Saturday 2 July 2022

యాంత్రికమైన జీవితం

 

యాంత్రిక మైన జీవితం

కష్ట పడితే ప్రభవించేది స్వేదం
ఉద్విగ్నపు సంతోషానికి ఫలితం ఆనంద భాష్పం
గుండె గాయమైతే కన్నీటి ప్రవాహం
అనుభూతుల స్మరణలో కళ్ళల్లో చెమర్చే తడి
కష్టాలకు,ఆనందాలకు
అనుభూతులకు ,అనుబంధాలకు
స్పందించే మన శరీర ధర్మం
జీవితంలో ఇదేకదా నిత్యం జరిగేది
మనసుపై బాధల ఒత్తిడి పడనీకుండా
శోకం జ్ఞాపకాలుగా మిగలకుండా
రక్షించే శరీర  యంత్రాంగం తీరు అర్థమైతే
మనిషికి మానసిక సమస్య లుండ వేమో!
శ్రమ లేని జీవితం
ఆనందం లేని జీవనం
నిస్సారమైన సంసారం
మదినిండా త్రుప్తి లేని గమనం
కాలంతో పరుగులు
బంధాలలో అంతులేని అంతరం
యాంత్రిక మైన యుగం లో
మనిషెంత కూరుకుపోతున్నాడో
ఇక స్పందనలకు సమయ మెక్కడ !
........ .ఒద్దుల రవిశేఖర్.                                 https://ravisekharo.blogspot.com/?m=1,  మరిన్ని వ్యాసాలకు ,కవితలకు నా బ్లాగును సందర్శించండి.అందరికీ ఆహ్వానం.

Saturday 25 June 2022

మానసిక అనారోగ్యాన్ని గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి...దీపిక (హిందీ సినీనటి )

 

2013,2014 సంవత్సరాల్లో నాకు సినిమా పరిశ్రమలో మంచి విజయాలు దక్కాయి. నాకు వచ్చిన సమస్యను మీ అందరితో పంచుకుంటాను. మొదట్లో ఉదయం లేవగానే కడుపులో ఏదో తెలియని ఇబ్బందిగా అనిపించేది అదేంటో ఎందుకు వస్తుందో అర్ధమయ్యేది కాదు. ఇంత వరకు ఎప్పుడూ ఈ పరిస్థితి నాకు ఎదురు కాలేదు జ్వరం, జలుబు వచ్చినప్పుడు వచ్చే మార్పులు మనకు తెలిసిపోతాయి. కానీ ఈ ఇబ్బంది నన్ను తీవ్రంగా బాధించేది. నాలో నేనే ఏడ్చుకునే దాన్ని అవి నా పాలిట చీకటి రోజులు. గమ్యరహితంగా,వెలితిగా ఉండేది  నా జీవితం.                                      *మా అమ్మ నన్ను చూడటానికి వచ్చినప్పుడు నా లక్షణాలు గమనించి అన్నా అనే సైకాలజిస్ట్ కు ఫోన్ చేసింది. ఆమె నన్ను నిపుణుడి సహాయం తీసుకోమంది. దీనికి సరయిన వైద్యం ఉందని, దాని ద్వారా నయమవుతుందని నమ్మమని కోరింది. మొదట్లో మందులు తీసుకోవడానికి వ్యతిరేకించాను. ఎక్కువ మందులు మింగడం ఆరోగ్యానికి మంచిది కాదు అనుకునే దాన్ని. నా మానసిక స్థితి చాలా హెచ్చు తగ్గులుగా ఉండేది. ఒకో సారి చాలా ఉన్నతంగా, మరో సారి పాతాళం లోకి తోసి వేసినట్లు అనిపించేది.లోలకం ఊగినట్లు నా మనసు ఊగేది. నా మనసుకు, నా శరీరానికి ఏమవుతుందో అర్ధమయ్యేది కాదు. తీవ్రమైన నిరాశ లో కూరుకు పోయేదాన్ని. అప్పుడు నాకు మందులు ఇవ్వడం మొదలు పెట్టారు డాక్టర్.           *Function లకు, party లకు వెళ్ళినప్పుడు అందరి ముందు చిరునవ్వుతో అంతా బాగున్నట్లు ఉన్నా ఏదో తీరని వెలితి లోపల. డాక్టర్స్ చెప్పిన దాన్ని బట్టి నాకు clinical depression ఉందని తెలిసింది. ఒక్క సారి సమస్య అర్ధమయ్యాక దాన్ని అంగీకరించాను. ఈ విషయాన్ని సన్నిహితులతో పంచుకున్నాను. నేను నిజాయితీ గా ఈ విషయాలు చెబుతున్నప్పుడు నా చుట్టూ ఉన్నవారు నన్ను అర్థం చేసుకుని సహకరించే వారు. అప్పటినుండి నా సమస్యను అందరికీ చెబుతుండే దాన్ని అప్పుడర్ధమయ్యింది ఇండియాలో ఈ సమస్యలు చాలా మందికి ఉన్నాయని.ఈ విధంగా అందరికీ చెప్పుకోవడం వల్ల నా career దెబ్బతింటుందనుకోలేదు. అసలు ఈ సమస్యను అందరికీ చెప్పుకోవడం వలననే నేను కోలుకోగలిగాను.                                       *జాతీయ టెలివిజన్ లలో ఇంటర్వూ లు ఇచ్చే దాన్ని. అలా చెబుతున్నప్పుడు స్వేచ్ఛ పొందినట్లు భావించేదాన్ని. మనం నిజాయితీగా ఉంటే మన చుట్టూ ఉన్న వారు అర్థం చేసుకొని అంగీకరిస్తారని తెలిసింది.నేను అనుభవించే బాధను,ఎలా అధిగమించానో తెలుసుకుంటే మిగతా వారికి మేలు జరుగుతుందని భావించేదాన్ని.  ఒక విలేఖరి నన్ను ఏదయినా మందుల కంపెనీ కి ఏజెంట్ గా పని చేస్తూ ఇదంతా చెబుతున్నావా అని అనుమానించింది.                                   *విచారంగా ఉండటం వేరు,వ్యాకులంగా ఉండటం వేరు మనం వ్యాకులాన్ని గుర్తించలేం కూడా. మానసిక అనారోగ్యం దాని లక్షణాలు అర్థం చేసుకోవాలి. కొంత మంది ఎలా ఉన్నావు అని అడిగితే బాగాలేను అంటారు. వారు కోలుకోవడానికి అటువంటి వారి పట్ల సహానుభూతి చూపడం అత్యంత అవసరం  అవతలి వారిపట్ల శ్రద్ద చూపడం వారిపట్ల జాగ్రత్త వహించడం ఉదాత్త లక్షణం       *2013-14 సంవత్సరాలు నా జీవితంలో అత్యంత కఠినమైనవి.నా హృదయం ముక్కలై పోయిందా అన్న భావన. ఆ స్థితిని తెలుసుకుని వైద్య సహాయం తీసుకోవడం నా జీవితాన్ని మార్చేసింది. అలాగే శారీరక అనారోగ్యం గురించి అందరికీ ఏదో ఒక మేరకు అవగాహన ఉంటుంది. కానీ రాబోయే 10 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరూ తమ మానసిక ఆరోగ్యాన్ని గురించి తెలుసుకుంటారని ఆశిస్తాను. (అనువాదం :ఒద్దుల రవిశేఖర్ )

Saturday 11 June 2022

సురభి గౌతమ్ :IAS ఆఫీసర్ అయిన విధం

 

నమస్తే అందరూ ఈ రోజు నా  విజయాల గురించే మాట్లాడుకుంటున్నారు. అన్ని ప్రఖ్యాతి గాంచిన పోటీ పరీక్షలు ఉత్తీర్ణత అయినట్లు నా  బయోడాటా లో మీకు కనిపిస్తుంది. కానీ మిత్రులారా  నేను పొందిన తిరస్కారాలు,నా పట్టుదల, మానసిక సామర్ధ్యము నా విజయాలకు కారణం.                               *మధ్య ప్రదేశ్ లోని మారుమూల కుగ్రామం మా ఊరు.1000 జనాభా కలిగిన చిన్న పల్లెటూరు. ఒక వర్షా కాలం ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో ఒక చిన్న పాప జన్మించింది. 30 మందితో కూడిన పెద్ద ఉమ్మడి కుటుంబమది.25 ఏళ్ళు గడిచాయి. అదే అమ్మాయి, అదే ఊరు. పూల దండలతో స్వాగతం. ఉమ్మడి కుటుంబంలో ఎవరినీ ప్రత్యేక శ్రద్ధతో చూడరు.మా ఊరి హిందీ మీడియం పాఠశాలలో చదివాను.5 వ తరగతి గణితంలో 100/100 మార్కులు సాధించాను. ఆ రోజు నాకు మొదటి ప్రశంస,గుర్తింపు లభించాయి.నా హృదయం విభిన్న అంశాలపై దృష్టి పెట్టమని కోరుతుంది.చిత్ర కళ,రంగులు వేయడం,ఎంబ్రా యిడరి మొదలు పెట్టాను.                                *కానీ నా దేహంలో కలుగుతున్న నెప్పిని గమనించలేకపోయాను. నా మోచేతి భాగం మరియు నా శరీరంలోని ప్రతి కీలులో విపరీతమైన బాధతో మంచానపడ్డాను. హాస్పిటల్ లో డాక్టర్ రుమాటిక్ జ్వరం అని చెప్పారు. ప్రమాదకర మైన జ్వరమని ప్రతి 15 రోజులకొకసారి నిపుణుడయిన డాక్టర్ తో పెన్సిలిన్ ఇంజక్షన్ వేయించాలని చెప్పారు. మా ఊర్లో కరంట్ లేదు కిరోసిన్ వెలుగులో చదువుకోవాలి. ఎటువంటి ట్యూషన్ లు లేవు.అయినప్పటికీ నా 10 వ తరగతి పరీక్షల్లో maths, science ల్లో 100/100 మార్కులు సాధించాను.నన్ను వార్తపత్రికలు ఇంటర్వూ చేసాయి. భవిష్యత్తులో ఏమవుతావని అడిగారు. Dancer ను singer ను అవుతానని చెప్పాను. కానీ ఆ విలేఖరి నువ్వు బాగా చదివి ఏమవుదామనుకుంటున్నావు అని అడిగారు. అప్పుడు మెరుపులా నా  మనసులో ఓ ఆలోచన వచ్చింది."కలెక్టర్ ను అవుతానని చెప్పాను. పేపర్ లో అదే హెడ్డింగ్ తో వార్త వచ్చింది. అందరూ అభినందించారు. కానీ కలెక్టర్ కావాలంటే ఏమి చెయ్యాలో తెలియదు. సమాజానికి కలెక్టర్ ఎంత ముఖ్యమో తెలీదు.                                             * ఇంటర్ లో మాథ్స్ గ్రూప్ తీసుకున్నాను. మా  ఊరిలో విద్యుత్ శక్తి,ఆసుపత్రి లేని దయనీయ స్థితిని మార్చాలనుకున్నాను. కానీ ఎలానో తెలీదు.12 వ తరగతిలో సైన్స్ లో ఎక్కువ మార్కులు రావడంతో అబ్దుల్ కలాం స్కాలర్ షిప్ వచ్చింది. మంచి గుర్తింపు వచ్చింది.               *తరువాత భోపాల్ వచ్చి ఇంజనీరింగ్ లో చేరాను. మా ఊరి నుండి వచ్చిన ఏకైక అమ్మాయిని నేనే. నేను నా ఆశయాలు సాధించక పోతే మిగతా అమ్మాయిల ఆశలు సమాధి చేసినట్లే. కాలేజీలో మొదటి రోజే చేదు అనుభవం. కెమిస్ట్రీ ల్యాబ్ లో మేడం నన్ను చూసి ఆ టెస్ట్ ట్యూబ్ తీసుకుని టైట్రేషన్ చేయమన్నది. అసలు హిందీలో దాని అర్ధమేంటో తెలీదు. టెస్ట్ ట్యూబ్ పట్టుకోగానే జారి క్రింద పడింది. ఇక రెండవ పీరియడ్ ఇంజనీరింగ్ ఫిజిక్స్. అందరు ఇంగ్లిష్ లో ధా రాళంగా మాట్లాడుతూ పరిచయం చేసు కుంటున్నారు.నాకు ఇంగ్లీష్ రాదు. హిందీ మీడియంలో చదివాను. అందరు చెప్పిన పదాలు పేర్చుకుని ఎలాగోలా చెప్పగలిగాను. మా ఫిజిక్స్ సార్ పొటెన్షియల్ అంటే ఏంటని అడిగారు.అర్థం తెలిసినా ఇంగ్లీష్ లో చెప్పలేక మౌనంగా ఉన్నా. సార్ వచ్చి నువ్వు నిజంగా ఇంటర్ పాస్ అయ్యావా, ఇంత చిన్న ప్రశ్న చెప్పలేవా అన్నారు. రూమ్ కు వచ్చి తనివి తీరా ఏడ్చాను. బ్యాగ్ సర్దుకొని ఇంటికి వెళ్లి పోదామనుకున్నా. మా  అమ్మానాన్న కు ఫోన్ చేసాను. హనుమంతుడికి అతని గొప్ప తనాన్నిజాంబ వంతుడు ఎలా గుర్తు చేసాడో నాకు అమ్మా నాన్న అలా ధైర్యం చెప్పారు అప్పుడు నిర్ణయించుకున్నా మొదటి సెమిస్టర్ అయిపోయేలోగా ఇంగ్లీష్ లో ధారాళంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నా. ఇంజనీరింగ్ పుస్తకాల్లోని పదాలను గోడలపై వ్రాసుకున్నా. నా మెదడులోకి బాగా ఎక్కించుకున్నా. నా  కలలు కూడా అప్పటినుంచి ఇంగ్లీష్ లోనే సాగాయి. మొదటి సెమిస్టర్ లో యూనివర్సిటీ లోనే మొదటి స్థానం సాధించాను. ఛాన్సలర్ స్కాలర్ షిప్ అందుకున్నా. సాధించాలని బలంగా నిర్ణయించుకుంటే ఏదయినా సాధించగలమని అప్పుడర్ధయింది. ఏకోచింగ్ లేకుండా ఇంగ్లీష్ లో మాట్లాడాగలిగాను.విశ్వం ఏ విధంగా తలచిందో మీ ముందు TED talk లో ఇలా నిలబడ్డా.20 ఏండ్ల 6 నెలలకు నా B. Tech డిగ్రీ పూర్తయింది.                     *సివిల్స్ వ్రాయాలంటే 21 సం నిండాలి. ఈ 6 నెలల్లో GATE, ISRO,BARC , SAIL,PPSC, IES ఇలా అన్ని ఇంజనీరింగ్ ఉద్యోగ పరీక్షలు వ్రాసా అన్నింట్లోనూ అర్హత సాధించా. ముంబై BARC నుండి ఇంటర్వూ కి పిలుపు వచ్చింది. మిత్రులంతా చాలా కష్టమని నిరాశ పరిచారు. ఇంటర్వూ లో విజయం సాధించి న్యూక్లియర్ సైంటిస్ట్ అయ్యాను.IES లో దేశం లో మొదటి ర్యాంక్ వచ్చింది. కానీ నేను ఏ IIT, NIT ల నుండి వచ్చిన దాన్ని కాదు. నేను ఇంజనీరింగ్ సర్వీస్ పరీక్షలో first వచ్చిన మొదటి మహిళను. ఇప్పటివరకు నా మార్కులు ఎవరూ దాటలేదు. BARC కు రాజీనామా ఇచ్చి రైల్వే ఇంజనీర్ గా చేరాను. హైదరాబాద్ లో శిక్షణ కోసం వెళ్ళా.                                  *ఇక చదవాల్సిన పని లేదు జీవితాన్ని సంతోషం గా గడుపుదా మనుకున్నా .కానీ ఎందుకో ఈ వృత్తి ఆనందాన్ని ఇవ్వడం లేదు.అమ్మని అడిగా ఎందుకు ఇలా అనిపిస్తుంది అని.అమ్మ ఇలా అన్నది "10 వతరగతి అయ్యాక పేపర్ కు ఇచ్చిన ఇంటర్వూ లో కలెక్టర్ అవుతానని, ఊరికి ఏదో మేలు చేస్తావని చెప్పావు కదా "అన్నది. అప్పుడు సివిల్స్ వ్రాద్దామని నిర్ణయించుకున్నా.సివిల్స్ ఇండియా లోనే కాదు, ప్రపంచంలోనే అతి కఠినమైన పరీక్ష.4,5 సార్లు వ్రాస్తేనే గాని విజయం సాధించలేని పరీక్ష.24 గంటలు చదువుతుంటారు ఈ పరీక్ష కోసం. కానీ నా రైల్వే శిక్షణ తీసుకుంటూనే రోజుకు మిగిలిన  3 లేదా 4 గంటలు చదివే దాన్ని చాలా ఒత్తిడికి గురయ్యేదాన్ని. వదిలేద్దా మనుకున్నా. మళ్ళీ అమ్మకు ఫోన్ చేసాను. ఆమె నాకు ఎప్పుడూ మంచి మెంటార్ గా ఉండేది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక కూడా నాకు జీవితం చాలా కష్టంగా ఉంది చిన్నప్పటినుండి కష్టపడుతూనే ఉన్నా. జీవితం లో ఆనందించేదెప్పుడూ సివిల్స్ పాస్ అవుతానోలేదో తెలీదు. అన్నాను అమ్మతో. అమ్మ అన్నది "నీ  వయసు 23, నేను నీ వయసులో ముగ్గురు బిడ్డల తల్లిని.30 మంది ఉన్న ఉమ్మడి కుటుంబానికి భోజనం తయారు చేసి 10 కి. మీ  వెళ్లి పని చేసి వచ్చే దాన్ని అయినా నేను ఎవరిపై ఫిర్యాదు చేయలేదు. కానీ నీకు ఎటువంటి కుటుంబ సామాజిక బాధ్యతలు లేవు. నీ కలను సార్ధకం చేసుకో, నిన్ను నువ్వు నిరూపించుకో ఇతరుల కోసం కూడా సాధించు, అదే నీ లక్ష్యం. నీ కళ్లద్దాలను కొద్దిగా సవరించుకో". ఇక నేను మిషన్ మోడ్ లో చదవడం మొదలు పెట్టాను. ఎన్ని ఆటంకాలు ఎదురయినా అంతే దృఢoగా మారిపోయాను.2016 లో సివిల్స్ లో దేశ స్థాయిలో 50 వ ర్యాంక్ సాధించాను.                                                                *ఈ క్రింది వాక్యాలు నేను నమ్ముతాను "కష్టపడటానికి మించి వేరే మార్గం లేదు. విజయానికి దగ్గరి దారి లేదు.సాధించలేని వాటి గురించి ఆలోచించకు.విధితో మొండిగా పోరాడి ఏదయినా సాధించు,ముందుకే వెళ్లాలని బలంగా నిర్ణయించుకో. అదే మన గమ్యాన్ని చేరడానికి గల రహస్యం." ధన్యవాదాలు. 🙏. (అనువాదం :ఒద్దుల రవిశేఖర్ )

