Friday 6 July 2012

వెన్నెల్లో జలకమాడినట్లు!


                                             నీలిరంగు పూసిన ఆకాశం కాన్వాసుపై
                                                  ధవళ వర్ణపు బొట్టు పెట్టినట్లు
                                             తల్లి చుట్టూ పాలకోసం తిరిగే పిల్లాడిలా
                                                 భూమి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ
                                                 భువిపై రవి కల్పించిన రాతిరిని
                                                 వెలుగును నింపి కావలి కాస్తూ
                                                 పని ఒత్తిడిలో అలసి పవళించిన
                                             జనజీవన స్రవంతికి చల్లని కాంతినిస్తూ
                                                      చుక్కలన్నీ బిక్కుమంటూ
                                             మినుకుమినుకుమంటూ చూస్తుంటే
                                             వెండి మేఘాలను మరింత మెరిపిస్తూ
                                             పుడమి ఒడి పై పున్నమి చంద్రుడు
                                             పిండార బోసినట్లు వెన్నెలను ప్రసరిస్తుంటే
                                                  నా తనువులోని అణువణువూ
                                                  పరవశంతో  మైమరిచి పోతుంది
                                                  పౌర్ణమిలో ధ్యానం చేస్తుంటే
                                             నా శ్వాసలో మలయ పవనపు సందడి
                                             నా మేను వెన్నెల్లో జలకమాడిన అనుభూతి
                                             నా వీనుల్లో మురళీరవపు మంద్రనాదాలు
                                             మెల్ల మెల్లగా మనసంతా ఆలోచనారహిత స్థితి
                                             శూన్యం మదినిండా ఆవరించిన అలౌకిక స్థితి
                                                      అంతఃశ్చేతనలోని చైతన్యం
                                                పురి విప్పిన మయూరపు నాట్యమై
                                               వెన్నుపూసనుండి జరజరా పైకి ప్రాకి
                                               మెదడంతా ఆక్రమించిన విద్యుత్తేజమై
                                             శిరసునిండా విశ్వమంతా పరచుకున్నట్లు
                                                   ఓ సంపూర్ణ సహజానందం
                                                   దేహమంతా వ్యాపించింది

Sunday 1 July 2012

యాంత్రిక మైన జీవితం


కష్ట పడితే ప్రభవించేది స్వేదం 
ఉద్విగ్నపు సంతోషానికి ఫలితం ఆనంద భాష్పం
గుండె గాయమైతే కన్నీటి ప్రవాహం
అనుభూతుల స్మరణలో కళ్ళల్లో చెమర్చే తడి
కష్టాలకు,ఆనందాలకు
అనుభూతులకు ,అనుబంధాలకు
స్పందించే మన శరీర ధర్మం
జీవితంలో ఇదేకదా నిత్యం జరిగేది
మనసుపై బాధల ఒత్తిడి పడనీకుండా
శోకం జ్ఞాపకాలుగా మిగలకుండా
 రక్షించే శరీర  యంత్రాంగం తీరు అర్థమైతే
మనిషికి మానసిక సమస్య లుండ వేమో!
శ్రమ లేని జీవితం
ఆనందం లేని జీవనం
నిస్సారమైన సంసారం
మదినిండా త్రుప్తి లేని గమనం
కాలంతో పరుగులు
బంధాలలో అంతులేని అంతరం
యాంత్రిక మైన యుగం లో
మనిషెంత కూరుకుపోతున్నాడో
ఇక స్పందనలకు సమయ మెక్కడ !

Friday 29 June 2012

స్నేహం మొదలయ్యే క్రమం(3)


   ( మార్చ్ నెలలో స్నేహం(1),స్నేహం ఓ ఆహ్లాదం (2)తరువాత స్నేహం పై వ్యాసాలలో ఇది మూడవది.)
                స్నేహం  చేసుకుందామని  ఎవరూ  ప్రయాణం  మొదలెట్టరనుకుంటా ! ఎందుకో  రెండు  హృదయాలు  ట్యూన్ అవుతాయి.ఇద్దరు మగ అయినా ఇద్దరు ఆడ అయినా ,ఒక మగ ఒక ఆడ అయినా స్నేహితులు కావచ్చు చిన్నపిల్లలు కూడా ఒకరిద్దరితో స్నేహం చేస్తారు.వారితోనే ఎక్కువ మాట్లాడటం,వారి ఇళ్ళకు వెళ్ళటం వారితో       ఎక్కువగా ఆడటం పరస్పర అభిప్రాయాల్ని పంచుకోవటం ఇలా స్కూల్ స్థాయి నుండి కాలేజీ వరకు తరువాత జీవి తంలోను స్నేహం ఓ భాగమయి పోతుంది.
        అసలు స్నేహం చేయటం ఎందుకు?స్నేహానికి జీవితం లో ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి.జీవితం చివరి వరకు అవ సరమా!అవసరాలతో స్నేహాన్ని కోలుస్తామా!ఆస్తులు,అంతస్తులను స్నేహం చూస్తుందా!అలా చూస్తే అది స్నేహం అవుతుందా!అంతస్తులను చూసి స్నేహితులుగా వుంటే దాన్లో ప్రయోజనాలను ఆశిస్తారు కదా!ప్రయోజనాన్ని ఆశిం చేది స్నేహం ఎలా అవుతుంది?
      ప్రాథమిక స్థాయి నుండి 10 వ తరగతి వరకు కనుక కలిసి చదువుకుంటే ఆ స్నేహం జీవితంలోగట్టి పడి చివరి దాకా ఉంటుందేమో!స్నేహంలో సాంద్రత ఎక్కువగా ఉంటుంది కనుక.చిన్ననాటి స్నేహితులు ఆ ముచ్చట్లు ఇచ్చిన త్రిల్ మరేదీ ఇవ్వదేమో!చిన్నప్పుడు ఆడిన ఆటలు,చేసిన అల్లరి పెద్దయిన తర్వాత గుర్తు చేసుకుంటే ఆ తన్మయ త్వం ఆ ఆనందం వర్ణించనలవికాదు.
        కాలేజీ నుండి ఉద్యోగం వచ్చే వరకు  మిత్రులు ఓ రకం.పరిపక్వత కలిగిన స్నేహం.ఒకరి భావాలు ఒకరు పంచుకోవటం,సాంత్వన పొందటం,పరస్పరం సహాయం చేసుకోవటం జరుగుతుంది.ఒక రకంగా కుటుంబం లోని వారికంటే ఎక్కువ స్నేహంగా ఉంటారు.ఇదంతా చూస్తుంటే చిత్రంగా ఉంటుంది.అన్నదమ్ములకి అక్కా చెల్లెళ్లకి అమ్మనాన్నలకి చెప్పుకోలేని సంగతులన్నీమిత్రులతోనే కదా పంచుకునేది.జీవితంలో 25 సం :వరకు అంటే పెళ్ళ య్యే వరకు స్నేహమొక ఆపాత మధురం.ఓ సజీవ స్రవంతి.ఓ భావ ప్రకంపనా ప్రపంచం.తరువాత జీవితంలో మన ఉద్యోగం లో మంచి స్నేహితులు తారస పడతారు .పరస్పర అవగాహ నతో కుటుంబ స్నేహితులు గా మారతారు ఇలా జీవన పయనం లో స్నేహం ప్రాధాన్యత ఎంత ఉందో!    

Monday 25 June 2012

త్రిశంకు నరకం


                                                           
   నిర్లక్ష్యం నిలువెత్తు నిలబడి  పిలుస్తుంటే
   మృత్యువు రారమ్మని ఆహ్వానిస్తుంటే
   లేత పాదాలు అటువైపే దారితీస్తుంటే
   ఏ ప్రకృతి శక్తులు ఆపలేదు వాణ్ని 
   అగ్నిపర్వతం క్రేటర్లో మునగపోతున్నట్లు
   తుఫాన్ కన్నులో కాలు మోపబోతున్నట్లు 
   కాళ్ళ క్రింద భూమి చీలబోతున్నట్లు 
   ఏ సంకేతాలు వాడికి అందలేదు 
   ఆటలోని ఆనందం 
   కుతూహలం లోని ఉత్సాహం 
   వాడిని మరణం అంచుల్లోకి 
   వెళ్ళకుండా ఆపలేదు 
   అన్వేషణ అంతమయ్యే లోపు 
   వాడు త్రిశంకు నరకం లోకి 
   జారుతున్నాడు 
   కన్నులు పొడుచుకున్నా  
   కానరాని గాడాంధకారం  
   ఒళ్లంతా చీరుకుపోయి కారుతున్న రక్తం  
   ఏదో బండరాయి వాని చావుకు అడ్డుపడింది 
   అప్పుడు మొదలయ్యింది ప్రత్యక్ష నరకం 
   ఉచ్చ్వాస,నిశ్వాసలు భారంగా మారుతూ 
   కంటి నిండా దుమ్ముతో చీకటి ఆవరిస్తూ 
   గొంతు నిండా మట్టితో ఉక్కిరిబిక్కిరవుతూ 
   క్షణక్షణం భయంకరమైన క్షోభ అనుభవిస్తుంటే 
   సమాంతర బోరుకు సన్నాహాలు 
   ఆక్సిజన్ గొట్టాల జారవేత 
   గంటలతరబడి వేలమంది కన్నీటి ధారలతో 
   గుండెలవిసేలా ఏడుస్తున్న తల్లిదండ్రుల రోదనలతో 
   మార్మోగుతున్న ఆ ప్రాంతంలో 
   ఒక్కసారిగా శ్మశాన నిశ్శబ్దం 
   బయటకు తీసిన వాడి శరీరంలో 
   కొన ఊపిరయినా ఉందేమోననే ఆశ 
   నిరాశగా మారిన ఆ క్షణం 
   దిక్కులు పిక్కటిల్లేలా శోకం 
   ఎన్ని ప్రాణాలు గాల్లో కలవాలో 
   రక్కసిలా నోరు తెరిచిన ఈ బోరు బావుల్లో 
   యుద్ధం ప్రకటించండి వీటి పూడ్చివేతకు 
   చిన్నారుల చిరునవ్వుల కోసం                                                                                                                                                               

Saturday 23 June 2012

అమ్మా! నన్ను ఇక్కడే ఉండనీ!


