వాతంత్ర్యం సాధించగలిగాము.సత్యం,అహింసలు ఆయుధాలుగా గాంధిజీ సాగించిన ఈ పోరాటం ప్రపంచానికి ఆదర్శం.
             గాంధిజీ తన ఆత్మ కథ చివరిలో సత్యం,అహింస  గురించి ఈ విధంగా వివరిస్తారు.ఆయన మాటల్లోనే
             "సత్యాన్ని నేను ఏవిధంగా చూచానో,ఏ రూపంలో చూచానో ఆ రూపంలో  దాని వివరించడానికి సదా ప్రయ త్నించాను.ఈ ప్రయోగాల వలన  పాఠకుల మనసులో సత్యము,అహింస పై అధికంగా విశ్వాసం ఏర్పడుతుందని నా నమ్మకం.సత్యం కంటే మించి మరో భగవంతుడు వున్నాడనే అనుభవం నాకు కలుగలేదు .సత్యమయం కావడానికి అహింసయే ఏకైక మార్గం.నా అహింస సత్యమయమైనా అది ఇంకా అపూర్ణమే,అపరిపక్వమే.వేలాది సూర్యుల్నిప్రోగు చేసినా,సత్యమనే సూర్యున్ని చూడలేము.అంత తీక్షణ మైనది సత్యం.అయినా ఆ సూర్యుని కిరణాన్ని మాత్రం దర్శిం చవచ్చు.అహింస లేనిదే అట్టి దర్శనం లభించడం సాధ్యం కాదు.ఇప్పటి వరకు జీవితంలో పొందిన అనేక అనుభవాల ఆధారంగా  చేసుకొని ఈ మాట చెబుతున్నాను.ఇట్టి వ్యాప్తి చెందినా సత్యనారాయణుని సాక్షాత్కారం కోసం ప్రతిజీవి ని ప్రతి ప్రాణిని ఆత్మ స్వరూపంలో ప్రేమించడం చాలా అవసరం."
   మహాత్మా గాంధీ ప్రవచించిన ఈ సత్యము,అహింస ల గురించి ఆలోచించే ఓపిక,తీరిక ప్రస్తుతం మనకున్నాయా !అన్న సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది.ప్రపంచమంతా రాజ్యాల మధ్య,జాతుల మధ్య సమూహాల మధ్య వ్యక్తు ల మధ్య హింస రాజ్యమేలుతుంది.దేశాల మధ్య ఆధిపత్య పోరాటాలు యుద్ధాలుగా పరిణమిస్తు మానవ జాతిని అంతులేని హింసకు గురి చేసాయి.మొదటి రెండవ  ప్రపంచ యుద్దాల వలన  కొన్ని కోట్ల మంది మరణించినా కూడా ఇంకా దేశాలు యుద్దాలు చేస్తూ ఉన్నాయి.అలాగే వ్యక్తులు  చేసే హింస కూడా తక్కువేమీ కాదు.హింస ద్వారా రాజ్యాలు అయినా వ్యక్తులయినా చివరకు సాధించేది ఏమీ ఉండదు.
       అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు జరుగుతున్నఈ సందర్భంలో మానవ జాతి తనకు తాను చేసుకునే హింస నుండి కూడా బయట పడాలి.మనుషుల ప్రాణాలను అలవోకగా తీసే ఈ సమాజం లో ఇక వన్య ప్రాణులను ప్రకృతిని మానవుడు నాశనం చేయటంలో ఆశ్చర్యం లేదు.విజ్ఞానం పెరుగుతుందని మనిషి అనుకుంటూ అజ్ఞానంతో ప్రవర్తి స్తున్నాడు.తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నాడు.సాటి మనిషిని ప్రేమించలేని వాడు ప్రకృతిని ఏమి ప్రేమించగలడు ఒకరికి అపకారం చెయ్యకుండా బ్రతకటమే మనిషికి గల ప్రాధమిక కర్త వ్యం.అప్పుడు ప్రకృతిని,ప్రాణులను ప్రేమిం చటం నేర్చుకుంటాడు.ఇందుకు సత్యం,అహింసల పథంలో మనిషి ప్రయాణం చేయాలి.

Sunday 23 September 2012

ర్యాగింగ్ అనే విష సంస్కృతి


              రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలలు ఎట్టకేలకు admissions పూర్తి చేసుకుని తరగతులు ప్రారం భిస్తున్నాయి విద్యార్థులు EAMCET వ్రాసిన 4 నెలలనుండి ర్యాంకుల కొరకు,ప్రవేశాలలోఏర్పడిన ప్రతి ష్టంబనలోని స్పష్టత కొరకు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసి తాము కోరుకున్న కళాశాలల్లో చేరటంతో విద్యా సం:ప్రారంభమయ్యింది.inter లోఅనుభవించిన ఒత్తిడి తగ్గిపోయి స్వేచ్చా వాతావరణంలోకి సీతాకోక చిలుకల్లా అడుగు పెట్టారు.తల్లిదండ్రులు తమ ఆశలను,ఆకాంక్షలను వారిలో నింపి వారిని కళాశాలలకు పంపారు.ఇలాంటి సందర్భంలో తల్లిదండ్రులు విద్యార్థులు యాజమాన్యాలు గుర్తించాల్సిన అంశం గురించి చర్చిద్దాం.
      కళాశాలల్లో అడుగిడగానే అంతకు ముందే చదువుతున్న విద్యార్థులు(వీరిని seniors అంటారు) కొత్త గా చేరిన వారిని (వీరిని juniors అంటారు)పరిచయం చేసుకుంటారు.ఈ పరిచయం స్నేహం పెంపొందటానికి,విద్యార్జనలో సహ కరించుకోవటానికి,కొత్త వారిలో బెరుకు పోగొట్టి స్నేహితులుగా మార్చుకోవడంలో సీనియర్ విద్యార్థులు చొరవచూపి జూనియర్ విద్యార్థులకు మార్గ  దర్శకత్వం వహించటం వరకు అర్థం చేసుకోదగినదే!
        ఇలా ప్రారంభమయిన ఈ కార్యక్రమం ఎన్నివికృత పోకడలు పోయిందో!ఎన్ని జీవితాలు బలి అయ్యాయో మనం ఏటా చూస్తున్నాం.జూనియర్స్ ను సీనియర్స్ ఆట పట్టిస్తూ సాగే ఈ తంతును ర్యాగింగ్ అని పిలుస్తుంటారు.ఇంటర్ నుండే ఎన్నో ఆశలతో ఇంజినీరింగ్లో చేరిన విద్యార్థుల్లో బిడియస్తులు మొహమా టస్తులు,సిగ్గుపడే తత్వం,బెరుకు మనస్తత్వం,ఇతరులతో కలవలేనివారు,సున్నిత మయిన మనస్కులు ఇలా ఎంతో మంది ఉంటారు.వాస్తవానికి కాల క్రమేణ వీరంతా పరిస్థితులకు తగ్గట్లు మారి అందరిలో కలిసి పోతారు.కానీ వెళ్ళగానే  ర్యాగింగ్ పేరుతో వీరి చేత చేయరాని  పనులు చేయిస్తూ సీనియర్స్ పొందే పైశాచిక ఆనందానికి ఎన్ని నిండు ప్రాణాలు గాల్లో కలిసాయో!ఎంత మంది చదువులు మానేసారో!
        ఈ విష సంస్కృతికి కారణ మేమిటి?ఎందుకు తోటి మనుషుల పట్ల ఇటువంటి అనాగరిక  ప్రవర్తను కనబరుస్తా రు? తమ అన్నలు,అక్కలు,చెల్లెళ్ళు,తమ్ముళ్ళు కూడా ఇతర కాలేజీల్లో ఇదేవిధంగా ఇబ్బంది పడి ఉంటారు కదా !స్వయంగా తామే ఆ ఇబ్బందులకు గురయి బాధలు పడి కూడా ఇలా ఇంకొకరిని ఎలా  బాధించ గలగుతున్నారని  కొంత మంది విద్యార్థులను అడిగితే వారిచ్చిన సమాధానం వింటే తల తిరిగినంత పనయ్యింది.తాము ఇంతకు ముం దు పొందిన బాధకు ప్రతీకారంగా ఇంకొకరిని ఆ విధంగా బాధిస్తే వారికి ఆనందం కలుగుతుందట.దీనిని ఒక రకం గా sadism అంటారు.ఈ మనస్తత్వం పిల్లలకు కాలేజీలకు వెళ్లాకే ఏర్పడుతుందా!
         దీనికి బాల్యం నుండి వారి కేదురైన అనుభవాలు,వారు శిక్షింపబడిన జ్ఞాపకాలు వారిలో ఆ విధ మైన కసి ప్రతీ కారం కలగటానికి ఆస్కారం కలిగించి ఉంటాయి.మరియు పాటశాలలు,కళాశాలలు వారికి ఎటువంటి నైతిక విద్యను అందించకపోవటం ఒక కారణం.అయినా తల్లిదండ్రులు తమ పిల్లకు కాలేజీలకు వెళ్ళేటప్పు డు ఎన్నో జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు.అయినా ఇలా జరుగుతూనే ఉంది.ప్రస్తుత మైతే ర్యాగింగ్ కు వ్యతిరే కంగా కటినమైన చట్టాలు ఉన్నాయి ఇలాంటి ప్రవర్తన కలిగిన విద్యార్థులను మరల ఎక్కడా చదవకుండా నిషేదించవచ్చు.అలా యాజ మాన్యాలు ధృవీక రణ పత్రాలు తీసుకుంటున్నాయి.అయినప్పటికీ ఇంకా చాలా కాలేజీల్లో ఈ సంస్కృతి ఉన్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి.
       యాజమాన్యాలు ఈ దిశగా కొన్ని ప్రయత్నాలు చేయాలి.మొదటి సం:విద్యార్థులు చేరగానే వారే college లోని అందరు విద్యార్థులను సమావేశ పరిచి counsilling psychologist లసహాయంతో శిక్షణ ఇప్పించాలి.చట్టంలోని కఠిన నిబంధనలు తెలియజేయాలి.అప్పుడు ఇటువంటి ఆలోచనలు మనసులో నుండి వైదొలుగుతాయి.అన్నింటికంటే ముఖ్యంగా విద్యార్థుల్లో స్నేహభావన ,పరస్పరం సహకరించుకునే తత్వం,నాయకత్వ లక్షణాల్లాంటి అంశాలను వారి కి ఆ శిక్షణలో నేర్పిస్తే ఈ సంస్కృతి తగ్గిపోతుంది విద్యా ర్థులు కూడా అలా ప్రవర్తించే ముందు తమ తల్లిదండ్రు లను ఒక్క సారి గుర్తు తెచ్చుకుంటే అటువంటి విష సంస్కృతి నుండి బయట పడగలుగుతారు.చక్కటి స్నేహ పూర్వ క వాతావరణంలో ,మంచి  విద్యనూ నేర్చుకొని ఉపాధి సంపాదించుకొని తమ కాళ్ళపై తాము నిలబడే విధంగా ఇంజి నీరింగ్ విద్యను పూర్తి  చేసుకోగలరు.

