Sunday 5 April 2020

అత్యంత ప్రభావ శీలుర 7 అలవాట్లు:(Seven habits of highly effective people by Stephen R.covey) ఒక సమీక్ష. ......... By ఒద్దుల రవిశేఖర్

అత్యంత ప్రభావ శీలుర 7 అలవాట్లు:(Seven habits of highly effective people by Stephen R.covey)      ఒక సమీక్ష.   .........   By  ఒద్దుల రవిశేఖర్                                                                            2000  సంవత్సరం లో అనగా 20 సంవత్సరాల క్రితం నంద్యాలలో ఈ పుస్తకం కొని చదివాను.నా మీద బాగా ప్రభావితం చూపిన పుస్తకం ఇది.సత్యవతి గారిచే తెలుగులో అనువదించబడింది.మళ్లీ చదవాలని నిర్ణయించుకుని గత 10 రోజుల్లో పూర్తి చేశాను.కొద్దిగా వివరంగా ఈ పుస్తకం గురించి పరిచయం చేస్తాను.                                                        తొలి పలుకులో మన పరిష్కారాలెప్పుడూ దేశాకాలాతీతమైన సిద్ధాంతాలపై ఆధారపడి ఉంటాయి.ఇదే ఈ పుస్తక మూలసారం.                                                             పుస్తకం ఒకటవ భాగం:దృక్పధాలు-సిద్ధాంతాలు,అంతరంగం నుండి బహిరంగానికి,7 అలవాట్లు ఒక అవలోకన.                    ఆలోచనలు ఎట్లా ఏర్పడతాయి,మన దృక్పధాన్ని అవి ఎలా నిర్దేశిస్తాయి అన్న అంశాలపై రచయిత పరిశోధించారు.గత 200 సంవత్సరాలలో వచ్చిన వ్యక్తిత్వ వికాస సాహిత్యాన్ని చదివిన రచయిత మొదటి 150 సంవత్సరాలలో వచ్చిన సాహిత్యం నైతికత,నిజాయితీ పునాదిగా వస్తే తరువాతి 50 సంవత్సరాల లో వచ్చింది మన ప్రవర్తన,వైఖరులు,నైపుణ్యాల గురించి చెబుతుంది.                 మన ప్రవర్తన మన స్వభావం దేనినుంచి పుట్టుకొచ్చిందో ఆ మూల దృక్పధాన్ని సరిచేసుకోనంతవరకు మనకు నిజమైన ఫలితాలు దక్కవు అంటాడు రచయిత.దృక్పధాలు సిద్ధాంత కేంద్రకంగా ఉండాలంటారు. ఇందులో చెప్పబడిన 7 అలవాట్లు మన ఇంగితజ్ఞానం లో ,మన అంతరాత్మ లో నిక్షిప్తమై ఉన్నాయని వీటిని గుర్తించి వెలికి తీయడం మన కర్తవ్య మంటారు.                                                                     రెండవభాగం:వ్యక్తిగత విజయం.                                                 మొదటి అలవాటు:క్రియా సంసిద్ధత(Be proactive) ఈ అలవాటును దార్శనికతా సూత్రాల క్రింద మనకు వివరిస్తారు.విక్టర్ ఫ్రాంకెల్ చెప్పిన మానవ స్వభావపు మౌలిక సూత్రం " ప్రేరణకి,స్పందనకీ మధ్య మానవులకు స్పందనను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది" నుండి రచయిత బాగా ప్రభావితమయ్యారు.