       
రాత్రి ముసుగును భూమి కప్పుకున్నవేళ
నేను రక్త మాంసాల దోసిళ్ళలో నిదరోతున్నాను
                  ఉచ్చ్వాస ,నిశ్వాసాల్లోఉన్ననాలో కదలిక
                 అందుకే  అమ్మ ఆర్తనాదాల ధ్వనులిక
                 నా చిన్ని గుండె తడబడుతుంది
                 నా లోన ఆవేదనే రగులుతోంది
ఎక్కడో అరుపులు,బాధామయ రోదనలు
ప్రసవ వేదనలు,ఆకలికేకల శోధనలు
అమ్మ పీల్చే గాలిలో మిళితమై ప్లవిస్తూ
నా శ్రవణేంద్రియాలలో ధ్వనిస్తూ
నన్ను ఆందోళనలో ముంచెత్తుతున్నాయి
                       ఓ వెన్నెల కిరణం
              నా తనువును స్పర్శిస్తున్నట్లుంది
             శశి నిశి పరదాలను తొలగిస్తున్నట్లుంది
               ఓ భయ విహ్వలత కంఠద్వానం
ఓ అంతరాల సమాజ వికృత పదఘట్టనలు
మరో శ్మశాన విషాద గీతాల ఆర్తారావాలు
శతకోటి దరిద్రనారాయణుల దీనాలాపాలు
అనారోగ్యంతో మరణించే పసివాళ్ళ ఆక్రందనలు
ప్రకృతీ వికటాట్టహాస వైపరీత్యాలు
         మత మూఢత్వాలపైశాచిక ఆనందపు డోలికలో
          తేలిపోతూ తూలిపోతు ఒకరినొకరు నరుక్కునే
         సుందర ప్రపంచాన్నానేను చూడబోయేది  
         ఇదేనా నా తడబడు అడుగులు పడబోయే ధరిత్రి
అణుధూళి విరామమెరుగక నిండబోయే రోజులు
సర్వమానవ వినాశ హేతువుల కారణభూత రాజ్యాలు
ఇవేనా నాకగుపించే  భవిష్యత్ సుందర్ దృశ్యాలు
          నా కొద్దు ఆ రాబోయే పరిణామాల ఫలితం
          ఇక్కడే ఆనందంగా,ఆహ్లాదంగా వుంది
          నా మనుగడకు ప్రాణం పోస్తూ తన మమకార
          మాధుర్యాలను నాలోన పొందుపరుస్తున్న
          అమ్మ ఆనంద బృందావనంలో
          ఇలానే ఉండాలనివుంది
          అందుకే అమ్మా! నన్ను ఇక్కడే ఉండనీ!        

Friday 22 June 2012

ఆధిక్యతా భావన (2)


               ఈ బంధాలు నిలబెట్టుకోవాలంటే ఏమి చెయ్యాలి?మొదట అన్న తమ్ముళ్ళకి ,అక్కాచెల్లెళ్లకి తాము ఎలా పెరిగారు?చిన్నప్పుడు తల్లిదండ్రులు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ?తాము ఎలా కలిసి పెరిగారు?అప్పటి ప్రేమ ఆప్యాయ తలు మనసులో ఉంచుకోవాలి.ఎవరు ఏ స్థాయిలో వున్నా పరస్పరం సహకరించుకోవాలి. ఒకరి బాధ మరొకరు పంచుకోవాలి.ముఖ్యంగా ఒకరు చెప్పేది మరొకరువినాలి.అప్పుడు బంధువులయి నా స్నేహం ఉంటుంది.ఆ స్నేహం లో అర్థం చేసుకునే గుణం ఉంటుంది.ఆ గుణమే బంధాలను నిలబెడుతుంది.ఆర్ధిక హోదా నుండి,చదువుల వలన వచ్చిన కీర్తి నుండి,హోదా నుండి వచ్చిన పేరు నుండి కలిగిన ఆధిక్యతను మిగతా వారిపై చూపటం వలన బంధాలు విచ్చిన్నమవుతాయి.సమాజంలో చాలా మంది ఈ బంధాలను నిలబెట్టుకుంటున్నారు.అంతే స్థాయిలో ఇవి బలహీనమవుతున్నాయి.
         సరే ఇవి కలవలేనంతగా తెగిపోయాయి అనుకుందాము.అప్పుడెలా?ఏముంది ఎవరి జీవితాలు వారు మిగ తా వారితో పోల్చుకోకుండా ,ఈర్ష్య పడకుండా తమకున్న అవకాశాల మేరకు సంతృప్తిగా ఆనందంగా జీవించ టమే కోపం,ద్వేషాలు పెంచుకోకుండా పరస్పరం నష్ట పరిచే చర్యలకు పాల్పడకుండా ఎవరి పరిధులలోవారు ఉండటమే!ఇది ఎంతో ఉత్తమమైన విధానం.
      అలాకాకుండా ఆస్తులు పంచుకోవటంలో వచ్చిన తగాదాలు,మాట జారటంలో వచ్చిన కక్షలు కొనసాగుతూ
తాము నాశన మవుతు కుటుంబాలను నాశనం చేసుకుంటూ ఉంటారు.ఇది అనాగరికమైన చర్య. వారి కక్ష్యల కు,ద్వేషాలకు పిల్లల జీవితాలు బలి అయి పోతాయి.ఇంకో తరం అభివృద్ది ఆగిపోతుంది.ఎన్నో జీవితాలు ఇలా ధ్వంసం  అయినవి మనకు కన్పిస్తాయి.
    పై అన్ని అంశాలను విశ్లేషిస్తే కుటుంబ సంబంధాలు అద్భుతంగా మారాలన్నా ,సంబంధాలు కలకాలం నిలవా లన్నా ఆ భావన ఇరువైపులా వుండాలి.అలా లేక పోయినా అవి నిలబడకపోయినా  ఘర్షణలు లేని వాతావరణంలో జరగాలి.

Tuesday 19 June 2012

ఆధిక్యతా భావన (1)


                                                       
             మానవుడి మనస్సు స్నేహాన్ని,ప్రేమను అద్భుతంగా స్వీకరిస్తుంది.కోపాన్నిద్వేషాన్నిఆధిక్యతా భావనను వ్యతిరేకిస్తుంది.ఏ వయసు వారయినా దీనికి అతీతం కాదు.చిన్నపిల్లల్నిగమనిస్తే మనం ప్రేమ పూర్వకంగా వ్యవహ రిస్తున్నామా ,వారిపట్ల కోపంతో ,దయ లేకుండా ప్రవర్తిస్తున్నామా!అన్నవిషయాన్ని వారు గమనించి వారి వ్యతిరేక తను ఏడుపు రూపంలో,లేదా కోపం రూపంలోవ్యక్తపరుస్తారు.ఇక మిగిలిన వారి గురించి చెప్పేదేముంది.
      మానవ సంబంధాలను ఆధిక్యతా భావన విచ్చిన్నం చేస్తుంది.ఒక కుటుంబాన్నిగమనిస్తే భార్యా భర్తల మధ్య చక్కటి అవగాహన ఉండి,పరస్పరం అభిప్రాయాలను గౌరవించుకుంటూ చిన్నచిన్నభేదాభిప్రాయా లను సర్దుబాటు చేసుకుంటూ ఉంటె అక్కడ ఆనందం వెల్లివిరుస్తుంది.అలాకాకుండా భర్త,భార్యపై ఆధిక్యత ప్రదర్శిస్తుంటే కొన్నాళ్ళ పాటు దానిని భరిస్తుంది.ఏదో ఒక సమయంలోఅది తిరుగుబాటుగా మారుతుంది.అలాగే భార్య భర్తలపై ప్రదర్శించే ఆధిక్యత కూడా ఇలాంటిదే.అక్కడ ఇద్దరి మధ్య ఉండవలసింది ముఖ్యంగా స్నేహం.స్నేహం ఇద్దరినీ కలిపి ఉంచు తుంది.ఆధిక్యతా భావన వేరుచేస్తుంది.అలాగే అక్క చెల్లెళ్ళ మధ్య అన్న తమ్ముల మధ్య ఎన్నోభేదాభిప్రాయాలు వస్తుంటాయి.వీటిల్లోముఖ్యంగా ఆర్ధిక హోదా,చదువులో తేడాలు,మాటలు ముందుగా జారటం ఇవన్నీఈ బంధాలు తెగిపోవటానికి కారణమవుతున్నాయి.
        ఒక్కో కుటుంబంలో అందరిని తండ్రి చదివించలేక కొంత మంది వ్యవసాయంలో,చిన్న ఉద్యోగాల్లో ఉండిపోతారు మిగిలిన వారు చదువుకొని ఉన్నతస్థానాలకు వెళతారు.ఇంకో కుటుంబంలోతండ్రి అందరిని చదివించినా తెలివిలో తేడాలుండటం వలన ఒకరు ఉన్నత స్థానానికి వెళ్లి మిగిలిన వారు సాధారణ జీవితం గడుపుతుంటారు.మరికొన్ని కుటుంబాలలో తండ్రికి గల ఆర్ధిక సమస్యలవలన ఒకరిని ఖర్చుపెట్టి ఉన్నత చదువులు చదివిస్తాడు.రెండవ వారికి (తెలివి వున్నాకూడా)డబ్బులేక సాధారణ కోర్సులు చదివిస్తాడు.అలాగే అక్క చెల్లెళ్ళ మధ్య కూడా మంచి చదువు, మంచి సంబంధాలు కుదరటం(ఇక్కడ అందం కూడా ప్రాముఖ్యత వహిస్తుంది)సాంఘికంగా ఉన్నత  స్థానంలో కొంద రు,సాధారణ స్థాయిలో మరికొందరు ఉండటం జరుగుతుంది.ఇక్కడే ఒకరిపై మరొకరికి భేదభావాలు ఏర్పడతాయి ఆర్థికంగా ఉన్నతస్థానంలో ఉన్నవారు లేనివారితో సరి అయిన మానవ సంబంధాలు కొనసాగించలేక పోవటం, వారి పై  ఆధిక్యత ,ఆధిపత్య భావజాలం ప్రదర్శించటం వలన ఆ సంబంధాలు క్షీణిస్తాయి.అదే విధంగా వారు ఉపయోగించే బాష వ్యవహార శైలి,సంభాషణ తీరు తక్కువ స్థాయిలో వున్నవారిని బాధించే విధంగా ఉన్నాఆ బంధాలు బలహీన మవుతాయి.
      పై వాటినన్నింటిని గమనించిన తరువాత తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆర్ధికపరంగా చదువులపరంగా, ఆస్తుల పరంగా సమాన అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఎంతయినా వుంది.సమాన అవకాశాలను కల్పించినా వారు ఉన్నత స్థానాలకు వెళ్ళకపోతే అది వారి సామర్థ్యాలను బట్టి ఉంటుంది .కాబట్టి తరువాత ఆక్షేపించే అవకాశం వారి కుండదు,
     ఒకప్పుడు ఎక్కువమంది సంతానం ఉండేది కాబట్టి అందరికి సరి అయిన సమాన అవకాశాలను తల్లిదండ్రులు కల్పించలేక పోయేవారు.కాని చిన్నకుటుంబాల(ఇద్దరు కలిగిన)లో సమానంగా పెంచటం, సమాన అవకాశాలను కల్పించటం తల్లిదండ్రుల ప్రాథమిక బాధ్యత.
(మిగతా భాగం తరువాత వ్యాసంలో )

Sunday 17 June 2012

నేనే మీకు సజీవ సాక్ష్యాన్ని!