Saturday 4 June 2022

మనమంతా పరిపూర్ణమైన అపరి పూర్ణులం....మునాబ్ మజారి.

 అందరికీ ధన్యవాదాలు. నన్ను నేను ప్రేరణాత్మక వక్తగా కాక ఒక కథకురాలిగా భావిస్తా ఎక్కడి కెళ్ళినా ఒక కథ చెబుతా, మాటలకున్న శక్తి విలువ నాకు తెలుసు. పదాలు మిమ్మల్ని తయారు చేయవచ్చు, మీ మనసును గాయ పరచవచ్చు, గాయాన్ని మాన్ఫవచ్చు.అందుకే నేను ఆశావాదంతో మాట్లాడుతుంటా వాళ్ళు దాన్ని నా బలహీనతగా భావిస్తే నేను అది బలంగా భావిస్తా, వారు నన్ను వికలాంగురాలిగా భావిస్తే నేను విభిన్న ప్రతిభా వంతురాలిగా భావిస్తా, నా సామర్ధ్యాన్ని చూస్తా. మీ జీవితం లో జరిగే కొన్ని సంఘటనలు మీ DNA ను మార్చేంత శక్తి కలిగి ఉంటాయి మీ దేహాన్ని ముక్కలు చేసినా మీ ఆత్మలో పరివర్తన కలిగిస్తాయి.అవి మిమ్మల్ని మరింత ఉన్నతీకరిస్తాయి. నాకు అలాగే జరిగింది.18 ఏళ్లప్పుడే నాకు పెళ్లి అయింది మాది చాలా సంప్రదాయ కుటుంబం వివాహం అయిన 2 ఏండ్ల కు నాకు కార్ ప్రమాదం జరిగింది. నా భర్త ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. నాకు తీవ్ర గాయా లయ్యాయి.కుడి భుజం మణికట్టు విరిగాయి. ఊపిరి తిత్తులు, కాలేయం దెబ్బతిన్నాయి గాలి పీల్చలేక పోయేదాన్ని, మూత్రము మీద నియంత్రణ కోల్పోయాను. నా వెన్నెముక పూర్తిగా దెబ్బతిన్నది. జీవితాంతం ఇక నడవ లేనని తెలిసింది ఈ గాయాలు నా జీవితాన్ని పూర్తిగా మార్చేసాయి కొంత మంది రక్షించి ఒక జీప్ వెనుక భాగంలో తీసుకెడుతుంటే మిగిలిన ఎముకలు కూడా విరిగాయి. అప్పుడు నా కర్ధమైంది. సగం దేహం విరిగిపోయింది, మిగతా సగం చలనం లేకుండా మారిందని. రెండున్నర నెలలు ఆసుపత్రి లో ఉన్నాను. నాకు చాలా శ స్త్ర చికిత్సలు జరిగాయి. నా శరీరం లో చాలా టైటానియం అమర్చారు అందుకే పాకిస్థాన్ లో నన్ను అందరూ ఉక్కుమహిళ అంటారు.ఒక రోజు డాక్టర్ వచ్చి నీవు ఇక చిత్రకారిణి కాలేవని చెప్పారు. మరుసటి రోజు వచ్చి నీ వెన్నెముక బాగా దెబ్బ తిన్నదని ఇక నీవు నడవ లేవని, బిడ్డలను కనలేవని చెప్పడం తో నా కర్ధమయింది పూర్తిగా నా జీవితం నాశనమయిందని. మా అమ్మను అడిగాను నేను ఎందుకు బ్రతికి ఉండాలని, నా జీవితానికి అర్థం ఏముందని? పిల్లలు కలగక పోతే జీవితమంతా అసంపూర్ణం గా మిగిలిపోవాల్సిందేనా అని. దేవుడు నీ కేదో గొప్ప భవిష్యత్తును వ్రాసి పెట్టాడేమో అని అమ్మ అన్నది. అంత బాధలోనూ అమ్మ మాటలు నా మీద మంత్రం లా పనిచేసాయి నన్ను ఆసుపత్రి నుండి తీసికెళ్ళమని అమ్మను, తమ్ముడిని కోరాను నేను మొదటి చిత్రాన్ని నా మృత్యు పాన్పు మీద వేసాను అదే నా హృదయానికి నేను చేసుకున్న చికిత్స. ఆసుపత్రి నుండి ఇంటికొచ్చాను. నా గాయల వల్ల 2 సంవత్సరాలు ఇంట్లోనే బెడ్ పైనే  ఉండవలసి వచ్చింది,కిటికీ గుండా పక్షుల కిలకిలా రావాలు వింటూ.ఒకసారి బయటికెళ్లి ప్రకృతి సంగీతాన్ని వినాలని కోరిక కలిగింది, అప్పుడనిపించింది ప్రజలెంత అదృష్టవంతులో కాని వారది గుర్తించరు. రెండున్నర సంవత్సరాల తర్వాత చక్రాల కుర్చీ పై కూర్చో గలిగాను. అప్పుడు నాకు పునర్జన్మ లభించినట్లనిపించింది. ఇక జీవితమంతా నడవ లేనని గుర్తు కొచ్చింది. అద్దముందు నిలబడి అనుకున్నా ఏ అద్భుతం జరిగి నేను నడవలేనని, ఏడ్చుకుంటూ మూలన కూర్చునే బదులు, ఎవరి దయ కోసమో ఎదురు చూసే బదులు నా స్థితిని అంగీకరించాలని నిర్ణయించుకున్నా! నా కోసం నేను జీవించాలనుకున్నా, అప్పుడే నిర్ణయించుకున్నా నా భయాలను గెలవాలని కానీ నా పెద్దభయం ఏంటంటే విడాకులు. నా అవసరం లేని వ్యక్తికి నేను ఎందుకు? అతనికి స్వేచ్చ ఇచ్చి నేను స్వేచ్ఛను పొందటం మేలు కదా!అతను వివాహం చేసుకున్నాడు అని తెలియగానే అభినందనలు తెలియజేసా రెండవ పెద్దభయం నాకు పిల్లలు కలగరని! కానీ ప్రపంచంలో ఎంతో మంది అనాధలున్నారు. వారిలో ఒకరిని దత్తత తీసుకోవచ్చు కదా అనిపించింది, అదే చేసాను. ఇక  3 వ భయం  జనాలను ఎలా ఎదుర్కోవాలి అని ఇంట్లో బెడ్ మీదున్న ఆ రెండు సంవత్సరాలు తలుపులు వేసుకొని ఎవరిని పలకరించటానికి ఇష్టపడే దాన్ని కాదు. వారు ఒక లాగా సానుభూతి చూపడం నాకు నచ్చదు ఇప్పుడు ఇలా మీ అందరి ముందు నా కథ పంచుకోవడం నా అదృష్టం. అలాగే పెయింట్ వేయడం మొదలు పెట్టాను. మోడలింగ్ చేస్తున్నాను. అందువలన  మనల్ని మనం ముందు అంగీకరిస్తే ప్రపంచం మనల్ని గుర్తిస్తుంది. పాకిస్థాన్ తరపున ఐక్యరాజ్యసమితికి రాయబారిగా వ్యవహరిస్తూ స్త్రీ ల  పిల్లల  హక్కుల గురించి  లింగ సమానత్వం గురించి  మాట్లాడుతున్నా.2015 BBC ఎన్నుకొన్న 100 మంది స్త్రీల లిస్ట్ లో నేను ఉన్నా, Forbes ఎన్నుకొన్న 30 సంవత్సరాల లోపు వయసు  గల  30 మంది స్త్రీల లిస్ట్ లో ఉన్నా. మీ వృత్తి లో మీరు  ఎంతో ఉన్నతస్థానం చేరుకోవాలని మీకు ఉండవచ్చు. కానీ దానికి ఒకటే  సూత్రం నేను అనుకోకుండా మనం అనుకోవాలి. నీ ఒక్కడివే విజయాలు సాధిస్తావు అనుకోవద్దు. నీ  వెనుక ఒకరుండాలి. నీకు మద్దతిస్తూ ఒకరుండాలి అటువంటి వ్యక్తిని కోల్పోవద్దు. నా  వెనుక  మా అమ్మ ఉంది నేను ఇలా ఉన్నానంటే ఆమే కారణం. మనం జీవితం నుంచి ఎంతో ఆశిస్తుంటాం కానీ జీవితం నన్నిక్కడ నిలిపింది. ఇది నాకు పరీక్షా కాలం. దాన్ని మనం  అర్థం  చేసుకుంటే  చాలు ఓటమి  ఒక అవకాశం, మళ్ళీ మళ్ళీ లేచి నిలబడి ప్రయత్నించాలి కానీ ఎప్పుడూ వదిలి పెట్టకూడదు. మనకు అంతా దోషం లేకుండా ఖచ్చితంగా, సంపూర్ణం గా ఉండాలనుకుంటాం. జీవితం, వృత్తి సంబంధాలు డబ్బు ఇలా అన్నింట్లో సంపూర్ణతను ఆశిస్తాం ఏదీ ఈ ప్రపంచం లో పరిపూర్ణంగా ఉండదు. మనమంతా పరిపూర్ణంగా అసంపూర్ణులం.ఇతరులకు మనం మంచిగా పరిపూర్ణంగా కనిపించాలనుకోవద్దు. నీ లోపల నీకు  ఆ పరిపూర్ణత ఉంటే చాలు. ఈ సమాజం మనం సంపూర్ణులుగా ఉండటానికి చాలా నిబంధనలు పెట్టింది. స్త్రీ పురుషులకు అవి విభిన్నంగా ఉంటాయి. మనం ఎదుటివారు చెప్పిన దానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తాం. మనల్ని మనం తక్కువ వింటాం.ఇతరుల మేలు కోసం నీవు ఏదయినా చేస్తే నీవు సంపూర్ణంగా ఉన్నట్లు. ఇతరుల బాధను మనం అనుభవించి నట్లయితే ఆ బాధే మనల్ని ఇతరులతో అనుసంధానం చేస్తుంది. బాధ తప్ప ఏదీ ఇతరులతో మనల్ని అనుసంధానించదు. అందుకే చెబుతుంటా నేను బాధ లో ఉన్నానని. నా కదే ఆశీర్వాదం. చక్రాల కుర్చీలో ఉన్నాను కాబట్టే పిల్లలకోసం పనిచేస్తున్నా. వైద్య సహాయం అందని మారుమూల ప్రాంతాల పిల్లలకు వైద్యం అందిస్తున్నా. అలాగే హిజ్రా లకు  సహాయం అందిస్తున్నా. ఇలా అసంపూర్ణమైన వ్యక్తులు మనతో అనుబంధం ఏర్పరచు కోవడానికి కారణం నేను అసంపూర్ణురాలుని కాబట్టి. జనం అడుగుతుంటారు ఎప్పుడూ నవ్వుతూ ఉండటంలో మీరు అలసట చెందరా అని. నీవు కోల్పోయిన వాటి గురించి, వ్యక్తుల గురించి ఆలోచించవద్దు. నీవు ప్రస్తుతం పీల్చే ప్రతి శ్వాసను ఆస్వాదించు.జీవితాన్ని ఉత్సవం లా జరుపుకో.జీవించు, మరణానికంటే ముందే చావకు. అందరం మరణించే వాళ్ళమే.75 ఏళ్ళు ఒకేలా బ్రతికి మనం దాన్ని జీవితమంటాం. ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తారు అది కాదు జీవితం అంటే. బయటికెళ్లి నీ సహాయం కావలిసిన వారిని గుర్తించు. వారి జీవితాలకు రంగులద్దు. వారి జీవితాలకు విలువనివ్వు. అన్ని నిరాశా వాదపు భావనలు తొలగించే స్పాంజ్ లా మారు అందమైన ఆశావాదపు భావనలు వెదజల్లగలిగితే ఇతరులను మార్చగలవు. నేను నవ్వుతుంటేనే ఇతరులను ఆనందపరచగలను. నీకు ఉన్న వాటి పట్ల గొప్పగా భావించు. మనకు లేని వాటిపట్ల ఎక్కువగా ఆలోచించ వద్దు. జీవితాన్ని పూర్తిగా జీవించండి. నీవు ఉన్న స్థితిని అంగీకరించు.నీ పట్ల నీవు దయకలిగి ఉండు అప్పుడే ఇతరుల పట్ల దయ కలిగి ఉంటావు.నిన్ను నువ్వు ప్రేమించు ఆ ప్రేమను వ్యాపింపజెయ్యి. జీవితం చాలా కఠినంగా ఉంటుంది.అలజడి, పరీక్షలు ఉంటాయి. అవే నిన్న ద్రుడంగా గా తయారు చేస్తాయి. ఎప్పుడూ దేన్నయినా  మధ్యలో వదిలి వేయవద్దు. నిజమైన ఆనందం డబ్బులో, విజయం లో కీర్తిలో ఉండదు.