Thursday 20 September 2012

Life Is Beautiful(అందమైన జీవితం )


       జీవితం ఎంతో అందమైనది,సరళమైనది.మరి దీనిని ఎందుకింత సంక్లిష్టం చేసుకుంటున్నాము.మానవ జన్మతో ఏర్పడిన బంధాలు,సమాజంలోని వ్యక్తులతో ఏర్పడే అనుబంధాలు,వారిపట్ల మన ప్రవర్తన,వారి ప్రతిస్పందన ఇవే కదా జీవితం!ఈ మొత్తం వ్యవహారం ఎంతో అందంగాను,అద్భుతం గాను,ఉండాలి.అటువంటి దీన్ని ఎందుకింత నీర సంగా ,అందవిహీనంగా ,యాంత్రికం గా మార్చుకుంటున్నాము.జీవితం ఉల్లాసంగా,ఉత్సాహంగా,ఆహ్లాదంగా మార కుండా ఏవి అడ్డుపడుతున్నాయి..
       తల్లిదండ్రులు,వారి పిల్లలు వీరి మధ్య సంబంధాల్లోని ఆప్యాయతలు,ప్రేమలు ఏ విధంగా ఉన్నాయి?అలాగే బంధువులు,స్నేహితులు,సన్నిహితులతో ఎలా సంబంధాలను నెరపుతున్నాము?ఇవన్నీ గమనిస్తే చాల సున్నితం గా ,సరళంగా,అందంగా,ఆనందంగా గడపాల్సిన జీవితం ఎలా ఉంది?       
       శేఖర్ కమ్ముల తన కొత్త సినిమా Life is Beautiful లో వీటికి కొంత సమాదానమిచ్చే ప్రయత్నం చేసారు .సిని మా ప్రారంభం లోనే చూ పించిన  రంగుల ద్వారా జీవితమెంత అందంగా ఉండాలో చూపించాడు.Happy Days చాయ లు కాస్త ఎక్కువగానే కన్పించినప్పటికీ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా అందులో లీనమయ్యేలా నడిపించాడు. అమ్మను ఇంగ్లీష్ లోవర్ణించటానికి మాటలు రావని తెలుగులో ఆ అమ్మాయితో చెప్పించటం ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టిస్తుంది.అన్నా చెల్లెళ్ళ సంబంధాలను ,కుటుంబ ఆప్యాయతలను,స్నేహితుల సహాయాలను,వాటి మధ్య మొగ్గ తొడిగే ఇష్టాలను,అవి ప్రేమలుగా మారే క్రమం లాంటి  సున్నిత మయిన మానవ సంబంధాలను తన దైన శైలిలో స్పృశిస్తూ ఓ అందమైన జీవితాన్ని మనకు పరిచయం చేసారు.అమ్మ మీద నువ్వు కావాలె అమ్మా! అంటూ సాగే పాట  ఇంకా మిగతావి కూడా మధురంగా ఉన్నాయి.ప్రస్తుత సినిమాలకు విభిన్నంగా,కుటుంబ మంతా కలిసి చూసే విధంగా ఆహ్లాదంగా తీసాడు.ఇటువంటి సినిమాలు తీయాలంటే ఎంతో ధైర్యం కూడా కావాలి.కానీ ఏదైనా కొత్త అంశాన్ని ఎన్నుకొని తీసి ఉంటె ఇంకా బాగుండేది.ఇటువంటి ఆరోగ్య కరమయిన సినిమాలను ప్రోత్సాహించాల్సిన అవసరం ఉంది.
           మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన "అందమైన జీవితం" నవల చాల అద్భుతంగా ఉంటుంది.ఇందులో
ప్రణయ్ జీవితంలో డబ్బు ఖర్చు లేకుండా ఆనందంగా ఎలా జీవించాలో చూపిస్తాడు.చదవక పోతే ఓ సారి చదవండి.
        జీవిత మంటే చిన్నచిన్నఆనందాలు,ఆప్యాయతలు,కలబోసిన రంగుల హరివిల్లు.ఉన్న దానితో త్రుప్తి చెందు తూ,రాబడి కంటే ఖర్చు ఎక్కువ పెట్టకుండా  ఉంటె చాలు.కోరికల సాంద్రత తగ్గించుకొని మానవ సంబంధాలను మెరుగు పరుచుకుంటూ ఉంటె ఆ జీవితం అందంగా మారుతుంది.కాలం వెంట పరుగులు తీస్తూ,లక్ష్యాల ఒత్తిడితో చిత్త వుతూ వర్తమానాన్ని త్యాగం చేస్తూ ఎప్పుడో ఆనందిస్తామంటే అప్పటికి అందరినీ కోల్పోతారు.విలువైన కాలం నష్ట పోతారు.గమ్యం ఎంత ముఖ్యమో! గమనం అంతే ముఖ్యం.ఆనందం కోసం బ్రతకడం కాదు,ఆనందంతో బ్రత కాలి.ముఖ్యంగా ఇతరులతో పోలికను తగ్గించుకోవాలి.
          కుటుంబ సభ్యుల మధ్య నమ్మకం,స్పష్టత,సర్దుబాట్లు,చిన్నచిన్న త్యాగాలు,క్లిష్ట సమయాల్లో పరస్పరం సహకరించుకోవటం,ఉద్వేగాల నియంత్రణ,సమన్వయము నెలకొల్పుకోవటం వంటి వాటి కలబోతే కదా జీవితం .సాధించలేక పోయిన,చేరుకోలేక పోయిన లక్ష్యాల గురించి అసలు చింతించకూడదు.వర్తమానంలో మన సామర్ద్యాల మేరకు,అవకాశాల మేరకు కృషి చేస్తూ పోవటమే!చక్కటి ఆహార నియమాలు,పాటిస్తూ శారీరక మానసిక వ్యాయా మాలైన ఆటలు,exercises ,ప్రాణాయామం,ఆసనాలు,ధ్యానం చేస్తూ చేస్తున్న పనిని అంకిత భావంతో,నిజాయితీ తో నిర్వహిస్తూ భార్యా పిల్లలతో ప్రతిరోజుముచ్చటించటం, సంగీతం వినటం పుస్తకాలు చదవడం,ప్రక్రుతి ఆరాధన లాంటి మంచి అలవాట్లతో జీవితాన్ని అందంగా మలచుకోవటం దాన్ని ఆనందించటం మన చేతుల్లోనే ఉంది.

Sunday 16 September 2012

బత్తాయి తోటతో అనుబంధం


     గ్రామీణ ప్రాంతాలలో రకరకాలయిన పండ్ల తోటలను మీరు చూసే ఉంటారు.మేమున్న మార్కాపూర్ ప్రాంతం బత్తాయి తోటలకు ప్రసిద్ది.కడప,కర్నూలు ,ప్రకాశంజిల్లాలో పశ్చిమప్రాంతం (కనిగిరి,గిద్దలూరు ,మార్కాపూర్,ఎర్రగొండపాలెం) మహబూబ్ నగర్,నల్గొండ జిల్లాలలో తోటలు బాగా ప్రసిద్ది.ఇవి అన్నీ బోర్ల క్రింద నీటి సాగుతో పండుతాయి.భూమిలో 300 అడుగులనుండి 600 అడుగుల లోతువరకు బోర్లు వేస్తారు. మధ్య కాలంలో మా ప్రాంతంలో సరి అయిన వర్షాలు లేక బోర్లలో నీళ్ళు లేక కొన్ని వందల ఎకరాలు ఎండి పోయాయి.రైతులు వాటిని తమ పిల్లల్లాగా కంటికి రెప్పలాగా పెంచుకుంటారు.మాకు కూడా 5 ఎకరాల తోట ఉండేది.బాగా కాపు మీద నీళ్ళు లేక మొత్తం ఎండి పోతే కొట్టివేసాము.9 అడు గుల ఎత్తు పెరిగిన వాటిని కొట్టివేస్తుంటే మా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.అలా 5 జిల్లాలలో కొన్ని వేల ఎకరాలు తోటలు కొట్టివేశారు.పండినప్పుడు కూడా సరిగా గిట్టుబాటు ధరలు వచ్చేవి కావు.3,4 సం: నేను హైదరాబాద్ మార్కెట్ కు వెళ్లి వాటిని అమ్మగా టన్నుకు రూ 4000 లేదా రూ6000 మాత్రమే వచ్చే వి.బాగా వేసవిలో అయితే రూ10,000 వరకు వచ్చేవి కానీ అప్పుడు నీరు లేక కాయలు తక్కువగా  ఉండి బరువు తూగేవి కావు.
   మా తోటలోకి వెడితే అదొక స్వర్గం .తోట పూతకు వచ్చినప్పుడు అక్కడ గాలిలో వాటి పరిమళం అంతా తోట చుట్టూ వ్యాపిస్తుంది.మా తోటలో వున్ననాలుగు వేపచెట్లు ఒకే చోట ఉండి గొడుగు పట్టినట్లు ఉంటా యి. ఇవి మాత్రం నా కోరిక మేరకు ఇప్పటికీ అక్కడ వున్నాయి.తోట మధ్యలో ఉండడం తో వాటిని కొట్టే స్తామంటే ఆపాను.వాటి క్రింద నులక మంచం మీద పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో!
           చెట్లకు నీరు కడుతుంటే మట్టి వాసన కమ్మగా మనకు సోకుతుంది.రైతుకు భూమి అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది.అందుకే కన్నతల్లి ఎలా లాలిస్తుందో ఆ భూమి అంత సాంత్వన నిస్తుంది.కాబట్టే దాన్ని వదలాలంటే రైతుకు అంత కష్టం.అందుకే పరిశ్రమల పేరుతో సారవంత మయిన భూములు కోల్పోయే రైతులు  అలా తిరగబడతారు.
         నీరు కట్టిన రెండు రోజులకు చెట్లు చిగిర్చి తలలూపుతూ పలకరిస్తుంటే రైతు కడుపు ఆనందంతో నిండి పోతుంది.అలాంటి స్థితిని అనుభవించిన మాకు ఆ తోట నీరు సరిపోక కొట్టివేసి ప్రస్తుతం మిర్చి, పత్తి వేసాము.కానీ అప్పటి ఆనందం తోట కెడితే ఇప్పుడు రావటం లేదు.ప్రభుత్వం ఈ రైతులకు గిట్టు బాటు ధరలు కల్పించాలి.
        మనం ఎక్కువగా బజారు కెళ్ళినా,ఇతర ప్రాంతాలకు వెళ్ళినా cooldrinksత్రాగుతూ ఉంటాము అలా కాకుండా బత్తాయి రసం త్రాగితే ఎంతో ఆరోగ్యం.100 grams ఒక కాయలో fat o.2 grams, saturated fat 0%,cholestrol 0%,sodium0%,carbohydrates 11g,fibre 3g,protiens 0.7 g,sugar 3g ఇలా ఇందులో పోషక పదార్థాలు ఉంటాయి.అలాగే దీనిలో c విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది జబ్బు పడ్డ వారికి ఈ రసం చాలా శక్తి నిస్తుంది.ఇరాన్ లో ఈ రసం తో ఫ్లూ,మరియు జలుబు కు వైద్యం గా వాడతారు.ఇవే కాకుండా ఎక్కువ మంది ఈ రసం త్రాగితే వాటికి బాగా డిమాండ్ ఏర్పడి రైతులకు గిట్టుబాటు ధరలు దొరికే అవకాశం ఏర్పడుతుంది.అందరు ఈ దిశగా ఆలోచిస్తే మన గ్రామీణ ప్రాంతాల లోని రైతులకు,పల్లెలకు ఎంతో మేలు చేసిన వారమవుతాము.