అస్పష్ట చిత్రాలు
సంక్లిష్ట దృశ్యాలు
స్పష్టత లేని చూపు
భవిష్యత్ ప్రమాదాన్ని సూచించలేదేవ్వరు?
నాకు కూడా అనిపించలేదు
కత్తుల వంతెన పై కాలం సాగుతుందని
బోర్డు కనపడదు మరి
విన్న దాన్నివిశ్లేషించుకోవడం
మిత్రులతో చదివించుకోవడం
వారికి తిరిగి వినిపించడం
జీవితమంతా సంఘర్షణల రణం
లక్ష్యం ఘనం గా ప్రతిష్ఠించుకున్నా
ప్రతి పరీక్షలో విజయం సాధించా
కీలకమైన జీవన గమనానికి
అనర్హుడివని తీర్మానించారు
నాలుగు రోడ్ల కూడలిలో జీవితం
ఆటంకాల మధ్య ప్రయాణం
అవకాశాలకై వెతుకులాట
నన్ను నడిపించింది ఆశావాదం
అంతులేని ఏకాగ్రత నాకు వరం
గణితాన్ని అవపోసన పట్టా
ఉద్యోగం సాదించా
ఇది నా పోరాటం
ఇది గొప్ప విషయమేం కాదు
కానీ నాలాంటి పిల్లలను గుర్తించండి
బాల్యంలోనే వారికి సహాయపడండి
ఇంత కష్టం! ఇంత నష్టం!
కలగకూడదు ఎవ్వరికి
అర్థం కావటం లేదు అన్న
 నా  విద్యార్థులకు చెబుతుంటా
నేనే మీకు సజీవ సాక్ష్యాన్నని
ఎవరు ఏమైనా సాధించగలరని
దేన్నైనా నేర్చుకోగలరని
నిరాశతో ఉన్నవారికి చెబుతుంటా
"నన్ను చూసి మీ జీవితాన్ని ప్రేమించండి
 ఆశావాదాన్ని మనసు నిండా నింపండి"  

     ఇది ఒక  అంధ ఉపాధ్యాయుని అంతరంగ ఆవిష్కరణ.ఆయన పేరు ఆంజనేయులు.ప్రకాశం జిల్లా మార్కాపూర్ దగ్గర సానికవరం ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తుంటారు.ఆయనకు చిన్నతనంలోనే వచ్చిన అరుదైన రెటీనా జబ్బు వలన చూపు క్రమేపి కోల్పోవటం, ఆయన ఎదుర్కొన్నకష్టాలు ఉపాధ్యాయ శిక్షణ కార్య క్ర మంలో చెబుతుండగా ఈ కవిత వ్రాసి అందరి ఎదుట దానిని చదివి ఆయనకు అందించటం ఎంతో త్రుప్తి నిచ్చింది ఆయనను చూసి మనిషెంత ఆశావాదిగా ఉండాలో నేర్చుకోవచ్చు.  

Sunday 10 June 2012

జీవితాన్ని తృప్తిగా జీవించటానికి 10 సూత్రాలు(2)


గత భాగం తరువాయి
           వీటన్నింటికి డబ్బు ఎక్కడనుండి వస్తుంది.డబ్బు సంపాదించటం కోసం ,అదనపు ఆదాయం కోసం సులభంగా డబ్బు సంపాదించే మార్గాల వైపు ప్రయాణం చేస్తారు.ప్రధానంగా ఉద్యోగుల్లో నైతే అవినీతి, మిగ తావారు వ్యాపారాల్లో విపరీతమైన లాభాలకోసం మోసాలు చేయటం,షేర్లు కొనటం ,అమ్మటం, రియల్ ఎస్టే ట్ ,పేకాట,పందాలు కట్టటం, అధిక వడ్డీలకు ఆశపడి ప్రభుత్వ గుర్తింపు లేని సంస్థల్లో deposites కట్టటం 10000 లకు  60,000 రూపాయలిస్తామని చెప్పే కంపెనీల మాటలు నమ్మి కష్టపడి సంపాదించిందంతా పోగొట్టుకోవటం(ఈ మధ్య india లోని 3 రాష్ట్రాల్లో 2000 కోట్లు జనం పోగొట్టుకున్నారు.) networkmarketing సంస్థల్లో చేరటం ఇలా విభిన్న మార్గాల్లో మోసపోతుంటారు.మరల ఆ కోల్పోయిన డబ్బును సంపా దించటం కోసం పలు అక్రమ మార్గాల వైపు ప్రయాణిస్తుంటారు.మనిషికి ఇదంతా నిత్యకృత్య మయింది.
          వీటన్నింటికి కారణం మనిషికున్న కోరికలు,వస్తువులు విచ్చల విడిగా కొనే సంస్కృతి,అత్యాశ కార ణంగా చెప్పవచ్చు.కోరికలు దుఃఖానికి కారణమని 2500 సం: క్రితం గౌతమ బుద్ధుడు చెప్పాడు కోరికలను పరిమితం చేసుకోవాలి.మనకున్న ఆదాయాన్ని బట్టి మన ఆలోచనలుండాలి .అత్యాశకు పోకూడదు. ఎక్కువ వడ్డీ,ఎక్కువ డబ్బులు ఇస్తామన్నారంటే అందులో ఏదో మోసం ఉంటుందని అంచనా వేయలేక పోవటం జనం యొక్క బలహీనత.బ్యాంకు, పోస్టల్ వడ్డీల కంటే ఎక్కువ వస్తుందంటే రిస్క్ పెరిగినట్లే.
      ఇక విద్య,వైద్యం వ్యాపారమయంగా మారిపోయాయి.ప్రైవేటు స్కూ ల్స్ ,కాలేజీల ఫీజులు పేద మధ్య తరగతి వారిని అప్పులపాలు చేస్తున్నాయి.అలాగే వైద్యం ఖర్చులు మనిషిని పీల్చి పిప్పి చేస్తున్నాయి. జబ్బులు రాకముందే ముందు జాగ్రత్త తీసుకునే అలవాటు మనుషులకుండటం లేదు.విద్య,వైద్యం తప్ప ని సరి అయినవి కాబట్టి సరి అయినవి ఎన్నుకోవటం చాలా అవసరం.లేక పోతే ఫలితం రాకపోగా ఎంతో డబ్బును, విలువైన కాలాన్ని, జీవితాన్ని కోల్పోతాము.వస్తువులు విపరీతంగా కొనే సంస్కృతిని పరిమి తం చేసుకొని తమ పిల్లలకు మంచి విద్యను అందింప చేయటం,చక్కని ఆరోగ్య పరిరక్షణకు తమకున్న వనరులు ఖర్చు చేయటం సరి అయిన ఆర్ధిక ప్రణాళిక.ఇన్ని ఒత్తిడుల మధ్య మనిషి తన ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాడు.మానసిక సమస్యలు,B.P,SUGAR,గుండెపోటులకు గురవుతున్నాడు వ్యసనాలకు బానిస కావటం చివరకు అప్పులతో ఆత్మహత్యలకు పాల్పడటం జరుగుతుంది.
      ఆడంబరం లేని సరళమైన జీవితాన్నిఎలా జీవించాలో తెలుసుకోవాలి.జీవితం తృప్తిగా ఆనందంగా గడిచి పోవాలంటే ఏమి కావాలో తెలుసుకోవాలి.అందుకు కొన్ని మార్గాలు
 1) కోరికలను పరిమితం చేసుకోవటం
2) అవసరం లేని వస్తువులను కొనే సంస్కృతిని తగ్గించుకోవటం
3) ఆరోగ్యం పట్ల ముందస్తు జాగ్రత్తలు
4) ప్రాధమిక అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వటం
5) అత్యాశకు పోకుండా వుండటం
6) కష్ట  పడకుండా  సులభంగా సంపాదించాలనే ఆశకు పోకుండా వుండటం
7) పొదుపు మంత్రాన్ని పాటించటం
8) సరళమైన జీవితాన్ని గడపటం
9) ఇతరులతో పోటీని ,పోలికను మానుకోవటం
10) వ్యసనాల బారిన పడకుండా వుండటం
ఈ 10 సూత్రాలతో చాలావరకు జీవితాన్ని తృప్తిగా ఆనందంగా జీవించవచ్చు.        

Saturday 9 June 2012

జీవితం తృప్తిగా జీవించాలంటే!1


            ప్రతి మనిషి ఏదో ఒక ఉద్యోగం ,లేదా వ్యాపారం ,వ్యవసాయం వృత్తి పనులు ,స్వయం ఉపాధి మార్గాలు ఎన్ను కొని జీవితాన్ని గడుపుతుంటాడు.తరువాత వివాహం చేసుకొని కుటుంబ జీవితాన్ని ప్రారంబిస్తాడు ఇక్కడ నుండి ఎంతోముందుచూపు,చక్కని ఆర్ధిక ప్రణాళిక ఉంటె కానీ అతని జీవితం సరి అయిన దారిలో నడవదు.
      కుటుంబం గడవటానికి అవసరమైన డబ్బు సంపాదన అన్వేషణాక్రమంలో మనిషి ఎన్నో మార్గాలను వెతుకుతుం టాడు.చట్టబద్ధంగా,న్యాయబద్దంగా అయితే ఫర్వాలేదు.తన అవసరాలు,కోర్కెలు తీర్చు కోవ డం కోసం అవసరమైన ధన సంపాదన మనిషిని  ప్రస్తుతం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.
          ముందుగా మనిషి అవసరాలు ఏమిటి? అని ఆలోచిస్తే ఇల్లు,ఆహార పదార్థాలు బట్టలు,విద్య వైద్యం వీటిని మ నం ప్రాధమిక అవసరాలుగా పరిగణిస్తాం.సొంత ఇల్లు కట్టాలంటే స్థలము ఎంతో ముందుగా కొని పెట్టుకోవాలి.ఇల్లు కట్ట టానికి అయ్యే ఖర్చును లెక్కించి ఎంతో చక్కని ఆర్ధిక ప్రణాళికతో ముందడుగు వెయ్యాలి.అలా కాకుండా మన స్నేహి తులో బంధువులో కట్టారని అప్పు చేసి ఇల్లు కట్టటం తరువాత తీవ్ర ఆర్ధిక ఇబ్బందులుకు లోను కావడం మంచిది కాదు పరిస్థితులు అనుకూలించేంతవరకు వరకు అద్దె ఇంట్లో వుంటూ దీర్ఘకాలిక ప్రణాళికతో ఇల్లు కట్టాలి. మనకు వచ్చే ఆదాయం ఎంత మన ప్రాధమిక అవసరాలకు దాన్ని ఏవిధంగా ఖర్చు పెట్టాలి?అన్నపూర్తి అవగాహనతోనడచుకో వాలి.
        మనం తినే ఆహార పదార్థాలలో పోషకాహారాలకు ఖర్చు పెట్టాలి.చాలా మంది ఆరోగ్యానికి హాని కలిగించే పదార్థా ల కు ఎక్కువ ఖర్చు పెడుతుంటారు .బట్టలు కూడా విలువైనవి పోటీ పడి కొంటుంటారు. ఇందులో ఎక్కువగా మిగ తావారిని చూసి వారి కంటే మిన్నగా వుండాలని కొంటుంటారు.ఒక మనిషికి స్త్రీ అయినా పురుషుడు అయినా ఐదు లేక పదిజతలు అవసరమవుతాయి.కానీ ప్రస్తుతం ఇంతకు ఎన్నోరెట్లు కొంటున్నారు.
        ఇక ఇంటికి అవసరమయ్యే వస్తువులు కొనే సంస్కృతి ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది.ప్రతి ఒక్కరి ఇంట్లో డబు ల్ కాట్ ,టి.వి ,ఫ్రిజ్ కూలర్, సోఫా సెట్,dyning table, ఖరీదయిన కుర్చీలు,కంప్యూటర్ లాంటి పరికరాలు కొంటు న్నారు .ఇవన్నీ ఉంటేనే మిగతా వారికి సరితూగ గలమని భావిస్తున్నారు.తమ ఆదా యానికి మించి అప్పులు చేసి మరీ కొన టం జరుగుతుంది.అలాగే బంగారం మీద విపరీతమైన వ్యామోహం తో ఖరీదయిన ఆభరణాలు చేయించుకో వటం ఒక fashion గా మారిపోయింది.మిగతా వారితో పోలిక ఈ వస్తువులను కొనే సంస్కృతిని పెంచుతుంది
         అలాగే cell phones అత్యంత ఖరీదయినవి కొనటం,విపరీతం గా వాటి ద్వారా మాట్లాడటంతో ఎంతో డబ్బు వృధా చేస్తున్నారు.చిత్తూర్ జిల్లాలో ఒక పరిశీలన ప్రకారం గత సం:సెల్ ఫోన్ బిల్ 500 కోట్లు అయి నట్లు తేలింది.జిల్లా మొత్తం వాడిన పాల బిల్ 450 కోట్లు.గమనించండి.కాలేజీ పిల్లలకు కూడా వీటిని కొనిచ్చివారి జీవితాలను పాడుచేస్తున్నారు ఇక ద్విచక్ర వాహనాలు లేని ఇల్లు లేదంటే అతిశయోక్తి లేదు. ప్రతి చిన్న పనికి వాహనాలు వినియోగిస్తూ పెట్రోలు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు.అందుకే చైనాలో సైకిల్ ను దేశమంతా వారంలో ఒకరోజు వాడేలా ప్రోత్సాహిస్తున్నా రు.ఇక విందులు,వినోదాలు,ఫంక్షన్లకు పోటీలు పడి ఖర్చు పెడుతున్నారు.కోట్ల మంది ఆకలితో అల్లాడుతుంటే ఫంక్షన్ల లో ఆహారపదార్థాలు ఎంతో వృధా అవుతుంటాయి.ఒకరిని మించి మరొకరు తమ ఆడంబరాన్ని చూపటానికి ఈ ఫంక్షన్స్ కి ఖర్చు పెడుతున్నారు.మధ్య తరగతి ,పేదవారు కూడా అప్పులు చేసి మిగతావారితో పోటీలు పడి వ్యయం చేస్తున్నారు.
      (మిగతా భాగం తరువాతి వ్యాసం లో )