నిజమైన ఆనందం కృతజ్ఞతలో ఉంటుంది. ప్రతి క్షణం జీవించడానికి ప్రయత్నించండి.(అనువాదం :ఒద్దుల రవిశేఖర్ )

Wednesday 1 June 2022

రేనాటి సూర్య చంద్రులు

 రచయిత :తంగిరాల సుబ్బారావు                   పుస్తక పరిచయం :ఒద్దుల రవిశేఖర్                    ఉయ్యాలవాడ నారసింహారెడ్డి యుద్ధ వీరగాధ (విప్లవ కాలము క్రీ. శ 1845-1847) బుడ్డా వేంగళ రెడ్డి దాన వీర గాధానిక (జీవిత కాలము:క్రీ. శ  1822-1900) చిరంజీవి " సైరా నరసింహా రెడ్డి " చిత్రం విడుదల కాగానే ఒక్క సారి అందరి దృష్టి ఉయ్యాలవాడ నారసింహారెడ్డి పై పడింది. ఆచార్య తంగిరాల వేంకట సుబ్బారావు గారు ఎంతో శ్రమకోర్చి సేకరించి గుడిగుచ్చి అందించిన ఈ పుస్తకం లో నారసింహా రెడ్డిని సూర్యుడిగాను, వేంగళ రెడ్డిని చంద్రునిగాను వర్ణించారు రచయిత. చరిత్ర ఎప్పుడూ వ్రాసే వారి అభిప్రాయాలను బట్టి ఉంటుంది అందుకే చరిత్రపై ఎన్నో భే ధాభిప్రాయాలు ఉంటాయి. నారసింహారెడ్డి విషయం లో అదే జరిగింది. కానీ రచయిత బ్రిటిష్ ప్రభుత్వం భద్రపరిచిన రికార్డులను, జనపదాల్లో పాడుకునే పాటలను, వీరగాధలను పరిగణన లోకి తీసుకొని ఆయన బ్రిటిష్ వారిపై విప్లవ శంఖం పూరించారని అర్ధమవుతుంది అంటారు. ఆయననను భారత ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామ వీరుడిగా రచయిత పేర్కొన్నారు. అలాగే 1866 లో రాయలసీమ ప్రాంతం లో వచ్చిన ఎర్రగాలి కరవు, ధాత కరవుల కాలంలో 3 నెలల పాటు కొన్ని వేల మందికి అన్నదానం చేసిన అపర దానకర్ణుడిగా ఖ్యాతి గాంచారు బుడ్డా వేంగళ రెడ్డి. ఆయన తన జీవితమంతా తన ఆస్థి పాస్తులను దాన ధర్మాలకే ఖర్చు చేశారు.చారిత్రక ప్రాంతాలపై ఆసక్తి ఉన్నవారు పుస్తకం మొదట్లో, చివర్లో ఇచ్చిన చిత్రాలు చూసి ఆయా ప్రాంతాలను సందర్శించవచ్చును. గిద్దలూరు దగ్గర కొత్త కోటపై ఉన్న ఫిరంగులను మేము విహార యాత్రలో చూసాము. ఈ పుస్తకం లో బండి గోపాలరెడ్డి, కలవటాల జయరామారావు బందుమియ్య రచనలను పొందు పరచారు. చివరలో బ్రిటిష్ ప్రభుత్వం వారు జరిపిన ఉత్తర ప్రత్యుత్తరములు ఇవ్వడం వలన రచనకు మరింత విశ్వసనీయత కలిగింది. గ్రంధాలయం లో ఎప్పటినుండి ఉందో ఈ పుస్తకం ఇప్పటికి చదివింది నేనే. ఆసక్తి గల వారు అన్ని ప్రభుత్వాగ్రంధాలయాల కెళ్ళి చదువ వచ్చును.  