Monday 10 September 2012

ఆత్మహత్యా ప్రయత్నం ఆపడం- నా అనుభవం


         ఈ రోజు ప్రపంచ ఆత్మహత్యల నిరోధకదినం.ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం బలవన్మ రణం పాలవుతున్నారు.ఎంత విషాదం.అందులో 30% విద్యార్థులే వున్నారని గణాంకాలు చెబుతున్నాయి.ఈ ఆత్మ హత్యలకు ఎన్నోకారణాలు.కుటుంబంలోమనస్పర్ధలు,నయం కాని జబ్బులు కలిగిన  వారు,అప్పుల పాలయిన వారు,సన్నిహితులను కోల్పోయిన వారు,,జీవితం పై విరక్తి చెందినవారు విద్యార్థులయితే  ranks,marks రాలేదని  విపరీతమయిన మానసిక ఒత్తిడితో,ఉద్యోగాలు సాధించలేదని ఇలా విభిన్న కారణాలతో జీవితాలను అంతం చేసుకుంటున్నారు.
        నా అనుభవంలో ఓ మిత్రుని ఆత్మహత్యా ప్రయత్నాన్ని ఆపగలిగాను.ఒక ఉదయాన్నేఅతను ఫోన్ చేసి రైల్ పట్టాలపై ఉన్నాను.జీవితం పై విరక్తి కలిగింది.అని చెబుతుంటే అతన్ని చిన్నగా కారణాలు అడు గుతూ మాటల్లో పెట్టాను.తన కుటుంబ సమస్యనంతా వివరించాడు.అతనికి రకరకాలుగా నచ్చ జెబుతూ  మాట్లాడ సాగాను.మధ్య మధ్యలో ధైర్యము నూరి పోస్తు సంభాషణను కొనసాగిస్తున్నాను.అలా ఒక గంట మాట్లాడిన తరువాత కూడా అతను మళ్ళీ మొదటికి వచ్చి నాకు చావు తప్ప పరిష్కారం లేదు అనే సరికి ఎలా సముదాయించాలోఅర్థం కాలేదు అప్పుడు  ఓ ఆలోచన వచ్చింది.చనిపోయే ముందు నాతో ఒక్క సారి మాట్లాడమని అడిగాను.ఈ రోజు రాత్రి బయలు దేరి రేపు ఉదయం నీ దగ్గరికి వస్తాను.అప్పుడు మాట్లాడు దాము.అప్పటికి నీకు అదే భావం ఉంటె అలాగే చనిపోదు వుగానీ అని అడిగాను.అలాగే అంటూ బాధపడు తూ కొంత కోలుకున్నాడు.చివరికి వద్దులేరా!అంత రిస్క్ తీసుకొని రావద్దులే నేను ఏమి చేసుకోనులే!అన్నాడు.నేను నమ్మలేక మాట ఇవ్వ మన్నాను.నీకు ఎప్పుడు అలా చనిపోవా లనిపిం చినా నాతో కలవ కుండా ఆత్మహత్య చేసుకోనని మాట ఇవ్వమన్నాను .అలాగే ఇచ్చాడు.ఒక గంటన్నర మాట్లాడాను తరువాత మళ్ళీ కలిసినప్పుడు అంతా బాగుందని చెప్పాడు.
      నా అనుభవంతో అందరికి చెప్పేదేమంటే మీ సన్నిహితులు గాని,ఇలాంటి ఆలోచనలతో ఉన్నట్లు వారు చెప్పినా మీరు పసిగట్టినా ఆ ప్రయత్నాన్ని మాటలతో వాయిదా వేపించండి.అలా వారితో మాట్లాడుతూ వుంటే కొద్ది సేపటిలో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటారు.మీరు చెప్పే మాటలతో వారికి బ్రతుకు మీద ఆశ కలుగుతుంది.ఇలా తెలు సుకోలేక ఇద్దరు దగ్గరి బంధువులను కోల్పోవాల్సి వచ్చింది.ఒకరు అప్పులతో,మరొకరు సంసార సమస్యలతో.
       జీవితం ఎంత విలువైనది.విద్యార్థులయితే మంచి  marks,ranks రాలేదని తమ జీవితాలను తామే బలి తీసు కుంటున్నారు.ఆ తల్లిదండ్రుల కడుపు కోతను ఎవరు తీర్చ గలరు.జీవితాన్ని జీవించటానికే గాని అంతం చేసు కునేం దుకు కాదు.తల్లిదండ్రులు కూడా పిల్లల ఆశలను,ఆకాంక్షలను అర్థం చేసుకొని ఒకవేళ  అవి తప్పయితే వారికి స్నేహితుల్లాగా నచ్చజెప్పి ధైర్యమివ్వాలి గాని వారిని మందలించ కూడదు.వారి  సామర్ద్యాలేమిటో తెలుసుకోకుండా తమకు నచ్చిన చదువులు చదవమని వాటిలో  చేర్పించటం విపరీతమైన ఒత్తిడితో వారు ఆత్మ హత్యా చేసుకోవటం చాలా ఘోరం.విద్యాలయాలు కూడా విద్యార్ధి వ్యక్తిత్వాన్ని వికసింపజేసే విద్యనూ అందిస్తూ,వారికి జీవితం పట్ల సరి యిన అవగాహనను కల్పిస్తూ బోధించాలి.
   అలాగే విభిన్న సంసార సమస్యలు ఉన్నవారు వాటిని ఎలా అధిగమించాలో పరిష్కారాలకై,మిత్రులతో సన్నిహితు లతో చర్చించి అవసరమయితే సైకాలజిస్ట్ ల సహకారంతో పరిష్కారాలను కనుగొనాలి గాని ఆత్మహత్యలకు పాల్ప డకూడదు.అలాగే అప్పులైన వారు ఆత్మాభిమానంతో ఆత్మ హత్యలు చేసుకోకుండా I.P పెడితే పోలీసు,కోర్ట్ లు రక్షణ కల్పిస్తారు.లేదా ఆ ఊరికి దూరంగా ఎక్కడయినా బ్రతకవచ్చు.తమ అప్పులకు తమ పిల్లలను చంపి ఆత్మచేసుకునే వాళ్ళను ఏమనాలి?
    అలాగే ప్రభుత్వం కూడా సలహా కేంద్రాలు ఏర్పాటు చేసి విస్త్రుత ప్రచారం చేయాలి.ఎక్కడయినా ఈ విషయం పై help lines కేంద్రాలు ఉంటె తెలియజేయగలరు

Saturday 1 September 2012

అంతరంగ యాత్ర

                ఏకాంతంలో మనలో ఏం జరుగుతుంది?మనకు మనం దగ్గరగా ఉంటాము.మన మనసు మన గురించే ఆలోచిస్తుంది.మన లోపలి ప్రతి ఆలోచన,భావం మనకు స్పష్టంగా అర్థమవుతుంటాయి.ఇంకా ఏం చేస్తే బాగుంటుం  ది.ఏకాంతంలోమనం మన అంతరంగాన్నిశోధిస్తూ వెళ్ళాలి ఆ సాధనలోమనకు మనం పూర్తిగా అర్థమవుతుంటాము ఈ ప్రక్రియలో ఎప్పటినుంచో మన మనసులోని సంస్కారాలు,వికారాలు,మన ప్రవర్తన,మన అలవాట్లు,మనం చేసిన పనుల్లోని మంచి చెడ్డలు,మన గుణగణాలు,మన బలాలు,మన బలహీనతలు,మన లోటుపాట్లు వంటి వన్నీ అలా వరుసగా అలలు అలలుగా ఆ యాత్రలో మనకు దర్శన మిస్తాయి.ఎటువంటి విశ్లేషణలు చేయకుండా,ఎటువంటి తీర్పులు ఇవ్వకుండా వాటిని గమనిస్తూ ఉంటె మనకు మనం మరింత అర్థమవుతుంటాము.
              జీవన ప్రవాహంలో మనం ఎటు వైపు వెడుతున్నామో కూడా మనకు తెలుస్తుంటుంది.ఆ ప్రక్రియలోమనం ఇంతకు ముందు ఎవరిన యినా అనాలోచితంగా అన్న మాటలు,ఎవరినయినా ఇబ్బందులకు గురిచేసే పనులు చేసి ఉన్నాఅన్నీగుర్తొస్తాయి.మన మనసులో పేరుకుపోయిన ఎన్నోసంఘటనలు,అవి కలిగించిన ప్రభావాలు,వాటికి మన  ప్రతిస్పందనలు అన్నీ తెరపై ప్రత్యక్షమయినట్లుగా మనకు కనిపిస్తాయి.వాటిని అలాగే గమనిస్తే అందులోని సంక్లిష్టత లు మెల్లగా తొలగి పోతుంటాయి.మన జీవితంలోని ఎన్నో సమస్యలు,కష్టాలు,కన్నీళ్లు బాధలు,సుఖ సంతోషాలు ఒక టేమిటి?మన ప్రతిస్పందనలన్నీ మనకు పునర్దర్శన మిచ్చి మన అంతరంగం మనకు దృశ్య రూపం లో కన్పిస్తుంది.
             ఈ అంతరంగ యాత్రను ఎవరికి వారు చేయాల్సిందే.ఆ యాత్రను ధైర్యంగా మొదలు పెట్టిన వారికే  అందు లో వచ్చే మార్పేమిటో అర్థమవుతుంది.ఈ యాత్రకు ఎటువంటి సాధనాసంపత్తి అక్కరలేదు.తమ మనసు లోపలి పొరల్లోకి తామే ప్రయాణించటం.ఈ యాత్ర ప్రతిరోజు జరిపితే మన మనసంతా తేలిక పడుతుంది.ఇది చాలా సాధార ణంగా ఏ స్థితిలో కూర్చున్నా ,పడుకున్నాఅటు ఇటు డాబా పైనో, గార్డెన్ లోనో నడుస్తున్నాచేయవచ్చు.ఇది ఎలాగైనా మన ఏకాంతంలోజరగాల్సిన ప్రక్రియ.దీనికి ఏ విధమైన నియమ నిబంధనలు లేవు.ఎటువంటి ఏర్పాట్లు లేవు ఎప్పు డు కుదిరితే అప్పుడు చేయవచ్చు.దీనికి ఎవరి సహాయము అక్కర లేదు.దీనిని మనకు ఎవరు నేర్పవలసిన పని లేదు.
             మానసిక విశ్లేషణ కూడా మన జీవితంలో మార్పుకు ఉపయోగ పడుతుంది.కానీ దాని కంటే ఇది మరింత గా మనకు తోడ్పడుతుంది.ఈ యాత్ర నిత్యం చేస్తుంటే మనం మనకు కొత్తగా,నూతనంగా ఆవిష్కరింపబడతాం.ఆ నూతనమైన,సజీవమయిన మనసుతో కొత్త పరిస్థితులను ఎదుర్కోవటం,కొత్త సంఘటనలకు మన మనసు ప్రతి స్పందనలు విభిన్నంగా ఉంటాయి.ఎదుటి వారికి మనం కొత్తగా కనిపిస్తాము.ఇంటిలో,బయటా మనతోఉండే వారిపై ఈ ప్రభావం పడుతుంది.అందులోనుండే అవగాహనతో కూడిన,స్నేహ పూరిత మైన,ప్రేమతో కూడిన మానవ సంబం ధాలు ఏర్పడతాయి.మనిషి జీవిత మంతా ఇతర వ్యక్తులతో అతని ప్రవర్తన మీదనే అతని వ్యక్తిత్వం అంచనా వేయ బడుతుంది.మనం సంఘ జీవులం కనుక ఈ సంఘంలో అందరితో కలిసి మెలసి మెలగ వలసిందే. ఈ మారిన మన సుతో మన చుట్టూ ఉన్నవాతావరణం మనకు మరింత ఆహ్లాదంగా కనిపిస్తుంది.మన లోని మార్పు ప్రభావం పరిస రాలపై కుడా పడుతుంది.మన మనసులో కలిగే ఆనందం ఇంకొకరికి ప్రసారం అవుతుంది.   

