Thursday 22 March 2012

ఉగాది

తెలుగు వారందరికీ నందననామ సంవత్సర శుభాకాంక్షలు .మనమింత స్వేచ్చగా ,స్వచ్చంగా భావ వ్యక్తీకరణ చేస్తున్నామంటే మన మాతృభాష తెలుగు కారణం.మనకెన్ని భాషలయినా  వచ్చి  ఉండవచ్చు,కాని మన అంతరంగ లోతుల్ని ఆవిష్కరించేది మన మాతృ భాషే!ఆనంద విషాదాలు ,ఆప్యాయతానురాగాలు,ప్రేమాభిమానాలు మన సమస్త భావోద్వేగాలు మన భాష లో ప్రకటించినంత స్వచ్చం గా  వేరే భాష లో ప్రకటించలేమేమో !                                                  
                                       అందుకే ఐక్యరాజ్యసమితి కూడా   ఎవరి మాతృభాష  ను  వారు  పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చింది .ప్రపంచం లోని ఇంత అభివృద్ధికి ,ఇంత నాగరికతకు భాషలే కారణం .మన భాషను మనం కాపాడుకుంటూ ఇతర భాషలను నేర్చుకుంటూ ఆ భాషల్లోకి మన సాహిత్యాన్ని తర్జుమా చేస్తూ వారి సాహిత్యాన్ని మన వారికందిస్తూ ,విభిన్న సంస్కృతుల సంగమానికి మార్గాలు  వెయ్యాలి .అప్పుడు మన భాష లోని సౌందర్యం ఇతర భాషలలోనికి వారి భాష ల లోని మాధుర్యం మనం గ్రోలటానికి అవకాశం వుంటుంది.చాలా మంది పెద్దలు ఈ ప్రయత్నం లో వున్నారు.ప్రపంచ చరిత్ర అంతా  భాషలలోనే ఇమిడి  వుంది.మనం ప్రస్తుతం ఉపయోగించే బ్లాగులు  కూడా భాషా  వికాసానికి బాగా   ఉపయోగ పడుతున్నాయి .THANKS TO GOOGLE.
 

Tuesday 20 March 2012

పోలికలోనుండి పుట్టిన ఈర్ష్యను ఎలా జయించాలి?