Monday 30 May 2022

నాలో రగిలే అగ్ని కి అదే ఇంధనం... ప్రియాంక చోప్రా

 అందరికి శుభమధ్యాహ్నం. ఈ అమ్మాయి పేరు ఈవ,16 ఏండ్ల వయసు. ఈ వయసులో అమ్మాయిలు వారి అమాయకత్వాన్ని ఆనందిస్తూ,వారి యవ్వనంలో త్రుళ్ళుతూ గడుపుతుంటారు. కానీ ఇంత చిన్న వయసులో ప్రపంచం లోని తన తోటి పిల్లల గొంతుకై, అవకాశాల్లేని యువతులు, మహిళలకు సలహా లిస్తూ ఇటువంటి గౌరవాన్ని పొందటం విశిష్ఠ మైన విషయం. ధన్యవాదాలు.  మీలాంటి అద్భుతమైన, అపురూపమైన మహిళల మధ్యన నేను పాల్గొనడం విశేషమైన గౌరవంగా భావిస్తున్నాను.   ఇక్కడ హాజరయిన ఎంతో గొప్ప విజయాలు సాధించిన octavia, మిచేల్, కెల్లీ, పాటి లాంటి 50  మంది మహిళలకు నా అభినందనలు. మీ విజయాలు నాకే కాకుండా ఎంతో మందికి స్ఫూర్తి నిస్తాయి. మీ ప్రక్కన నిలబడటం నాకెంతో గర్వ కారణం. మీ జీవితం లో ఒక్క సారి ఆగి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఇక్కడి దాకా ఎలా వచ్చాం, ఇక్కడ ఎందుకు నిలబడ్డాము అని. నాక్కూడా నా మూలాల్లోకి తిరిగి వెళ్లి చూసుకోవాలనిపిస్తుంది. నేను అపురూపమైన, అద్భుతమైన తల్లిదండ్రులకు పుట్టాను. వాళ్ళు భారత సైన్యం లో పనిచేసారు. నేను వారికి ప్రధమ సంతానం.99% మా తల్లిదండ్రులనుగర్వపడేలా చేసాను. కొన్ని సార్లు వ్యక్తిగత విజయాలు చెప్పుకుంటే ఎక్కువ గా చెప్పినట్లు అనిపిస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత మా తమ్ముడు పుట్టాక కూడా నాకేమీ మార్పు లేదు. మా ఇద్దరికీ సమాన అవకాశాలు ఇచ్చారు మా తల్లి దండ్రులు.ఈ విషయాన్ని నేను నొక్కి చెప్పగలను. సమాన అవకాశాలు ఇవ్వడం మీకు సాధారణం అనిపించవచ్చు కానీ అభివృద్ధి చెందుతున్న అన్ని దేశాల్లోలాగానే మా భారత్ లో కూడా ఈ అసమానత్వ సమస్య ఉన్నది.ఈ అసమానత్వం చాలా చిన్న వయసు నుండే అబ్బాయిలు అమ్మాయిల మధ్య ఉంటుంది.సేవా భావం కలిగిన, మధ్యతరగతికి చెందిన తల్లిదండ్రుల ఇంట్లో నేను పెరిగాను. వాళ్ళు తరచూ చెబుతూ ఉంటారు. తక్కువ సంపద కలిగి ఉన్నవారికి సేవ చెయ్యడం అనేది అవకాశం కాదు అది ఒక జీవన మార్గం అని మనం ఎంతో అదృష్టవంతులమని చెబుతుండే వారు.నాకు  7,8 ఏండ్ల వయసు నుండే మా తల్లి దండ్రులు వెర్రిల్లి పట్టణ చుట్టూ ప్రక్కల ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ నన్ను తీసుకెళ్ళే వారు. నేను రోగులకు మందులు ఒక ప్యాకెట్ లో పెట్టి ఇచ్చే దాన్ని. ఈ పని నేను చాలా తీవ్రంగా చేస్తుండే దాన్ని. ఇలా నేను వెడుతున్నప్పుడు బాల బాలికల మధ్య, స్త్రీ పురుషుల మధ్య అంతరాలు గమనించాను.ఉదాహరణకు బాలికలను యవ్వనం రాగానే పాఠశాలలు మాన్పించి వివాహానికి సిద్ధం చేస్తారు. కాని బాలు రు వారి బాల్యాన్ని ఆనందిస్తుంటారు.స్త్రీలు అయినంత మాత్రాన ప్రాధమిక మానవ హక్కులు, ఆరోగ్యం నిరాకరించబడటం అన్యాయం. ఇలా నేను ఎదిగే కొద్ది ఇటువంటి ఎన్నో అంశాలు గమనించాను. నా సినిమా కెరీర్ 18,19 ఏండ్లకే మొదలయ్యింది. స్త్రీ ని అయినందుకు నాకు తక్కువ పారితోషికం ఇవ్వజూపే వారు, నేను వ్యతిరేకిస్తే నా స్థానం లో ఇంకొకరికి అవకాశం ఇచ్చేవారు.ఎందుకంటే వినోద రంగం లో మహిళలను మారుస్తూ ఉంటారు. అప్పుడు నన్ను వారు మార్చలేని విధంగా తయారవ్వాలని నిర్ణయించుకున్నాను. చివరకు అంతిమంగా ఇది ప్రియాంకా చోప్రా foundation పుట్టుకకు దారి తీసింది. దీని తరపున విద్య, వైద్య రంగాల్లో  UNICEF భాగస్వామిగా పని చేయాలని నిర్ణయించుకున్నాను.12 ఏండ్ల క్రితం మా ఇంట్లో పని మనిషి వాళ్ళ అమ్మాయి, నేను షూటింగ్ నుండి త్వరగా వచ్చిన రోజు నా పుస్తకాల గది లో పుస్తకం తీసి చదవడం గమనించా,8 లేక 9 ఏండ్లు ఉంటాయోమో పుస్తకాలంటే ఎంత ప్రేమో అనుకున్నా, ఈ రోజు బడి ఉంది కదా ఎందుకు వెళ్ళలేదు అని అడిగితే నేను ఇక బడికి వెళ్ళను అంది.వాళ్ళ అమ్మను అడిగితే  అమ్మాయిని అబ్బాయిని బడికి పంపే స్థోమత లేదు మాకు అన్నది.ఆ అమ్మాయికి చదువుకు డబ్బు వృధా, ఆ డబ్బు తో వారికి పెళ్లి చేయవచ్చు అంది. నా కు ఆ మాట ఈడ్చి కొట్టినట్లు తగిలింది. నా అంతరంగాన్ని కుదిపేసింది.ఆ అమ్మాయి చదువుకయ్యే ఖర్చు నేను భరించాలని నిర్ణయించుకున్నాను. ఆ అమ్మాయి చదువు కొనసాగించాలి ఎందుకంటే, చదువనేది కనీస మానవ హక్కు మరియు ప్రస్తుతం అత్యా వశ్యకం. అప్పుడు దృఢముగా నిర్ణయించుకున్నా ఎంత మంది పిల్లల జీవితాల్లో వీలయితే అంత మార్పు తీసుకు రావాలని, ఎంతో కొంత సహాయం చేయాలని నిర్ణయించుకున్నా.ఈ మధ్యే ఒక అందమైన కోట్ చదివా,ఈ సందర్భంగా దాన్ని చెప్పటం చాలా సమయోచితం అనుకుంటా " ఈ రోజు ఊయల ఊపే చేయి రేపటి తల్లిని తయారు చేస్తుంది, స్త్రీ నాగరికత యొక్క విధినే రూపు దిద్దుతుంది " అటువంటి అందమైన సృష్టి అయిన ఆడబిడ్డలు నేడు మానవత్వం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య కావడం విధి కల్పించిన దుఃఖకరమైన నిందా స్తుతి కాక మరేమిటి? ప్రపంచాన్ని మార్చే శక్తి బాలికలకుంది. అది నిజం.గత రెండు దశాబ్దాల్లో ఎన్ని ప్రయత్నాలు ఎంత అభివృద్ధి జరిగినా తరగతి గదుల్లో బాలుర కంటే బాలికలు చాలా తక్కువగా ఉన్నారు.కోటి మంది బాలుర తో పోలిస్తే కోటిన్నర మంది  ప్రాధమిక పాఠశాల బాలికలు చదవడం వ్రాయడం నేర్చుకోలేక పోతున్నారు. ఇదీ మన భవిష్యత్తుకు ఆరంభం. గత 11 సంవత్సరాల నుండి ప్రపంచ వ్యాప్తంగా బాల్య వివాహం, యుద్ధం, సెక్స్, హింస ల బాధితులు, వాటి నుండి నుండి బయట పడ్డవారికి UNICEF చేసే నమ్మ శక్యం కాని అపూర్వమైన సేవను వీక్షిస్తున్నా, కానీ చాలా పని మిగిలి ఉంది చేయడానికి. నాలో రగిలే అగ్ని కి అదే ఇంధనం, అదే ఈ సమస్య పట్ల నా నిబద్దత కు కారణం, అక్కడనుండే నా తీవ్రమైన ఇష్టం మొదలయింది, ఎందుకంటే బాలికా విద్య కుటుంబాలకు అధికారం ఇవ్వడమే కాదు సమాజానికి, ఆర్ధిక వ్యవస్థకు కూడా తోడ్పాటు నందిస్తుంది. ఇక్కడ కూర్చున్న కళాకారులు, ప్రభావశీలురు మనందరి సామాజిక బాధ్యత ఏంటంటే మాట్లాడలేని వారి గొంతుక కావడం.ఇక్కడ కూర్చున్న ప్రతి స్త్రీ ని ఎందుకు ప్రశంసిస్తున్నానంటే, మీ కందరికి ఈ సమస్య పట్ల ఉన్న అవగాహనతో మీ మీ కార్యక్షేత్రాల్లో మీ స్వరాన్ని వినిపించండి, మనం బ్రతికున్నంత వరకు ఒక్క తరపు బాలికలు కూడా విద్యను కోల్పోకూడదు. ఈ వేదికపై నాకు అవకాశమిచ్చిన "Variety " సంస్థకు, ప్రోత్సహించిన మీ అందరికి, ఇక్కడున్న అందరం ఈ సమస్యపై పోరాటం చేస్తూ ముందుకెళదామని ఆశిస్తూ అందరికి ధన్యవాదాలు.(అనువాదం :ఒద్దుల రవిశేఖర్ ) (https://youtu.be/iCwKM6uB71I)

Friday 27 May 2022

మూడడుగుల్లో విశ్వం

 మూడడుగుల్లో విశ్వం:రచయిత డా. వి. శ్రీనివాస చక్రవర్తి పుస్తక పరిచయం :ఒద్దుల రవిశేఖర్     భూమి మీద  దూరాలను కొలవడం సులభంగానే మానవుడు నేర్చుకున్నాడు. కాని ఖగోళ దూ రాలను కొలవడానికి మానవునికి కొన్ని వందల సం.రాలు పట్టింది. రచయిత అందుకు జరిగిన ప్రయత్నాలను సవివరంగా ఇందులో వివరించారు. ఆసక్తికరమైన కొన్ని అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తాను. మొదటి మెట్టు :మొదటగా క్రీ. పూ  ఎరటోస్తనీస్, పోసిడోనియస్ విశ్వం స్థాయిలో శాస్త్రీయ పద్దతిలో దూరాలు కొలిచారు.భూమి వ్యాసాన్ని, చుట్టుకొలతను అంచనా వేసారు.అరిస్టార్కస్, హిప్పార్కస్ భూమి వ్యాసాన్ని ఆధారం చేసుకొని చంద్రుడి దూరాన్ని అంచనా వేసారు.భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంది అని,భూమి నుండి సూర్యుని దూరం కొలవటానికి ప్రయత్నించిన వారు అరిస్టార్కస్.1543 లో నికోలాస్ కోపర్నికస్ సూర్య కేంద్రక సిద్దాంతాన్ని ప్రత్తిపాదించారు. గ్రహాల దూరాలను అంచనా వేయడానికి కొత్త సూత్రాన్ని అందించిన వాడు కెప్లర్.1609 లో గె లీలియో ఒక దూరదర్శినిని తయారు చేసి ఆకాశం కేసి గురిపెట్టాడు.1673 లో గియోవానీ సూర్యునికి భూమికి మధ్య దూరం సగటున 9,29,65,000 మైళ్ళని అంచనా వేశారు. దీన్ని ఖగోళ ఏకాంకం (AU) అంటారు.1830 లో విల్ హెల్మ్ బెసెల్ హీలియో మీటర్ ను వాడటం మొదలు పెట్టాడు. 61 సిగ్మస్ అనే తార దూరం 64 ట్రిలియన్ మైళ్ళు అని కనుగొన్నారు కాంతి వేగం సెకనుకు 1,86,282 మైళ్ళు.ఒక ఏడాదిలో (6 లక్షల కోట్ల (ట్రిలియన్ ) మైళ్లు ) కాంతి ప్రయాణించిన దురాన్ని కాంతి సంవత్సరం అంటారు ఆల్ఫా సెంటారీ తార దూరం 4.3 కాంతి సం వత్సరాలని థామస్ హేండర్సన్ కనుగొన్నారు.1900 సం.రానికి  విక్షేప పద్ధతిని ఉపయోగించి 70 తారల దూరాలను కనుగొన్నారు 1950 కల్లా 6000 తారల దూరాలు కనుగొన్నారు. మన కంటితో 6000 తారలను చూడగలం.1609 లోనే గేలీలియో పాల పుంత గెలాక్సీ ని గమనించాడు. విలియం హెర్షల్ 1785 లో రోదసిలో తారలన్ని ఒక కటకం ఆకారం లో అమరి ఉన్నాయని ప్రతిపా దించాడు.                                              రెండవ మెట్టు :1921 లో 25 సెఫెయిడ్ తారలను హేన్రి యేట్టా లీవిట్ కనుగొన్నారు. షాప్లీ గోళాకార రాసులను కనుగొన్నాడు. గేలాక్సీ పరిమాణం కొలవాలని ప్రయత్నించాడు. సూర్యుడు గెలాక్సీ కేంద్రం చుట్టూ సెకనుకి 150 మైళ్ళ వేగంతో కదులుతూ  200 మిలియన్ ఏండ్లకు ఒకసారి గేలాక్సీ చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు. గెలాక్సీ వ్యాసం లక్ష కాంతి సం వత్సరాలు అని తెలిసింది. తారా నీహారికలను(నెబ్యూలా )మెసియర్ కనుగొన్నాడు. ఓరియన్ నెబ్యూలాను క్రిస్టియన్ హైగెన్స్ కనుగొన్నాడు.విలియం పార్సన్స్, సైమన్ మారియస్ నెబ్యూలాలను అధ్యయనం చేశారు.100 అంగుళాల దూరదర్శిని తో హబుల్ ఆండ్రోమెడా ను గమనించి ఇది ఒక గేలాక్సీ అని తేల్చారు. ఇది మన గెలక్సీ కి 2.5 మిలియన్ కాంతి సం.రాల దూరంలో ఉన్నట్లు తేలింది. గేలాక్సీ లు కూడా రాసులుగా ఉంటాయి. కోమా బెరెనేసిస్ అనే తారా రాశిలో 11,000 గెలా క్సీ లు ఉన్నాయి. మన గేలాక్సీఉన్న తారా రాశి లో 19 గేలాక్సీ లు ఉన్నాయి.                                                     3 వ మెట్టు :100 మిలియన్ కాంతి సం. రాలకి మించిన దూరాలను కొలవడానికి ఎడ్విన్ హబుల్ మరో పద్ధతి కనుగొన్నాడు.హబుల్ నోవాలపై అధ్యయనం చేశారు. వెస్టో స్లిఫర్ తారల నుండి వచ్చే కాంతిని బట్టి వాటి వయసులు తెలుసుకున్నాడు. అన్ని గేలాక్సీ లు మనకు దూరంగా వెడుతుంటే ఆండ్రో మెడా గేలాక్సీ మన గేలాక్సీ కి దగ్గరగా వస్తుంది. హబుల్ గేలాక్సీ ల దూరం కనుగొనడానికి V=HD అనే సూత్రాన్ని ప్రతి పాదించాడు. H=హబుల్ స్థిరాంకం. ఇలా గేలాక్సీ లన్నీ పరస్పరం దూరంగా జరుగుతుంటే విశ్వం వ్యా కోచిస్తుందా అన్న సందేహం కలిగింది. మహా విస్పోటనం విశ్వానికి నాంది అని జార్జి లమేత్ర్ మొట్ట మొదట ఊహించారు. విశ్వం లోని అంతరి క్షమే వ్యాకోచిస్తుంది. అలా పరిమాణం పెరిగి తిరిగి సంకోచిస్తుంది. దీన్నే మహా సంకో చం అంటారు. మన పాల పుంత గేలాక్సీ లో 20,000 కోట్ల తారలున్నాయి అందులో మన సూర్యుడొకడు.గేలాక్సీ కేంద్రం నుండి మన సూర్యుడు 26,000 కాంతి సం. రాల దూరం లో ఉన్నాడు. ప్రస్తుత అంచనాల ప్రకారం దృశ్య విశ్వం 93 బిలియన్ కాంతి సం వత్సరాలు.ఇలాంటి అద్భుతమైన, ఊహించటానికే వీలు కాని దూరాలను గురించి ఎంతో ఆసక్తికరంగా వివరించారు రచయిత. వారికి అభినందనలు.విశ్వం అనంతత ముందు సౌరకుటుంబం, భూమి, మానవ జాతి  చాలా అల్పంలా అనిపిస్తాయి. సౌరమండలం చివరినుండి మన భూమి చిన్న చుక్కలా కనిపిస్తుంది. కానీ మన భవిష్యత్తు  ఈ భూమే దానిని రక్షించుకోవాలి అన్న గొప్ప సందేశం తో ముగిస్తారు. విశ్వాన్ని అధ్యయనం చేయాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా సైన్స్ విద్యార్థులు,ఉపాధ్యాయులు అధ్యాపకులు చదివి తీరవలసిన పుస్తకమిది.

