Sunday 16 September 2012

బత్తాయి తోటతో అనుబంధం


     గ్రామీణ ప్రాంతాలలో రకరకాలయిన పండ్ల తోటలను మీరు చూసే ఉంటారు.మేమున్న మార్కాపూర్ ప్రాంతం బత్తాయి తోటలకు ప్రసిద్ది.కడప,కర్నూలు ,ప్రకాశంజిల్లాలో పశ్చిమప్రాంతం (కనిగిరి,గిద్దలూరు ,మార్కాపూర్,ఎర్రగొండపాలెం) మహబూబ్ నగర్,నల్గొండ జిల్లాలలో తోటలు బాగా ప్రసిద్ది.ఇవి అన్నీ బోర్ల క్రింద నీటి సాగుతో పండుతాయి.భూమిలో 300 అడుగులనుండి 600 అడుగుల లోతువరకు బోర్లు వేస్తారు. మధ్య కాలంలో మా ప్రాంతంలో సరి అయిన వర్షాలు లేక బోర్లలో నీళ్ళు లేక కొన్ని వందల ఎకరాలు ఎండి పోయాయి.రైతులు వాటిని తమ పిల్లల్లాగా కంటికి రెప్పలాగా పెంచుకుంటారు.మాకు కూడా 5 ఎకరాల తోట ఉండేది.బాగా కాపు మీద నీళ్ళు లేక మొత్తం ఎండి పోతే కొట్టివేసాము.9 అడు గుల ఎత్తు పెరిగిన వాటిని కొట్టివేస్తుంటే మా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.అలా 5 జిల్లాలలో కొన్ని వేల ఎకరాలు తోటలు కొట్టివేశారు.పండినప్పుడు కూడా సరిగా గిట్టుబాటు ధరలు వచ్చేవి కావు.3,4 సం: నేను హైదరాబాద్ మార్కెట్ కు వెళ్లి వాటిని అమ్మగా టన్నుకు రూ 4000 లేదా రూ6000 మాత్రమే వచ్చే వి.బాగా వేసవిలో అయితే రూ10,000 వరకు వచ్చేవి కానీ అప్పుడు నీరు లేక కాయలు తక్కువగా  ఉండి బరువు తూగేవి కావు.
   మా తోటలోకి వెడితే అదొక స్వర్గం .తోట పూతకు వచ్చినప్పుడు అక్కడ గాలిలో వాటి పరిమళం అంతా తోట చుట్టూ వ్యాపిస్తుంది.మా తోటలో వున్ననాలుగు వేపచెట్లు ఒకే చోట ఉండి గొడుగు పట్టినట్లు ఉంటా యి. ఇవి మాత్రం నా కోరిక మేరకు ఇప్పటికీ అక్కడ వున్నాయి.తోట మధ్యలో ఉండడం తో వాటిని కొట్టే స్తామంటే ఆపాను.వాటి క్రింద నులక మంచం మీద పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో!
           చెట్లకు నీరు కడుతుంటే మట్టి వాసన కమ్మగా మనకు సోకుతుంది.రైతుకు భూమి అంటే ఎంత ఇష్టమో అర్థమవుతుంది.అందుకే కన్నతల్లి ఎలా లాలిస్తుందో ఆ భూమి అంత సాంత్వన నిస్తుంది.కాబట్టే దాన్ని వదలాలంటే రైతుకు అంత కష్టం.అందుకే పరిశ్రమల పేరుతో సారవంత మయిన భూములు కోల్పోయే రైతులు  అలా తిరగబడతారు.
         నీరు కట్టిన రెండు రోజులకు చెట్లు చిగిర్చి తలలూపుతూ పలకరిస్తుంటే రైతు కడుపు ఆనందంతో నిండి పోతుంది.అలాంటి స్థితిని అనుభవించిన మాకు ఆ తోట నీరు సరిపోక కొట్టివేసి ప్రస్తుతం మిర్చి, పత్తి వేసాము.కానీ అప్పటి ఆనందం తోట కెడితే ఇప్పుడు రావటం లేదు.ప్రభుత్వం ఈ రైతులకు గిట్టు బాటు ధరలు కల్పించాలి.
        మనం ఎక్కువగా బజారు కెళ్ళినా,ఇతర ప్రాంతాలకు వెళ్ళినా cooldrinksత్రాగుతూ ఉంటాము అలా కాకుండా బత్తాయి రసం త్రాగితే ఎంతో ఆరోగ్యం.100 grams ఒక కాయలో fat o.2 grams, saturated fat 0%,cholestrol 0%,sodium0%,carbohydrates 11g,fibre 3g,protiens 0.7 g,sugar 3g ఇలా ఇందులో పోషక పదార్థాలు ఉంటాయి.అలాగే దీనిలో c విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది జబ్బు పడ్డ వారికి ఈ రసం చాలా శక్తి నిస్తుంది.ఇరాన్ లో ఈ రసం తో ఫ్లూ,మరియు జలుబు కు వైద్యం గా వాడతారు.ఇవే కాకుండా ఎక్కువ మంది ఈ రసం త్రాగితే వాటికి బాగా డిమాండ్ ఏర్పడి రైతులకు గిట్టుబాటు ధరలు దొరికే అవకాశం ఏర్పడుతుంది.అందరు ఈ దిశగా ఆలోచిస్తే మన గ్రామీణ ప్రాంతాల లోని రైతులకు,పల్లెలకు ఎంతో మేలు చేసిన వారమవుతాము.