                   యువకులుగా వున్నప్పుడు  జీవితం గురించి  ఎన్నో కలలు  కంటాం.జీవితంలో విభిన్న వృత్తుల్లో స్థిర  పడ్డ తరువాత వెనుదిరిగి చూసుకుంటే కొన్ని నెరవేరుతాయి.మరికొన్నినెరవేరవు.మరికొంతమందికిఅసలేమి  నెరవేరవు.ఈ లోపు మీతో చదువుకున్న వాళ్ళు ,మీ బంధువులు,మీ స్నేహితులు ,మీ పక్కింటి వారు  మీకన్నా బాగా స్థిరపడి వుంటారు.అప్పుడు మొదలౌతుంది  మీలో.వారిలా మనం లేమే .వారికున్న  ఆస్తులు,హోదా,అందం  ,పలుకుబడి మనకులేవే అన్న పోలిక మొదలౌతుంది.అందులోనుండి  ఈర్ష్య పుడుతుంది.ఈ పోలిక తో ప్రారంభమయిన ఈర్ష్య మనిషిని  ఒక పట్టాన వదలదు.కొంతమంది దీన్నిఆరోగ్యకరమయిన రీతిలో తీసుకొని తాము ఎదగటానికి ప్రయత్నిస్తారు.మరికొంతమంది ఈర్ష్య స్థితిలోనే జీవితాన్ని  కొనసాగిస్తారు.ఈ మొత్తం ప్రక్రియను పరిశీలిస్తే ఎవరు ఇదంతా చేస్తుంది,అని ఆలోచిస్తే మీకు మన మనసే అని సమాధానం దొరుకుతుంది.
                       మరి ఈ ధోరణి సరి అయినదేనా !సరి అయినది కాదు అనుకుంటే దాని వాళ్ళ నష్టం ఏమిటి అని ఆలోచిస్తే ,ఈర్ష్య ఒక నకారాత్మక  మానసిక స్థితి.అది నిరంతరం మనసును మెలిపెడుతుంది.మనకు తెలిసిన ప్రతి ఒక్కరి ఉన్నత స్థితిని పోల్చుకుంటుంది.తనకు లేదని దిగులు చెందుతుంది.దాంతో వారిపట్ల వ్యతిరేక భావాన్ని
పెంచుకుంటుంది .దీని లోంచి ఎదుటివారికి ఏదయినా నష్టం జరిగితే  మనసు ఆనందిస్తుంది.ఎదుటివారు దెబ్బ  తినాలని కోరుకుంటుంది .వారికి విజయాలు లభిస్తే తట్టుకోలేనంత అసూయ కలుగుతుంది.ఇదంతా మనసు లో పేరుకునిపోయి విభిన్నమయిన వ్యాధులుగా బయటపడతాయి.ముఖ్యం గా వ్యాపారం లో వున్నవారు,క్రీడాకారులు ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారికి   ,ప్రభుత్వ స్థాయి లోని అధికార యంత్రాగం లోని వారికి ,వారు వీరని కాదు అన్ని వర్గాలలో ఇది ఎంతోకొంత వుంటుంది.,ఇంత నష్టం కలుగుతుంటే మనం దాన్ని అనుభవించాల్సిందేనా!మరి పోలిక నుండి పుట్టిన ఈర్ష్యను తొలగించు కోవాలంటే   ఎలా?
                    ఒక్క సారి మనసు చేసే ఈ ప్రక్రియను దాని ద్వారానే విశ్లేషిద్దాము.మనం మనకి పరిచయం లేని వారితో ఎందుకు పోల్చుకోము.ఇది అర్థమయితే ఈ ప్రక్రియ అంతా ఆగిపోతుంది.ఎందుకంటే మీకు వారు తెలుసుకాని వారికి మీరు తెలీదు కాబట్టి.వారెప్పుడు మీకు పరిచయం లేదుకాబట్టి.ఒక సారి ఆలోచించండి.మీరు పోల్చుకునే వారికంటే కొన్ని కోట్లమంది ఎక్కువ సంపద కలిగినవారు ఉన్నారు.ఉదాహరణకు మనకు billgates(microsoft) ను ,ముకేష్ అంబాని ని చూసినా  ఎటువంటి ఈర్ష్య కలగదు ,కాని    మన స్నేహితుడు కాస్త ఉన్నత స్థితిలో  వుంటే  అసూయ కలుగుతుంది.అలాగే మన సహోద్యోగి మన కన్నా కాస్త సంపదకలిగి వుంటే మనసు విలవిలలాడి  పోతుంది.ఈ తేడా ను జాగ్రత్తగా అంచనా వేయండి.తెలిసిన వాళ్ళయినా ,తెలియని వాళ్ళనయినా ఒకే  రకం  గా పరిగణిస్తే మనసుకు ఈ సంఘర్షణ ఉండదుకదా !అసలు ఎవరి అవకాశాలు వారివి.ఒకరివి  ఒకరికి  రావు  కదా .మనం ఆలోచించాల్సింది  మనం ఎంత సంతృప్తిగా జీవితాన్ని కొనసాగిస్తున్నాము.ఎంత ఆనందంగా  వుండగ లుగుతున్నాము అన్నది  ప్రధానం.జీవితమంటే  ఆనందం, ఒక సంతృప్తి,ప్రతిక్షణం  పరిపూర్ణం గా జీవించాల్సిన  ఒక ప్రయాణం .ఈ విధంగా ఆలోచించండి.మనసు  పోలికలు లేకుండా పరిపూర్ణంగా వుండటం మీరే  చూస్తారు.

Sunday 18 March 2012

ఇవన్నీ ప్రేమలా వుంటాయోమో!

పూల పరిమళం
వెన్నెల వర్షం
హిమపాతపు చల్లదనం
ఉషోదయ గీతం
సంధ్యా రాగం
ఇంద్ర ధనుస్సు వర్ణం
ఇవన్నీ ప్రేమలా వుంటాయోమో!  