Tuesday 24 May 2022

మెదడు చరిత్ర :Dr. వి. శ్రీనివాస చక్రవర్తి

 రచయిత :డా. వి. శ్రీనివాస చక్రవర్తి             పుస్తక పరిచయం :ఒద్దుల రవిశేఖర్                      మనం ఆలోచిస్తున్నామన్నా, మన శరీరం లోని అన్ని వ్యవస్థలు క్రమబద్ధంగా నడుస్తున్నాయన్నా దానికి కేంద్రం మెదడే. మెదడు గురించి ఆలోచించి పరిశోధించిన వారి వివరాలు తెలియజేస్తూ మనకు మెదడు గురించి అర్ధమయ్యేలా సరళంగా వ్రాయడానికి ప్రయత్నించిన పుస్తకమిది. ఇది science కు సంబంధించిన పుస్తకం కనుక చదివి పూర్తి వివరాలు తెలుసు కోండి. ఇక్కడ  విశేష కృషి చేసిన శాస్త్రవేత్తల గురించి మాత్రమే ప్రస్తావిస్తాను. క్రీ.శ  2వ శతాబ్దంలోనే వైద్యుడ యినా కాడ్ గాలెన్ మెదడు నిర్మాణాన్ని వివరించాడు.1500 సం రాల తర్వాత లియో నార్దో డావిన్సీ అండ్రియాస్ వేసేలియాస్ మెదడు గురించి గొప్ప అధ్యయనాలు చేశారు. తరువాత రెనడే కార్త్, ఫ్రాన్స్ గాల్ మెదడును యంత్రం లా భావించారు.రాబర్ట్ హుక్ సూక్ష్మ దర్శిని సహాయం తో జీవకణాలను మొదటి సారి చూసాడు.ఆంటాన్ వాన్ రీవెన్ హాక్ సూక్ష్మ దర్శిని సహాయంతో నాడీ కణాలను పరిశీలించాడు. లూయిగీ గాల్వాని విద్యుత్ జీవక్రియా శాస్త్రం నకు ప్రాణం పోశారు. జోహాన్నస్ ముల్లర్ ఇంద్రియ సంవేదనలపై శో ధించారు. ఎమిల్ దుబ్వా రేమండ్ హెల్మ్ హోల్జ్ "విద్యుత్ ఈల్" మీద పరిశోధనలు గావించారు. హోల్జ్ నాడీ మండల క్రియలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు.20 వ శతాబ్దం ఆరంభానికి మెదడు ఒక విస్త్రతమైన సంక్లిష్టమైన విద్యుత్ యంత్రం అని అర్ధమయ్యింది. ఔషద  శాస్త్రంపై పెన్ ఫీల్డ్,పాల్ బ్రోకా, కార్ల్ వెర్న్ కీ పరిశోధించారు. వెర్న్ కీ పరిశోధన ల నుండి కనెక్షనిజం అనే నాడీ   శాస్త్రం ఆవిర్భవించింది. దాన్నుండి neural networks అనే కొత్త గణిత సిద్ధాంతం జన్మించింది. మనస్తత్వ శాస్త్రం పై ఇవాన్ పావ్లోవ్ జరిపిన పరిశోధనలు ప్రేరణ, స్పందన, నియంత్రణ లకు దారితీశాయి. B. F. Skinner,Tharandike, jhon watson ప్రవర్తనా వాదాన్ని ప్రవేశ పెట్టారు. మెదడు ఒక జాలం (Net work ) 10,000 కోట్ల న్యూరానులను కలిగి ఉంది. ఇన్ని విశేషాలను మనకు వివరించిన రచయిత శ్రీనివాస చక్రవర్తి గారికి ధన్యవాదాలు చెప్పాలి. మెదడు గురించి తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నవారు పాఠశాల, కళాశాలలో సైన్స్ విద్యార్థులు ఉపాధ్యాయులు, అధ్యాపకులు తప్పక చదవాల్సిన పుస్తకం...... ఒద్దుల రవిశేఖర్.

Monday 23 May 2022

కోవిడ్, ఎయిడ్స్ నేను..... Dr.Y.మురళీ కృష్ణ

 ప్రతి రంగంలో క్రొత్త దారులు వేసేవారుంటారు. తమదయిన ముద్రతో వినూత్న ఆవిష్కరణ లతో మానవాళికి మేలు చేసే వారుంటారు వారిలో డా. యనమదల  మురళీ కృష్ణ గారు ఒకరు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న రెండు మహమ్మారులకు తన దైన పరిష్కారాలు చూపిస్తూ లక్షలాది మంది జీవితాలను రక్షిస్తున్న మురళీ కృష్ణ గారి  వ్యాసాలు Facebook లో తరచుగా చదువుతూ share చేస్తుండే వాడిని.తాను కనుగొన్న పద్ధతులతో ఎయిడ్స్, కోవిడ్ కు ఇచ్చే చికిత్సలపై ఆయన వ్రాసిన "కోవిడ్ ఎయిడ్స్ నేను "అన్న పుస్తకం తెప్పించుకుందామనుకుంటూ కొంత ఆలస్యమయ్యింది."రవీ నువ్వు చదవాలి" అంటూ ఆప్యాయంగా పలకరించి పుస్తకాన్ని పంపించిన వారికి ధన్యవాదాలు. వైద్య రంగంలో ఆరోగ్యం పట్లతగిన జాగ్రత్తలు చెబుతూ సరియైన చికిత్సను అందిస్తూ రోగిని కోలుకునేలా చేయడం వైద్యుని ప్రాధమిక విధి.  ఏ మందు వాడాలో, ఏ చికిత్స,ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ పుస్తకం లో చక్కగా వివరించారు.వైద్య రంగం లో తాను చేసిన కృషిని వివరిస్తూ తగిన సూచనలు అందజేస్తూ ఎయిడ్స్, కోవిడ్ ల పట్ల ప్రజలకు సరిఅయిన అవగాహన కల్పించడం లో వారి అనుభవం పరిశోధన ఎంతగానో దోహద పడ్డాయి. అంతర్జాతీయ స్థాయిలో వారి ప్రతిభను గుర్తించడం, మన దేశపరిస్థితుల కనుగుణంగా వైద్య విధానాలు రూపొందించడం ఆయనలోని విశేష ప్రతిభ, మేధస్సును తెలియజేస్తాయి. ఈ పుస్తకం లో నాకు విశేషంగా తోచిన, ఉపయుక్తంగా అనిపించిన కొన్ని అంశాలు 1)ఆసుపత్రుల్లోని A/C గదుల్లో HAI జబ్బులు వ్యాపిస్తాయి జనం గుమికూడే ప్రాంతాలు మూసికొని ఉండరాదు A/C ఇళ్ళకే పరిమితం చెయ్యాలి.2)ఇంటిలో కేవలం సబ్బు, నీటిని ఉపయోగించి చేతులు శుభ్రం చేసుకోవాలి. ఇతర చోట్ల శానిటైజర్ వాడాలి.3) కోవిడ్ బారిన పడ్డవారు  ధైర్యం, ప్రశాంతత, డాక్టర్ సూచించిన వైద్యం తో కోలుకోవచ్చు.4) కరోనాకు home care treatment ను రెండు pages లో చేతిరాతతో వివరించిన విధానం 5)కోవిడ్ చికిత్సలో డా. మురళీ కృష్ణ గారి ప్రోటోకాల్ అంతర్జాతీయ సదస్సుకు పరిశోధనా పత్రం సమర్పణ వారిలోని విశేషమైన ప్రతిభకు తార్కాణం.6)కోవిడ్ బారిన పడ్డ వారికి ఎదురవుతున్న సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 7) అన్ని వ్యాసాల్లో అదనపు సమాచారం కోసం QR codes ఇవ్వడం 8)MBBS చేస్తున్నప్పటినుండి ఎయిడ్స్ పట్ల సమాజానికి అవగాహన కల్పిస్తూ దానిపై స్వంత పరిశోధనలుచేస్తూ specialist వైద్యునిగా ఆయన ప్రయాణం అద్భుతం.9)ఎయిడ్స్ రోగులను ఆయన చూసే విధానం కొన్నివేల మంది రోగులకు ఆరోగ్యాన్ని ప్రసాదించడం మానవునిలోనే మాధవుడున్నాడు అనేందుకు సాక్ష్యం.10) తాను తక్కువ ఖర్చుతో, స్వంత డబ్బులతో వైద్యం చేస్తూ నిస్సహాయమైన రోగులకు సహాయం చేసేలా సమాజాన్ని చైతన్యం చేయడం 11) వైద్యునిగా ఆయనకు కలిగే సంతృప్తిని గురించి "మీరు జీవితాన్ని స్వాధీనం చేసుకున్నారు "అన్న ప్రశంస పొందడం 12) వైద్య రంగం లోని లోటుపాట్లను ఒక వైద్యునిగా ఎత్తి చూపడం  13)ఆయన వైద్య విద్యార్థి గా ఉన్నప్పటినుండి ఇప్పటివరకు తన గురించి, తన విధానాల గురించి వివరించే పద్ధతి పాఠకుడిని పుస్తకాన్ని ఆసక్తిగా చదివేలా చేస్తుంది.14) వైద్యం లోని విషయాలే కాకుండా గొప్ప జీవన తాత్వికతను గురించి చెబుతూ ఆలోచింప జేసే విధానం 15) మనం పంచిన ప్రేమ పదింతలై తిరిగి వస్తుంది... ఎంత గొప్ప తాత్వికత 16) విపరీత మైన వినిమయలాలస ప్రకృతిని ధ్వంసం చేస్తుంది అన్న విషయం ద్వారా పర్యావరణ పరిరక్షణ గురించి చెప్పడం 17)తనకు నచ్చిన, తాను మెచ్చిన వ్యక్తుల గురించి చెప్పడం 18) జ్ఞానాన్ని అనుభవం లోకి తెచ్చు కోవడమే గొప్ప జీవితం, సంతృప్తిని మించిన సంపదలేదు అని తన అనుభవ సారం చెబుతారు 19)కాలం చెల్లిన మందులు కూడా వాడొచ్చు అన్న కొత్త విషయాన్ని తెలియజేయడం 20)ఆయన,పుస్తకాలు విపరీతంగా చదవడం, కాలం కన్నా ముందు ఆలోచించడం.                                             ఇవీ ఈ పుస్తకం లో నాకు నచ్చిన అంశాలు. ఆరోగ్య స్పృహ ఉన్న ప్రతి ఒక్కరు చదవతగ్గ పుస్తకం. నాకు అనిపిస్తుంటుంది, ప్రకృతి తనను తాను రక్షించుకోవడానికి ఒక్కో రంగం లో కొంతమంది విశిష్ఠ వ్యక్తుల్ని సృజించుకుంటుంది అని. అందులో మురళీ కృష్ణ గారు ఒకరు. వారికి నాదొక విన్నపం,వ్యాధులు, జబ్బులు రాకుండా ముందుగా ఎటువంటి ఆహారం తీసుకోవాలి, తగిన చికిత్సలు, తక్కువ ఖర్చుతో రోగాలు నయమయ్యే విధానాలపై మరిన్ని పుస్తకాలు వ్రాయాలని........ ఒద్దుల రవిశేఖర్ 

Sunday 3 April 2022

10 సంవత్సరాల నా బ్లాగ్ ప్రయాణం

 2011 జులై లో అనుకుంటా ICT లో training, Mysore లో ఉందంటూ ఉమ్మడి రాష్ట్రం నుండి 5 లేదా 6 మంది ఉపాధ్యాయులను అనుకుంటా పంపారు ప్రభుత్వం తరపున. అది దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి శిక్షణా సమావేశం. అప్పుడు అందరి సమక్షంలో బ్లాగ్ ఎలా మొదలు పెట్టాలో చెప్పారు. అప్పుడు మొదలయిన నా బ్లాగ్ ప్రయాణం 10 ఏండ్లు పూర్తి చేసుకుంది.మొదట్లో చదువరుల సంఖ్య బాగా ఉండేది. చక్కగా స్పందిస్తూ comments వ్రాసేవారు. అప్పుడు ఈ FB, Whatsapp, instagram లు లేవు. క్రమేపీ ఇవన్నీ వచ్చాక బ్లాగ్ లు చదవడం తగ్గింది.అయినా వ్రాస్తూ ఉన్నా. ఇప్పటికి 200 post లు పూర్తయ్యాయి.77,601మంది పాఠకులు చదివారు.1000 comments వచ్చాయి.చదువుతున్నట్టు statistics చూపిస్తున్నాయి. కానీ స్పందనలు లేవు.బ్లాగ్ లో వ్రాసేవన్నీ ఇప్పుడు Fb లో share చేస్తున్నా. Fb లో కూడా అంతే చదివే అలవాటు బాగా తగ్గి పోతున్నారు. దానికి బదులుగా వినడం, చూడడం బాగా పెరిగింది. దానికి youtube వేదికయింది.ఇంతకు ముందే పెట్టిన youtube channel ఉన్నా బ్లాగ్ లో పెట్టిన విషయాలను, ఇంకా నేను చెప్పాలనుకున్న విభిన్న అంశాలను ఒక చోట చేర్చాలని దానికి కొత్తగా ఒక youtube channel పెట్టాలనుకుంటున్నాను. త్వరలో మీ ముందుకు వస్తాను. అందులో ఆడియో, video అన్ని రూపాల్లో share చేసుకోవాలని. మిత్రులందరికి ముందుగా తెలియజేయాలని ఇక్కడ పంచుకుంటున్నాను. ఎప్పటిలాగానే సదా మీ ప్రోత్సాహాన్ని కోరుకొనే ..... మీ ఒద్దుల రవిశేఖర్.