Tuesday 5 June 2012

శబ్ద సౌందర్యం


                                                                  ఓ స్వరం
                                                                  ఓ పిలుపు
                                                                ఒక విభ్రమం
                                                               ఒక సంభ్రమం
                                                           ఉఛ్ఛ్వాసం మరచిన
                                                            నిశ్వాసం నిలిచిన
                                                        ఆ క్షణం సుదీర్ఘ నిరీక్షణం
                                                  నిశ్శబ్దాన్ని చేధించిన శబ్ద సౌందర్యం
                                                 జ్ఞాపకాల పుటలపై పుప్పొడి పరిమళం
                                                  అనంత అంతరం అంతరించిన  వేళ
                                                  మనసంతా వెన్నెల ప్రసరించినట్లు
                                                 ఆశ్చర్యం ఆనందం ఉత్తేజం ఉల్లాసం
                                                       చేజారిన అమృత కలశం
                                                        చిక్కిన చక్కని భావన
     

Monday 4 June 2012

ప్రకృతికే సరికొత్త భాష్యాన్నిద్దాం


నీలి  సంగీతాన్ని  పరచుకొని ఆకాశం
శశి కోసం ఎదురుచూస్తున్నట్లు
నీరెండ చాయలో నిలబడి నీకోసం
నాలో నేనే పల్లవి పలికిస్తుంటా
సంధ్య యాత్రను ముగించుకొని తన ఒడిలో
ఒదిగే దినకరుని కోసం చూసే పర్వతాల్లాగా
నింగిని రంగులతో అద్ది ముగ్గులతో ముద్దిడి
ఇంద్ర ధనుస్సు తో అలంకరించి వేచి చూస్తుంటా
మల్లెలు మత్తుగా పిలుస్తున్నాయి మరి
జాబిలి ఎందుకో ఈ రోజు రెచ్చగొడుతుంది
భావ విహంగాలు నా నుండి నీకు చేరటం లేదా
నా గాన మకరందాన్ని నింపుకొని గాలిలో
అలలై తేలి నా విరహాన్ని వినిపించటంలేదా
పూల పల్లకిని సిద్ధం చేసి పండు వెన్నెలను రంగరించి
మంచు ముత్యాల తోరణాలు కట్టి
తెల్ల మబ్బుల అల్లరి చిత్రాల కాన్వాసులను
నీవు వచ్చేదారుల్లో స్వాగతానికి పెట్టా
మాటలు రాని చుక్కలకు పలుకులను
పాటలు రాని ఉరుములకు గీతాలు నేర్పించా
దారంతా పున్నమి కాంతులు వున్నా నీకోసం
మెరుపుల చమక్కులను సిద్ధం చేసా
ఏంటో నా పిచ్చిగానీ నీకివన్నీ ఇచ్చే తృప్తి  కంటే
నా సాంగత్యం లోనే నీ హృదయ సరస్సులో
ప్రేమ పుష్పాలు విరుస్తుంటాయి
కానీ ఎందుకో నీ కోసం ఈ ఆకాశపు చిత్రాలన్నీ
భువి పైకి తెచ్చి నీ కందించాలనిపిస్తుంటుంది
నీవు నాదరికొస్తే మనం  ఈ
ప్రకృతికే సరికొత్త   భాష్యాన్నిద్దాం  

Friday 1 June 2012

కోపాన్ని జయించటం ఎలా?3


             ఆరోగ్య పరంగా కలిగే నష్టం గురించి చెప్పాలంటే అడ్రినలిన్ అనే హార్మోన్   కోపం వచ్చిన సమయం లో రక్తం లోకి ఎక్కువ గా విడుదల అవుతుంది.ఇది చాలా సేపటి వరకు రక్తం లోనే ఉండిపోతుంది.దీని వలన గుండెకు చాలా ఇబ్బందులు కలిగే అవకాశం వుంది.కోపంలోమన భాష అదుపు తప్పుతుంది.అలాగే కొంత మంది ఈ కోపాన్ని గుర్తుపెట్టుకొని ద్వేషంగా మార్చుకొని అవతలి వారికి నష్ట పరిచే చర్యలు కూడా చేపడతారు.అప్పుడు ఇంకా మరిన్ని సమస్యలు వస్తాయి.మానవ సంబంధాలను దారుణం గా దెబ్బ తీసే ఈ కోపాన్ని జయించటం ఎలా?
      ఇది ఒక్క సారిగా కోపం రాకుండా వుండాలని నిర్ణయించుకొని రేపటినుండి ఆపాలి అంటే ఆగిపోయేది కాదు.మరి ఎలా?కోపాన్ని అణచి వేయకుండా మీ ప్రతి స్పందనని కొద్దిసేపు వాయిదా వేయండి.కొంత మంది ఒకటి నుండి పది వరకు లెక్క పెట్ట మంటారు.అంటే మాటల ద్వారా మీ స్పందన తెలియజేయ కుండా కొంత విరామం తీసుకుంటే ఈ లోపు కోపం కొంత తగ్గుతుంది. అప్పుడు మన బాష కొంత మృదువుగా వస్తుంది.కాని మీకు జరిగిన అన్యాయాన్ని ,అవమానాన్ని భరించమని చెప్పటం లేదు.మీరు స్పందించదలచుకున్న అంశానికి కోపాన్ని జత జేయకుండా అవే ప్రశ్నలను సహనం తో అవతలి వ్యక్తిని ప్రశ్నించండి.ఆ లోపు అతను కూడా తేరుకుని మారవచ్చు.లేదా మీకు తన వివరణ ఇవ్వవచ్చు.ఇక్కడ స్పందన ప్రతి స్పందన లకు మధ్య విరామాన్ని ఇస్తే సమస్య చాలా వరకు తేలికౌతుంది. నిర్మాణాత్మకమైన ప్రశ్నలు వేయటం ద్వారా అవతలి మనిషి ప్రవర్తన మారే అవకాశం ఎక్కువ.మనం గొంతు పెంచి అరిస్తే అవతలి వారు బలహీనులైతే కొంత సేపు సహిస్తారు.సమానులు,లేదా బలవంతులైతే అంతకంటే ఎక్కువ కోపాన్ని ప్రదర్శిస్తారు.
          మీ కోపానికి కారణం అవతలి వారి ప్రవర్తన అయితే వారి ప్రవర్తన ఎందుకు నచ్చలేదో మృదువైన మాటలతో చెప్పటానికి ప్రయత్నించండి.ఫలితముంటుంది.ఇలా మీకు అనువైన మార్గాలను అన్వేషించండి.దీనికి పెద్ద జ్ఞానం అక్క ర్లేదు.పెద్ద చదువులు అక్కర్లేదు.పల్లెటూర్లలో చదువు రాని  నిరక్షరాస్యులు సైతం సహనంతో,నింపాదిగా సమస్యలను పరిష్కరిస్తూ వుంటారు.ఇదంతా అనుభవాల ఆధారంగా మనిషి నేర్చుకుంటాడు.ఒక సారి కోపగించుకుంటే కలిగిన నష్టాన్ని అంచనా  వేసుకొని  ఇంకో సారి అలా కోపాన్ని ప్రదర్శించకుండా ఉంటె చాలు.రెండు,మూడు అనుభవాలతో మనకు పూర్తిగా  అర్థమయిపోతుంది,కోపం ద్వారా సాధించేదేమీ లేదని.
         కోపగించుకున్నారు.పొరపాటును గుర్తించి మీ కంటే పెద్ద వారయితే విచారాన్ని వ్యక్తం చేయండి.చిన్న వారయితే అభిమానాన్ని,ప్రేమను మృదువైన మాటలతో ప్రదర్శించండి.సమస్య సర్దుకుంటుంది.    