Saturday 17 March 2012

ప్రకృతీ పదనిసలతో సరిగమలు

కురిసీ కురియని మేఘాలెన్నో వచ్చి వెళుతున్నాయి
వసంతాలు హేమంతాలన్ని కరిగి పోతున్నాయి
వెలుగు వెనుక చీకటి,చీకటి వెనుక వెలుగులెన్నో
                                                              దొర్లిపోతున్నాయి
అమావాస్యల అనురాగాలు ,వెన్నెల మందారాలు
                                                             మౌనంగా వెళ్ళిపోతున్నాయి
తీరం తెలియని నావ సంద్రంలో సంగమించి పోబోతుంది
ఉషోదయం చూసి ఉత్సాహంగా ఉందామన్నా
సంధ్య వెలుగువచ్చి చీకటికి స్వాగతమిస్తుంటే
మనసు,మమతల మకరందాలు విన్నవించ లేకున్నా
 మాటలకు రూపమిద్దామని అనుకున్నానంతలో
నీలాల గగనాన జాబిల్లి ఎందుకో ననుచుసి నవ్వుతోంది
పాటకు పల్లవి కూరుధ్ధామన్నా నా శబ్ద విపంచులు
ప్రకృతి నాదాల సవ్వడిలో కలిసిపోతున్నాయి
కవిత్వాక్షరాలను అవనిఫై  అక్షరీకరిద్దామన్నా
ఏమిటో అంతర్భాగాన అర్థం కాని నాదాలు,బాహ్యప్రపంచాన
                                                                            దుఖాశ్రువుల గీతాలు
నీ చిరునవ్వుల ముఖ సౌందర్యాన్ని   
                                            ఆకాశం కాన్వాసుమీద చిత్రిద్దామన్నా
అంతలో తెల్లని మేఘాల మాలికలు
                                             నీ చిరునవ్వులనే శ్రుతి చేస్తున్నాయి
అంటే నీవు నీవుగా లేవనుకుంటున్నాను
నీ కోసం వేచిచూసి చూసి విసుగుచెందానని భ్రమిస్తున్నాను  
ఇప్పుడర్ధమయ్యింది నీవు మౌనంగా దాచుకున్న హృదయానురాగాలను
ప్రకృతిలో మిళితం చేసావని
ఇప్పుడనుకుంటున్నాను!ప్రకృతి రూపమే నీవు,నీ రూపమే ప్రకృతని
కాని నిన్నుచూడాలని సవంత్సరాలతరబడి వేచిచూసిన  ఫలితాన్ని
ఇంత మనోహరమయిన   ప్రత్యూష నాదాలతో పల్లవించే
ప్రకృతీ పదనిసలతో సరిగమలు కూర్చావన్న మాట               