"పధం" సంస్థలో NMMS లో శిక్షణ.

 "పధం"సంస్థలో NMMS,SSC విద్యార్థులకు శిక్షణ"పధం" సంస్థ.                           తర్లుపాడు వారి ఆధ్వర్యం లో సంక్రాంతి సెలవుల్లో 10 వతరగతి విద్యార్థులకు శిక్షణా కార్యక్రమాలు 8/1/2022 నుండి ప్రారంభమయ్యాయి.NMMS విద్యార్థులకు గత సం దసరా నుండి శిక్షణా తరగతులు జరుగుతున్నాయి.10 వ తరగతి విద్యార్థులకు అన్ని subject లలో పరీక్షలో వచ్చే అంశాలపై విషయ నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నారు.పధం నిర్వాహకులు మల్లిఖార్జున ఈ  కార్యక్రమాన్ని సమన్వయ పరుస్తున్నారు.మొదట introduction class తీసుకున్న ఒ.వి.రవిశేఖర్ రెడ్డి ,చిన్నప్పుడు అందరికి "కుతూహలం" చాలా ఎక్కువగా ఉంటుందని వయసు పెరిగే కొద్దీ ఆ లక్షణం కోల్పోతారని చెబుతూ తెలుసుకోవాలనే కోరిక విద్యార్థి దశలో అత్యున్నత స్థాయిలో ఉండాలని దానినుండి జ్ఞానం ఆనందం వస్తాయని జీవితమంతా అటువంటి కుతూహలాన్ని కోల్పోకుండా ఉండాలని  స్నేహితుల,పరిసరాల ప్రభావం మీపై  ఎక్కువగా ఉంటుందని ,చిన్న వయసు నుండి మంచి అలవాట్లను ఏర్పర్చుకుంటూ చెడు అలవాట్లను తొలగించుకుంటూ మనసు ను ఎప్పటికప్పుడు rewiring,recharging చేసుకోవాలని చెప్పారు.జార్జి ఫార్మసీ కాలేజ్ కరస్పాండెంట్ శ్రీ A.సతీష్  మాట్లాడుతూ పరిసరాలను పరిశీలిస్తూ,ప్రయోగాత్మకంగా నేర్చుకుంటూ ఉంటే ఏదయినా వస్తుందని ఉపాధ్యాయులే అంతా చెప్పాలనే భావన నుండి బయటపడాలని స్వయం అభ్యసనం(self learning) చేయాలని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలనే లక్ష్యాలు పెట్టుకోవాలని విద్యార్థులకు సందేశ మిచ్చారు.మార్కాపురం బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ M.చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ప్రాంతం ఒక శాంతినికేతన్ లా ఉందని ఇలాంటి వాతావరణం లో చక్కని జ్ఞానం పొందవచ్చని పధం నిర్వాహకులను అభినందించారు.చెన్నారెడ్డి పల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, శ్రీ వై శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు పరీక్ష విధానం గురించి క్షుణ్ణంగా తెలుసుకుని మంచి మార్కులు సాధించాలని పదం కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మర్రిపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వర రావు గారు సంక్రాంతి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్చిలోనే పరీక్షలు జరుగుతాయని ఈ మూడు నెలలు ఏకాగ్రతతో చదవాలని విద్యార్థులను కోరారు.చివరగా మల్లిఖార్జున గారు మాట్లాడుతూ చదవడం ఒక ఆనందకర ప్రక్రియ అని,జీవితంలో సాధించాల్సింది ఆనందంగా ఉండడమే అని అటువంటి సమాజాలు ఉన్నతమైనవని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో పదం నిర్వాహకులు చాంద్ భాషా,ఆనంద్,కోటి మోహన్,వెంకట్ నారాయణ,నాగూర్, గాలెయ్య భాస్కర్, కరీం పాల్గొన్నారు."పధం"సంస్థలో NMMS,SSC విద్యార్థులకు శిక్షణ"పధం" సంస్థ. తర్లుపాడు వారి ఆధ్వర్యం లో సంక్రాంతి సెలవుల్లో 10 వతరగతి విద్యార్థులకు శిక్షణా కార్యక్రమాలు 8/1/2022 నుండి ప్రారంభమయ్యాయి.NMMS విద్యార్థులకు గత సం దసరా నుండి శిక్షణా తరగతులు జరుగుతున్నాయి.10 వ తరగతి విద్యార్థులకు అన్ని subject లలో పరీక్షలో వచ్చే అంశాలపై విషయ నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నారు.పధం నిర్వాహకులు మల్లిఖార్జున ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరుస్తున్నారు.మొదట introduction class తీసుకున్న ఒ.వి.రవిశేఖర్ రెడ్డి ,చిన్నప్పుడు అందరికి "కుతూహలం" చాలా ఎక్కువగా ఉంటుందని వయసు పెరిగే కొద్దీ ఆ లక్షణం కోల్పోతారని చెబుతూ తెలుసుకోవాలనే కోరిక విద్యార్థి దశలో అత్యున్నత స్థాయిలో ఉండాలని దానినుండి జ్ఞానం ఆనందం వస్తాయని జీవితమంతా అటువంటి కుతూహలాన్ని కోల్పోకుండా ఉండాలని స్నేహితుల,పరిసరాల ప్రభావం మీపై ఎక్కువగా ఉంటుందని ,చిన్న వయసు నుండి మంచి అలవాట్లను ఏర్పర్చుకుంటూ చెడు అలవాట్లను తొలగించుకుంటూ మనసు ను ఎప్పటికప్పుడు rewiring,recharging చేసుకోవాలని చెప్పారు.జార్జి ఫార్మసీ కాలేజ్ కరస్పాండెంట్ శ్రీ A.సతీష్ మాట్లాడుతూ పరిసరాలను పరిశీలిస్తూ,ప్రయోగాత్మకంగా నేర్చుకుంటూ ఉంటే ఏదయినా వస్తుందని ఉపాధ్యాయులే అంతా చెప్పాలనే భావన నుండి బయటపడాలని స్వయం అభ్యసనం(self learning) చేయాలని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవాలనే లక్ష్యాలు పెట్టుకోవాలని విద్యార్థులకు సందేశ మిచ్చారు.మార్కాపురం బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ M.చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ప్రాంతం ఒక శాంతినికేతన్ లా ఉందని ఇలాంటి వాతావరణం లో చక్కని జ్ఞానం పొందవచ్చని పధం నిర్వాహకులను అభినందించారు.చెన్నారెడ్డి పల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, శ్రీ వై శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు పరీక్ష విధానం గురించి క్షుణ్ణంగా తెలుసుకుని మంచి మార్కులు సాధించాలని పదం కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మర్రిపాలెం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగేశ్వర రావు గారు సంక్రాంతి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్చిలోనే పరీక్షలు జరుగుతాయని ఈ మూడు నెలలు ఏకాగ్రతతో చదవాలని విద్యార్థులను కోరారు.చివరగా మల్లిఖార్జున గారు మాట్లాడుతూ చదవడం ఒక ఆనందకర ప్రక్రియ అని,జీవితంలో సాధించాల్సింది ఆనందంగా ఉండడమే అని అటువంటి సమాజాలు ఉన్నతమైనవని చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో పదం నిర్వాహకులు చాంద్ భాషా,ఆనంద్,కోటి మోహన్,వెంకట్ నారాయణ,నాగూర్, గాలెయ్య భాస్కర్, కరీం పాల్గొన్నారు.

Scince day రోజున నా రేడియో ఇంటర్వ్యూ.

 28/2/2022 న జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా మార్కాపురం ఆకాశవాణి కేంద్రం అధికారి శ్రీ సుధాకర్ మోహన్ గారు నాతో నిర్వహించిన interview ఈ దిగువ లింక్ లో తన website లో ఉంచిన నాగమూర్తి గారికి ధన్యవాదములు. నన్ను ప్రోత్సాహించిన సుధాకర్ మెహన్ గారికి ప్రత్యేక ధన్యవాదములు.(http://www.ignitephysics.net/2022/03/28-28-02-2022.html?m=1)

Monday 28 March 2022

స్పందనా రాహిత్యం

 ఒక అందమైన దృశ్యాన్ని చూస్తే హృదయం పరవశిస్తుంది.ప్రకృతి అందాలకు మనసు మురిసిపోతుంది. పైరగాలి పాటకు ప్రాణం లేచి వస్తుంది.బోసినవ్వుల పసిపాపను చూస్తే అప్రయత్నంగా మన పెదవుల పై చిరునవ్వు ప్రత్యక్షం అవుతుంది. ఎవరయినా మనల్ని పలకరిస్తే ముఖం విప్పారుతుంది.ఏదయినా ప్రశ్న వేస్తే జవాబిస్తాం. అడగాలనిపిస్తే ప్రశ్నిస్తాం.హాస్యానికి నవ్వులతో హారతి పడతాం.క్లిష్టమైన సమస్యలకు తర్కాన్ని అన్వయిస్తాం. తోటివారు చూపే ప్రతిభా నైపుణ్యాలను అభినందిస్తాం. ఇలా ఎన్నో విధా లుగా ప్రతిస్పందిస్తుంటాం. ఇది మానవ సహజ లక్షణం. కానీ ప్రస్తుతం ఒక కొత్త తరహా మానసిక స్థితి ఏర్పడుతుంది. దేనికీ స్పందించకపోవటం. Online or offline మనకెందుకు లే అనే భావన. ఇది ప్రత్యక్ష సంభాషణల్లోను పరోక్ష social మీడియాలోనూ గమనించవచ్చు. FB లో చాలా మంది అసలు active గా ఉండరు. Active గా ఉన్నవాళ్లలో ఎక్కువ మంది ఒక paragraph అయినా చదవరు. చదివిన వారు స్పందించరు. ఇక whatsapp లో మరీను.256 మంది ఉన్న group లో ఏ కొద్ది మందో post లు పెడుతుంటారు. ఒక్కరు లేదా కనీసం ఇద్దరు కూడా స్పందించరు.ఇక చాలామంది వారికి ప్రత్యక్షంగా whatsapp కి పంపిన సమాచారానికి కూడా స్పందించరు. పంపేవారు కూడా అవసరం లేనివికూడా ఎక్కువ సందేశాలు పంపుతుంటారు.whatsapp ఓ రకంగా మనం మరిచిపోయిన ఉత్తరాలు వ్రాసుకోవడానికి ఆధునిక రూపం. ఏదయినా మాట్లాడు కుంటేనే మాటలు, స్నేహం కుదురుతుంది. స్పందిస్తుంటేనే మన మనస్తత్వం ఎదుటివారికి అర్ధమవుతుంది. Social media ను మనం ఇంతకుముందు వ్రాసిన ఉత్తరాలకు బదులుగా చక్కగా ఉపయోగించుకోవచ్చు.ఎంత మంచి విషయం post చేసినా కనీసమైన స్పందన ఉండటం లేదు.communication gap భయంకరం గా కనిపిస్తుంది. పరస్పర మానవ సంబంధాల్లో కూడా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు ఎవరితో వివరంగా ఏదీ చెప్పరు. చెప్పినా దానికి సరిఅయిన సమాధానం ఇవ్వరు.ఇలా కుటుంబంలో,బయట స్పష్టత స్పందన కరువై ఎన్నో సమస్యలు సంక్లిష్టం గా మారుతున్నాయి.మానవ సంబంధాల పటిష్టతకు కనీసం ఒక ఫోన్ కాల్, లేదా ఒకసారి ఆత్మీయులను కలవడం చేయాలి. అవతలి వారి బాధలు వినాలి.సహానుభూతి(empathy )కలిగి ఉండాలి. స్పందించే గుణం కోల్పోతే సగం జీవితం కోల్పోయినట్లే..... ఒద్దుల రవిశేఖర్.