Sunday 26 August 2012

ఏకాంతం


              ఒంటరితనం నుండి బయట పడే మార్గాల గురించి చర్చిస్తూ మనం ఏకాంతంలో మన అంతరంగ స్థితిని గమనిస్తూ గడపాలి అనుకున్నాము.మరి ఏకాంతం అంటే ఏమిటి?ఒంటరితనానికి ఏకాంతానికి గల తేడా ఏమిటి?అన్న విషయాలు పరిశీలిద్దాము.తోడు లేక పోవటం,నిర్లక్ష్యం చేయబడటం,దగ్గరివారు వదలి వెయ్యటం,ఎవ్వరు పట్టించుకోక పోవటం,విస్మరించబడటం,అందరితో సంబంధాలు తెగిపోవటం,దగ్గరి వారు మరణించటం ఇలా ఎన్నో రకాల స్థితులలో మనిషికి కలిగే భావమే ఈ ఒంటరితనం.ఒక రకంగా ఇవన్నీ మనిషిని వేదనకు గురిచేసేవే!వాటినుండి బయట పడటానికి ఏకాంతాన్ని కూడా ఒక మార్గంగా ప్రస్తావిం చుకున్నాము.
      మరి ఏకాంతం అంటే ఏమిటి?ఎవరితోనూ,దేనితోను కలవని స్థితి .మనం ఈ ప్రపంచం లోకి ఎలా వచ్చాము?ఒక్కరిగానే వచ్చాము కదా!కవల పిల్లల విషయంలో తప్ప.అలాగే మరణంలోకూడా మన కెవ్వరు తోడు రారు కదా!మరి మధ్యలో ఉన్న జీవితమంతా ఏ విధంగా గడుపుతున్నాం.
                     ఒక్కరయి రావటం....ఒక్కరయి పోవటం నడుమ ఈ  నాటకం ,విధి లీల.........
పాటలాగా!చిన్నప్పుడు అమ్మానాన్నలు,బంధువులు,,తరువాత స్నేహితులు ,భార్య ,పిల్లలు ఇరుగు పొరుగు సమాజంలో ఎంతో మంది మన జీవితంలోకి ప్రవేశిస్తారు.ఈ సంబంధాలలో ఎన్నో కష్టాలు,బంధాలు వాటన్నటి నుండి ఏర్పడే ఒంటరితనాన్ని పరిశీలించాం .కాని మనిషి ఈ అన్ని సంబంధాలలో ఉంటూ  వాటినుండి కలిగే అన్ని సమస్య లను నిమిత్తమాత్రంగా చూస్తూ ఉండగలడా!ఉండలేడు.ప్రతి సంబంధం సృష్టించే సుఖాలను,సంతోషాలను ,బాధలను ,కన్నీళ్లను,కష్టాలను,ఈర్ష్యా అసూయలను,కోపం,ద్వేషాలను ఆశలను,కోరికలను దురాశ ,దుఖాలను,భయాలను అన్నింటిని గురించి ఆలోచిస్తూ సంఘర్షణకు గురి అవుతూ మనసు ఒంటరితనానికి లోనవుతూ ఉంటుంది .దీన్నుం డి తప్పించుకోవటానికి రకరకాల పలాయన మార్గాలను మనసు అన్వేషిస్తుంది.ఒంటరితనంలో పుట్టే భయాన్నుండి తప్పించుకోవటానికి ఎన్నుకునే మార్గాలు మరింత బాధకు గురిచేస్తాయి.
         మరి వాటినన్నింటిని తప్పించుకోవటం కాకుండా పై పరిస్తితులన్నింటిని అర్థం చేసుకొని అవగాహనతో ఆ పరి స్థితులకు తగ్గట్లు స్పందిస్తూ ఎవరికివారు తమకు సంబంధించిన తమ లోకాన్ని ఒక దానిని సృష్టించుకుంటే ఎలా ఉంటుంది?ఆ స్థితి దేని నుండి పారిపోతే వచ్చేది కాదు.తన పరిస్థితిని తాను అర్థం చేసుకొని మనసును పై అన్ని క్లేశా ల నుండి  దూరంగా ఉండే స్థితిని కల్పించు కోవటం,అన్నిరకాల బందాలలోని బాధనుండి ,అన్ని రకాల భయాల నుండి,మన మనసును కట్టడి చేసే రకరకాల ప్రతిబంధకాలనుండి స్వేచ్చను కల్పించే ఆ స్థితిని మనకు మనం సృష్టించుకుంటే ఎలా ఉంటుంది.అంటే మనతో మనం గడపటంతో ఇది సాధ్యమవుతుంది.
          ఎప్పుడూ ఎవరో ఒకరితో మాటలాడుతూ,లోకాభిరామాయణం ముచ్చటిస్తూ ,మన కష్టాలు బాధలు,సంతో షాలు పంచుకునే వాళ్ళుఎవరు దొరుకుతారా అని ఎదురు చూసే బదులు మన మొత్తం మనసులో జరిగే ప్రక్రియల ను మనం అర్థం చేసుకుంటే అప్పుడు మన మనసులోకి ఓ ఏకాంత సౌందర్యం ప్రవేశిస్తుంది.అది ఒంటరి తనం లాంటి ది కాదు.ఊహ తెలిసినప్పటినుండి మరణించే వరకు మనకు తోడు ఎవరుంటారు.మన మనసే కదా ఉండేది!  దానిని ఎప్పుడు ఎవరో ఒకరి ఆలోచనలతో నింపే బదులు దానిని మనతోనే ఉండనిస్తే! ఆ ఉండటంలో ఓ ప్రశాంత చిత్తం ఏర్ప డుతుంది మనల్ని గురించి మనం సంపూర్ణంగా ఆవగాహన చేసుకున్న స్థితి.మనలో ఉన్న బలాలు,బలహీనతలు మనలోని వక్రత,సక్రమత మన లోపాలు అన్నీ అర్థం అయిన స్థితి.
        ఆ స్థితిని మనకు మనం కల్పించుకుంటే ,అంత సమయాన్ని మనకు మనం ఇవ్వగలిగితే మన మనసు అద్భు తాలు సృష్టించదా !అందులోంచి ఉల్లాసం ఆహ్లాదం ఉద్భవిస్తాయి.ఏ బంధానికి చిక్కుకోని స్థితి,ఎవరిపై ఆధార పడనీ  స్థితి,ఓ స్వేచ్చా ప్రపంచం,మనదైన లోకం.చిన్నప్పటి మనలోని అమాయకత్వం స్వచ్చత ,సున్నితత్వం మనసులో ఉద్భవించి మన కళ్ళల్లోకి ప్రవహిస్తుంది.అప్పుడు ఆ ఏకాంత సరోవరంలో పూసే ఆనంద కలువల పరిమళం మది నిండా ఆవరించటం మన అనుభవంలోకి వస్తుంది.ఏటిగట్ల వెంట ఉదయపు వ్యాహ్యాళి,సాయంత్రపు నడకలు,పార్కు ల్లో మనం ఏకాంతంగా గడపటం,కాలువ గట్ల వెంట పంట పొలాలలో,నదుల ఒడ్డున ఎవరికీ వీలయినచోట వారు ఈ ఏకాంతాన్ని సృష్టిం చుకుంటే,అన్నింటికీ మించి మన ఇంటిలోనే మనం కల్పించుకునే ఈ ఏకాంతం మనలో మానసిక పరివర్తనకు దారి తీస్తుంది.ఆ పరివర్తనలోనే ఓ దివ్యానందం ఉద్భవిస్తుంది.

Wednesday 22 August 2012

ప్రాణ సఖా!


ప్రాణ సఖా!నా ఉచ్చ్వాసము మన ప్రేమ అయితే
నా నిశ్వాసము అంతా నీ పై నా విరహమే
నా హృది నిండా నీ పై నా
అనురాగం పలికిస్తూనే ఉంటాను
అప్పటికీ నీ నాదం నా దరికి చేరకపోతే
నా ధమనుల్లోని ప్రతి కణాన్ని అద్ది
మనసు స్పృహ తప్పనంతవరకు
మన ప్రేమ భాషనే కురిపిస్తుంటాను
సంధ్య వాకిట్లో నిలబడి
పున్నమి చంద్రునికి విన్నవిస్తున్నా
నీ సఖి ఇక్కడ విషాద సితార తంత్రుల్ని
"రవిశంకర్"కన్నా మనోహరంగా మీటుతుందని
నీ చెలి ఇక్కడ నీ రూపాన్ని వందల చిత్రాల్లో
"రవివర్మ" కన్నా  అద్భుతంగా చిత్రిస్తుందని
నీకు చెప్పమని వేడుకుంటున్నా
ప్రభూ నీ కోసం ఎదురు చూస్తున్నా
రేపు తూరుపు పగడపు కొండల నడుమ నుండి
ఉదయించే ఉషస్సులను మోసుకొస్తావని

Sunday 19 August 2012

ఒంటరితనం నుండి బయటపడటం ఎలా?(2)