Tuesday 13 March 2012

స్నేహం అంటే ఓ ఆహ్లాదం 2

   ఎటువంటి చుట్టరికం లేకున్నా సన్నిహితంగావుంటూ కష్ట సుఖాలు ,ఆనంద విషాదాలు,సమస్యలు పంచుకోవటం ,ఓదార్పును పొందటం,ఇవ్వటం అవసరమయిన మేర సహకరించుకోవటం ఇవీ స్నేహ ధర్మాలు.బాల్య స్నేహితులు గా వుండి,విడిపోయి ఎప్పుడో మరల కలుసుకున్నా ఆ అభిమానాలు అలానే ఉంటాయి.యువకులుగా ఉన్నప్పటి స్నేహాలలో కొంచం సాంద్రత తక్కువగా వుంటుంది  ఇక జీవితాలలో స్థిరపడ్డ తరువాత ఏర్పడ్డ స్నేహాలు ఎక్కువ కాలం కొనసాగుతాయి.
         మరి ప్రస్తుత స్నేహాలు సమీక్షిస్తే ఒకప్పుడు ఉన్నంత మంచి స్నేహాలు, మిత్రులు ప్రస్తుతం ఉంటున్నారా!ఆర్థిక వ్యత్యాసాలు స్నేహానికి కొలమానం అవుతున్నాయా?అభిప్రాయ భేధాలతో స్నేహాలను వదులుకొంటున్నారా !పోటీ ప్రపంచం లోని ఈర్ష్య ,అసూయ ,పోలికలు స్నేహాలను దెబ్బ తీస్తున్నాయా?ఇవన్నీ ఆలోచిస్తే స్వచ్చమయిన      స్నేహంలోని సాంద్రత బాగా తగ్గినట్లు కనిపిస్తుంది.ఎదుటి మనిషి మనకు ఎలా ఉపయోగపడతాడా!అని ఆలోచించేవారు ఎక్కువయ్యారు.అవసరాలకోసం స్నేహాలు ఎక్కువయ్యాయి.వ్యాపార లావాదేవీల్లో స్నేహితులను మోసం చేసే వ్యక్తులు పెరిగి పోయారు.నమ్మకంగా వుంటూ మిత్ర ద్రోహం చేసే వాళ్లకు కొదువ లేదు.హోదా అంతస్తులు స్నేహాన్ని నిర్దేశిస్తున్నాయి.తమ తాహతుకు తగ్గ వారితోనే స్నేహాలు చేస్తున్నారు.ఇవన్ని గమనిస్తుంటే స్నేహం ఎలా ఉండాలో వ్రాయాలని పిస్తుంది.
         ప్రతి మనిషికి,తన భావాలు స్వేచ్చగా వ్యక్తపరచుకోవటానికి ఒక స్నేహితుడు/రాలు అవసరం.అలాంటి స్నేహం లో ఎలాంటి స్వార్థం ఉండకూడదు.ఒకరినొకరు మోసం చేసుకోకూడదు.హితము కోరేవాడే కదా స్నేహితుడు.ఆర్థిక వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకోకూడదు.స్నేహితుని చూస్తే ఆనందం కలగాలి.ఈర్ష్య,అసూయ కలుగుతున్నాయంటే ఆ స్నేహం కలుషితమవుతున్నట్లు.ఒక స్నేహంలో పరస్పరం ఎన్నో నేర్చు కోవాలి.విభిన్న అభిప్రాయాలు కలిగి వున్నా పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలి.
       స్నేహం అంటే చంద్రుని వెన్నెలలా చల్లదనం ఇవ్వాలి.జీవితం లో అది ఒక సాంత్వన నివ్వాలి.స్నేహం అంటే ఓ నమ్మకం .స్నేహం అంటే ఓ ఆహ్లాదం.ఎటువంటి ఒడిదుడుకులు లేని ఓ ప్రయాణం.ఏమీ ఆశించని ఓ ఆనందాల హరివిల్లు.  

Saturday 10 March 2012

స్నేహం1

                       స్నేహం  గురించి వివరించేముందు దీని అర్థమేమిటో తెలుసుకుందామా! స్నేహం అంటే స్నేహితుల మధ్య ఉండే సంబంధం.మరి స్నేహితుడంటే ? a person with whom one enjoys mutual affection and regard(exclusive of sexual or family bonds)ఫై అర్థము oxford dictionary లోనిది .దానిని స్వేచ్చానువాదము చేస్తే  పరస్పర ఇష్టము కలిగి వున్న ఇద్దరు వ్యక్తులు ఒకరి సమక్షము లో మరొకరు ఆనందముగా వుంటే వారు స్నేహితులని భావించవచ్చు.(ఈ ఆనందానికి శృంగారపరమయిన ,కుటుంబ బంధాలు కారణము కాకూడదు.)
            ఇప్పుడు వివరముగా స్నేహము గురించి చర్చిద్దామా!ఫైన చెప్పుకున్నట్లు నిఘంటువుల్లో మాదిరిగా ఇది మనుషుల మధ్యనేనా?కాదు .సృష్టిలో అన్ని జీవరాశుల్లో  కూడా స్నేహము వుంటుంది.ఒకే జాతి జంతువుల మధ్య విభిన్న జాతుల మధ్య మనం చూస్తూ ఉంటాము. ఆ లక్షణమే  మనకు వచ్చింది.మనము వాటినుండి వచ్చినవారమే కదా! మనిషి బాల్యము నుండి ఇతరులతో  సంబంధాలు కలిగివుంటాడు వాటిలో ఏ  సంబంధము అయితే తనకు ఇష్టమో ,ఎవ్వరి సమక్షము లో అయితే ఆనందము కలుగుతుందో వారితో ఎక్కువగా మాట్లాడటము  ,ఎక్కువసేపు గడపటం  చేస్తుంటాడు.దానికి ప్రాతిపదిక ఎలా ఏర్పడుతుంది.అవతలి మనిషి హావభావాలు ,మాట తీరు,అతని అభిప్రాయాలు,ఇష్టా ఇష్టాలు  వంటి రకరకాల కారణాలతో ఫై సంభందము ఏర్పడుతుంది.ఇది బాల్యములో ఏర్పడవవచ్చు,తరువాత ఏర్పడవచ్చు.ఇలా ఒకరికొకరు స్నేహితులుగా వ్యవహరిస్తూ స్నేహం అనే బంధం లో వుంటారు.
స్నేహం ఫై ఇది ప్రారంభం మాత్రమే మరిన్ని వ్యాసాల కోసం వేచి చూడండి .     