Sunday 20 March 2022

Heal Paradise(అనాధ పిల్లల పాఠశాల ) village సందర్శన

 

ఎప్పటినుండో అనుకుంటూ వెళ్లలేకపోయిన ప్రదేశం ఇది. ఓ సారి CA PRASAD గారి పిలుపు మేరకు నయీ తాలీమ్, మానవతా మిత్రమండలి సమావేశానికి 2018 లో వెళ్లలేకపోయిన ప్రాంతం. కరోనా కష్టాలు తొలగి పోయిన తరువాత ఇక వెళ్లకుండా ఉండలేక పో యాను. ప్రసాద్ గారు అందులో పనిచేసే కరుణ బాబు, మణికుమారి ఫోన్ numbers ఇవ్వడం తో వారి తో సంప్రదించగా రమ్మన్నారు.మణికుమారి గారయితే అమెరికా నుండి ఫోన్ చేసి campus incharge ప్రసాద్ గారి నెంబర్ ఇచ్చారు.vijayawada city bus stand నుండి 308 అగిరపల్లి bus ఎక్కి గంట ప్రయాణం తరువాత దిగాను. నూజివీడు రూట్ లో 30 కి. మీ ఉంటుంది. ముందుగానే నాకోసం wait చేస్తున్న Blind school incharge అబ్రహాం గారు నన్ను అక్కడనుండి 5km దూరంలోనున్న పాఠశాలకు తీసుకెళ్లి సంజన madam గారికి పరిచయం చేశారు. ఆమె ఈ మధ్యనే అక్కడ చేరారట.B.Tech పూర్తి చేసి వాలంటీర్ గా అక్కడ చేరారు. ఆమె campus అంతా చూపిస్తూ వివరంగా చెప్పారు. పాఠశాలలో సుమారు 700 మంది అనాధ, పేద పిల్లలకు 1 నుండి 12 తరగతి వరకు CBSE విధానం లో ఉచిత విద్య నందిస్తున్నారు.మొదట ఆర్గానిక్ ఫార్మింగ్ చూసాము. దానికి వెనుకగా పెద్ద సరసు.ప్రకృతి అంతా పిండారబోసినట్లు. తరువాత blind school చూసాము incharge అబ్రాహాం గారు. ఎవరయినా పిల్లలు ఉంటే refer చెయ్యమన్నారు. తరువాత జైపూర్ పాదం తరహాలో ఇక్కడ కూడా 18ఏండ్ల లోపల వయసు గలవారికి చెయ్యి కాలు రెండూ అమర్చుతారు. Great service. అక్కడ నుండి సోలార్ పవర్ తో నడిచే కిచెన్ చూపించారు.శక్తి వనరులు ఆదా చేయడం ఎలాగో ప్రత్యక్షంగా చూడొచ్చు. భవనం పై ఏర్పాటు చేసిన సౌరఫలకల తోనే మొత్తం campus అంతా కరెంటు అవసరాలు తీరుతున్నాయి. మిగిలిన విద్యుత్ ను ప్రభుత్వానికి అమ్ముతారు. మంచి రుచికరమైన పోషకాహారం పిల్లలకు అందిస్తున్నారు. తరువాత ప్రిన్సిపాల్ శ్రీదేవి గారితో, campus incharge ప్రసాద్ గారితే మాట్లాడి HEAL SCHOOL గురించి వివరంగా తెలుసుకున్నాను. వారు తమ సమయాన్ని నాకు కేటాయించి ఎంతో ఆదరంతో మాట్లాడారు. ఏదయినా విద్యార్థులకు నా వంతు సహాయం చేయగలనని తెలిపాను.science labs అద్భుతంగా తీర్చి దిద్దారు. ఆధునిక మైన డిజిటల్ classrooms, computer lab ఉన్నాయి. పిల్లలకు అన్ని రకాల ఆటలు ఆడుకోవడానికి విశాలమైన ఆటస్థలం ఉంది.ఎవరికయినా సహాయం చేయాలనుకుంటే అత్యంత అర్హులు అనాధ పిల్లలే. ఇంత గొప్ప సేవకు అంకురార్పణ చేసి అనాధపిల్లల కు భువిపై స్వర్గాన్ని సృష్టించిన పాఠశాల వ్యవస్థాపకులు శ్రీ సత్యప్రసాద్ కోనేరు గారు వారి మిత్రులు ఎంతయినా అభినందనీయులు. మనం ధనం,కాలం, జ్ఞానం, ప్రేమ ల్లో ఏదయినా ఆ అనాధపిల్లలకు అందించ వచ్చు. ఒకసారి మీరు చూసి నిర్ణయం తీసుకోండి... ఒద్దుల రవిశేఖర్ 

Thursday 10 February 2022

మనపై మనకు ప్రేమ.

 మనం ఎన్నో పనుల్లో నిమగ్నమవుతుంటాం. ఉద్యోగం,వృత్తి, వ్యాపారం,సేవ, ఇంకా ఎన్నో.నిజంగా ఆయా పనులను సంపూర్ణమైన ఇష్టంతో, ప్రేమతో చేస్తున్నామా ఆలోచించండి.ఎంతో మందిని అభిమానిస్తుంటాం. సినిమాలు, రాజకీయం,ఆటలు వంటి విభాగాల్లో ప్రసిద్దులను అభిమానిస్తుంటాం, ఇష్టపడుతుంటాం.ఒక్కోసారి ఈ ఇష్టం ఎంత వరకు వెడుతుందంటే తమ తల్లిదండ్రులను ఇష్టపడే కంటే,తమనితాము ఇష్టపడే కంటే, తమనితాము ప్రేమించే కంటే ఎక్కువగా ఉంటుంది.ఎవరినైనా అభిమానించవచ్చు. కానీ అది తమ విలువైన కాలాన్ని ఎంత హరిస్తుందోతెలుసుకోరు,పైగా తమ లక్ష్య సాధనకు అడ్డంకి గా కూడా మారొచ్చు. తాము ఎదగాలి అనుకున్న రంగాల్లో కానీ లేదా విభిన్న రంగాల్లో ప్రసిద్దులైన వారి జీవిత చరిత్రలు చదివి లేదా వారి సందేశాలు విని ప్రేరణ పొందవచ్చు. ఆ అభిమానం, ప్రేమ, ఇష్టం తమపై, తాము చేసే పనులపై పెడితే ఎన్నో అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. ఉదాహరణకి తమ పై తమకి ప్రేమ ఉన్నవారు ఆహార అలవాట్లలో, ఆరోగ్యవిషయాల్లో, వ్యాయామం చేయడం లో శ్రద్ద పెడతారు.... ఒద్దుల రవిశేఖర్.

Tuesday 8 February 2022

యాగంటి సందర్శన

 27 ఏండ్ల నుండి నంద్యాల వస్తున్నా, మహానంది చాలా సార్లు చూసినా యాగంటి చూడటం కుదర్లేదు. ఇన్నాళ్ళకి కుదిరింది. నంద్యాల నుండి బనగానపల్లికి ₹35 టికెట్ ఉంటుంది. మధ్యలో పాణ్యం వస్తుంది. బనగానపల్లి నుండి ఆటో లో ₹30 ఛార్జ్.10కిమీ ఉంటుంది. మధ్యలో KC canal వస్తుంది.ప్రఖ్యాతి గాంచిన బేతంచెర్ల బండల గనులు కనపడతాయి. రెండు కొండల నడుమ కోనేరు, శివాలయం ఉన్నాయి.కోనేరు చాలా అద్భుతంగాఉంది.ప్రస్తుతం ప్రవేశం లేదు.కోనేరు చుట్టూ చక్కటి నిర్మాణం తో  గోడ ఉంది.ఆలయం ప్రక్కనే కొండమీద నుండి నిరంతరం వచ్చే నీరు ఈ కోనేటిలోకి వస్తాయి. మహానంది లో కూడా ఇలానే నీళ్లు వస్తుంటాయి. ఈ నీళ్లతోనే 500 ఎకరాల్లో అరటి సాగు చేస్తుంటారు రైతులు.వేసవి లో కూడా తగ్గకుండా వస్తూనే ఉంటాయట. ఇప్పటికీ అర్ధం కానీ రహస్యం ఇది.ఇక యాగంటి లో గుడి ప్రక్కనే ఉన్న కొండలో ఒక గుహ ఉంది. ఇక్కడే అగస్త్యమహాముని  తపస్సు చేశారట.గుహను చూస్తే సంభ్రమాశ్చర్యాలకు గురవుతాము.సహజంగా ఏర్పడ్డట్లే ఉన్నాయి. మెట్లు ఎక్కి పైకి వెళ్లాలంటే పెద్దవారికి వీలు కాదు. గుహ పైన చీలిక ఉంది. దాని ద్వారా చక్కటి వెలుతురు వస్తుంది. ఈ గుహ ప్రక్కనే ఇంకో గుహలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. మహానంది లాగా ఇక్కడ అంతగా అభివృద్ధి జరగ లేదు. చెట్లు ఎక్కువగా కనపడలేదు. కొండల మీద చెట్లే మీ లేవు. కొండల మీద, గుడి ముందు మొక్కలు నాటి పెంచితే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది.బనగానపల్లి లోనే బ్రహ్మం గారు పశువులను కాస్తూ రవ్వలకొండ లో సహజసిద్ధంగా ఏర్పడ్డ గుహలో కాలజ్ఞానం వ్రాసారట. తాడిపత్రి కి వెళ్ళేదారి లోనే ప్రసిద్ధిచెందిన బెలుం గుహలు ఉంటాయి. మరోసారి వాటిని చూడాలి.

Sunday 2 January 2022

ఒక వైపు.....ఇంకోవైపు.

 కాలం చెక్కిన గాయాన్ని మాన్పటానికి ప్రయత్నం ఒకవైపు,నిర్లక్ష్యపు చేష్టలతో ప్రాణం మీదకు తెచ్చుకునే మనుషులొక వైపు, ఇది జరుగుతున్న వర్తమానం.                                                 ప్రకృతిలో ఎప్పుడూ పరస్పర విరుద్ధ శక్తుల మధ్య సంఘర్షణ అనివార్యం.చరిత్ర మొత్తం మనకు కనిపిస్తున్నదిదే.                                           విధ్వంసక ఆయుధాల కుప్పలపై కూర్చున్న రాజ్యాలొక వైపు,నిస్సహాయంగా చూస్తున్న ఐక్యరాజ్య సమితి మరో వైపు ,నడుస్తున్న నాటకమిదే.                                                   మనిషికి రక్షణ ఛత్రంలా ప్రకృతి ఒక వైపు,దాన్ని ఛిద్రం చేస్తూ కాలుష్యం మరోవైపు మనం నిత్యం చూస్తున్నదిదే.                                         అయస్కాంత మేదో ఆకర్షించినట్లు సంపద కేంద్రీకృతం ఒకవైపు,కోట్ల మంది దరిద్రనారాయణుల జీవితమొకవైపు , కఠిన వాస్తవమిదే.                                            సృష్టికి ప్రతిసృష్టి చేసే విజ్ఞానం ఒక వైపు,జీవితాలను దుర్భరం చేసుకునే అజ్ఞానం మరోవైపు.                                             ప్రజాస్వామ్యం ఇచ్చిన స్వేచ్ఛ ఒక వైపు,నియంతృత్వపు పరిపాలనలోని దైన్యం మరో వైపు.                                                           బంగారం లాంటి భూమిని మరుభూమిగా మారుస్తున్న వైనం ఒక వైపు,అంగారకుడి ఉపరితలంపై ఆవాసం కోసం ఆరాటం మరో వైపు.                                                    నాణ్యమైన,సుఖప్రదమైన జీవితాలొక వైపు,క్షణ క్షణం బ్రతుకు నరకం మరొక వైపు.                    అధిక ఆహారంతో ఊబకాయ ప్రపంచం ఒకవైపు,ఆకలితో డొక్కలంటుకుపోయిన ప్రజలొక వైపు.                                                             వేలకోట్ల ఆకాశ హర్మ్యాలొక వైపు,నిత్యం రాత్రి ఆకాశం చూసే కోట్లాది బ్రతుకులొక వైపు.              ఈ ఘర్షణకు అంతం ఎప్పుడో, లేదా అంతమే పరిష్కారమా! కాలమే సమాధానం ఇవ్వాలి..... ఒద్దుల రవిశేఖర్.

Saturday 1 January 2022

నూతన సంవత్సరం(2022)... నూతన ఆలోచనలు

                 ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోను స్థానిక కాలమాన పరిస్థితుల్ని బట్టి వారి క్రొత్తసంవ త్సరాలు జరుపుకుంటారు.కానీ ప్రపంచీకరణ జరిగిన తరువాత ఆంగ్లసంవత్సరాన్ని నూతన సంవత్సరంగా జరుపుకునే సంస్కృతి గత 30 సం. నుండి విస్తృతమైంది.ఇక అందరు గతం నుండి బయటపడి నూతన సం.లో సంతోషంగా,ఆరోగ్యంగా ఉండాలని ఇతరులకు శుభాకాంక్షలు చెప్పుకోవడం అలవాటయ్యింది.నిజంగా ప్రపంచంలోని మనుషులందరు ఆశించినట్లు ఇతరుల మేలు కోరే సమాజం ఈ రోజు బాగా కనిపిస్తుంది.ఇతరులగే కాక మనకు మనం  శుభాకాంక్షలు చెప్పుకుంటే మరింత బాగుంటుంది.ఎందుకంటే మన ఆలోచనల్లో వచ్చే మార్పులు,నూతన ఆలోచనలు మనకు మేలు జరగడంతో పాటు ఇతరులకు కూడా ఉపయోగపడాలి,లేదా నష్టం కలిగించకుండా ఉండాలి.అలాగే మనకు నష్టం కలిగించే అసూయ,ద్వేషం,కోపం,బద్దకం,నిర్లక్ష్యం లాంటి వాటినుండి విముక్తి పొంది ప్రేమ,కరుణ,స్నేహం,శాంతి మన మనసులో విరబూయాలని మనకు మనం కోరుకుందాం .                            ఏ వృత్తిలో ఉన్న వారయినా తాము చేసే పనులతో తమలో నైపుణ్యాలు పెంచుకుంటూ,ఇతరులకు ఉపయోగపడేలా ప్రవర్తించాలి.ఉదాహరణకు ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులకు చక్కని విద్యను అందించాలని,ఒక వైద్యుడు రోగులకు మరింత మెరుగైన సేవలందించాలని,రాజకీయనాయకులు ప్రజలజీవితాల్లో మార్పులు తీసుకురావాలని,ఉద్యోగులు ప్రజలకు బాధ్యతగా ఉండాలని,వ్యాపారవేత్తలు నాణ్యమైన వస్తువులు తయారుచేయాలని ఇలా ఎవరికివారు తమకి తాము శుభాకాంక్షలు చెప్పుకోవాలి.మనలో వచ్చే మార్పే బయట ప్రతిఫలిస్తుంది.ఇలా ఎవరికి వారు మారితే బయటి ప్రపంచం సుఖసంతోషాలతో ఉంటుంది.నూతన ఆలోచనలతో మనలో వచ్చేమార్పు అందరికి శుభం కలిగిస్తుంది.అందరికి నూతన సం. శుభాకాంక్షలు.......ఒద్దుల రవిశేఖర్.