మనం మార్చగలిగే అంశాల పట్ల దృష్టిపెట్టమని,మార్చలేని వాటిని గురించి పట్టించుకోవడం మానమని చెబుతారు.మన ప్రభావ వృత్తాన్ని పెంచుకోమంటారు.మనకి మనం చేసుకునే వాగ్దానాలకు ఇతరులకు చేసే వాటికి నిబద్ధులై ఉండడమే మన క్రియా సంసిద్ధతకి రుజువు అంటారు.వాగ్దానాలు చేసి నిలుపుకోవడం మనలో నిజాయితీని పెంచుతుంది.                    రెండవ అలవాటు:అంతం ధ్యాసతో ఆరంభం(Begin with the  end in mind)   ఈ అలవాటును వ్యక్తిగత నాయకత్వ సిద్ధాంతాల ఆధారంగా వివరించారు."మీ జీవితాంతాన్ని దృష్టిలో పెట్టుకుని మీ జీవన గమనాన్ని ప్రారంభించడం మీలో ఎంతో మార్పు తెస్తుంది".గమ్యాన్ని గురించిన ఒక స్పష్టమైన అవగాహనతో గమనాన్ని ప్రారంభించడం,మనలో గొప్ప మార్పు తెస్తుందంటారు.ఎవరికి వారు వారి జీవిత లక్ష్య ప్రకటనను తయారు చేసుకోమంటారు.                            మూడవ అలవాటు:ముందు విషయాలు ముందు(Put first things first) ఈ అలవాటును వ్యక్తిగత నిర్వహణా సిద్ధాంతాల ఆధారంగా వివరించారు. మనుషులు చేసే పనులు 4 విభాగాలుగా ఉంటాయంటారు.మన ప్రాథమ్యాలను చక్కగా plan చేసుకుని అవి urgent గా మారకుండా ముందుగానే పూర్తి చేయమంటారు.                       3 వ భాగం:సామాజిక విజయం,పరస్పరాధార దృక్పధాలు.            మనపై మనం విజయం సాధించుకోలేకపోతే,ఇతరులపై విజయం సాధించలేము.ఇందులో వ్యక్తులతో మంచి అనుబంధాలను కలిగి ఉండాలంటారు.ఇందుకు ఇతరులను అర్ధం చేసుకోవడం,నిబద్దత,నిజాయితీ కలిగి ఉండడం ముఖ్యం అంటారు.                                                                  నాలుగవ అలవాటు:గెలుపు/గెలుపు ఆలోచన(Think win/win) ఈ అలవాటును పరస్పర నాయకత్వ సిద్ధాంతాలతో వివరిస్తారు.ఈ దృక్పధానికి 1)నిజాయితీ(integrity)2)పరిణతి (Maturity) 3) పుష్కల మనస్తత్వం (abundance mentality) ఈ 3 లక్షణాలున్నవారు ఎటువంటి నైపుణ్యాలతో పనిలేకుండానే సామజిక విజయం సాధిస్తారు.గెలుపు/గెలుపు ఒప్పందం అనేది ఒక దృక్పధం,సత్యశీలం.సత్సంబంధాల ఫలితం.            అయిదవ అలవాటు:ముందు అర్ధం చేసుకోండి,తరువాత అర్ధం అవండి.                                                                    ఈ అలవాటును సహానుభూతి భావ ప్రసార సిద్ధాంతాల ఆధారంగా వివరించారు.సహానుభూతితో వినడం నేర్చుకోవాలంటారు.అనగా అర్ధం చేసుకునే ఉద్దేశం తో వినడం.