13 comments:

  1. సర్, నిజమే కూల్డ్రింక్స్ కంటే పళ్ళ రసాలు మేలైనవి. అయితే రైతులను మనం ఆదుకోలేము.
    వారిని మద్యవర్తులైన వ్యాపారులు దోచేస్తారు.
    మనం ఒక బత్తాయి కనీసం ఆరు రూపాయలకు కొంటె రైతు దాన్నీ పావలాకి అమ్మి ఉంటాడు.
    ఏది ఏమైనా ఈ కూల్డ్రింక్స్ వదిలి పళ్ళరసాలు అలవాటు కావాలి జనాలకి. మంచి పోస్ట్...మెరాజ్

    ReplyDelete
    Replies
    1. ఇంతకు ముందు కూల్ డ్రింక్స్ లో ఉన్న పదార్థాల గురించి ఒక నివేదిక వచ్చినప్పుడు జనం భయపడి పళ్ళ రసాలు బాగానే త్రాగే వారు.మళ్ళీ మామూలే!మీరు చెప్పినట్లు ఒక కాయకు ఒక్క రూపాయి గిట్టుబాటు అయినా రైతు లక్షాధికారి అవుతాడు.కొబ్బరి నీరు,పండ్ల రసాలు రాగి జావ లాంటి పోషకాహార పానీయాలు సేవిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్స్ చెబుతూనే ఉంటారు.మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  2. నిజమే మీరన్నది. నాకు తెలిసి ప్రస్తుతం చాలా మంది హెల్త్ కాన్షియస్ తో పండ్ల రసాలే ఎక్కువగా సేవిస్తున్నారండి. కానీ సామాన్య ప్రజలకి అందుబాట్లో లేవేమోకదా!

    ReplyDelete
    Replies
    1. బత్తాయి రసం మధ్య తరగతి పట్టణాలలోఒక గ్లాసు 10 రూపాయలు అమ్ముతున్నారండి.కూల్ డ్రింక్స్ అంతకంటే ఎక్కువకు అమ్ముతున్నారు.ఇక పోతే సాయంత్రం అయ్యే సరికి చిరు తిండ్లకి ఎంత ఖర్చు చేస్తారో లెక్కే లేదు .ఇక పేద వారిలో మందు కోసం పెట్టె ఖర్చులో పదో వంతు పెట్టినా చాలు.మనసుంటే మార్గముంటుంది.మీ స్పందనకు నెనర్లు.

      Delete
  3. *నిజమేనండి. పొలం, మొక్కలు... వీటితో అనుబంధం డబ్బుతో తూచలేనిది.
    * చదువుకున్న వాళ్ళు కూడా కొందరు రసాయనిక కూల్ డ్రింక్స్ నే ఇష్టపడుతుండటం దురదృష్టకరం. ( పండ్ల రసాలు ఆరోగ్యకరమని తెలిసినా .)
    * వ్యాపారులు, పండ్లను రైతుల వద్ద చవగ్గా కొని , షాప్స్ లో అధికధరకు అమ్ముతారు. ఇందువల్ల రైతులు, వినియోగదారులు ఇద్దరూ నష్టపోతుంటారు.
    * ఇంటివద్దకు వచ్చి పండ్లను అమ్మే చిన్నవర్తకులను గీచిగీచి బేరమాడే వినియోగదారులు కూడా మెగామాల్స్ కు వెళ్ళి యాపిల్స్, కొన్నిరకాల ఆరెంజెస్ .... ఒక్కో కాయను 30 రూపాయలు అయినా కొంటుంటారు.