Tuesday 29 May 2012

మనకి కోపం ఎందుకు వస్తుంది!2


 
           ముందుగా ఎవరికి వారు తమ   మానసిక పరిస్థితిని విశ్లేషించుకోవాలి. ప్రస్తుతమున్న సమాజంలో మనకు ఎన్నో అస్తవ్యస్థ  పరిస్థితులు కనిపిస్తున్నాయి.గత కాలంలో జీవితంలో ఇంత వేగం లేదు.ఇంత పని ఒత్తిడి లేదు. సంపా దించాలనే కోరిక ఇంతగా లేదు.మనుషుల కింత ఆరాటం లేదు.ఉమ్మడి కుటుంబ వ్యవస్థల్లో పెద్దలు చెప్పిన మాటలు వింటూ ఇటు ఇంట్లోను బయట సానుకూలంగా, మర్యాదగా ప్రవర్తిస్తూ నీతిగా,నిజాయితీగా బ్రతుకుతూ వుండే వారు. జ్ఞానం పెరిగి సంపాదనా కాంక్ష పెరిగిన తర్వాత కుటుంబాలు వేరయ్యాయి.పెద్దల సలహాలు,సూచనలు లేక ఇటు కు టుంబం లోను,బయట మనిషి ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు.ఈ ఒత్తిడిలో ఏ చిన్నవిషయంలో నైనా తనకు వ్యతిరేకమైన సంఘటన జరిగితే తట్టుకోలేక వెంటనే అనాలోచితంగా ప్రతిస్పందిస్తున్నారు.అది కోపం రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో భార్యా పిల్లలపై బయ టి వ్యక్తులపై ఇలా కోపాన్ని వ్యక్త పరుస్తుంటారు .కొంత మంది దానిని లోలోన అణచుకొని మానసిక వ్యాధుల బారిన పడుతున్నారు.
     మరి కాస్త విశ్లేషిస్తే ఎవరయినా కోపాన్నితన కంటే బలహీనుల పైననే చూపిస్తుంటారు.ఉదాహరణకు తల్లి దండ్రులపై ఎదిగిన పిల్లలు,భార్యపై భర్త ఇలాగే కోప్పడుతుంటారు.ఈ మధ్య భార్యలు కూడా భర్తలపై బాగానే కోప్పడుతున్నారు. అధికార్లు తమ క్రింది సిబ్బంది పై కోపగించుకుంటారు.పై అధికార్ల దగ్గర మాత్రం అణకువగా వుంటారు.ఉపాధ్యాయులు విద్యార్థుల పై ఇలాగే కోప్పడుతారు.కాని ఎవరు బలవంతులపై  కోప్పడరు.ఎందుకంటే బలవంతుడు అంతకంటే ఎక్కువ కోపాన్ని ప్రదర్శించటంతో పాటు కొండొకచో కొట్లాటకు దిగవచ్చుకూడా !కాబట్టి కోపానికి కూడా బలవంతుడంటే భయమే!ఈ విధంగా కోపం ప్రదర్శించబడు తుంది.
  తరువాతి వ్యాసం లో కోపం వల్ల నష్టాలు,దాన్ని అధిగమించే తీరు గురించి తెలుసుకుందాము.

Monday 28 May 2012

మనకి కోపం ఎందుకు వస్తుంది?1


        మనిషికి కోపం లేదా ఆగ్రహం ఎందుకు వస్తుంది?.కోపం ఎవరిపై వస్తుంది?కోపం అంటే ఏమిటి?ఏదైనా బాహ్య పరిస్థితి  తనకు అనుకూలంగా లేకున్నా,ఎదుటివారు మనల్నికించ పరిచేలా మాట్లాడినా మన అవకాశాలను ఎవర న్నా దెబ్బ కొడుతున్నారని తెలిసినా మన దగ్గరి వారు మన మాట వినక పోయినా, ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా ఇలా విభిన్న పరిస్థితులలో మన ప్రతిస్పందన కోపం రూపంలో బహిర్గతమవుతుంది .దీని బారిన పడని మనిషి ఉండ డేమో!కాకపోతే ఎంత త్వరగా ఆ స్థితినుండి బయటపడతారు అన్నది వ్యక్తుల స్వభావాన్ని బట్టి ఉంటుంది.
         పై కారణాలనన్నింటితో పాటు  ఒక విషయం చెబితే అందరు  ఆశ్చర్యపోతారు.మనకు చాలా లక్షణాలు వంశపా రం పర్యంగా వస్తాయి.మన తల్లి దండ్రులకు లేదా వారి తల్లిదండ్రులకు గల ఈ లక్షణం జీన్స్ ద్వారా మనకు రావచ్చు. కాబట్టి ఒక రకంగా కోపం ముందుగానే నిర్ణయించబడుతుంది.ఇంకా చెప్పా లంటే మన తల్లిదండ్రులు ప్రవర్తించే విధానా న్ని మనం చిన్నప్పట్నుండి చూస్తుంటాము కనుక అలాగే మన ప్రవర్తన నిర్ణయించబడుతుంది.నూటికి నూరు శాతం కాకపోయినా ఎక్కువ శాతం ఇలా జరిగే అవకాశం వుంది.అలాగే కోపం ప్రదర్శించడం వ్యక్తి నిస్సహాయ స్థితిని కూడా సూచిస్తుంది.ఇంకా ఎన్నో అంశాలు దీనికి కారణమవుతాయి.
       సహజంగా ఈ కోపం రెండు రకాలు.1)ప్రదర్శితమయ్యేది2)లోలోపల వ్యక్తమయ్యేది
కొంత మంది వ్యక్తులు ప్రతి చిన్న విషయానికి కోపాన్ని ప్రదర్శిస్తుంటారు.మరికొంత మంది వ్యక్తులు ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే ప్రదర్శిస్తారు.చిత్రంగా ఇంకొందరు అసలు కోపాన్ని ప్రదర్శించరు.మరి వారికి కోపం రాదా అంటే వస్తుంది.దానిని అంతర్గతం గా అణచుకుంటారు.అతి తక్కువ మందికి మాత్రమే అంతర్గతంగా కూడా కోపం జనించదు. వారిని మనం ఋషులు అనవచ్చు.మనమందరం మామూలు మానవులం కాబట్టి దీని నుండి ఎలా బయట పడాలో మరో వ్యాసంలో చర్చిద్దాము.
 

Saturday 26 May 2012

ఇదే కదా మరణం ఇచ్చే సందేశం!


                                         
సర్వ బంధాలనుండి విముక్తి
సమస్త బాధలనుండి స్వేచ్చ
కలగన్నవి, పెంచుకున్నవి, పంచుకున్నవి
అన్నింటిని తుంచివేసే సంపూర్ణ స్వేచ్చ
మృత్యువు జీవితానికి చివరి అంచు కాదు
ప్రతి క్షణం మరణ స్ప్రుహ  తో జీవించడం
మనిషి పోగుచేసుకున్నవన్నీ విసర్జించడం
అదే కదా మృత్యువు యొక్క ఆంతర్యం
జీవించడమంటే మరణించడమే 
ప్రతిరోజు పెంచుకున్న బంధాల్ని
ఒక్కొక్కటిగా తుంచుకోవడమే
జీవించి ఉండగానే బంధాలన్నీ వదలగలిగితే
మృత్యువు తర్వాత అదే కదా జరిగేది
జీవిస్తూనే మృత్యువును అనుభూతించడం
అదే సిసలైన ధ్యానం
మరణించడమంటే ప్రేమతో జీవించడం
ప్రేమించగలిగే హృదయం కలిగి ఉండటం
ప్రతి క్షణం మనతో ఉండే నేస్తం మృత్యువు
ప్రతి క్షణం మరణించాలి  మన జ్ఞాపకాలకు
మరు క్షణం జననం ప్రేమిం చటానికి
 క్షణక్షణం జనన మరణ స్పృహ
ఇదే జీవనం సజీవ జీవనం
ఇదే కదా మరణం ఇచ్చే సందేశం         
(జిడ్డు కృష్ణమూర్తి తత్వ సారం మరియు మరణాన్ని దగ్గరగా చూసిన అనుభవం తో ) 

Friday 18 May 2012

ఓ విరిచూపు


                                                        విరిచూపు
                              తను ఎన్నో ఆశ్చర్య కరమైన ప్రశ్నలకి
                                                              గురి అయ్యానంటోంది
                             మరెన్నో అవ్యక్తానుభూతులకు లోనై  
                                                                             ఆలోచిస్తున్నానంటోంది
                             మదిలో చెప్పలేని సందేహాలెన్నో  
                                                             మొగ్గ తొడిగాయంటోంది
                             నా పరిస్థితికి నీ ప్రయత్నాలన్నీ 
                                                             వ్యర్థమే అంటోంది
                             నా కోసం ప్రయాణించే నీ రైలు ఓ జీవితకాలం 
                                                           ఆలస్యం అంటోంది
                              నా హృది నీలాకాశంలా  విస్తరించినపుడు
                              నీ వెందుకు ప్రవేశించలేదు నేస్తమా!
                              నేనందమైన జాబిల్లినని ఇంకాస్త ముందుగా
                              ఎందుకు తెలియజేయలేదు మిత్రమా!
                              అంటూ అల్లరి కనురెప్పల
                         కదలికలు పలికిస్తున్నాయి
                              ఇంకేం మిగిలివుంది సఖుడా! నా దగ్గర
                              అద్భుతమైన నీ ఆరాధనా భావ పరంపరలు తప్ప!
                              మరింకేం చెప్పేది వీధి లైట్ కాంతి 
                              నా మీద పడి  నీ భావాల్ని జ్ఞప్తికి  తెస్తోంది  
                              ఓడ కళాసీ పాట  దూరంగా వినిపిస్తుంది
                              నీ స్వరధుని నన్ను జీవితమంతా
                        పులకరింప జేస్తూనే వుంటుంది  
                               అని కాటుక కనులువాబిస్తున్నట్లుంది
                               ఇంకా ఇలా పలికిస్తుంది చూపు
                                             వుంటాను స్నేహితుడా!
                                        నీ పలకరింపులకు దూరంగా 
                                        నీ     భావనలకు      దగ్గరగా  

Wednesday 16 May 2012

నీ ధ్యానమే!


నింగిని నేనై విశ్వమంతా పరచుకున్నా
నీ జాడను నే కనుగొన  లేకున్నా    
కవితను నేనై నీ కన్నుల్లో వికసించినా
కలనైనా కనిపించకున్నావు
కమ్మని పాటలో నిన్నునే వర్ణించినా
తియ్యని పిలుపైనా నీనుండి రాలేదు
ఊహవు నీవై మదిని నిండి
                                     ఊయల లూగావు
అనుభూతివి నీవై హృదిని నింపి
                                       ఎక్కడో వున్నావు
ఆశను పెంచి
వేదన నింపి
కవితకు అందక
కలలకు చిక్కక
కన్నీటిని తెప్పించి
కనుమరుగయిన  అనురాగమయి
తుది దాకా  నీ గానమే!
చివరి వరకు నీ ధ్యానమే!
       
 

Sunday 13 May 2012

అమ్మకు పాదాభివందనం.