చెప్పే వారిని లోతుగా,సంపూర్ణంగా అర్ధం చేసుకోవడం.తరువాత మీరు వారికి అర్ధం అవుతారు.మన ఆలోచనల్ని స్పష్టంగా,నిర్దిష్టంగా,దార్శనికంగా, సందర్భానుసారంగా చెబితే మనపట్ల విశ్వసనీయత పెరుగుతుంది అంటారు.దాపరికం లేని సంభాషణ వలన సమస్యల్ని మొగ్గలోనే తుంచవచ్చు అంటారు.                          ఆరవ అలవాటు:సమ్మిళిత శక్తి (synergy).                                ఈ అలవాటును సృజనాత్మక సహకార సిద్ధాంతాలు ఆధారంగా వివరిస్తారు.సిద్ధాంత కేంద్రక నాయకత్వం యొక్క సారాంశమే సమ్మిళిత శక్తి అంటారు.ఒక బృందం అంతా కలిసి పాత ఆలోచనలకు స్వస్తి చెప్పి కొత్త వాటిని స్వాగతించడమే సమ్మిళిత శక్తి.జీవితం ఎప్పుడూ ద్వందాల నడుమే ఉండదని,మూడవ ప్రత్యామ్నాయం ఉంటుందని తెలుసుకోవాలంటారు.ప్రకృతి అంతా సమ్మిళితమే.                   నాలుగవ భాగం:పునరుద్ధరణ.                                                    ఏడవ అలవాటు:కత్తికి పదును(Sharpen the saw).             ఈ అలవాటును పునరుద్దరణ సిద్ధాంతాలతో వివరిస్తారు.ఇందులో మన స్వభావం లోని భౌతిక,ఆధ్యాత్మిక,బౌద్ధిక,మానసిక/సామాజిక దిశలను పునరుద్ధరించుకోవాలి.ఈ 4 దశల్లో 6 అలవాట్లను పునరుద్ధరించు కోవచ్చు.రోజూ పై 4 దిశల్లో పునరుద్ధరణకు కృషి చేస్తుంటే 6 అలవాట్లు శక్తివంతం అవుతాయి.ఇదే కత్తికి పదును అనే 7 వ అలవాటు.                                                    మనతో మనం ఏకత్వం సాధించడం,మనకు ప్రేమాస్పదులైన వారితో ఏకత్వం సాధించడం అనేదే అత్యంత ప్రభావ శీ లుర 7 అలవాట్లు ఇచ్చే మధురఫలం అంటారు.                         సత్య సిద్ధాంతాలనేవి ప్రకృతి ధర్మాలు.వీటికి అనుగుణంగా నడిస్తే మన స్వభావం లో దివ్య లక్షణాలు వచ్చి చేరతాయి.మన జన్మ సార్ధకమవుతుందంటారు.                    మనని ఒకరు ఇష్టపడడం కన్నా నమ్మడం మేలు.నమ్మకం,గౌరవం ఉన్నప్పుడు ప్రేమ సహజంగా ఉబికి వస్తుంది.                                                                                   మనం ఎన్నో వ్యక్తిత్వ వికాస పుస్తకాల గురించి విని ఉంటాము,చదివి ఉంటాము.కానీ జీవితం లో విజయం సాధించడానికి వేగవంతమైన పరిష్కారాలు లేవని సిద్ధాంతాల ఆధారంగా ఈ 7 అలవాట్లు కలిగి ఉంటే అదే పరిపూర్ణమైన జీవితం అంటారు.ప్రపంచ వ్యాప్తంగా 1 కోటి 50 లక్షల ప్రతులు అమ్ముడు పోయిన పుస్తకం ఇది.   అందరూ తప్పక చదవండి.