    ReplyDelete
    Replies
    1. వ్యవసాయం మన దేశానికి వెన్నెముక అండి.అలాంటి దానిని ఎలా చేస్తున్నారో గమనిస్తున్నాము.త్వరలో ఆహార సంక్షోభం రాబోతుంది.అలాగే మన ఆహార పు అలవాట్లు కూడా మన ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తున్నాయి.మధ్య దళారీలు,ప్రభుత్వం,ప్రకృతి ని నాశనం చేసే చర్యలు అన్నే కలిసి ప్రస్తుత స్థితికి కారణం.మీ విశ్లేషణాత్మక స్పందనకు ధన్యవాదాలండి.

      Delete
  4. అవినీతి ప్రభుత్వం ఏదో చేయాలని ఆశించడం వృథా. వాళ్ళకు స్కాములు చేయడానికే సమయం చాలడం లేదాయె.
    బత్తాయి రైతులే ఆ పళ్ళని నిలువచేసే పద్ధతులు( రసాలు, జామ్ వగైరాలు), మార్కెటింగ్ చేసుకోవడం చేసుకోవాలి. ప్రతి ఏడూ టమేటా రైతులు మదనపల్లెలో గిట్టుబాటు ధరలు లేక రోడ్డు మీద పడేసి వెళ్ళిపోవడం గుర్తుకొచ్చి బాధగా వుంటుంది. టమేటా పచ్చళ్ళు, జ్యూస్, పిజ్జాలకు వాడే సాస్, కెచప్‌లు తయారీ పరిశ్రమలు ఔత్సాహికులు తెరవాలి. చదువురాని రైతులను ఎడుకేట్ చేయాలి. ముఖ్యంగా నిలువ చేసే పద్ధతులు తెలుసుకోవాలి. FDIలు retail sectorలో వస్తే చేసేది అదే.
    "ఎవరో వస్తారని
    ఏదో చేస్తారని
    ఎదురు చూసి మోసపోకుమా"

    ReplyDelete
    Replies
    1. మీరు చాలా మంచి పరిష్కారం చెప్పారు snkr గారు!అలా నిలవచేసే పద్దతులు కనుక రైతులు నేర్చుకుంటే గిట్టుబాటు సమస్య తీరుతుందేమో! కానీ వీటికి ఏవైనా స్వచ్చంద సంస్థలు చొరవ తీసుకొని రైతులలు శిక్షణ ఇస్తే బాగుంటుందేమో!మీ విలువైన సూచనకు ధన్యవాదాలు.

      Delete
  5. రవి శేఖర్ గారూ!
    బైట మంచినీళ్ళ కంటే కూడా చవకగా దొరికే
    హానికరమైన కూల్ డ్రింక్స్ రాజ్యమేలుతున్నాయి...
    అందుకే ఈ అగచాట్లు...
    మంచి పోస్ట్...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. మీరన్నది అక్షరాలా నిజమే!cooldrinks ఎంత హానికరమో పత్రికలన్నీ వ్రాసాయి.అయినా వాటి అమ్మకాలేమీ తగ్గలేదు.విదేశాలనుండి వారి powder ఏదో వస్తుంది.దానిని ఇక్కడ నీటితో కలిపి మనకు అమ్ముతున్నారు.అలాగే ఇక్కడి నీటిని తోడి మనకే అమ్మేస్తున్నారు.మీ స్పందనకు ధన్యవాదాలు శ్రీనివాస్ గారు!

      Delete
  6. వినాయకచవితి శుభాకాంక్షలండి,

    ReplyDelete
    Replies
    1. మీకు కూడా!మీకు ధన్యవాదాలు.

      Delete
  7. మీకు ,మీ కుటుంబ సభ్యులకు ,బంధువులు అందరికీ శుభాకాంక్షలండీ.మీకు ధన్యవాదాలు.

    ReplyDelete