అమ్మ అంటే మనల్ని సృష్టించిన సృష్టి కర్త.
       మనల్ని సృష్టించడం మే కాక భూమి మీద పడ్డ మరుక్షణం నుంచి స్తన్యమిచ్చి ఆకలి తీరుస్తూ ,జోల పాడి లాలి పోస్తూ ,ఊయలూపి  నిద్ర పుచ్చుతూ,కన్ను మూసినా,తెరిచినా మన ప్రక్కనే ఉండి  గమనిస్తూ,మన ప్రతికదలికను మనసారా ఆస్వాదిస్తూ ,ఆనందిస్తూ ,గోరుముద్దలు తినిపిస్తూ ,మారాం చేస్తే చంక నెక్కిం చుకొని చందమామను చూపి స్తూ కథలు చెబుతూ ,చిటికెన వ్రేలు పట్టుకొని నడక నేర్పుతూ,అల్లరి  ఆటల మురికిని వదలగొట్టేలా స్నానం చేయిస్తూ ,మనం చేసుకోలేని ప్రతిపనిని తాను చేస్తూ,ఇష్టమైనవి వండి పెడుతూ, మన బట్టలుతుకుతు,మన పుస్తకాలు సర్దుతూ ,తల దువ్వుతూ,మన చిరు తిండికి  డబ్బులిస్తూ,మన ప్రక్కన కూర్చుని చదివిస్తూ,అర్థం కాకపోతే విడమరచి చెబుతూ ,బాధలో వున్నప్పుడు ధైర్యం చెబుతూ,నాన్నతో మాట్లాడి మన కోరికలకు డబ్బు సమకూరుస్తు,మనం జీవితం లో స్థిర పడితే పొంగిపోతూ,మనకు సరిజోడీ ని వెతికి మన జీవితానికి పరిపూర్నత్వాన్నిస్తూ,మన పిల్లలకు కూడా సేవ చేస్తూ,మరణం వరకు మనసేవలో తరించే నిస్వార్థ జీవి ,ప్రేమ మూర్తి అమ్మకు పాదాభివందనం.

Friday 11 May 2012

ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి జయంతి నేడే






  with anniebesent


       ప్రపంచంలోని తత్వవేత్తలలో  జిడ్డు కృష్ణమూర్తి ని అగ్రగణ్యుడుగా చెప్పవచ్చు .ఈయన ఆంధ్రప్రదేశ్ లోని మదన పల్లె లో నారాయణయ్య,సంజీవమ్మ లకు 1895 మే 11 న 8 వ బిడ్డగా జన్మించారు.ఆరోజుల్లో Annie Besent తియో సాఫికాల్  సొసైటీకి ప్రెసిడెంట్ గావున్నారు .వారు మానవ రూపం లో దేవుడు అవతరించి ప్రజలను రక్షిస్తాడు ,తనే ప్రపంచగురువు పాత్ర పోషిస్తాడు అని నమ్ముతూ వుండేవారు.ఆయన రాక కోసం ప్రపంచాన్ని సిద్ధం చేయటం కోసం order of the star అనే సంస్థను స్థాపించారు.1911 లో అనీబీసెంట్ ఆయనను,తమ్ముడు నిత్యానందను గమనించిం ది. ఆమెకుకృష్ణమూర్తిలో కాబోయే జగద్గురువు కనిపించాడు.వారిద్దరిని  శిక్షణకై   England,France పంపించారు.ఆ శిక్షణ సమయంలో  ఆయనలో పూర్తిగా పరివర్తన వచ్చి  మహా ప్రజ్ఞతో ,అపర బుద్ధుడిగా గోచరిం చాడు.తరువాత నిత్యానంద మరణంతో భయంకరమైన దుఖం  అనుభవించి తనకు తాను దుఃఖ విముక్తుడై య్యాడు.ఆయన ఇలా ప్రకటించారు.
  "నా ప్రధాన లక్ష్యం ఒక్కటే_వ్యక్తి స్వేచ్చ .అన్ని భయాలనుండి,బంధాలనుండి మనిషిని  విముక్తి చెయ్యాలి."
      1929 లో  order of the star సమావేశంలో దానిని రద్దు చేసి నేను ఎవరికీ గురువును కాను నాకెవరు అనుచ రులు లేరు అని ఆ సంస్థ ఆస్తుల్ని సంపదలని వారికి పంచిపెట్టాడు.అప్పటినుండి  1986లో చనిపోయేంత వరకు ప్రపంచ మంతా పర్యటిస్తూ,ప్రజలను కలుస్తూ, చర్చిస్తూ గురువు లాగా కాకుండా,ఒక స్నేహితుడి లాగా వ్యవహ రించాడు.ఆయన పుస్తకాల జ్ఞానంతో కాక మానవుడు ఎదుర్కొనే పరిస్థుతులపై  తన అంతరదృష్టి తో,పవిత్రమైన మనస్సు తో,ఒక ప్రత్యేకమైన తత్వం చెప్పకుండా జీవిత సమస్యలను ప్రస్తావిస్తూ వెళ్ళారు.
           ఆయన ఏ మతానికి,ప్రాంతానికి,దేశానికి చెందకుండా ,ఏ సంస్థను స్థాపించకుండా ,ఏ తత్వాన్ని ప్రచారం చేయకుండా ప్రపంచమంతా తిరుగుతూ తూర్పు,పశ్చిమ దేశాల్లో ,అన్ని కాలాల్లోని తత్వవే త్తల్లో  గొప్ప స్థానం సంపాదించుకున్నారు.
*ప్రకృతి సృష్టించిన ఈ అందమైన భూమిని,పర్యావరణాన్ని ,ఇందులో నివసిస్తున్న మానవులను రక్షించుకోవాలని పిలుపిచ్చారు.
ఆయన బోధనల్లోని ముఖ్యాంశాలు.
*సత్యానికి మార్గం ,పథం అంటూ ఏమీ లేదు.
* అన్ని జీవనకళల్లోకి  ధ్యానం ఉన్నతమైనది.
*అసలైన విప్లవం పేరు ప్రేమ.మనిషిలోను,సమాజం లోను మార్పు తీసుకు రాగలిగింది ప్రేమ.
*మనలో మానసిక విప్లవం రావాలి.గతాన్నిపూర్తిగా నాశనం చేయగల విప్లవం.
*జ్ఞానం వలన మనిషి సమస్యలు పరిష్కారం కావు.సమస్య పరిష్కారానికి వివేకం కావాలి.
*ప్రేమ నిండిన మనస్సులోనే సత్య దర్శనం అవుతుంది.
*హృదయం చెప్పింది వినండి.హృదయం చెప్పినట్లు చేయండి.వెలుగు మీలోనే వుంది.
*నిన్నునీవు  గమనించు.అదే ధ్యానం.ధ్యానం అన్నది పరిపూర్ణ స్వేచ్చ.
*జీవించి ఉండగానే బంధాలన్నీ వదిలి మనసు శూన్యం అయితే ....మృత్యువు తర్వాత అదేకదా స్థితి.జీవిస్తూనే అలా మృత్యువును అనుభూతించడం  గొప్ప అనుభవం.అదే సిసలైన ధ్యానం.
*ప్రేమ,అనురాగాలతో మనిషిలో మార్పు వస్తుంది.మనలో ద్వేషం వుంటే ఇవి ఏర్పడవు.
*మరో జన్మ లేదు.భూమి మీద పుట్టిన ప్రతి జీవి నశిస్తుంది.ఆ రహస్యం తెలుసుకోవడమే జ్ఞానం.
జీవించడం అంటే ప్రతిరోజు పెంచుకున్న అనుబంధాల్ని ఒక్కొక్కటిగా తెంచుకోవడం.
*వివేచనతో,విచక్షణతో,అవగాహనతో.చైతన్యంగా ,స్వేచ్చగా,వర్తమానం లో వినడం అనేది జీవితంలో అన్నింటి కన్నా ముఖ్యం.మనం ఏ  పని చేసినా దానిని ప్రేమతో చేయాలి.
*సత్యం మీ నిత్య జీవితం లోని ప్రతి కదలిక లోను వున్నది.
*సత్యాన్వేషణమే నిజమైన విద్య.
*విద్య యొక్క  కర్తవ్యం ప్రజ్ఞావంతులైన సమగ్ర మానవులను,పూర్ణ పురుషులను సృష్టించడం.
కృష్ణ మూర్తి  సంభాషణలే తర్వాత పుస్తకాలుగా వెలువడ్డాయి.వాటిలో ముఖ్యమైనవి .
1)Education and the significance of life
2)commentaries on living (written by krishna murti)
3)The First and the last Freedom
4)note book
4)freedom fro the known
5)beyond violence
6)The awakaning of inelligence
7)A World in a crisis
8)ఈ విషయమై ఆలోచించండి.
9)గరుడ యానం
10)నీవే ప్రపంచం
11)విద్య:అందు జీవితమునకు గల ప్రాధాన్యం
జీవితాన్ని  గురించి  క్షుణ్ణంగా  తెలుసుకోవాలనుకునే  వారు ఆయన రచనలు,బోధనలను పరిశీలించాలి.
ఆయన విద్యకు జీవితం లో చాలా ప్రాముఖ్యత ఇచ్చారు.అందుకై అమెరికా,ఇంగ్లాండ్ ,ఇండియా లలో
స్కూల్స్ ఏర్పాటు చేసాడు.
ఈ దిగువ వెబ్ సైట్  లలో ఆయన గురించి మరింతగా తెలుసుకోవచ్చు.

*     www.kfionline.org
*     www.jkrishnamurti.org

The official Krishnamurti Schools are:

కృష్ణ మూర్తి చే స్థాపించబడ్డ స్కూల్స్ .

1)USA - Oak Grove School
220 W. Lomita Ave., Ojai, California 93024-1560 USA
Tel: (805) 646-8236 Fax: (805) 646-6509
Email: office@oakgroveschool.com
Admissions: enroll@oakgroveschool.com
Web: www.oakgroveschool.com

2)UK - Brockwood Park School
Bramdean, Hampshire, SO24 OLQ, England
Tel: 011-44 (0)1962 771744 Fax: 011-44 (0)1962 771875
Email: info@brockwood.org.uk
Web: www.brockwood.org.uk

3)India - Rishi Valley Education Center
Rishi Valley - 517 352, Chittoor District, Andhra Pradesh, India
Tel: 011 91 8571 62037
Fax: 011 91 8571 68622
Web: www.rishivalley.org
India - Rajghat Education Center

4)Rajghat Besant School, Rajghat Fort, Varanasi
Tel: 91-542-2430336, 2440717, 2441536
Emails: rbskfi@gmail.com, kfirajghat@gmail.com
Webs: www.j-krishnamurti.org, www.rajghatbesantschool.org

5)India - The School "Damodar Gardens"
Besant Avenue, Chennai - 600 020 India
Tel:011 91 44 491 5845
Web: www.theschoolkfi.org

6)India - Bal Anand, Mumbai
Akash Deep, 28 Dongersey
Road Malabar Hill, Mumbai--400 006

7)India - The Valley School Bangalore Education Center
"Haridvanam", 17th K.M. Kanakapura Road,
Thatguni Post, Bangalore - 560 062 India
Tel: 011-91-80-843-5240
Fax: 011-91-80-843 5242
Email: kfiblr@blr.vsnl.net.in
Web: www.jkstudy.org

8)India - Sahyadri School
Sahyadri School, Post Tiwai Hill, Tal. Rajgurunagar, Dist. Pune 410 513
Thatguni Post, Bangalore - 560 062 India
Tel: 011 91 2135 84270/84271/84272
Fax: 011 91 2135 84269
Email: sahyadrischool@freeyellow.com
Web: www.sahyadrischool.org:    