Wednesday 1 January 2020

కాలచక్రం 2020

కాల చక్రం తిరుగుతూ ఉంది.మన భూమి 454 కోట్ల సంవత్సరాలనుండి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది.ఒక్కో పరిభ్రమణాన్ని ఒక్కో సంవత్సరంగా మనం పరిగణిస్తుంటాం.అంటే ప్రస్తుతం క్రీస్తు జననం తర్వాత 2019 పరిభ్రమణాలు పూర్తి చేసి 2020 వ పరిభ్రమణం మొదలెట్టింది మన భూమి.గణాల్ని,తెగల్ని,సమూహాలను,రాజ్యాల్ని దాటుకుంటు ప్రస్తుతం దేశాల్ని చూస్తుంది.ఒక్కటిగానున్న తనను గీతలు గీసి ముక్కలు చేసుకున్న కాలాన్ని చూస్తుంది.దేశాల పరంగా, మతాల పరంగా,జాతుల పరంగా విడిపోయిన తనని తాను చూసుకుంటుంది భూమి.                                     జీవరాశి నివసించటానికి అనుగుణంగా సిద్ధమయిన భూమి అదే జీవరాశి లో అత్యున్నతమైన దశకు చేరుకున్న మానవుని దెబ్బకు విలవిలలాడుతుంది.struggle for existence, survival of the fittest సూత్రాలతో జీవపరిణామ  ముందుకు సాగుతోంది.అత్యంత నాణ్యమయిన జీవితం గడపటానికి ,సంపూర్ణమైన ఆనందాన్ని పొందడానికి మనిషి ప్రయత్నిస్తూ విఫలమవుతున్నాడు.                                                                 పారిశ్రామిక యుగానికంటే ముందు స్వచ్ఛమైన గాలి,నీరు,పచ్చని అడవులతో కాలుష్యరహితంగా ఉన్న ఈ భూమి అత్యున్నత సాంకేతిక యుగం లో కాలుష్యభరితమై,జీవరాశి మనుగడ ప్రశ్నార్థకమయ్యేలా ,భూతాపం ఎక్కువయ్యి కొట్టుమిట్టాడుతోంది.2100 సంవత్సరం నాటికి భూ ఉష్ణోగ్రత మరో 2 డిగ్రీ లు పెరిగి జీవికి నివాసయోగ్యం కాని పరిస్థితులు ఏర్పడబోతున్నాయి.                                            మరో ప్రక్క ఇవేవీ పట్టని దేశాలు,ఒకదానిపై మరొకటి పోటీతో అత్యాధునిక ఆయుధ సంపత్తితో, వాణిజ్యయుద్దాలతో సంపద సృష్టితో,అభివృద్ధి పేరుతో తీవ్రంగా పోటీ పడుతూ ప్రస్తుత తరం భవిష్యత్తును ఫణంగా పెడుతూ దూసుకెడుతున్నాయి.                                             నాణ్యమైన, ఆరోగ్యకరమైన,ఆనందకరమైన ,సమతుల జీవనం ఎలా ఉండాలో భూటాన్ లాంటి చిన్నదేశాలను చూసి నేర్చుకోవచ్చు.                                                               భూమి ఆరోగ్యంగా ఉన్నంతవరకే మన అభివృద్ధి,మన సంపద,జీవజాతుల మనుగడ.ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశాలు సమావేశమై తక్షణం భూవిధ్వంసానికి కారణమయ్యే ప్రతిఅంశాన్ని లోతుగా చర్చించి అమలుపరిచే కార్యాచరణ సిద్ధం చేయాలి.ప్రతి ఒక్కరు,ఏ పనిచేస్తున్నా పర్యావరణానికి,ప్రకృతికి ఏమయినా కీడు చేస్తున్నామా అని ఆలోచించాలి.ఎవరివంతు ప్రయత్నం వారు చేస్తే భవిష్యత్ తరాలకు మనం ఈ భూమిని బహుమతిగా ఇవ్వవచ్చు.లేదంటే భావితరాలు మనల్ని క్షమించవు.                                                                        క్రీ.శ 2020 వ భూ పరిభ్రమణ శుభాకాంక్షలు.                     ఒద్దుల రవిశేఖర్.

Monday 10 September 2018

అనంతపురం యాత్ర.