Friday 9 March 2012

చర్చ వాదన

క్రితం టపాలో మనం చర్చ వాదన లోకి దిగకుండా ఎలా మనసును గమనించాలో తెలుసుకున్నాము.కాని ఇక్కడో విషయం!ఈ సందేహం మీకు వచ్చే వుంటుంది .అవతలివారు తప్పుడు సమాచారం చెబుతుంటే ఎలా?ఇక్కడ మనమో సంగతి అర్థం చేసుకోవాలి.కావాలని అలా మాటలాడుతున్నడా లేక నిజం గా తెలీక మాట్లాడుతున్నాడా అనే విషయం గ్రహిస్తే మనం సత్యం చెప్పినా వారు తమ అభిప్రాయాలు మార్చుకోరు.తెలీక పోతే తెలుసుకోవాలనే వారికి చెబుతాము కాని నటిస్తున్న వారికేమి చెబుతాము.
        సహజంగా వాస్తవం తెలిసివారు చెప్పకుండా ఊరుకోరు .కాని అవతలి వ్యక్తులను బట్టి మనం వ్యవహరించ  కలిగితే సమస్యలు రావు.సాధ్యమైనంత వరకు చర్చ ఎలా సాగుతుందో మనం గమనిస్తుంటే మన స్పందన లో లోపాలు లేకుండా సవరించుకోవచ్చు.కీలక విషయాలఫై అర్ధ వంతమయిన చర్చ ఆహ్వానించ దగిందే!కాని వ్యక్తిగత విషయాలపయికి   చర్చను మళ్ళించ కూడదు.విద్యార్థులు,యువకులు ఎక్కువగా సినిమా,క్రికెట్ ల గురించి మాట లాడుతుంటారు.ఏదో సినిమా బాగుందా లేదా అన్నంత వరకు మంచిదేకాని ఎవరుగొప్ప అన్నంతవరకు వెళ్ళకపోతే మంచిది.ఇక అభిమానం పేరుతో చేసేవన్నీ వృధానే!అలాగే క్రికెట్ ఫై చర్చ కూడా !
              మన మనసు నిరంతరం తను చేసేపనిని తనే గమనించేలాగా చేయగలిగితే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. 

Monday 5 March 2012

మనం మానసిక ప్రయోగాలు చేద్దామా !

మనం మానసిక ప్రయోగాలు చేద్దామా !
మనం రోజంతా గడిచిన తర్వాత ఇంటికి వచ్చి పడుకునేలోపు ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక్క సారి మన ప్రవర్తనను విశ్లేషించుకుంటే మనకు మనం అద్దం లాగా కనబడతాము.దీనికి ఇంకో ఉపాయం వుంది.ఇంటికి వచ్చేదాకా ఎందుకు మనం ఇతరులతో మాటలాడుతున్నప్పుడే ఒక వైపు ఈ ప్రక్రియ నడిపించగలిగితే మరీ మంచిది.సరే మీకు తోచిన సమయంలో చేయండి.
     సహజంగా మనం మాట్లాడుతున్నప్పుడు మనకు అనుకూలమయిన విధంగా ఎవరయినా మాట్లాడితే మనకు సరిపోతుంది.అలాకాకుండా వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే స్పందిస్తాము.ఆ స్పందన లో మాటలు జారుతాము.ఇక విషయం ప్రక్కదారి పట్టి మనం వాడిన భాష ఫై చర్చ మొదలవుతుంది.ఇక్కడ ఒక్క చిన్న విషయం .ఎవరికయినా తమ స్పందన తెలిపే హక్కు వారికుంటుంది.దానిలో మంచి చెడ్డలను మనం  విశ్లేషించాలే గాని స్వరం పెంచి వ్యక్తిగత విషయాలఫైకి   మల్లించాల్సిన అవసరం లేదు. ఇలాంటి  చర్చలు ప్రభుత్వ ఆఫీసులలో బాగా జరుగుతుంటాయి.పార్టీలలో,సమావేశాలలో పదిమంది కూడి ఉన్నప్పుడు ఇవి సాధారణం.మన అభిప్రాయాలు చెప్పడం వరకే మన భాద్యత .అది ఎదుటివారికి నచ్చాలని లేదు కదా.
           సహజంగా వార్తాపత్రికలలో వచ్చే విషయాలఫై  చర్చలు మొదలవుతాయి.అందులో రాజకీయాలదే కీలక పాత్ర .సినిమాలు,క్రికెట్   తరువాత !ఈ చర్చల్లో ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చవు.ఇక  వాదోపవాదాలు .అంతా అయిన తర్వాత మనం వాడిన భాష గుర్తుంటుంది .మానవ సంబంధాలు  దెబ్బతింటాయి. ఇక సామాజిక సమస్యలఫై  కూడా  ఇటువంటి చర్చలే నడుస్తుంటాయి.ఈ ప్రక్రియ నంతటిని ఒక వైపు మనసు గమనిస్తుంటే సూక్ష్మం లో చర్చ ముగుస్తుంది.ఇలా ప్రయత్నించండి.మరోసారి కలుద్దాము..   