            విద్యార్ధి దశలో స్నేహం ,ప్రేమ ఈ రెండింటి విషయంలో చాలా మంది ఎన్నోసమస్యల బారిన పడుతుంటారు. చదువు కంటే ఈ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత నివ్వటం వలన ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి.మంచి స్నేహి తులు ఒకరిద్దరు ఉండటంలో తప్పు లేదు కానీ స్నేహం ప్రేమలతో కాలమంతా దుర్వినియోగం చేయటం తగదు. స్నేహితుల మధ్య మనస్పర్ధలతో ఎడం కావటం,అందులో బాధలు ఎక్కు వగా ఇష్ట పడ్డవాళ్ళు దూరం కావటంవంటి సంఘటనల్లోనుంచి విద్యార్థులు ఈ సమస్య బారిన పడతారు అలాగే ప్రేమలు కూడా!స్నేహమో,ఇష్టమోప్రేమో అర్థం కాక అర్థం చేసుకునే సరికి కాలం కరిగిపోయి దూరమై పోయే సరికి బాధతో కూడిన ఒంటరితనానికి లోనవటం జరు గుతూ ఉంటుంది.విద్యార్ధి దశలో ఈ సమ స్యలనుండి బయటపడాలంటే చదువును ఇష్ట పడుతూ,ఉన్నత మైన లక్ష్యం ఏర్పరుచుకొని ముందుకు వెడుతూ ఉంటె ఈ ఇబ్బంది నుండి బయట పడవచ్చు.ఒక వేళ ఈభావనలోఉన్నా తల్లి దండ్రులను ఒక్క సారి గుర్తు చేసుకొని వారికంటే మిమ్మల్ని ప్రేమించే వారు ఎవరు ఉండరని  తెలుసుకొని మాన సిక ధైర్యం  తెచ్చుకొని కొత్త ఉత్సాహంతో చదువు మీద ఏకాగ్రత పెంచుకోవాలి.ఇలా చదివితే మంచి ఉద్యోగాలు లభిం చటం జీవితంలో ఏదో ఒక రంగంలో స్థిరపడటం వలన నిరుద్యోగ సమస్య దాని లోని బాధలు అనుభవించే పరిస్థితి తప్పిపోతుంది.
        ఇక సంసారంలోకి ప్రవేశిస్తున్నప్పుడే జీవిత భాగస్వామిని,సరిగా అర్థం చేసుకుంటూ ఇద్దరు పంతాలకు పట్టిం పులకు పోకుండా పిల్లలను చక్కగా పెంచుకుంటూ ఆనందకరమైన జీవితాన్నిగడపగలిగితే ఈ సమస్యలు రావు అలాగే ఆరోగ్యం పట్ల ముందు నుండి జాగ్రత్త వహిస్తూ ఎవరికి సరిపోయిన వ్యాయామం వారు చేస్తూ ఫలితాలిచ్చేఆరో గ్య విధానాలు పాటిస్తూ వృద్ధాప్యంలో ఏ జబ్బులు రాకుండా మంచానపడ కుండా తమ సంతానం మీద ఆధార పడ కుండా తిరుగుతూనే జీవనయాత్రను చాలించగలిగితే ఆ జీవితం ఎంత అద్భుతం.
          ఒంటరితనం నుండి పారిపోవాలని రకరకాలయిన అలవాట్లకు లోనయి జీవితాన్ని నరక ప్రాయం చేసుకునే వాళ్ళెంత మందో! చక్కటి సంగీతం వినటం,నేర్చుకోవడం ,మంచి పుస్తకాలుచదవటం అద్బుతమైన ప్రదేశాలు చూడ టం,ప్రకృతిని ఆరాధించటం ,మొక్కల పెంపకం,తోటపని,సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం,ఏకాంతంలో అంతరంగాన్ని విశ్లేషించుకోవటం ద్వారా ఈ ఒంటరితనాన్ని నుండి బయట పడ వచ్చు.మన అంతరంగాన్నిసానుకూల విషయాల వైపు మల్లిస్తూ వాటిల్లో పాల్గొంటూ ఉంటె  ఈ భావనను దూరం చేసుకోవచ్చు.

Wednesday 15 August 2012

ఒంటరితనం (1)



         ఈ భావన మనకెప్పుడు వస్తుంది? చిన్నతనంలో తల్లిదండ్రుల సమక్షంలో కాలం గడిచిపోతుంది. మన సంర క్షణ అంతా వారే చూసుకుంటారు కాబట్టి.మరి తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పరిస్థితి ఏమిటి? తల్లిదండ్రుల ప్రేమ ను ఎవరు భర్తీ చేయగలరు? ఆ పిల్లల మనస్సులో ఏర్పడిన వెలితిని ఎవరు పూరించగలరు.వారిలోకలిగే ఒంటరి భావనను ఎవరు దూరం చేయగలరు?చాలా స్వచ్చంద సంస్థలు ఇక్కడ కొంతవరకు వారిని ఆదుకుంటున్నాయి. ఎదుగుతున్న క్రమంలో యుక్త వయసులో తమ భావాలను పంచుకోవటానికి స్నేహితుల అవసరం ఏర్ప డుతుంది స్నేహంలోవచ్చే సమస్యలు,అపార్థాలు,విడిపోవటాలు,సరి అయిన స్నేహితులు దొరకకపోవటం అందులో ఏర్పడే ఒంటరితనం మరో సమస్య.ఇక ప్రేమించటం,ప్రేమింపబడకపోవటం,ప్రేమలోఉన్నంత కాలం అదో సంఘర్షణ కలుసు కోవాలని,మాట్లాడుకోవాలని ఉంటుంది.కలిసే సమయం కుదరక అవకాశాలు రాక విరహంతో కూడిన ఒంటరితనం అభిప్రాయ భేదాలతో,పెద్దల జోక్యంతో విడిపోయినప్పుడు, ప్రేమ విఫల మైనప్పుడు మరల ఏర్పడే ఒంటరితనం దీనిని తట్టుకున్న వారు జీవితంలోముందుకు వెడతారు,తట్టుకోలేని వారు చదువు పాడు జేసుకుని నిష్ప్రయోజకులుగా మిగిలి పోవటం లేదా ఆ ఒంటరితనం నుండి వచ్చిన depression తో ఆత్మ హత్యకు పాల్పడటం.
      ఇక పోతే చదువులు ranks,లక్ష్యాలు,నరాలు తెగే పోటీ !చివరకు సాధించే వారు కొద్ది మంది మాత్రమే!మిగిలిన వారి పరిస్థితి.సాధించలేక పోయామన్న బాధ ,ఏదో కోల్పోయిన భావన,ఓటమిని పంచుకోలేక ఎవరితో కలవలేని ఒంటరితనం.ఏదో ఒక కోర్సు అయిపోగానే ఉద్యోగాల వేట!నేర్చుకున్నదేదీ ఉద్యోగానికి పనికి రాక కొత్తగా వేల కొద్ది ఫీజులతో మరల శిక్షణలు!ఉద్యోగం కోసం విపరీతమైన పోటీ. ఫలితం శూన్యం.వందల ఉద్యోగాలు,లక్షల్లో అభ్యర్థులు చివరికి ఏమీ సాదించలేక మనస్సంతా భవిష్యత్తు పట్ల భయం .. ఒంటరితనం. చిన్నచిన్న ఉద్యోగాల్లో చేరినా అసం తృప్తితో తల్లిదండ్రుల ముందు స్నేహితుల ముందు తలెత్తుకోలేక ఎవరితో పెద్దగా కలవక లేక కలిసినా ముభావంగా ఉండటం మనసును ఒంటరితనం ఆక్రమించుకున్న చిహ్నం.
         జీవితంలో విజయంతోనో,చిన్నపాటి ఉద్యోగాలతోనో,వ్యాపారాలతోనో ఏదో ఒక పనిచేసుకుంటూనో వివాహం చేసుకోవాలి కాబట్టి సంసారంలో అడుగు పెట్టటం జరుగుతుంటుంది.అర్థం చేసుకుని ఆనందంగా జీవించే జంటలు కొన్నైతే అర్థం చేసుకోలేక ఆర్ధిక సమస్యలతోకొన్ని జంటలు, ఆర్థికంగా బాగా వున్నా అహం సమస్యలతో కాపురం చేస్తున్నా భయంకరమయిన ఒంటరితనం.ఇక వివాహ వయసు దాటిపోయి పెళ్లి చేసుకోలేక పోవటం,వధువు,వరు డు దొరకకపోవటం పెళ్లి కాకుండా జీవితంలో ఒంటరిగా ఉండి పోయేవారి పరిస్థితి మరో రకం.వారికి తాము నిర్లక్ష్యం చేయబడ్డ భావన ,ఎవరు పట్టించుకోలేదని విచారం కలుగుతుంటుంది.ఇక జీవితం స్థిర పడే దశలో విభిన్న ఉద్యో గాలు,వ్యాపారాలు రకరకాల ప్రయోగాలు చేసి ఎన్నో కష్ట నష్టాల కోర్చినా ఎదుగు,బొదుగు లేని జీవితం వెనుదిరిగి చూసుకుంటే ఏమీ లేదు.భవిష్యత్తు ఆశాజనకంగా లేక ఇంటా బయటా సమస్యలతో మనిషిని కమ్ముకునే ఒంటరి తనం.
                  విలాసవంతమైన జీవితం గడుపుతున్నా ,పరిస్థితులతో సర్దుకుంటూ పరిమిత జీవనం గడుపుతున్న
ఏర్పడే ఆరోగ్య సమస్యలు ,కుటుంబ సభ్యుల నిరాదరణ ,పిల్లల సమస్యలు, నిర్లక్ష్యం చేయబడుతున్నామన్నభావన పిల్లలు పట్టించుకోవటం లేదన్న దిగులు భర్త నిరాదరణ,భార్య నిరాదరణ ఇలాంటి పరిస్థితిలో నాకెవ్వరు లేరన్న భావంలోనుంది వచ్చిన ఒంటరితనం.
     డబ్బు ఉన్నా లేకున్నా మనిషిని జీవితం చివరి దశలో ఆవరించే ఈ ఒంటరితనాన్ని,జీవితమంతా ఏదో ఒక దశలో ప్రతిమనిషి అనుభవించే ఈ ఒంటరితనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి?
                                                          (మిగతా తరువాతి భాగంలో )