Sunday 6 May 2012

నేడే గౌతమ బుద్ధ జయంతి


                                  ఈ రోజు గౌతమ బుద్ధ జయంతి .మానవాళికి తెలిసిన అతి ప్రాచీన తాత్వికులలో ఆయన ఒకరు.సంక్షిప్తం గా బుద్ధుని గురించి ఆయన బోధనల గురించి తెలుసుకుందాము.ఈయ న అసలు పేరు గౌతముడు..తండ్రి శుద్దోధనుడు,తల్లి మాయాదేవి.క్రీ .పూ 565_485 మధ్య కాలం లో జీవించాడు.తల్లి మరణం తో పినతల్లి మహాప్రజపతి పెంచింది.యుక్తవయస్సు లో యశోధర తో వివాహం అయింది.వారికి ఒక కుమారుడు.పేరు రాహులుడు.నేడే 
       దారుణమైన ,నివారణా సాధ్యమైన మానవాళి కష్టాలు ఆయన అనుభవం లోకి వచ్చాయి ఆకలి అంటురోగాలు,ఆహార కొరత వీటిని ఆపేందుకు మార్గం లేదా అని ఆలోచించాడు.ఇవన్నీ చూస్తూ రాజ భోగాలు అనుభవిస్తూ ఉండటమా!లేక గొప్ప లక్ష్య సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేయడమా!నాటి ప్రజాబాహుల్యం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు ఒక పరిష్కారమార్గాన్ని కనుగొనుటకు అవసరమైన జ్ఞానాన్ని సంపాదించడానికి రాచరిక జీవితాన్ని వదిలి వేశాడు.ఏడు సం:సుదీర్గమైన తపస్సు అంటే పరిశోధన చేసాడు.బుద్ధగయ వద్ద జ్ఞానోదయం అయింది.కఠినమైన శిక్షణ,ఏకాగ్రత అలవరచుకున్నాడు.ఒక ప్రత్యేకమైన జీవన విధానాన్ని,ఆలోచనా విధానాన్ని సాధన చేసేందుకు అనుగుణంగా తన శరీరాన్ని మన సును పదును పెట్టుకున్నాడు.బుద్ధుడు అనే బిరుదు ప్రజలు, శిష్యులు ఆయనికి ఇచ్చారు.గౌతముడు ఈ జ్ఞానాన్ని ,మానసిక పరిపక్వతను అద్యయనం,బోధన అనే నిరంతర ప్రక్రియల ద్వారా సంపాదించు కున్నాడు .
       ఆయన బోధనల్లోని ముఖ్యాంశాలు.
*"నా లోపలినుంచి జ్ఞానం ఉదయించిన తర్వాత కోరికల మత్తునుంచి,పునర్జన్మ మత్తునుంచి అజ్ఞానమనే మత్తు నుంచి నా హృదయం ,నామనసు విముక్తి చెందాయి.జ్ఞానం,స్వాతంత్ర్యం నాకు స్వేచ్చను ప్రసాదిం చాయి.పునర్జన్మ లేదని నాకు తెలిసింది.నేను నా లక్ష్యాన్ని చేరుకునాను."
     స్వీయ జ్ఞాన సముపార్జన కోసం దుర్భరమైన కష్టాలు అనుభవించిన అనంతరం గౌతముడు జ్ఞానిగా మారాడు.అప్పటినుండి బుద్ధునిగా పిలవ బడ్డాడు.
*"భావోద్రేకాల ఉచ్చును చేదించడం తెలిసిన వాడిని,జనాన్ని కష్టాల సుడిగుండం నుంచి కాపాడగలిగిన వాడిని,ఐహికవాంఛలకు స్వస్తి పలికి వాటి కాటుకి బలికాకుండా చేయగలిగిన వాడిని.సత్యమనే వెలుగు ద్వారా అజ్ఞానపు చీకటిని చెల్లా చెదురు చేయగలిగిన వాడిని తద్వారా మనిషికి అసలైన నిబ్బాన(నిర్వాన)దశను అందించగల వాడిని నేనే!"
    తాను ప్రవచించింది ఆచరించి చూపిన  మనీషి బుద్ధుడు .ధనం కోసం గాని కీర్తి గాని ఆశించకుండా ఏ వ్యక్తి అయినా వ్యవహరిస్తే అతనే బుద్ధుడు.తనకు తాను ఏ దివ్యత్వాన్ని ఆపాదించుకోలేదు.
   హృదయ బంధనాలు విచ్చిన్నమయ్యాయి.సందేహాలన్నీ  పటాపంచలై,భవబంధాలను ప్రేరేపించే కర్మలన్నీ  నివ్రుత్త మయ్యాయి.పరమ సత్యం తేట తెల్లమయింది.బుద్ధుని హృదయం కరుణతో నిండి పోయింది.
 ఆయన ప్రవచించిన అష్టాంగ మార్గం.
1)సమ్యక్ దృష్టి (మంచి ఉద్దేశాలు)RightViews
2)సమ్యక్ సంకల్పం (మంచి  ఆశలు)Right Aspirations
3)సమ్యక్ వచనం (మంచి  మాటలు)Right Speech
4)సమ్యక్ కర్మ (మంచి ప్రవర్తన)Right Conduct
5)సమ్యక్ జీవనం(మంచి బ్రతుకు దెరువు)Right Livelyhood
6)సమ్యక్ ప్రయత్నం(మంచి వ్యాయామం) Right Effort
7)సమ్యక్ స్మృతి(మంచి మనస్సు,ఆలోచనలు) Right Mindfulness
8)సమ్యక్  సమాధి(మంచి ఉల్లాసం స్వీయ నియంత్రణ)Right Contemplation
               ఇవి బుద్ధుడి తత్వ శాస్త్ర మూలాలు.
    ఈ విశ్వానికి ఒక క్రమబద్దత వున్నదని ,దాని తీరుకు ఒక ఆధారం వున్నదని ప్రకటించాడు.జ్ఞాన శాస్త్రం మీద ఈ ప్రకటన ప్రభావం అపారంగా వుంది.
బుద్ధుడు బౌతిక ఆధ్యాత్మిక వాదాన్ని మేలవించాడు.తన జీవితమంతా ఆత్మ చైతన్యం ,ఆత్మ నియంత్రణ కోసం కృషి చేసాడు.
*కోరికలు,లోభం దుఖానికి కారణం.బాధ,బాధకు మూలం ,బాధా విముక్తి,బాధా విముక్తికి మార్గం--ఈ మహాసత్యాలు సంపూర్ణం గా అవగాహన అయిన తర్వాత జీవన ప్రక్రియ పట్ల మొహం నశిస్తుంది.
*సంపూర్ణంగా మనసా,శారీరకంగా సత్యాన్వేషనే లక్ష్యం.
*అనిత్యమైన అహాన్ని వదిలి నిత్యమైన సత్యాన్ని గుర్తించాలి.
పౌర సమాజానికి ప్రవర్తనా నియమావళిని రూపొందించిన గొప్ప ప్రాచీన తాత్వికుడు బుద్ధుడు.
ఒక కారణం నుంచి మొదలయ్యే వాటన్నింటికి బుద్ధుడు కారణాన్ని వివరించాడు.ప్రతి కారణం ఎలా అంతమవుతుందో కూడా చెప్పాడు.ఇదే మహా జ్ఞాని ప్రవచనం.
 ప్రతి దానికి ఒక కారణం వుంటుంది.ప్రతి కారణానికి తనదైన ప్రభావం వుంటుంది.అనే సత్యాన్ని కనుగొనడం ద్వారా సమకాలీన పాశ్చాత్య తత్వవేత్తల నందరినీ అధిగమించాడు.
*కారణం _ప్రభావం.
   క్రీ.పూ ఆరవ శతాబ్దిలో బుద్ధుడు ఇంతటి సమున్నత శిఖరాలు అందుకోవడం చాల గొప్ప విషయం.
     బుద్ధుడు  తన  80 వ  ఏట క్రీ.పూ 480_485 ప్రాంతం లో చనిపోయాడు.
(కంచ ఐలయ్య గారు ,స్వామి రంగనాదానంద గార్ల  రచనలనుండి సేకరించిన సమాచారాన్ని ఇచ్చాను.వారికి సదా కృతజ్ఞతలు.)
           


Friday 4 May 2012

చెలీ!


                                     విశాల విశ్వంలో నీవు వినిపించని
                                     గీతికలా వున్నావెందుకు
                                     ఆ గీతాన్ని నాకిస్తే శ్రుతి చేసి
                                     మధురంగా పలికించనా
                                సముద్రంలో చిన్న అలవై
                                మిగిలిపోయావెందుకు
                                కెరటంలా ఒడ్డుకు రావా
                                నన్ను నీలో కలుపుకునేందుకు 
                                     వెన్నెల ఆకాశంలో చిన్న
                                     నక్షత్రమై వెలుగుతావెందుకు
                                     పున్నమి వెన్నెలవు నీవైతే
                                     పులకరించే కలువను నేను కానా
                               వాన వెలసిన వేళలో
                               ఒంటరిగా వున్నావెందుకో
                               ఇంద్ర ధనుస్సువు నీవైతే
                               ఆ వింటినారిని నేను కానా
                                    తెలవారిన తర్వాత
                                    ఏటి ఒడ్డున నీటి కోస్తావెందుకు
                                    కొద్దిగా ముందొస్తే  సుప్రభాత సంగీతాన్నై
                                    నీ వీనుల విందు చేయనా
                              చెలీ నా భావాల వీణ లోని
                              ప్రతి తీగను మీటాను
                              ఏ రాగం నిన్ను కదిలించినా
                              ఆ తొలకరి మేఘాని కందించవా  

Thursday 3 May 2012

జాతీయ ఆనంద సూచిక

          ఇంతకు ముందు పోస్ట్ లో  మానవ  జీవిత లక్ష్యమేమిటి? అంటే ఆనందం అని తెలుసు కున్నాము. మరి ఒక దేశం దాన్ని తన జాతి జీవన విధానం గా మలిస్తే ఎలా వుంటుంది.భూటాన్ లా వుంటుంది.అన్ని దేశాలు Gross National Product(GDP)  ను లెక్కిస్తుంటే భూటాన్  మాత్రం Gross National Happieness(GNH) ను లెక్కిస్తుంది.అంటే స్థూల జాతీయ ఆనందం .ఎంత బాగుందో కదా!
                        వారిని పర్యావరణ మైత్రి,సంస్కృతి పరిరక్షణ,సుపరిపాలన,ఆర్ధిక వృద్ది  నిత్య సంతోషం గా వుంచుతు న్నవి.వాళ్ళు ప్రకృతిని విపరీతం గా ప్రేమిస్తారు.అక్కడ 72% అడవులు వున్నాయి .జంతువు లను వేటాడరు ,నదుల్లో చేపలను కూడా పట్టరు .బౌద్ధం వారి జీవన విధానం .ప్రకృతి మా ప్రాణం అంటారు వారు.టి.వి. వారి దేశం లో 1999 లో ప్రవేశించింది.తమకు అంగీకారం కాని చానళ్ళకు అడ్డుకట్ట వేసింది.
               ప్లాస్టిక్ మీద అక్కడ పోరాటం జరుగుతోంది.ఇక్కడ  అన్ని రకాల పొగాకు అమ్మకాలు నిషిద్దమే!ఇక్కడ నీరు,గాలి అత్యంత స్వచ్చంగా వుంటాయి.పర్యావరణాన్ని  పారిశ్రామీకరణ  దెబ్బతీస్తుందని ప్రోత్సాహించటం లేదు.పర్యాటకుల వల్ల కూడా పర్యావరణం దెబ్బ తింటుందని  వారిని నియంత్రిస్తారు.
         ఇంతలా పర్యావరణాన్ని ప్రేమిస్తూ ప్రకృతి లో ఆనందం గా బ్రతుకుతున్న దేశాన్ని,ప్రజలను ఎక్కడా చూడలేమేమో!జీవితాన్ని సంతృప్తిగా ,మనః శాంతిగా గడపడానికి అక్కడి ప్రభుత్వం పనిచేస్తుంటే ప్రజలంతా దానికి మద్దతు పలుకుతున్నారు.ఓ సారి ఆ దేశాన్ని చూసొద్దామా!
     (మూలం :ఈనాడు ఆదివారం పుస్తకం .వారికి కృతజ్ఞతలు.)

