Monday 2 April 2012

బాధించే జ్ఞాపకాలు మరచిపోవటం ఎలా?3


            ఇక చివరగా మనసంటే ఏమిటి?మనమేగా !రెండు ఒకటేగా !అంటే   తనకు తాను ఓదార్చుకొని తనకు కలిగిన జ్ఞాపకాన్ని తనే మరచిపోవాలి.దానికి మన మనసు తో కొన్ని ప్రక్రియలు నిర్వహించాలి .జ్ఞాపకాన్ని వదలటానికి దాన్ని పట్టుకునేదేది?బాధఅదిఎక్కడ కలిగింది మన మనుకుకుంటాము. హృదయానికి గాయం అయింది !మన స్పందనలు,మన సున్నితత్వం హృదయానికి  సంబంధించిన వే, కాని విచక్షణ బుద్ధికి సంబందించినది హృదయపు  బాధకూడా మనసు బాధకూడా మనసు  సరిచేయాల్సిందే! అంతవరకు o.k కదా!ఇది అంతా ఆలోచించండి బాగా.నాకు లానే మీరు ఆలోచించాలని లేదు.నేను ఒక కోణాన్ని మీకు పరిచయం చేస్తున్నాను.మీకు మరిన్ని కొత్త ఆలోచనలు రావచ్చు.
                   పరిష్కారం  దిశగా అడుగులు  వేద్దాం.ప్రతి   మనిషి తనకు తాను పూర్తిగా విభిన్నం  మన ఆలోచనలుఅభిప్రాయాలు   అభిరుచులు ప్రవర్తన మనకే సొంతం.తల్లి,తండ్రి ,భార్య ,భర్త పిల్లలు ,స్నేహితులు బంధువులు ఎవ్వరు నీవు కాదు..ఇంకా   కఠినంగా  చెప్పాలంటే నీవు ప్రేమించినవిఇష్టపడ్డవి, పెంచుకున్నవిపంచుకున్నవి ప్రతిది  కూడా   నీలాగే    వేరేవారికి వుండాలని  లేదు కాలం వాటినన్నిటిని  తుంచి వేస్తూ ముందుకు  పోతుంటుంది .నీవు  పెంచుకున్నంత మమకారం  వారికి నీ  ఫై  వుండదు . ప్రేమికులు  వైవాహిక   జీవితం  లో  పెళ్లికి  ముందు సాంద్రతను  అనుభవించ గలుగు తున్నారా  !మనం పొందిన అనుబంధాల్లోని గాఢతలు  ప్రస్థుతం    సంబంధాల్లో లేవు .కాని గతం  మన ఊహల్లో వుంటుంది   .గతం  మన జీవితం  లో  నిజం గా వర్తమానం  అయ్యుంటె  ఖచ్చితంగా   వర్తమానానికి  మరో  గతం  తోడవుతుంది    ..కఠినంగా  చెప్పినా వాస్తవ  మిదే  !ఇకపోతే మన హ్రుదయ సమ్మతి  లేకుండా   ఒక్కరు, ఒక్క విషయం మనల్ని బాధించలేవు  గాయం కలిగించిన వ్యక్తులు  పశ్చాత్తాపపడి   వుండవచ్చు .