Tuesday 14 August 2012

పచ్చని అడవి

        వర్షాకాలం వచ్చిందంటే చిన్నప్పుడు ఎంత ఆనందంగా ఉండేదో!కాగితపు పడవలు,చేసి పారే నీళ్ళల్లో వదిలి కోలాహలంగా వాటి వెంట పరుగు తీసే వాళ్ళం .చిన్న చిన్న పిల్లకాలువలకి ఆనకట్టలు(చిన్నవే) కట్టి వాటిలో అగరుబత్తీలకు వచ్చే కడ్డీ లను తూములుగా అమర్చి దానిగుండా పారే నీటిని చూస్తూ ఎంత ఉత్సాహంగా వుండే వాళ్ళమో! వడగళ్ళ వాన పడితే వాటిని చేతుల్లోకి తీసుకొని ఐస్ అంటూ ఆడుకునే వాళ్ళం.అప్పటికి ఈ ఫ్రిజ్ లు  లేవు.కొని తినే ఐస్ లు మాత్రమే తెలుసు.ఇక ఇప్పటి వర్షాకాలంలో  పిల్లలు ఏమీ ఆటలు ఆడటం లేదు. మనమే మన పిల్లల్ని తడవనీయటం లేదు జలుబు చేస్తుందని.ఈ మధ్య రాష్ట్రం లో వర్షాలు బాగానే పడ్డాయి కానీ  projects లకి ఇంకా నీరు రాలేదు.శ్రీశైలంకు  వస్తున్నాయని అంటున్నారు.ఎప్పుడొస్తాయా వెళ్లి చూద్దామని ఉంది. ఈ లోపల ఒకసారి మహానంది వెడితే ఎలా ఉంటుందా అని అనిపించింది.
         మార్కాపూర్ (మేము ఉండే వూరు )నుండి నంద్యాల వెడుతూ నల్లమల అడవి అందాలు చూస్తుంటే తన్మయత్వంతో పులకించి  పోయాము.కొన్ని లక్షల వృక్షాలు పచ్చగా చిగురించి ఆకు పచ్చని తివాచిని పరిచినట్లు ఎంత హొయలు పోతున్నాయి.ట్రైన్లో  వెడుతూ చూస్తూఉంటే  చెట్లన్నీ రారమ్మని ఆహ్వానిస్తున్నట్లు ఊగుతూ  పలకరించాయి.ఎన్ని రకాల చెట్లని.పేర్లన్నీ  సేకరించి మరోసారి  వ్రాస్తాను,ఎందుకంటే అన్ని చెట్ల పేర్లు తెలియవు మరి.రైలు మెలికలు తిరుగుతూ వెడుతుంటే చెట్లన్నీ టాటా చెబుతూ వెనుకకు పరిగెడుతూ ఉన్నాయి.దిగువ మెట్ట  దగ్గర కాసేపు ఆపుతారు,ట్రైన్ కు నీరు పట్టు కోవాలని.మీకో విచిత్రం తెలుసా!ఇక్కడ అన్ని రైళ్లకు పట్టే నీరంతా దగ్గరి కొండమీదనుండి సంవత్సరమంతా వస్తూ ఉంటుంది.కొండ పైన ఒక చోటనుండి నీరు ఉబికి వస్తుంటే అక్కడ బ్రిటిష్ వారు వేసిన పైపులనుండి క్రిందికి వస్తాయి.ఇక అక్కడి నుండి ముందుకు వెడితే పచ్చర్ల స్టేషన్ లో కొద్ది సేపు రైల్  ఆగుతుంది.ఇది అడవి మధ్యలో ఉంటుంది.అక్కడ తనివి తీరా ప్రకృతి అందాలను ఆస్వాదించ వచ్చు.మబ్బులు కొండల అంచును తాకుతూ వెడుతుంటాయి.
     ఇక దాని తర్వాత మొదటి సొరంగం వస్తుందండీ.ఇక ట్రైన్ అంతా ఒకటే కేకలు.లోపల ఒక మూడు నిమిషాల ప్రయాణం .లైట్స్ ముందే వేస్తారు.వేయకపోతే చిమ్మ చీకటి పగలే.అది దాటినా తరువాతంతా అడవే.ఇక్కడే చాలా సినిమాలు తీసారు.p.v.నరసింహారావు గారి హయాం లో దీనిని అభివృద్ది చేసారు.ఇక అలా అడవిని దాటుకొని నంద్యాల వెళ్లి తరువాత మహానంది వెళ్ళాము.ప్రకృతి ఎంత అందంగా అలంకరించుకొని అక్కడ నాట్యం చేస్తుందో చూడాలంటే రెండు కళ్ళు చాలవు.ఆ గుడిలో సహజ సిద్ధంగా వచ్చే నీటితో ఒక కొలను లోపల, రెండు కొలనులు బయట ఏర్పాటు చేసారు.వాటిల్లో ఈత కొట్టటం మరపురాని అనుభవం.చాలా సార్లు వెళ్ళినా వెళ్ళిన ప్రతి సారి కొత్తగా ఉంటుంది.ఇక్కడ వచ్చే నీరు బయటికి వదులుతారు.వీటి సహాయంతో వందల ఎకరాల అరటి తోటలు  పండుతాయి గుడిలో దర్శనం  అయిన తర్వాత గుడి వెనుకే అడవి.అడవిలో కొద్ది దూరం నడిచి చెట్లను చేతులతో తట్టి పలకరించి వచ్చాము .కానీ ఇక్కడ కొండకు దిగువగా గుడి వెనకాల ఒక మంచి ఉద్యాన వనం ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుందో!
      అలాగే అక్కడ ఒక హెలిపాడ్ ఏర్పాటు చేసి అందులోహెలికాప్టర్తో  నల్లమల అడవంత చూపించే  ఏర్పాటు చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా!అడవిని పైనుండి చూడటం ఎవరికీ సాధ్యం కాదు కదా!నల్లమల  అడవి ప్రపంచం లోనే పేరెన్నికగన్నది.దీన్ని కాపాడుకోవటం మనందరి బాధ్యత.అలాగే ప్రభుత్వం కూడా ఇక్కడి చెట్లు కొట్ట నీయకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి .ఈ కాలంలో ఓ సారి  అక్కడికి ఒక సారి వెళ్లి రండి.

Friday 10 August 2012

ఓ ప్రియ నేస్తమా!


ఓ ప్రియ నేస్తమా!
మాట వినని ఈ మనసునేం చేయను ?
నీ కోసం శ్రుతి చేసిన రాగాన్ని
పంపుదామన్న ఈ గాలి ప్లవించదేం    
నీ మౌన వీణా తంత్రులను
మీటుదామన్నా వీలు కాదేం
నిర్ఝర ఝరీ తరంగ ప్రవాహంలా
మధుర స్నిగ్ధ హ్రుదయినిలా
వ్యక్తమయ్యే నీ అవ్యక్త భావనలు
మౌనం ఒడిలో కునుకు తీస్తున్నాయేం
ప్రభాత  స్వప్నంలో నీవు కనిపించావు  అంటే
నీ దరహాస వదనం దర్శనం అవుతుందా!
ఏమిటో చెలి మన ప్రేమ
నా కవిత్వంలో చిందులు తొక్కుతుంది
మరేమిటో సఖీ !మధురానుభూతివి నీవే
అందమైన జ్ఞాపకానివి నీవే
నీ పట్ల కనబరిచే నా భావనలు
ఎంతకీ తరగని స్మృతులు మరి
ఇంకేం వ్రాయను ?వెలుగు వెనుక సంధ్య
సంధ్య వెనుక వెన్నెల విరబూస్తుంది
వుంటాను మరి
నీ జ్ఞాపకాల విత్తుల్ని ఏరుకుంటూ

Monday 6 August 2012

అహంకారం తొలగించుకోవడం ఎలా?(ముగింపు)


           ఈ వ్యాసాలు ఎంతోమంది వ్యక్తులను ఎన్నో సందర్భాలలోగమనించిన తరువాత వాటినన్నింటిని క్రోడీకరించి నాకు తెలిసినంత వరకు విశ్లేషించాను.ఇవే పూర్తిగా 100% సరి అయినవి అని నేను అను కోవటం లేదు.ఇంకా ఎంతో మందికి ఎంతో సమాచారం ఈ విషయంపై తెలిసి  ఉండవచ్చు.వారికి సదా స్వాగతం.సద్విమర్శకు ఎప్పుడూ ఆహ్వా నం పలుకుతాను.ఈ వ్యాసాలూ ఏ ఒక్కరినో ఉద్దేశించినవి కావు. ఎవ్వరినీ నొప్పించాలని వ్రాయలేదు.నాకు ఎదురైన అనుభవాలను,ఎంతో మంది అహంకార లక్షణాలు గల వ్యక్తులను గమనించిన తరువాత,ఈ అహంకారం ప్రదర్శిం చిన వారివలన బాధలు పడిన వారితో మాట్లాడిన మేరకు మరియు నా మీద ఈ భావనతో మాట్లాడిన వ్యక్తుల వలన కలిగిన అనుభవాలు అన్నింటిని కలిపి వ్రాసాను.నా పట్ల ఈ భావంతో మాట్లాడిన వారికి అప్పుడే ఇవే విషయాలు ఓపెన్ గా స్పష్టంగా చెప్పాను.ఇప్పుడు కొత్తగా ఏమీ వ్రాయలేదు.కాకపోతే ఆ అనుభవాలు ఈ అహంకారం శీర్షిక క్రింద చేర్చాను.ఒక వేళ అటువంటి వారెవరైనా ఇది చదివి నొచ్చుకుని ఉంటె క్షంతవ్యుడిని.ఇక్కడ  గమనించాల్సిన విష య మేమనగా ఈ వ్యాసాలూ చదివి వారు నొచ్చుకున్నారంటే మరి వారి మాటలకు నొచ్చుకున్న వారు,లోలోన బాధపడ్డ వారెంత మందో కదా!ఈ అహంకారంతో కూడిన మాటలతో బాధ పడ్డ వారు తమ భావాలు వ్యక్తపరిస్తే అది ప్రదర్శించిన వారి వైఖరిలో సహజంగా మార్పు రావాలి.కానీ అలా కాకుండా మరల తిరిగి అలాంటి భావాలను ప్రదర్శించడం సరికాదేమో!దానిని వారి విజ్ఞతకే వదిలి వేస్తున్నాను.విషయం వరకే తీసుకోవాలిగానీ ఎవరు వ్యక్తి గతంగా తీసుకోకూడదు అని నా భావన. అటువంటి వారు వ్రాసిన సందర్భంకాని వ్యాఖ్యలను తొలగించక తప్పని పరిస్థితి.
      మొదటే చెప్పినట్లు ఈ బ్లాగులో వ్రాసే వ్యాసాలూ ఎక్కువ భాగం మనిషి ఆనందంగా జీవించడం కోసం ఉద్దేశిం చినవే!ఈ విషయం నా గత వ్యాసాలూ చదివితే మీకే అర్థమవుతుంది.
           ఇక మిగిలిన అహంకార లక్షణాలు తొలగించుకోవాలంటే మన హృదయాల్లో మనస్సులో కాస్త స్నేహభావం ప్రేమ నిండి వుంటే చాలు.సాటి మనిషిని మాటలతోబాధించకూడదు అన్న స్పృహ ఉంటె చాలు.అంతే కాకుండా ప్రతి రోజు మనం నిద్రించే లోపు ఆ రోజు మన ప్రవర్తన ద్వారా,మన మాటల ద్వారా ఎవరినయినా నొప్పించామా అన్న ఆత్మ పరిశీలన చేసుకుంటే ఈ అహంకారం దానంతట అదే తొలగి పోతుంది.ఈ విషయాలు అన్ని నిరక్షరాస్యులు కూడా పాటిస్తుంటారు.వారు ఎంతో దయకలిగి ఎవ్వరినీ బాధించకుండా మాట్లాడుతుంటారు.వారి అమాయకత్వాన్ని ఎంతో మంది వాడుకుంటూ వారిపట్ల ఈ అహంకారాన్నిప్రదర్శిస్తుంటారు.రాజకీయ నాయకులు,ప్రజలకు సేవ చేయాల్సిన పదవుల్లో ఉన్న వారు ప్రజలకు అందాల్సిన వాటినన్నిటినీ తామే స్వాహ చేస్తూ వారి పట్ల ఎంతో అహంకార పూరితంగా వ్యవహరిస్తుంటారు.ఆ అహంకారానికి గురయిన వారు నా కంటే చాలా  బాగా ఈ విషయాల గురించి చెప్పగలరు,ఎందుకంటే ఆ బాధలు పడ్డ వారు కాబట్టి .
     జీవితం ఎంతో చిన్నది.చాలా అందమైనది.ఎంతో సరళ మైనది.కానీ మనిషి దాన్ని ఎందుకో ఇంత క్లిష్టంగా మార్చుకుంటున్నాడు.జీవితం చివరి దశలో వెనుదిరిగి చూసుకుంటే ఎంతో త్రుప్తి కలగాలి మనసంతా ఆనందంతో నిండిపోవాలి.సంపూర్ణ మైన జీవితం గడిపినందుకు సంతృప్తితో చెట్టు నుండి ఆకు రాలినట్లు రాలిపోవాలి.ఎంతో అందమైన,అద్భుతమైన జీవితాన్ని గడిపేందుకు ఉన్న అన్ని రకాల అడ్డంకులను అధిగమించేందుకు మనిషి మానసికంగా,సామాజికంగా మంచి మార్పులకై నిరంతరం  అన్వేషించాలి.