Thursday 30 December 2021

వెళ్ళు, నీ కలను వేటాడు(Go,Hunt your dream)

 https://www.fearlessmotivation.com/2019/06/29/go-hunt-your-dream-official-music-video-and-lyrics/. (Thanks to "fearless motivation" William Hollis and Chris's Ross)  పై లింక్ లో వీడియో చూడండి.Powerful motivation.                        *కల ....అది అత్యంతశక్తివంతమైన పదం.              *నీ కలలను వేటాడే క్రమంలో నీవు చాలాసార్లు పడిపోయి ఉండవచ్చు.                                   *తిరిగి ప్రయత్నించడానికి నీకు శక్తి లేదని భావించవచ్చు.                                              *తిరిగి లేవడానికి నీకు బలం లేకపోవచ్చు            *ఇక వదిలివేయడం ఒక్కటే మార్గం అనిపించవచ్చు   *జీవితం కొట్టే ఎదురుదెబ్బలకు నీవు పడిపోవచ్చు   *అదే సరైన సమయం తిరిగి కొట్టటానికి.        *చాలా మంది జీవితం కొట్టే దెబ్బలకు ఎదురుతిరిగి పోరాడలేరు.                                                   *నీవు అలాగే క్రిందనే ఉండిపోతావా లేదా తిరిగిలేచి పోరాడటానికి సిద్ధంగా ఉన్నావా                          *నీ మీద ఎవరికీ నమ్మకం లేనప్పుడు తిరిగి పోరాడటానికి ధైర్యం కావాలి.నమ్మకం కావాలి.బలమైన మనస్తత్వం కావాలి.   *మనందరిలో ఒక సింహం ఉంటుంది.    *కొంతమంది ఆ సింహాన్ని ఎప్పుడూ లేపరు.    *చాలా మంది ఆ సింహాన్ని బోనులో పెట్టి తాళం వేస్తారు.                                                              *నీ కలను సాధించటానికి ఆకలిగొని ఉన్నావా      *ఆ కలను నెరవేర్చుకోవడానికి పోరాటం చేస్తావా       *ఆ సింహాన్ని బయటకు రానీయండి.నీ కలను సాధించే ఆకలి గొనండి.                                   *వెళ్ళు వేటాడునీ కలను సాధించడానికి             *ఆ కల గురించి మాట్లాడటం నిన్ను ముందుకు తీసుకు వెళ్లదు.                                                *పని చేయడం మాత్రమే నిన్ను ముందుకు తీసుకు వెడుతుంది.                                                  *నిన్ను సందేహించేవాళ్ళు వాస్తవికంగా వెళ్లమంటారు.                                               *నిన్ను ద్వేషించేవాళ్ళు వైదొలగమంటారు.        *కానీ ముందుకురికి ఆ కలను సాధించగలిగేది నువ్వే                                                              *అది నీ కల.దాన్ని ఎవరూ వెంటాడరు            *ఎవరు నీ కోసం దాన్ని వేటాడరు                         *నీ కలకు ఎవ్వరూ మద్దతివ్వరు,నీవు తప్ప.       *ఒక సామెత లో ఇలా ఉంది"ప్రతి ఒక్కరికి తినాలని ఉంటుంది.కొంతమంది మాత్రమే వేటకు సిద్ధంగా ఉంటారు.ప్రతి ఒక్కరికీ విజయం సాధించాలని ఉంటుంది.కానీ కొంతమందే అందుకవసరమైన పనిలోకి దిగుతారు.                                           *మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోవద్దు.                 *మీ కలలను మీరు నిజాలుగా మార్చుకోగలరు. *కానీ అది సాధ్యపడుతుందని ఒక్కరు మాత్రం విశ్వసించాలి.ఒక్కరు మాత్రం పనిలోకి దిగాలి. ఆ వ్యక్తి నువ్వే                                                        *నీ కంటే ముందు చాలా మంది,వారు కలగన్న జీవితాలను జీవించారు.పెద్ద పెద్ద విజయాలు సాధించారు.                                                  *వారు సాధించారు.అదే సాక్ష్యం నువ్వు సాధించగలగడానికి.                                      *నువ్వు నిజంగా కోరుకుంటే నీ కలను నిజం చేసుకోగలవు.                                                      *నీ కలలకు నువ్వే భయంకరమైన శత్రువువి. ఎందుకంటే నీ కలను ఎప్పుడు విడిచిపెట్టాలో,నువ్వే నిర్ణయిస్తావు కనుక,నువ్వే నిర్ణయిస్తావు నీ కలలను ఎప్పుడు చంపుకోవాలో                                          *నీ గురించి నీకు తెలిసిన దానికంటే నీవు ఎక్కువ శక్తివంతుడివి/రాలివి.                                          *నీ కలతో ప్రపంచాన్ని మార్చగలవు.                  *కానీ దానికి నువ్వు కావాలి. నీ అనువయిన స్థితి నుండి బయటకు రావడానికి,నీలో ఉన్న సింహాన్ని కట్టువిప్పటానికి,ఆ సింహాన్ని బోనులో నుండి నువ్వు మాత్రమే బయటకు విడువగలవు.నువ్వు మాత్రమే నీ కలలను వెంటాడగలవు.                            *బలహీనమైన మనస్తత్వం ఉన్నా,ఆపదలను ఎదుర్కోవడానికి భయపడినా జీవితంలో ఎప్పుడూ ముందుకుపోలేవు                                    *బలహీనమైన మనస్తత్వంతో నువ్వెప్పుడు నీ కలను సాధించుకోలేవు                                      *ఇతరులు వదిలివెడుతున్నా ముందుకే వెళ్లే మనస్తత్వాన్ని సృష్టించుకో                               *జీవితం ఎప్పుడూ ఉహించినవిధంగా ఉండదు.అది ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది నువ్వు ఆలోచించే విధం కన్నా నీ కలకు నువ్వు దగ్గరగా ఉంటావు.                                                          *నువ్వు వదిలివెయ్యకుండా ఉంటే నీ కల వాస్తవం అవుతుంది.                                                    *సింహం లా ఉండండి.నువ్వెదుర్కొనే సవాళ్లనుండి ఎప్పుడూ వెనక్కి వెళ్లొద్దు.                                *సింహం ఎప్పుడూ దాని ఆహారాన్ని వేటాడటం ఆపదు,అది దొరికే వరకు.                                    *నీ కలను నిజం చేసుకునేంత వరకు వేటాడటం ఆపవద్దు.                                                        *పెద్ద కలలు కను,నువ్వు కలలు సాధించలేవని చెప్పే అల్పమనస్కుల మాటలు నమ్మొద్దు.                 *అవి వాళ్ళు సాధించలేనివి,కానీ నీకు బాగా తెలుసు                                                         *నిన్ను నువ్వు నమ్ము.                                        *నా లక్ష్యాల,కలల దారిలో నువ్వు కూడా ఉంటే కదులు, ముందుకు కదులు.(అనువాదం:ఒద్దుల రవిశేఖర్) 

Sunday 26 December 2021

స్టూడెంట్ నంబర్ 1

స్టూడెంట్ నంబర్ 1                                                రచన:విశేష్,భరత్                                                   పుస్తక పరిచయం:ఒద్దుల రవిశేఖర్           విద్యార్థుల తల్లిదండ్రులకు అంకితం ఇవ్వటంతోనే ఈ పుస్తక ప్రాధాన్యతను చెప్పకనే చెప్పారు రచయితలు. పైగా ముందు మాట కూడా లేకుండా వచ్చిన పుస్తకం ఈ మధ్య కాలంలో లేదు. మీరు రాసి పంపిస్తే ప్రచురిస్తాం అన్న మాటలతో పాఠకుల దృష్టి పుస్తకం మీదకు వెళ్లేలా చేస్తుంది.

ఈ పుస్తకం లో 12 అంశాలు ఉన్నాయి. ఇంతవరకు ఏ తెలుగు పుస్తకంలో రాని విధంగా సంభాషణల రూపంలో పుస్తకంలోని అన్ని అంశాలను రూపొందించడం, పాఠకుడితో మాట్లాడినట్టు ఉంది ఈ పద్ధతి. తనను తాను identify చేసుకుని లీన మయ్యేలా చేస్తుంది.                                ఇందులోని అంశాలు..

1)  బాగా చదవడమంటే ఏమిటో ఏమిటో విద్యార్థులకు ఎవరూ సరిగా చెప్పకపోవడం అనే అంశాన్ని ప్రస్తావిస్తూ ముందు, ముందు topic లలో వాటికి సమాధానాలుంటాయని ఉత్సుకతను లేపారు. 

                                                                      2)విద్యార్థుల్లో బలమైన నమ్మకాలను పెంపొందించాలని అప్పుడే విజయం సాధ్యమవుతుందని విద్యావ్యవస్థలో అదే లోపించిందని దాన్ని సరిదిద్దాలని ఇందులో తెలియజేస్తారు.                                        3)పాఠాలు ఎలా వినాలో, ప్రతి పాఠం శ్రద్ధగా వింటే అది మన జీవితాలకు ఎలా పెట్టుబడిగా మారుతుందో మన సంపాదనా స్థాయి ఎలా పెరుగుతుందో ఇందులో ఆసక్తిగా వివరిస్తారు.

4)తరగతి లో చెప్పే పాఠ్యాంశాల్ని ఎలా notes రాసుకోవాలో, mindmaps ఎలా తయారు చేసుకోవాలో ఇందులో వివరణాత్మకంగా చెబుతారు.                                   

5)బాగా చదవడం అంటే ఏమిటో 7 steps ద్వారా ఇందులో వివరిస్తారు.అన్నీ సాధన చేస్తే అలవాటయ్యేవే!                         

6)సంగీతం వింటూ ఆల్ఫాస్థితికి చేరి మరింత ఏకాగ్రతను పొంది బాగా చడవవచ్చని, చదివింది, విన్నది,అలాగే గుర్తుండి పోతుందనే వినూత్న విషయాన్ని ఇందులో పరిచయం చేస్తారు.

7)విద్యార్థులకు challenging గా ఉండే "గుర్తుంచుకోవడం" అనే అంశం చదివి తెలుసుకుని ఆచరిస్తే వారి జ్ఞాపక శక్తి అనూహ్యంగా పెరుగుతుంది. 

 8 ) మనం marks, grades, ranks సాధించిన వారినే తెలివైనవారని అనుకుంటాము. తెలివితేటల్లోని విభిన్నమైన రకాలను పరిచయం చేసి,  ప్రతి ఒక్కరికీ ఏదో ఒకదానిలో ప్రావీణ్యం ఉంటుందని చెబుతారు.                         

9)మెలకువలు పాటిస్తే ఎవరయినా ఏకాగ్రతను సాధించవచ్చు అని ఇందులో వివరిస్తారు.     

10) విద్యార్థుల పై ఒత్తిడిని పెంచే పరీక్షలకు ప్రణాళికా బద్దంగా ఎలా తయారు కావాలో తెలియజేస్తారు                       

11)పరీక్షలంటే విద్యార్థుల్లో ఉండే భయాన్ని ఎలా అధి గమించాలో practical గా వివరిస్తారిందులో.

12) ఇక చివరి అంశం లో విద్యార్థులకు ఉండాల్సిన skills ను వివరిస్తూ జీనియస్ లా మారాలంటే ఏ రకమైన ఆలోచనా తీరు కలిగి ఉండాలి,దానికి ఎలాంటి, training తీసుకోవాలో Genius gym లో విద్యార్థులకు ఎటువంటి శిక్షణ ఇస్తారో తెలుపుతూ ఈ పుస్తకాన్ని ముగిస్తారు.             

విద్యార్థులు,వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా చదవ వలసిన practical way of conversation ఇందులో వివరించబడింది. తరువాత Genius Gym లో శిక్షణ పొంది genius లుగా మారటానికి ఈ పుస్తకం పునాదిలాగా పనిచేస్తుంది. విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పక చదవ వలసిన పుస్తకం ఇది.

-ఒద్దుల రవిశేఖర్

👉 స్టూడెంట్ నెంబర్-1 పుస్తకం హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో 50, 101 నెంబర్ స్టాల్స్ లో దొరుకుతుంది.

👉పోస్ట్ ద్వారా పొందాలనుకునే వారు ఈ కింది లింక్ క్లిక్ చేయండి. పోస్ట్ ద్వారా మీ ఇంటికి పంపిస్తాం. 

https://imjo.in/sX2DmY