Sunday 7 October 2012

Art Of Listening(కళాత్మకంగా వినడం)

          మనం చిన్నప్పుడు అమ్మ,అమ్మమ్మ,తాతయ్య కథలు చెబుతున్నప్పుడు ఎంతో శ్రద్ధగా విన్నాం.ఉపాధ్యా యులు పాఠాలు చెబుతున్నప్పుడు ఇంతే శ్రద్ధగా విన్నామా!అదేవిధంగా మిత్రులతో మాట్లాడుతున్నప్పుడు ఎలా వింటాం.అమ్మా,నాన్నలు,పెద్దలు మన మేలు కోరి చెబుతున్నప్పుడు ఎలా వింటున్నాము.అలాగే మన సంసారం లో భార్య మాట,మన పిల్లలు చెబుతున్నప్పుడు ,అలాగే ఆఫీసుల్లోసహచరులతో,ఈ వినడం అనే ప్రక్రియ మనలో ఎలా నడుస్తుంది.ఇంతకీ ప్రస్తుతం మనం ఏదైయినా విషయాన్ని ఎలా వింటున్నాం.అలాగే మనం చెబుతున్నప్పుడు ఎదుటి వారు ఎలా ఆలకిస్తున్నారు.ఈ విషయం గురించి ఎప్పుడయినా ఆలోచించారా!
            సహజంగా మనకు ఏ విషయం అయినా వింటున్నప్పుడు  ఏమి జరుగుతుంది.మన మనసు మనకున్న పూర్వ జ్ఞానంతో విన్న ఆ విషయాన్ని విశ్లేషించి వెంటనే మనదయిన  అభిప్రాయాన్ని చెప్పమంటుంది.మనకు తెలి సిన అంశాల ఆధారం గా మనదైన ప్రతిస్పందనను తక్షణం తెలియ జేయాలనిపిస్తుంది.అంటే ఇక్కడ వినడం అనే ప్రక్రియ జరగక మనం చెప్పడం అనే ప్రక్రియలోకి వెళ్ళిపోయాము.ఎప్పుడూ చెప్పటానికి అలవాటు పడ్డ మనసు పూర్తిగా వినడాన్ని నిరాకరిస్తుంది.ప్రకృతి పరంగా కూడా మనకు రెండు చెవులు,ఒక నోరు ఉండటానికి కారణం ఎక్కువ విని తక్కువ మాట్లాడటానికి అంటారు.మనమందరం మనం చెప్పేది అవతలి వారు వినాలని కోరుకునే వారమే!మరి అదే సూత్రం మనకి మనం అన్వయించుకోము. కుటుంబంలో,స్నేహితుల మధ్య నయినా ఆఫీసుల్లో నయినా సమాజంలో ఎక్కడయినా ఇదే జరుగుతుంటుంది.మనం ఎదుటివారి నుండి ఏమి ఆశిస్తామో వారు మననుండి అదే ఆశిస్తారు.
              మరి దీన్ని మనం ఎలా ఆచరణ లోకి తెచ్చుకోవాలి.ఎవరితో మాట్లాడుతున్నాఅవతలి వారి మాటలను ఎంతో శ్రద్ధతో,దయతో,వాత్సల్యం తో వినడం చేస్తే వారు మీకు చెప్పేది తప్పయినా ఒప్పయినా ఆ విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది.వింటున్నప్పుడు ఎటువంటి ఖండనలు,విమర్శలు,ఆలోచనలు లేకుండా కేవలం వినడం మాత్రమే జరిగితే అప్పుడు ఎదుటివారికి తాము చెప్పినది విన్నాడు అనే త్రుప్తి కలుగుతుంది. ఆ త్రుప్తితో మీరు చెప్పేది వారు అదేవిధంగా వినడం మొదలు పెడతారు.ఎప్పుడయితే మీరు శ్రద్ధగా విన్నారో వారికి మీ అభిప్రాయం కూడా అంతే సున్నితంగా వ్యక్తం చేస్తారు.ఆ సున్నితత్వంలోని సహ్రుదయతను అవతలి హృదయం గ్రహించి మీ సంభాషణను అంతే స్థాయి అవగాహనతో వింటుంది.
               అప్పుడు రెండు మనసుల మధ్య,రెండు హృదయాల మధ్య ఒక అద్భుతమయిన భావ ప్రసారం జరుగు తుంది.అందులో స్నేహం,ప్రేమ,దయ,అవగాహన,వాత్సల్యం వంటి మాటల కందనిదేదో ఇద్దరి మధ్యా ప్రవహిస్తుంది.                                               

8 comments:

  1. మనం చెప్పేడప్పుడు ఎదుటి వారు ఎంత శ్రద్ధతో వింటారో...
    మనం కూడా వారి మాటలను అంత శ్రద్ధగానూ వినాలి...
    మంచి విషయం చెప్పారు రవి శేఖర్ గారూ!
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. అలా వినని వాళ్ళను మనం చూస్తుంటాం.వారి ధోరణిలో వారు చెప్పుకుంటూ వెడుతుంటారు.ధన్యవాదాలు శ్రీ గారు!

      Delete
  2. "ఖండనలు,విమర్శలు,ఆలోచనలు లేకుండా కేవలం వినడం" సరే కానీ ఎదుటి వారు చెప్పేది మనం నిజంగా వింటే మీరు చెప్పినట్టు "మన మనసు మనకున్న పూర్వ జ్ఞానంతో విన్న ఆ విషయాన్ని విశ్లేషించటం" మొదలుపెడుతుంది అంటే ఆలోచిస్తున్నట్టే కదండీ?

    ReplyDelete
    Replies
    1. వినడం పూర్తయిన తరువాత మనం ఆలోచించినా,విశ్లేషించినా అది అంతా అతను చెప్పటం పూర్తయిన తరువాత చెప్పాలి అని నా ఉద్దేశ్యం.అవతలి వ్యక్తీ ని పూర్తీ చెయ్యనివ్వకుండా మనం చెప్పకూడదు.చెప్పేటప్పుడే ఆలోచించటం మొదలు పెడితే అవతలి వారి దృష్టికోణం మనకు అర్థం కాదు.మీ స్పందనకు నెనర్లు.

      Delete
  3. మంచి విషయాలు చిప్పినందుకు ద్యన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. మనం రోజు అనుభవించే విషయాలేనండి.ధన్యవాదాలు మీకు.

      Delete
  4. కళాత్మకంగా వినడం వలన వ్యక్తుల మద్య స్నేహం, ప్రేమ, దయ, అవగాహన, వాత్సల్యం వంటి మాటల కందనిదేదో ఇద్దరి మధ్యా ప్రవహిస్తుంది.........
    మీరు చెప్పింది యదార్ధం రవిశేఖర్ గారు. చక్కటి పోస్ట్.

    ReplyDelete
  5. ధన్యవాదాలు భారతి గారూ!మీ స్పందనకు.

    ReplyDelete