Monday 30 April 2012

నేడే!మేడే!

హలాలతో పొలాలదున్నీ
జాతికి జవసత్తువనిచ్చే 
కర్షకవీరుల త్యాగం.
గనిలో,పనిలో,ఖార్ఖానాలో  
విరామమెరుగక,విశ్రమించక
జగతికి జవజీవాలిచ్చే 
కార్మికధీరుల కష్టం.
మెలి తిరిగే నరాలతో 
పట్టువీడని కరాలతో
జనుల అవసరాలు తీరుస్తున్న 
శ్రామిక లోకపు స్వేదం.
కండర కష్టం నమ్ముకొని 
ఎండను,వానను,చలినీ 
లెక్కచేయని తత్వం.
చక్రం,రంపం
పగ్గం ,మగ్గం
కొడవలి,నాగలి
సమస్త వృత్తులు
శ్రమైక జీవన సౌందర్యానికి 
అచ్చమైన ప్రతీకలు.
మీ కల్యాణానికి 
మీ సౌభాగ్యానికి 
మీ పోరాటానికి 
నేడే!మేడే!
                   ఈ కవితకు స్పూర్తి  శ్రీశ్రీ మహాప్రస్థానం లోని ప్రతిజ్ఞ అనే కవిత    
                                 శ్రామిక లోకానికి మేడే శుభాకాంక్షలు.

Saturday 28 April 2012

మానవ జీవన లక్ష్యమేమిటి?3


             మానవ జీవన లక్ష్యమేమిటి? ఈ  ప్రశ్నతో ఇంతకు ముందు వ్యాసం ముగించాను కదా! వ్యాసంలో  మనకు నష్టం చేసే సంస్కారాలను పేర్కొన్నాను.వాటిలో కొన్ని జన్యుపరంగా వచ్చే అవకాశం కూడా వుంది .ఉదాకోపము అలాగే మంచి సంస్కారాలు కూడా ఏర్పడతాయి. పరిసరాలద్వారా, ఎదురయ్యే సంఘటనల ద్వారా ఎదు ర్కొన్న సమస్యల ద్వారా, తల్లిదండ్రులు నేర్పిన విలు వల ద్వారా ఇవి ఏర్పడుతుంటాయి.
             అవి ప్రేమ,కరుణ,దయ,సహనం ,శాంతి,అహింస,సేవాగుణం ,సర్దుకుపోయే తత్వం,అర్థంచేసుకోవటంఅణకువ ,విచక్షణ కలిగివుండటం,వినయం,వివేకం,త్రుప్తి,ప్రశాంతత నిరహంకారం ,ఆశావాదదృక్పథం, గెలుపు, ఓటములను సమంగా తీసుకోవటం, కుతూహలం ,ఆసక్తి ,పెద్దలను గౌరవించటం ,నిజా యితి,స్వచ్చత,పవిత్రత, స్నేహతత్వం,ఆనందం,మానవత్వం,నైతికత,సత్యమునే పలకటం,క్రమశిక్షణ, జిజ్ఞా,బాధ్యత,అన్వేషణా దృక్పథం   విధేయత,నమ్మకం,సమయపాలన,నిస్వార్థం,మర్యాద ,ప్రశంసించటం,అంకితభావం,పట్టుదల,కృషి,ప్రశాంతచిత్తం మార్పును ఆహ్వానించటం ,ఓపిక,జాగ్రత్త,సున్నితత్వం సోదరభావం,క్షమాగుణం సానుభూతి,జాలి,ప్రోత్సాహంకృత జ్ఞత,అవగాహన,దేశ,వర్ణ,కుల,మత,ప్రాంతాలకతీతమైన మనస్తత్వం (విశ్వమానవ సౌబ్రాత్రుత్వం) వంటివి.వీటిలో కూడా కొన్నిజన్యుపరంగా,జీవితంతో పాటు నేర్చుకునేవి కొన్నివుంటాయి.కానీ ప్రస్తుతం సంస్కారాలు మనుష్యు లలోతగ్గి పోతున్నాయి.
           మనం చేసే చర్యలను బుద్ది ఇది తప్పు,ఇది ఒప్పుఅని చెబుతూవుంటుంది.కానీ దాని మాటను మనసు లెక్కచెయ్యదు.మనిషి వ్యతిరేక సంస్కారాలు ప్రదర్శించటం,అనుభవించటం అలవాటు చేసుకున్నాడు.పై చెప్పిన అనుకూల సంస్కారాలపై నిలబడాలంటే ఎంతో నిబద్ధత కావాలి.బ్రతుకు పోరాటంలో పడి ఇవన్నీ వదిలేసి నష్ట పరచే సంస్కారాలను పెంచుకుంటూ పోతున్నాడు.కాని మనకు తెలియకుండా ఇవన్నీ మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపి రకరకాలైన మానసిక వ్యాధుల రూపంలో దీర్ఘకాలికంగా వస్తున్నాయి.మంచి సంస్కారాలు మనిషికి అద్భుత మైన  ఆరోగ్యాన్నిస్తాయి.చూడండి! పల్లెటూరి వారికి రక్తపోటు,షుగర్,గుండె జబ్బులు,అధిక బరువులాంటి సమస్య  లు చాలా తక్కువగా వుంటాయి .కోరికలు తక్కువ .ఉన్నదానితో సంతృప్తి చెందుతారు.
                         ఇక మనిషి జీవిత లక్ష్యమేమిటి? పాటికే మీకు అర్థమయ్యే వుంటుంది.
            క్షణక్షణం ఆనందంతో జీవించటం.సుఖ,సంతోషాలు బాహ్యమైనవి.ఆనందం అంతర్గత మైనది .అది లోపలి నుండి పెల్లుబుకుతుంది.హృదయము నుండి మనసులోకి వస్తుంది.మంచి సంస్కారాలతో ఆనందం వస్తుంది మనస్సంతా ప్రేమను నింపుకొని వుంటే మనమంతా అన్వేషించే అద్భుతం ప్రత్యక్షమవుతుంది అదే సత్యం.  

Friday 27 April 2012

నా హృ(మ)ది లో ...



మానస వీణకు తీగెలు సరిచేసి
స్వరాలు కూరుద్దామని కూర్చున్నా
సంధ్యా సాగరపు ఒడ్డున
అప్పుడప్పుడు పాదాలు స్పృశించే
అలల చిరుతాకిడి  చెంతన
మనసు నా వశం కావటం లేదు
సరిగమలు పలికిస్తున్నంతలో
ఉవ్వెత్తున సవ్వడి చేస్తూ కెరటాలు
ఎక్కడికో వెళ్లాలని
సముద్రుని విడిచి ఎగరాలని
అంతలోనే మళ్ళీ వెనక్కి
నా ఆలోచనలు అంతే
ఓ వరుసలో కూర్చి పాటగా పలికిద్దామన్నా 
పల్లవులను కూర్చి గొంతెత్తి పాడుదామన్నా
ఏవో సంక్లిష్ట సంకేతాలు
మరేవో అస్పష్ట సంగీతాలు
నా మనో సాగరాన ఒక్కోసారి నెమ్మదిగా
ఇంకోసారి ఉధృతంగా విరుచుకుపడే స్థాయిలో
ఏవేవో ఒత్తిడులు
మరేవో బంధాలు
ఒత్తిడులనుండి కొన్ని దృశ్యాలు
బంధాలనుండి మరిన్ని చిత్రాలు
కాని కెరటాల్లా కాకూడదు నావి
నిగ్రహంతో లక్ష్యాన్ని ఢీకొనాలి
తీగెలు సరిచేస్తూ కాలం గడిపేయకూడదు.
గుర్రపు గిట్టల బలంతో విచారపు
గతాన్ని వెనక్కి తన్ని
వర్తమానపు సంకేతాలను మోసుకుంటూ
భవిష్యత్ ఛాయాపథం లోకి దూసుకెళ్ళాలి.
తేనె లొలుకు తెనుగుకు మాలలు కట్టి
తీయనైన పాటలతో హారతి పట్టి
ముందుకు మున్ముందుకు వెళతాను
కష్ట జీవి స్వేదంతో నేను కలిసిపోతాను
కార్మికుడి కన్నీటిలో లీనమౌతాను
అనాధ నేత్రాలకు వెలుగౌతాను
ఇదంతా కేవలం భావోద్వేగం కాదు
నా హృదిలోని  స్పందనలు
నా మదిలోని   భావనలు

Thursday 26 April 2012

"విజ్ఞానశాస్త్రము"అనే నూతన బ్లాగు

                సైన్సు పై తెలుగులో "విజ్ఞానశాస్త్రము"అనే నూతన బ్లాగును ప్రారంభిస్తున్నాను.ఇంతవరకు ఏ అగ్రిగేటర్ లో చేర్చలేదు. కారణం మొదట దానిని ఇంగ్లీష్ బ్లాగు గా ప్రారంభించటమే!ప్రస్తుతం దీన్ని తెలుగు లోకి మార్చి అన్ని agregators తో  లింక్ చేయటం జరిగింది.
              సైన్సు ద్వారా సత్యాన్వేషణ మరియు శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ది చేయటం దీని ప్రధాన ఉద్దేశం .విద్య అంతా ఇంజనీరింగ్,మెడిసిన్ ల వైపు వెడుతుంది.సైన్సు గురించి తెలియజేయటమే కాకుండా అందులో కుతూహ లాన్ని,జిజ్ఞాసను రేకెత్తించే విధంగా ఇందులో వ్యాసాలూ వుంటాయి.మీ పిల్లలచేత చదివించి మీరు అర్థము చేసుకొని వారికి వివరించగలరు.
              ప్రస్తుతం ఈ విశ్వం 18  సూత్రాలు పై నడుస్తుందని శాస్త్రవేత్తలు తీర్మానించారు.వాటి గురించి వ్యాసాలూ వస్తు న్నాయి. విద్యార్థులు,ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు .సైన్సు పట్ల ఆసక్తి వున్నవారు  దీనిని ఉపయోగిం చు కోగలరు 
ఈ   బ్లాగు  పై దీని url వున్నది . ఈ బ్లాగు   url   http://cvramanscience.blogspot.in