కొంతమంది  మీకు విచారం వ్యక్తం  చేసి వుండవచ్చు . మరి కొంత  మంది మీకు తెలియకుండానే   మిమ్మల్ని తమ  మనసులోనే  క్షమాపణలు  కోరివుండ   వచ్చు.అంటే  వారు మారి ఉండవచ్చు .సన్నిహితులు  ఎలాంటి  మార్పుకు లోనైతే  మనం  గాయాలను మరచి పోవటానికి   కొద్దిగా క్షమ వుంటె  చాలు.స్నేహితులు   అలా దూరమైతే    మరల కలవక పోయినా  మనసులోనే  వారిని క్షమించేసుకొని  బాధనుండి విముక్తి  చెందవచ్చు.ప్రతి  జ్ఞాపకాన్ని మన మనసు పొరల పై  నుండి  శుభ్రం  చేసుకునేందుకు   క్షమ ఒక ఆయుధం.
           ఇంకొకటి  కలవ లేనంతగా   దెబ్బతిన్న  సంబంధాలు పునరుధ్ధరించ లేక  పోయినా   దెబ్బ మనసు నుండి  తుడిచి    వేయటానికి  మరో  ఆయుధం వుంది గమనించండి .మన జీవన ప్రయాణం  లో  అందరు మనకు పరిచయం అయిన వారే !(బంధువులతో   సహా).కాని చివరివరకు  మనకు మనమే  తోడుగా   వుంటాము .ఇది రైలు  ప్రయాణం  ఎక్కుతుంటారు ,.దిగుతుంటారు .మరణం  వరకు మనకు తోడు   మన మనసు మాత్రమే  వుంటుంది .ఇతరులకోసం ,వేరెవరికోసమో ,ఏవో సంఘటనల  నుంచో   దాన్ని మనం వారి ఆలోచనలతో  ,బాధలతో   నింపి మన మనసును వారికి, బాధలకు అప్పజెప్పేబదులు మన మనసును మన స్వాధీనం లో  వుంచుకుందాము .దాన్ని శుభ్రం  చేసుకుంటే    అద్దం పై  మనకు మనం మరింత  కొత్తగా   కని పిస్తాము .మన ముఖం లో  మరింత  వెలుగు వస్తుంది .ఇది ఎవరికోసమో  కాదు,పూర్తిగా  మన కోసమే  .అప్పుడు   మనస్సు చిత్రం పై  వర్తమానం లో   ని ప్రతిక్షణం    ఆనంద  గీతాన్ని  లిఖించుకుందాము.మన విషాదాలకు మరొకరు కారణం  కాకూడదు .అలాగే   మనం మరొకరి విషాదాలకు మూలం  కాకూడదు .మన ఆనందం మన చేతుల్లోనే   వుంది.అప్పుడు మాత్రమే   మనం  ఇతరులకి  ఆనందాన్ని ఇవ్వగలం.అప్పుడు  చూడండి !మన  జీవితాల్లో   ప్రతిక్షనం    సజీవ నిత్య  చైతన్యం  తాండవిస్తుంది .అది అవతలి వారికి కూదా   అధ్భుతం  లా తోస్తుంది .వారిలో  మార్పు వస్తుంది .వెంటనే  రాకున్న క్రమేపి  వస్తుంది .కాని మనం మాత్రం  వర్తమానాన్ని  క్షణక్షణం  మనకోసం  ఆనందంగా   గడపవచ్చు .ఆలోచించండి .