                 ఫిజిక్స్ ఉపాధ్యాయుల రాష్ట్ర స్థాయి సమావేశం అనంతపురంలో 9/9/18 న ఉండటం తో చుట్టుపక్కల ప్రదేశాలు శనివారం చూద్దామని నాగ మూర్తి ప్రతిపాదించడంతో ఏడో తారీఖు సాయంత్రం అనంతపురం బయలుదేరాము. ఉదయాన్నే ఆనంద భాస్కర్ రెడ్డి మదన్ మోహన్ రెడ్డి గార్లు
హోటల్ కు వచ్చి పలకరించారు. టిఫిన్ గా ఆప్రాంత ప్రత్యేక వంటకమైన  ఓలిగలు పెట్టించారు. పక్
భక్ష్యం కంటే పలుచగా చాలా బాగున్నాయి.                                               8:30 కి కార్ లో బయలుదేరాము, మొదట పెనుగొండ కోట కు  బయలుదేరాం. మార్గమధ్యంలో  కియా మోటార్స్ మీదుగా వెళ్ళాము, వందల ఎకరాల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి కొరియా భాషలో దారి పక్కన బోర్డులు దర్శనమిస్తున్నాయి, అన్నమయ్య సినిమాలో మోహన్ బాబు పోషించిన సాళ్వనరసింహరాయలు స్థాపించిన కోట ఈ పెనుగొండ కోట, చుట్టూ కోటగోడ తప్ప ఏమీ మిగల్లేదు అక్కడే కాళేశ్వర్ ఆశ్రమం, జైన దేవాలయం చూసి కృష్ణదేవరాయలు అద్భుతమైన విగ్రహాన్ని చూసాము.
                అక్కడ నుండి లేపాక్షి వెళ్ళాము మేము వస్తున్నామని ఆనంద్ భాస్కర్ చెప్పడంతో కేశవరెడ్డి మమ్మల్ని స్వాగతిస్తూ ఆలయంలోని శిల్పాల ప్రాధాన్యతను తెలియచేస్తూ 2 గంటలపాటు వివరించారు, మరియు ప్రత్యేక దర్శనం చేయించి వారు చేసిన అతిధి మర్యాద మరువలేనిది, వారు లేకపోతే ఒక అర్ధగంటలో బయటికి వచ్చే వారం అక్కడ మాకు పశ్చిమగోదావరి మిత్రుడు శేషేంద్ర గారు కలిశారు అందరిని మరలా కేశవరెడ్డి వారి ఇంటికి తీసుకెళ్లి
ఆదరించారు, తరువాత ప్రసిద్ధి చెందిన నంది విగ్రహాన్ని
దర్శించాము. గండభేరుండ పక్షి ని ఈ మధ్యకాలంలో ప్రతిష్ఠించారట, లేపాక్షి ఆలయానికి సరియైన ప్రచారం లేదనిపిస్తుంది తమిళనాడు ఆలయాల తరహాలో శిల్పకళ ఉట్టిపడు తుంది.పర్యాటకులు విస్తారంగా వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.
                 కదిరి దగ్గర ఉండే తిమ్మమ్మ మర్రిమాను దగ్గరికి వెళ్లాం.దాదాపు 600 సంవత్సరాల క్రితం తిమ్మమ్మ నాటిన ఈ మొక్క 8 ఎకరాల్లో విస్తరించి అద్భుతంగా కనిపిస్తుంది.
పచ్చగా కళకళలాడుతూ ఉన్న మర్రిచెట్టును తనివితీరా చూసాం.చెట్టు మొదలు శిథిల
మవటంతో అక్కడ చిన్నగుడి కట్టారు.అటవీ శాఖ దీనిని చాలా చక్కగా పరిరక్షిస్తుంది.ప్రతి సంవత్సరం ఈ చెట్టు  విస్తరిస్తోంది.
ఈ వృక్షం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదయింది.
 తరువాత కదిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని అనంతపురానికి తిరుగు ప్రయాణమయ్యాము..

Tuesday 28 August 2018

మహాబలిపురం(తమిళనాడు) యాత్ర.