Saturday 3 March 2012

సైన్సు@మొబైల్

సైన్సు@మొబైల్
జాతీయ సైన్సు దినోత్సవాల్లో భాగంగా విజ్ఞాన్ ప్రసార్,ఇగ్నో కలిసి సైన్సు@మొబైల్  ను ప్రవేశ పెట్టారు.సైన్సు కు సంభందించిన వార్తలు ,ముఖ్యమైన రోజులు,నిజాలు,సూక్తులు,శాస్త్ర వేత్తల వివరాలు,ఆరోగ్య చిట్కాలు ఉచితంగా sms రూపంలో అందిస్తుంది.SCIMBL అని టైపు చేసి 092230516161 కు sms పంపించాలి . లేదా  www.vigyanprasar.gov.in  లో SCIMBL  అని సెర్చ్ లో టైపు చేస్తే ఒక రిజిస్ట్రేషన్ form  వస్తుంది  అది  పూర్తి చేస్తే సరి.
దీనిని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు.అందరు దీనిని వినియోగించుకొని సైన్సు గురించి తెలుసుకోండి.

Saturday 25 February 2012

చిరుతిళ్ళు బాగా తింటున్నారా !


చిరుతిళ్ళు    బాగా తింటున్నారా !మనం పడుకునే లోపు ఆహారం 3 సార్లు తీసుకుంటాము.కాని మధ్యలో చాలా పదార్థాలు తింటాము.అందులో ముఖ్యంగా తీపి పదార్థాలు ఎక్కువగా వుంటాయి.తరువాత వేడి వంటకాలు సరేసరి .ఇకశీతలపానీయాలు ఉండనే ఉన్నాయి .వీటన్నింటికి తోడు పార్టీలు,.ఇక నూనె  వస్తువులు ఎక్కువ గా తింటాము. ప్రస్తుతం మసాలాలు చాలా ఎక్కువ గా చిరుతిండ్ల క్రింద తీసుకుంటూ వుంటారు.ఇలా జిహ్వ చాపల్యం కొద్ది ఇష్టం వచ్చినట్లుగా తింటే మన ఆరోగ్యం ఏమి కావాలి !  
               ఎప్పుడన్నా ఈ ఆహారం విషయం ఆలోచించారా !ఎప్పుడన్నా రుచి కోసం అయితే పరవాలేదు కాని ఎక్కువయితే ప్రమాదమే !ప్రస్తుతానికి మీ మీ ఆహారపు అలవాట్లు పరిశీలించుకోండి .ఎలా మార్పులు చేసుకుంటే బాగుంటుందో మరో టపాలో ప్రస్తావిస్తాను.   