Saturday 31 March 2012

బాధించే జ్ఞాపకాలు మరచి పోవటం ఎలా? 2



ప్రేమలో వైఫల్యం
,స్నేహితుల మధ్య మనస్పర్థలు,office లలో సహచరులతో వాగ్వాదం,బంధువులతో మాట తేడాలు,భార్యా భర్తల ఎడబాటు,మాట జారటం ,ఆస్తి పంపకాలు,సంసారం లో సమస్యలు,సంతానం సరిగా చూడకపోవటం,ఇక మన చదువులలో ,మన వృత్తులలోమరిన్ని  ఓటములు,అనుకున్నది సాధించుకోలేక పోవటం,సరి అయిన సమయానికి సరి అయిన నిర్ణయాలు తీసుకోలేక అవకాశాలు కోల్పోవటం,కలగన్నవి పొందలేకపోవటం,,బంధువుల,సన్నిహితుల  మరణం ఇలా మన జీవితం లో ఎక్కడో ఒకచోట లేదా పలు సందర్భాలలో ,మనసుకు ఎంతో బాధ కలిగించే సంఘటనలు మనకు తటస్తించి వుంటాయి.అవన్నీ మన మనస్సులో జ్ఞాపకాలుగా స్థిరపడి పోయుంటాయి.
               ఇక వర్తమానం లో  జ్ఞాపకాల ఆధారం గా మన  ఆలోచనలు,నిర్ణయాలు,మాటలుప్రవర్తనఅభిప్రాయాలు అన్నీ రూపుదిద్దుకుంటాయి.ఇవి ఆజ్ఞాపకాలలోని బాధలను దూరం చేసేవైతే ఫర్లేదు.
గుణపాటాల్లాగా తీసుకుని మరల చేసిన ఆ తప్పులు దొర్లకుండా  అనుభవాలని పునాది చేసుకుని జీవితాన్ని మరింత ఉన్నతంగా దిద్దుకోవడానికి ఉపయోగించుకున్నంత వరకు  మంచిదే.
                  సంఘటనల్లోని  బాధను,ఓటముల్ని,అవమానాల్ని,గుర్తు తెచ్చుకొని బాధపడుతుంటే  మనసు నూతనత్వాన్ని కోల్పోతుంది.వర్తమానం లోని ఆనందాన్ని అనుభవించలేదు.మన జీవితం లోని ప్రతిది నూతనం గా క్రొత్తగా వుంటుంది.ప్రకృతి అలాగే వుంటుంది.ప్రతి క్షణం గతించిన క్షణానికి భిన్నం గా వుంటుంది.భూమితో సహా సూర్య చంద్రాదులు  ప్రతిక్షణం వేగంగా ప్రయాణిస్తూ వుంటాయి .వాటి కనుగునంగా భూమి ఫై  మార్పులు కూడా చలి,ఎండా ,వాన,రుతువుల్లో మార్పులు ఇవన్నీ అంతే!మరి మనలో కూడా కాలం నూతనత్వాన్ని మోసుకొస్తూ వుంటుంది.మనం అందులో ఉండకుండా గతం     బాధలోనో ,భవిష్యత్తు పట్ల భయంతోనో వర్తమానం లో వుండలేకపోతున్నాము. క్షణం ఒక సజీవ దృశ్యం.t.v లలో ప్రత్యక్ష ప్రసారం ఎంత కుతూహలం గా చూస్తాము.రికార్డు అయిన ప్రోగ్రాం లో అంత మజా ఉంటుందా !
                   ఇక వాటిని మరవటం ఎలా?మన శరీరం చిన్న గాయాల్ని జబ్బుల్ని తనకు తానే బాగుచేసుకుంటుంది.కొద్దిగా పెద్దవి వైద్యసహాయం తో సరిచేసుకుంటుంది.కొన్ని సందర్భాలలో ఆయా భాగాలను తీసివేసి  సమస్యకు పరిష్కారం చేస్తారు.అంతేకాని వచ్చిన రుగ్మతను సరిచేసుకోకుండా అలాగే వుంటే క్రమేపి శరీరం మొత్తం దెబ్బతింటుంది.మరిమనసు అంతేగదా గతం లో సమస్య ప్రస్తుతం బాధిస్తుంది .పరిష్కారమేమిటి?వాస్తవానికి మన చిన్నప్పటి సంఘటనలన్నీ మనకు గుర్తువున్నయాలేదుకదా అలా గుర్తుండి వుంటే మన బుర్ర వేడి ఎక్కి పిచ్చెక్కి వుండేది.చాలా విషయా లు మనం మరచి పోతు ఉంటాము .అంటే తనకు తాను మనసు శుభ్రం చేసుకుంటుంది.కాని పయిన చెప్పిన జ్ఞాపకాలు అంత త్వరగా మనసు తీసివేసు కోలేదు.మరి ఎట్లా !
            చూడండి.రోజు వార్తా పత్రికలలో t.v లలో ఎన్నో ఘోరాలు,నేరాలు జరుగుతుంటాయి.అయ్యో అనుకుంటాము.మరచిపోతు ఉంటాము.అలాగే మన కష్టాల కంటే ,బాధలకంటే ,ఓటముల కంటే నష్టాలకంటే మరింత పెద్దవి ,ఇతరుల జీవితాల్లోనివి తెలుసుకొని పాపం అనుకోని వదిలివేస్తుంటాము అంతకంటే మనవి చాలా చిన్నవి అయినా మనం మరచిపోలేము.అలాగే మన దగ్గరివారు ఇబ్బందుల్లో వుంటే వారిని ఓదార్చుతుంటాము .మరచిపోవాలండి!పోయిన వారితో మనం పోతామా అంటూ!అంటే మనకు మరచిపోవటం చాలా బాగా తెలుసు.
   చాలా ఎక్కువయింది కదా !అందుకే  ముగింపు తరువాత!   