                   చెన్నైలోని చూడదగ్గ ప్రదేశాలలో మైలాపూర్లోని కపాలీశ్వర స్వామి దేవాలయం అద్భుతమైన శిల్పకళతో ఉట్టిపడుతుంది. ముందున్న అతి విశాలమైన కోనేరు చూపులు పక్కకు తిప్పనివ్వదు. దీనికి దగ్గరలో రామకృష్ణ మిషన్ ఆశ్రం ఉంది ఇది 1905 లోనే ప్రారంభించబడింది శారదామాత వివేకానంద ఇక్కడికి వచ్చారు.                                                              అలాగే మెరీనా బీచ్ ఉదయాన్నేచూస్తే చాలా ప్రశాంతంగా ఉంది కాకపోతే శుభ్రత బాగా తక్కువ.అన్నాదురై,MGR ,జయలలిత,కరుణానిధి సమాధులు ఇక్కడ ఉండటంతో యాత్రా స్థలంగా మారింది.                                            ఇక ప్రత్యేకంగా చూడాలనుకుని ప్లాన్ చేసుకొని మహాబలిపురం వెళ్ళాం ప్రభుత్వ బస్సులు ఉన్నా ఎక్కువ ప్రాంతాలు చూడలేమని కారు తీసుకుని ఏడు గంటలకు బయలుదేరి 8:30 కల్లా  మహాబలిపురం చేరాము. అడయార్ ఆనంద భవన్ లో టిఫిన్ చేశాం ఊరిబయట విశాలమైన స్థలంలో రిసార్ట్ లాగా ఉంది రుచి బాగా ఉన్నా, విపరీతమైన ధరలు ఉన్నాయి. మొదట షోర్ టెంపుల్ చూసి పాండవ రధాల దగ్గరికి వెళ్లాము. రాయిని చెక్కి గుడిని శిల్పాలను తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత.
                   ఇసుకలో పూడిపోతే వెలికితీసినట్లు గా ఉంది సహజత్వం ఉట్టిపడేలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇది సముద్రపు ఒడ్డున ఉంది తర్వాత లైట్ హౌస్ దగ్గర కొండపైన గుడి చూసాము. అక్కడనుండి నది సముద్రంలో కలిసే చోటుకనిపిస్తుంది .మొదట ఈ కొండపైన గుడిపై old light house ఉండేది.1900 లో బ్రిటిష్ వారు కొత్తగా కట్టారు.దీనిపై నుండి సముద్రాన్ని చూడటం గొప్ప అనుభూతి.తరువాత మ్యూజియం చూసాము.ఓడల విడిభాగాలు,ఆ ప్రాంతం లో దొరికిన విభిన్నమైన వస్తువులు ఇక్కడ ఉంచారు.ఓడ పై భాగంలో గల గద ఆకారంలో ఉన్న వస్తువు చూడటానికి చాలా గొప్పగా అనిపిస్తుంది. ఇక మహాబలిపురానికి ప్రత్యేకమైనటువంటి రాళ్ళపై శిల్పాలు గుడులు చూసాము.చివరలో సీషోర్ టెంపుల్ చూసాం ఇదికూడా పల్లవులు చోళులు హయాంలో నిర్మించిందే ఇది సముద్రపు ఒడ్డున ఉంటుంది ప్రక్కనే బీచ్ చూసుకొని తిరుగు ప్రయాణమయ్యాం.                                                                                        మార్గమధ్యంలో దక్షిణ చిత్ర , జైన దేవాలయం చూశాం. దక్షిణ చితలో దక్షిణ భారతదేశం లోని పాతకాలపు ఇండ్లను తిరిగి కడుతున్నారు.  ఇక్కడ దక్షిణ భారత కళలు పరిరక్షించ బడుతున్నాయి ఈ ఆలోచన ఒక విదేశీయురాలుకు వచ్చింది ఆమె ఈ ప్రాంతానికి వచ్చి 13 ఎకరాల స్థలంలో దీన్ని నిర్మించింది ఇది గొప్ప ఆలోచన.  జైన దేవాలయం అత్యద్భుత నిర్మాణశైలితో రాజస్థాన్ వారు నిర్మించారు. జైన మతానికి చెందినటువంటి తీర్థంకరుల యొక్క విగ్రహాలు ఇందులో ప్రత్యేకత. నిర్మాణం పై భాగమంతా అర్థ చంద్రాకారంగా ఉంటుంది. మీరు ఒకసారి మహాబలిపురం చూసి  వస్తారు కదూ!