Thursday 23 February 2012

IIT-JEE,AIEEE రద్దు మరియు ISECET ఏర్పాటు

  స్నేహితుడు సినిమా చూడమని చెప్పిన టపాకు విపరీతమయిన స్పందన వచ్చింది(చదవటం వరకే ,వ్యాఖ్యలు లేవు).ఆటపా లో కోరినట్లుగా జరిగింది .ఆ టపాను మంత్రులు  చదివారా అన్నంతగా రెండు రోజులకే IIT_JEE
 రధ్ధవడం ఎంతో ఆశ్చర్యానికి గురిచేశాయి.ఏమైనా ఈ మార్పును మనస్పూర్తిగా ఆహ్వానించాలి.
            ఇంటర్ మార్క్స్ కి ప్రాధాన్యతనిస్తూ, రెండుదశ ల్లోనిర్వహించాలని ప్రతిపాదన .మొదటి దశలో సమగ్రంగా పరిశీలించే పరీక్ష ,రెండవ దశలో సబ్జెక్టు ఫై పరీక్ష ఉంటాయంటున్నారు.ఈ విషయం లో అమెరికా లో ఏవిధంగా వుందో పూర్తిగా తెలిసిన NRI లు ప్రభుత్వానికి సలహా లివ్వగలరు.ఎందుకంటే రాబోయే రెండు నెలలలో నియమాలు తయారు కాబోతున్నాయి.అమెరికా నే కాదు ప్రపంచం లోని ఇతర దేశాల్లో ఎలావుందో కూడా మీ మీ అభిప్రాయాలను భారత మానవ వనరుల శాఖకు పంపించండి .విద్యార్థులకు గొప్ప ఉపకారం చేసినవారవుతారు.మేధావులు,విద్యావంతులు ముందుకు వచ్చి సలహాలివ్వగ లిగితేనే  విద్యా వ్యవస్థ లో మార్పులు వస్తాయి.
            

Tuesday 21 February 2012

మాతృభాష ను మరువకుమా !

మాతృభాషా దినోత్సవం
            మన జీవితమంతా మన ఎదుగుదలకు,మన వికాసానికి ఉపయోగపడేది మన మాతృభాష.అమ్మ మనకు గోరుముద్దలు తినిపిస్తూ నేర్పించే భాష .దాన్ని జీవితమంతా కాపాడుకోవాలి.మన పిల్లలకు ఆ భాష లోని మాధుర్యాన్ని గ్రోలేటట్లు చెయ్యాలి.మాధ్యమాల చర్చ ప్రక్కనపెడితే ప్రతి తల్లి తండ్రి తన బిడ్డలు తమ భాషను మర్చిపోకుండా బాధ్యత తీసుకోవాలి.అమ్మ,నాన్న అని పిలిచే పలుకులలోని తియ్యదనం మమ్మీ డాడీ లలో ఎక్కడ వస్తుంది.తాతయ్య,అమ్మమ్మ పిలుపుల్లోని కమ్మదనం గ్రాండ్ పా,గ్రాండ్  మా లో వస్తుందా.!విదేశాల్లో ఉండే తెలుగు ప్రజలు మన మాతృ  భాషా పరిరక్షణకు ఎంతగానో తపిస్తుంటే ఇక్కడ ఉన్న మనకు నిర్లక్ష్యంగా వుంది.
               ఒక చేదయిన  వాస్తవమేమంటే  ఆంగ్ల మాధ్యమం లో చదివే పిల్లలకు ఆంగ్లం రావటం లేదు ,తెలుగు రావటం లేదు .విద్యా వ్యవస్థలో ఎన్నో లోపాలు  వున్నాయి.విదేశాలలో వున్నవారు ఏదోఒక విధం గా మీ బిడ్డలకి మాతృభాషలోని మధురిమలు పంచండి.క్రొత్త  భాష రావాలంటే ఎంతో కష్ట పడతాము.మరి తల్లి భాషను దూరం చేసుకుంటే ఎలా?

Monday 20 February 2012

స్నేహితుడు సినిమా ఎందుకు చూడాలి?