Saturday 4 August 2012

జ్ఞానం వలన కలిగే అహంకారం (6)


         మనం జన్మించినప్పటి నుండి ప్రతి విషయాన్ని పంచేంద్రియాలయిన చెవులు,ముక్కు,నోరు,నాలుక,చర్మ ములతో గ్రహిస్తూ ఉంటాము.ఇలా ప్రతి విషయం మన మెదడు పొరలలోనిక్షిప్తమయి ఉంటుంది.పై ఐదింటిని జ్ఞానేం ద్రియాలు అని కూడా అంటాము.పై సమాచారాన్ని విశ్లేషించుకొని మెదడు తన పొరలలో నిక్షిప్తం చేసుకుంటుంది. ఇంకా మనిషి అనుభవాల ద్వారా,సమాజాన్ని చూడటం ద్వారా ,చదువు ద్వారా విభిన్న మయిన పుస్తకాలు చదవ టంద్వారా ,వార్తాపత్రికలు,టి.వి ,కంప్యూటర్(ఇంటర్నెట్),సినిమాలు,రాజకీయాలుద్వారా తను చేసే పనుల ద్వారా నేర్చుకున్న విషయాలు మెదడులో నిక్షిప్తం అవుతాయి.అలాగే ,కుటుంబం,సమాజంతోకలిసి ఉండడం ద్వారా వ్యవ హారధోరణి,ప్రవర్తన,వంటివి ఏర్పడుతుంటాయి.
         ఇలా మనిషి పోగుచేసుకున్న జ్ఞానం అంతా మనిషి మాటల్లో,చేతల్లో, ప్రవర్తనలో వ్యక్తమవుతూ ఉంటుంది.ఈ వ్యక్తమయ్యే జ్ఞానం ఎక్కడ ఎంతవరకు అవసరమో అంత వరకు ఉపయోగిస్తూ,పనులు సమర్థవంతంగా పూర్తి చేసే వారు కొంతమంది,అవసరం లేని చోట తెలివి ప్రదర్శించటం,తనకే ఎక్కువ తెలుసు అనుకోవటం,ఎదుటివారిని అజ్ఞా నులుగా  భావించటం,అన్నీ తెలిసినట్లుగా మాట్లాడటం,ఎదుటివారిని అవమానించేలా మాట్లాడటం,నేనే కరెక్ట్ అను కోవటం,ఎదుటివారు చెప్పేది సరికాదు అనుకోవటం ,అసలు సరిగా వినకపోవటం ఇవన్నీ జ్ఞానం ద్వారా వచ్చిన అహంకారంగాపరిగణించవచ్చు.ఇందులోమళ్ళీ రెండు రకాల వ్యక్తులు ఉంటారు.1)మొదటి రకం ఏదయినా ఒక అంశాన్ని కాస్త ఎక్కువగా తెలుసుకొని ఇక ఈ విషయంలో నాకు ఎదురులేదు అనుకునే వారు,2)అన్ని విషయాలు కొద్దికొద్ది గా తెలుసుకొని అరకొర జ్ఞానంతో మాట్లాడేవారు.
      ఎక్కువగా చదువుకున్నవారిలో ఈ రకమైన ధోరణులు మనం చూడవచ్చు.అసలు జ్ఞానం నిరంతరం మారుతూ ఉంటుంది.మానవ పరిణామ క్రమములో సైన్సు ఈ స్థాయికి వచ్చిందంటే ఎప్పటికప్పుడు మారుతున్న జ్ఞానం ఆధా రంగానే సాధ్య పడింది.ఒకప్పటి జ్ఞానం నిన్న లేదు.నిన్నటి జ్ఞానం ఈ రోజుకి పనికి రావటం లేదు. ఈరోజు జ్ఞానం రేప టికల్లా మారిపోతుంది.అదేవిధంగా మానసిక రంగంలో కూడా కొన్నివేల సంవత్సరాలనుండి నిరంతర మార్పులు చోటుచేసుకుంటున్నాయి.ఒకప్పటి నమ్మకాలు,అవగాహన నేడు మారిపోతున్నాయి.ఇంత వైవిధ్య భరితమైన మానవ జీవితంలో జ్ఞానం ఆధారంగా అహంకారం ప్రదర్శించటం సముచితం కాదు.
        ఏదయినా ఇలా అహంకారం ప్రదర్శించే వ్యక్తులు ఇలా ఆలోచిస్తే బాగుంటుందేమో!ఈ ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కీ మొత్తం జ్ఞానం తెలిసే అవకాశం లేదు.మనిషి జీవనానికి అవసర మైన విభిన్నవృత్తుల ద్వారా లేదా ఆసక్తుల ద్వారా మనం కొంత జ్ఞానాన్ని ఆర్జిస్తాం .కొంత మంది కొన్నివిషయాల్లో మాస్టర్ డిగ్రీలు,Phd చేసిన ఆ తర్వాత కొంత కాలానికి అదే విషయంలో ఎంతో నూతన జ్ఞానం కనుగొన బడుతుంది.కాబట్టి ఏ విషయంలో నైనా నాకు అంతా తెలు సు అనిగాని,నాకే తెలుసు అనిగాని,ఎదుటి వ్యక్తులు చెప్పేదంతా తప్పుఅనిగాని భావించేవారు ఒక్క సారి ఆలోచిం చండి.ఈ విశ్వంలో మన భూమి ఒక ఇసుక రేణువుతో సమానం.దానిలో ఉన్న 700 కోట్ల మందిలో మనం ఒకరం కాబట్టి మన స్థాయిని  మనం అంచనా వేసుకోవాలి.
     ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న సైంటిస్ట్ లతో ఓటింగ్ జరిపిస్తే న్యూటన్ మొదటి స్థానం  పొందారు.ఆయన అన్న మాట లు మనం గుర్తించాలి."మహా సముద్రం ఒడ్డున గులక రాళ్ళు ఏరుకునే ఓ చిన్న బాలుడిని నేను."అని.ఈ విశ్వంలో జ్ఞానం అపారం.అది నిరంతరం కనుగొన బడుతునే ఉంది.
        చాలా మంది తమకు తెలిసిన విషయపరిధి లోనే వాదించటం చూస్తూ ఉంటాము.ఎదుటి వారి కోణాన్ని అర్థం చేసుకోరు.కొన్ని విషయాల పట్ల ఏ అవగాహన లేకున్నాకొంత మంది వ్యక్తుల గురించి ఏమీ తెలియకున్నా వారి గురించి వ్యాఖ్యానిస్తుంటారు.ఏదయినా ఒక విషయం గురించి గట్టిగా వాదించే ముందు కూలంకషంగా తెలుసుకొని  మాట్లాడితే బాగుంటుంది.లేదా నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను.మీరు చెబితే తెలుసుకుంటాను అని ఎదుటి వారు చెప్పే దివినాలి.ఆ విషయాన్ని విశ్లేషించుకొని,నిర్ధారించుకొని మన అభిప్రాయాలను చెప్పాలి..
          సినిమాలు,రాజకీయాలు,క్రికెట్,సామాజిక సమస్యలు,నమ్మకాలు,తత్వం,ఆరోగ్య విధానాలు విశ్వావిర్భావం జీవపరిణామ క్రమం ఇలా విభిన్న విషయాలపై,కొంత మంది ఘంటాపధంగా తమ అభిప్రాయాలు చెబుతుంటారు. ఎదుటివారికి ఏమీ తెలియదనుకొని.ఏ విషయం పట్ల అయినా ఒక అభిప్రాయం వ్యక్త పరిచే ముందు కొంత మనసు లోఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది.మనసులో ఏమనిపిస్తే,మనకేమి తెలిస్తే అదే మాట్లాడితే ఎన్నో సమస్య లు వస్తాయి.
       మనం ప్రతి రోజు ఎన్నోవిషయాలు నేర్చుకుంటూ ఉంటాము.ఎన్నో సంఘటనల నుండి ,ఎన్నో పుస్తకాల నుండి ఎంతో మంది వ్యక్తుల నుండి,మనకు కలిగే జీవితానుభవాల నుండి మనం ఎంతో నేర్చుకుంటూ ఉంటాము.పసిపిల్ల వాని నుండి కూడా ఎంతో నేర్చుకోవచ్చు.నాకే అంతా తెలుసనే భావన వదిలి పెట్టి ఎదుటివారు చెప్పేది మనసు హృదయం పెట్టి వినటం నేర్చుకుంటే మనలో క్రమంగా ఈ జ్ఞానం వలన కలిగే అహంకారం తొలగి పోతుంది.

Sunday 29 July 2012

డబ్బు సృష్టించే అహంకారం(5)