విద్యార్థులు,తల్లిదండ్రులు ఉపాధ్యాయులు,అధ్యాపకులు, యాజమాన్యాలు, ప్రభుత్వ విద్యా శాఖ ,విద్యకు సంబంధించిన    ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూడాలి. ఇదేంటి !ఈ సినిమాకు ప్రచారం చేస్తున్నాడు అనుకుంటున్నారా!
    హిందీలో 3 idiots చూడలేకపోయాను.ఈ స్నేహితుడు చూసిన   తర్వాత చూడమని  చెప్పకుండా                                                  ఉండలేకపోతున్నాను  .ఎందుకో వినండి! మొత్తం మన విద్యా  వ్యవస్థ లక్ష్యం విద్యార్థులందరినీ  ర్యాంకులు,మార్కులతో విభజిస్తూ భవిష్యత్ గుమస్తాలను తయారు చేసే దిశగా సాగుతోంది.బ్రిటిష్ మెకాలే ప్రవేశపెట్టిన వ్యవస్థ ఇంకా కొనసాగుతోంది.లేకపోతే ర్యాంకులు, మార్కుల లక్ష్యముగా భోధన జరుగుతుందేకాని విద్యార్థి సమగ్ర మూర్తిమత్వాన్ని అభివ్రుద్దిచేసే విధానాలు భోధనలో లేవు.
         విద్యా వ్యవస్థను రెండు భాగాలుగా చేసి విశ్లేసిస్తే 1)L.KG  నుండి   12 వ తరగతి 2)ఉన్నత విద్య
ఉన్నత   విద్య అయిన మెడిసిన్ ఇంజనీరింగ్ ఎంట్రన్సు లకు శిక్షణా కేంద్రాలుగా పాటశాలలు మారి పోయాయి. .ఉదాహరణకు 10,000 సీట్లు ఉండే  I.I.T  ఎంట్రన్సు కోసం   5 లక్షలమంది,  A.I.E.E.E  కోసం  10 లక్షల మంది విద్యార్థులు   శిక్షణ పొందుతూ ఉంటె వీటికి  foundation course  పేరిట ఆరవ తరగతి నుండి దేశ వ్యాప్తంగా మరి కొన్ని లక్షలమంది  గణితము, సైన్సునే  application orriented లో అభ్యసిస్తున్నారు  .ఆటలు,పాటలు,కళలు moral values, సైన్సు ప్రయోగాలు అన్ని పాటశాలల లో శూన్యం. ఇలా తయారైతే భవిష్యత్తులో   వీరు ఏమవుతారు   ఉన్నత విద్యలో కూడా సినిమాలో చూపినట్లు ఎక్కడా విద్యార్థి సృజనాత్మకతకు, పరిశోధనకు అవకాశం ఇవ్వకుండా జరిగే విద్యా భోధన  శాస్త్రవేత్తలను ఎలా  తయారు చేయగలదు. అమెరికా డాలర్స్ సంపాదించే కంప్యూటర్  మనుషులను  తప్ప!
                ప్రస్తుత సమాజ అవసరాలఫై    అధ్యయనం చేయని విద్య, పరిశోధనకు ప్రాముఖ్యత    ఇవ్వని విద్య,పరిశ్రమలతో  ప్రత్యక్ష అనుసంధానము లేని విద్య ఎలా భావిభారత పౌరులను తయారుచేయగలదు?మన దేశ బడ్జెట్ లో 2% విద్యకు కేటాయించి ఏమి సాధించాలి?అందులో పరిశోధనకు మరింత తక్కువ కేటాయిస్తారు.6% కేటాయిస్తే కొంతవరకు న్యాయం చేసినట్లు.
        భారత మానవ వనరుల శాఖ నిర్ణయించినట్లు,దేశవ్యాప్త ఇంజనీరింగ్ ఎంట్రన్సు పెడుతూ దానిని SAT(USA) తరహాలో కోచింగ్ లకు ఆస్కారం లేని విధం గా సిలబస్ లోనే ఆయా అంశాలఫై  భోధన వుండే విధం గా తయారు చెయ్యాలి.పాటశాల స్థాయిలోర్యాంకులు ,మార్క్స్ గొడవ తీసివేసి సమగ్ర మూల్యాంకనం ప్రవేశ పెట్టాలి.అప్పుడే విద్యాలయాలు బాగుపడతాయి  .
                  ఈ సినిమా ఆదిశగా ఆలోచింప చేస్తుంది.ఇంత హృద్యంగా కథను తయారుచేసిన రాజు హీర్వాని దాన్ని మన భాష లో అద్భుతంగా అందించిన శంకర్ గారిని,విజయ్ మరియు  సహనటుల్ని  ,అభినందించకుండా   ఉండలేము.
                 అందుకే  "స్నేహితుడు" సినిమా చూడండి.