            డబ్బు సమాజాన్ని శాసిస్తున్న రోజులివి.సంపద పట్ల విపరీత మైన వ్యామోహం ప్రజల్లో వ్యాపించింది.
ఎప్పు డైతే దీనికి అంత ప్రాధాన్యత ఏర్పడిందో ఎవరికయితే డబ్బు ఉందొ వారికి సంఘంలో విలువ గౌరవం పెరిగి పోసాగాయి.డబ్బున్న వారు గొప్ప వారుగా ,డబ్బు లేని వారు సామాన్యులుగా పరిగణింప బడే సంస్కృతి ప్రబలింది ఎప్పుడైతే దీనికంత ప్రముఖ స్థానం లభించిందో అది వున్న వారికి సహజం గా గుర్తింపు లభించటంతో వారు తాము ప్రత్యేకమైన వ్యక్తులుగా పరిగణింపబడాలని కోరుకోవటం మొదలయింది.సహజంగా వారికి సంఘంలోఅన్ని పనులు చకచకా జరిగిపోవటం,ప్రభుత్వాలు వారు చెప్పినట్లు అనుకూల నిర్ణయాలు తీసుకోవటంతో వారి సంపద అనూ హ్యంగా పెరిగిపోతుంది.
        ఈ నేపధ్యంలో ఎవరికి వారికి వ్యక్తిగత స్థాయిలో డబ్బుద్వారా వచ్చే గుర్తింపును కోరుకోవటం ,ధనవంతుల మనే దర్పం ప్రదర్శించటం ,డబ్బు లేని వారిని తక్కువగా భావించటం ,తమ దైనందిన వ్యవహారాల్లో ఆ అహాన్ని చూపించే తత్వం స్థిరపడటంతో అది సంపద ద్వారా వచ్చిన అహంకారం గా పరిగణించవచ్చు.ఇది ప్రజల మధ్య ఎన్నో వైరుధ్యాలు సృష్టిస్తోంది.మధ్య తరగతి వారిలో కూడా తమ కంటే తక్కువ ఆస్తిని కలిగి ఉన్నవారి పట్ల చిన్న చూపు చూస్తున్నారు.సొంత ఇల్లు కలిగిన ఇంటి యజమానులు అద్దెకుండే వారిపై ఈ అహంకారంతో కూడిన మాటలు వాడ టం మనం వింటూ ఉంటాము.
      సంపద కలిగిన వారు దానిని ఎలా ప్రదర్శించాలి  అనే కోణంలో ఆలోచిస్తుంటారు.తమ కట్టుకున్న ఇంటి ద్వారా ధరించే బంగారు ఆభరణాల ద్వారా,ఖరీదయిన బట్టలు ధరించడం ద్వారా ,విలాసవంత మైన వాహనాలు ద్వారా భారీ వేడుకలు నిర్వహించటం ద్వారా తమ గుర్తింపును పెంచుకోవటానికి ,ఇతరులకు తమ ఆర్ధిక హోదా అర్థం కావ టానికి దాని ద్వారా తమ అహంకారాన్ని చూపిస్తుంటారు.ఈ క్రమంలో వారు తమ కంటే తక్కువ ఆర్ధిక స్థాయి కలి గిన వారిపట్ల వారిమాట తీరులో వారి వ్యవహార ధోరణిలో అడుగడుగునా సంపద ఇచ్చిన అహంకారం తొణికిసలాడు తుంది.బంధువుల మధ్య ఈ ధోరణి సంబంధాలను క్షీణింప చేస్తుంది.వారు సంపాదించే క్రమంలో ఎంతో మందిని ఇబ్బందులకు గురిచేస్తూ,వారి హక్కులను కాలరాస్తూ ,తమ తోటి ప్రజలకు దక్కాల్సిన ప్రయోజనాలను తామే సొంతం చేసుకుంటూ వ్యవహరించే ఈ ధోరణి సమాజానికి ఎంతో అరిష్టం.
      సంపద కలిగిన వారిలో కొంత మంది ఎంతో నిరాడంబరంగా ,ఎక్కడా ఈరకమైన అహంకార ధోరణి చూపకుండా
సరళమైన జీవితాన్ని గడిపే వారిని మనం గమనిస్తుంటాము.ధర్మ బద్దంగా సంపాదిస్తూ ప్రభుత్వానికి పన్నులు కడు తూ సేవా కార్యక్రమాలకు నిధులు వెచ్చిస్తూ ఉన్నటువంటి వ్యక్తులను మనం గమనించ వచ్చు.అటువంటి వారు పెద్ద పారిశ్రామిక వేత్తలలో కూడా వున్నారు.మన మధ్య లో కూడా ఎంతో మందిని మనం గుర్తించ వచ్చు.
       సంపద సుఖాన్ని,విలాసవంత మైన జీవనాన్ని ఇవ్వ వచ్చు.ఆరోగ్యం సరిగా లేక పోతే ఎంత డబ్బు వున్నా నిష్ప్రయోజనం.సుగర్,బి.పి లేని ధన వంతులను మనం తక్కువగా గమనిస్తాంఎంత డబ్బులున్నా ఏమీ తినటానికి ఉండదు.తిన్నది అరగదు.సమస్యలతో కంటినిండా నిద్రపట్టదు.heart attacks,cancers వస్తే పరిస్థితి మరింత దారుణం. ఇంత మాత్రానికి డబ్బు పేరుతో విర్ర వీగటం ,అహంకారం ప్రదర్సించటం,తమ తోటివారిని ఇబ్బందులు పెట్టటం ఎంత వరకు సమంజసం.సంపాదనకు అంతు లేదు.ఎంత సంపాదించినా వారికంటే అధిక ధనవంతులు ఉంటూనే వుంటారు.వారు చూపించే ఆధిపత్యం ,అహంకారం తక్కువ ధనవంతులను మరల బాధ కలిగిస్తుంది.
        సంపద వున్నా తృప్తిగా జీవించకపోతే ,సమాజంలో మంచి పేరు,గౌరవం జీవిత కాలం లో సాధించలేకపోతే దేన్ని చూసుకుని ఇంత అహంకారం ప్రదర్సించారో అది మరణిస్తే తన వెంట రాదు కదా!అలెగ్జాండర్ ప్రపంచాన్నంతా జయించాలని ,భూమండలాన్నంతా తన పాదాక్రాంతం చేసుకోవాలని బయలుదేరి భారత దేశం వచ్చి తిరిగి వెళుతూ మార్గ మద్యంలో మరణిస్తూ తన రెండు చేతులు తన శవ పేటిక పై చాచి ఉంచే లాగా ఏర్పాటు చేయ మన్నాడట తాను ఏమీ తీసుకు పోవటం లేదు అని చెప్పటానికి.
            తాను తన కంటే అధిక ధనవంతుల ద్వారా పొందే అవమానం తో బాధ పడే వ్యక్తి దానిని ఇతరుల పై చూప కుండా ఆ లక్షణం తనలో వున్నట్లు గుర్తించి సంపద ద్వారా అహంకారాన్ని కాకుండా,వినయాన్ని పెంచుకుంటూ తోటి మనుషుల యెడల సహకార ధోరణితో మెలిగితే తన జీవితం ధన్యం అయినట్లే!

Friday 27 July 2012

అందంగా వుండే వారిలో అహంకారం ఉంటే!(4)


           నేను  ఎక్కువ అన్న భావం ప్రదర్శించే వారిని సమాజం లో చాలా మందిని చూస్తుంటాము.అందం ద్వారా భావం ఏర్పడిన వాళ్ళు తాము ఇతరుల కంటే చాలా అందంగా ఉన్నామని దానిని ప్రద ర్శించుకోవటం   కోసం అలంకరణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ,విభిన్న సందర్భాలలో దానిని మాటల రూపం లో ,హావభావాల రూపం లో వ్యక్తం చేస్తుంటారు.అందంగా లేని వ్యక్తుల పై కామెంట్ చేస్తుంటారు.మేము B.ED  చదివే రోజుల్లో మా మిత్రుడు ఒకతను నల్లగా ఉంటాడు.కాని మంచి తెలివితేటలు ,ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడే సామర్థ్యము ఉన్నాయి.ఇంకొక మిత్రుడు చాలా అందంగా ఉండేవాడు.అతను కూడా ఇంగ్లీష్ బాగా మాట్లాడగలడు.ఒకరోజు ఒక అంశం పై సెమినార్ జరిగితే ఇద్దరు మాట్లాడారు.సెమినార్ అయిన తర్వాత అందంగా ఉండే మిత్రుడు మా దగ్గరికి వచ్చి నా మిత్రుని (నల్లగా వుండే)తో నీవు అచ్చు శివరాసన్లా (రాజీవ్ గాంధీ హంతకుడు) ఉన్నావు,అన్నాడుఇంకొకరయితే ఎలా సమాధానమిచ్చేవారో కాని నా మిత్రుడు చాలా కూల్ గా నీవు మాత్రం రాజేష్ ఖన్నా లాగా చాలా అందంగాఉన్నావు అన్నాడు.అంతే వ్యాఖ్య చేసిన మిత్రుడు బాధపడి విచారం వ్యక్తం చేసాడు.
           ఈ విధం గా ఎంతో మంది అందంగా లేని వారిపట్ల అవమానకరమైన రీతిలో మనసు బాధ పడే లాగే వ్యాఖ్యానిస్తుంటారు.ముఖ్యంగా నలుపు,ఎత్తు,లావు గురించి కామెంట్స్ చేస్తుంటారు. అహంకారం ప్రదర్శించే వ్యక్తులు అవతలి మనుషుల మంచి తనానికి విలువ ఇవ్వరు.ఎప్పుడయినా తమకి అవసరమయినప్పుడు బాధలో వున్నప్పుడు వీరికి అందం లేని వారు సహాయం చేస్తే అప్పుడు వారిలో మానసిక మార్పు రావచ్చు.లేదా తాము ఆరోగ్యాన్ని కోల్పోయి అందాన్ని కోల్పోయినప్పుడు వారిలో అహంకారం సమసి పోవచ్చు.లేదా వయసు మీరిన తర్వాత వచ్చే వృద్ధ్యాప్యంవలన ముడతలు పడిన పడిన శరీరాన్ని అద్దంలో చూసుకుంటూ అప్పుడు తీరిగ్గా అహంకారాన్ని తొలగించుకోవచ్చు. లోపల జీవితం ముగిసి పోతుంది.అందం మనిషికి ఆత్మ విశ్వాసాన్ని ఇవ్వాలే గాని అహంకారాన్ని ఇవ్వ కూడదు.
     అందాల పోటీల్లో మీ జీవిత లక్ష్య మేమిటని అందగత్తెలను ప్రశ్నిస్తే సమాజానికి సేవచేయాలనో,అనాధలను వ్యాధిగ్రస్తులను చేరదీసి సేవ చేయాలనో సమాధానమిస్తారు.అంటే వారిలో ఎంత వరకు  అంతఃసౌందర్యం ఉందో పరీక్షిస్తారు.అక్కడ సరి అయిన సమాధానము చెప్పేవారికే ప్రపంచ సుందరి కిరీటం దక్కుతుంది.వారికన్నా అందం గా వుండి  సరి అయిన సమాధానం చెప్పని వారికి కిరీటం తప్పి పోయిన సందర్భాలున్నాయి ..
        బాహ్య సౌందర్యం తాత్కాలిక మైనది.అంతఃసౌందర్యం శాశ్వతమయినది . రోజుకు మహనీయుల గురించి తలచుకుంటూ వుంటామంటే వారి ప్రవర్తన ,వారి ఆలోచనలు,వారి ఆచరణలను బట్టే  .ప్రపంచంలో ఎంతో మంది అంద మైన వాళ్ళు పుట్టారు,మరణించారు.అందం పేరుతో గొప్పవారుగా పరిగణింప బడే వారు ఎంత మంది?ఎంతో అందమైన సినిమా నటులయినా వారి నటనకు గుర్తింపు పొందుతారు, కాని అందంగా ఉన్నంత కాలం ఆరాధిస్తారు  తర్వాత ఎవరైనా పట్టించుకుంటారా!అందంగా లేని ఎంతో మంది ఎన్నో రంగాల్లో అద్భుత మైన తెలివితేటలతో గొప్ప సేవా భావం తో ప్రపంచ ప్రఖ్యాతి పొందారు.
      ఒక్క క్షణం అందంగా ఉండే వారంతా ఆలోచిస్తే వారిలో ఇటువంటి అహంకార మేమైనా ఉంటే  దాన్ని తమంతట తాము గుర్తిస్తే అంటే తమకి లక్షణాలు ఉన్నట్లు వారు గుర్తిస్తే క్షణమే అహంకారం నుండి బయట పడగలరు.అప్పుడు వారికి ప్రపంచ మంతా అందంగా కనబడుతుంది.ముఖ్యం గా వారి మనస్సులో  అహంకారం  ఎప్పుడయితే తొలగి పోతుందో వారి ముఖము దేదీప్య మానంగా వెలిగిపోతూ వారు ద్విగుణీకృత మయిన తేజస్సు తో ప్రకాశిస్తారు.