Friday 30 March 2012

కవితారవి... ఒద్దుల రవిశేఖర్

                 అక్షరాలను అస్త్రశస్త్రాలుగా మలచినవాడు                      
                       నిశ్శబ్దం లోని శబ్దాన్ని వినేవాడు
                 అభావం లోని భావాన్నిచూసేవాడు
                        ప్రకృతి లోని కృతిని పాడేవాడు
                 అంతరంగ లోతుల్నిస్ప్రుశించేవాడు
                         ఆనందపు అంచుల్ని తాకేవాడు
                 పూలపరిమళాన్నిపుటలఫై చల్లేవాడు
                         పండు వెన్నెలను పగలే చూపించేవాడు
                 ఇంద్రధనుస్సు లోని రంగుల మర్మం తెలిసినవాడు
                         చెరకు విల్లును వంచి చెక్కర రసాన్ని గ్రోలేవాడు
                 చెలి చెక్కిలి ఫై చక్కిలిగింతలు పెట్టేవాడు
                         ప్రణయం  లో ప్రణవరాగం వినిపించేవాడు
                  కవితా కాంతులతో వెన్నెల కావ్యాలు రచించినవాడు
                         సౌందర్యం లోని సౌరభాన్ని వెదజల్లే వాడు
                  శృంగారం లోని రహస్యాలను శోధించేవాడు
                         ఒక్క పిలుపుతో లక్ష అక్షౌహినులయ్యేవాడు
                   ఒక్కపలుకుతో సహస్ర శతఘ్నలు  పేల్చేవాడు
                         మనిషి వేదనను  ఉచ్చ్వాశించేవాడు
                  కవితాక్షరాలతో    నిశ్వాశించేవాడు
                         సమస్యల ఫై పర్జన్య శంఖం పూరించేవాడు
                  అన్నార్తుల పాలిట  ఆపన్నహస్తం అయ్యేవాడు
                         కష్ట జీవుల స్వేదం లో నిర్వేదం తెలిసిన వాడు
                  కర్షకుల కష్టాన్ని కన్నీటితో పలికించినవాడు
                         కార్మికుని కడుపాకలిని పసిగట్టేవాడు
                  కాలం చెక్కే చరిత్రను క్రమబద్ధం చేసే వాడు
                          ప్రతి ఎద లోని వ్యధలను  వినేవాడు
                  అవినీతిని కవిత్వం తో ఖడ్గ  ప్రహారం  చేశేవాడు
                          అంధకారాన్ని  చీల్చుతూ వెలుగురేకలు నింపేవాడు
                 నిజాల నిప్పులు చిమ్ముకుంటూ నింగి    కెగరేవాడు
                          ఇజాల తుప్పు  వదిలిస్తూ డప్పు మ్రోగించేవాడు   
                  నిత్యం సత్యాలను ఆవిష్కరించేవాడు
                          తిమిరం ఫై జ్ఞానఖడ్గం తో సమరం   చేశేవాడు

Sunday 25 March 2012

గత కాలపు జ్ఞాపకాలను మరచిపోవటం ఎలా?


            విద్యార్థి దశలోవిద్యకు సంబంధించి ప్రతి విషయం విద్యార్థులు బాగా గుర్తుపెట్టుకుంటారు.ఎవరు ఎంత బాగా గుర్తు పెట్టుకుంటే అంత ఉత్తమ విద్యార్థి క్రింద లెక్క ఇది సబ్జెక్టులకు సంబంధించి మరి మిగతా విషయాల పరిస్థితి ఏంటి?అన్నీఅలా గుర్తు పెట్టుకుంటే మరింత మంచి విద్యార్థి అవుతాడా? ఉదాహరణకి ఒకచిన్నపరీక్షలో విఫలమయ్యాడు .అది అలాగే గుర్తుంచుకొని బాధపడుతుంటే సరిపోతుందా.ఆ ఓటమి నుంచి పాటం నేర్చుకొని మరింత ఉత్తేజంతోముందు కెల్లాలి కదా! నాకు ఈ సబ్జెక్టు రాదు అని కుమిలిపోతే ఎలా? అలాగే ఆటల్లోఓటమి చెందితే ఆ ఓటమిని స్పూర్తిగా తీసుకుని మరింత బాగా ఆడాలి కదా !సహజంగా ఆ వయసులో మనసు స్వచ్చంగా వుంటుంది.కాబట్టి చాలావరకు తేలిగ్గా ఓటములు, అవమానాలు,శిక్షలు మరచిపోతుంటారు.గమనించారా!మనం పిల్లల్నిఎప్పుడన్నాకసురుకున్నా మరికొద్దిసేపటికి అది మరచిపోయి మరల మన దగ్గరకొస్తారు.కానీ పెరిగి పెద్దయి జీవితాల్లో స్థిరపడ్డ తరువాత పరిస్థితి ఏమిటి?మనకు ఈ మరచిపోవటం, గుర్తువుంచుకోవటాన్నిఅన్వయిద్దాము .మన వృత్తి కవసరమయిన విషయాలు,సాంకేతిక జ్ఞానాన్నిఅన్వయించి పనిచేయటానికి అవసరమయినదంతా గుర్తుంచుకోవాల్సిందే.
     మరి మనజీవితంలో మరపుకు జ్ఞాపకం కు గల పాత్ర ఏమిటి. మనజీవితంలో ఎన్నో ఓటములు విజయాలు లభిస్తుంటాయి.ఎన్నోకష్టాలు,సుఖాలు అనుభవిస్తుఉంటాము .మరెన్నోఅవమానాలు నిందలు  మరికొన్నిప్రశంసలు లభిస్తుంటాయి.సంసారం లోమరెన్నోఅనుభవాలు ఇలా జీవితం,కొన్నిసార్లు ముళ్ళబాట,పూలబాట లాగా అనిపిస్తూవుంటుంది.మరి ఈ జ్ఞాపకాలు మనల్ని ఏమిచేస్తుంటాయి వాటినంత తేలిగ్గామరచి పోగలమా ఇందులోమధుర మయినవి బాధించేవి వుంటాయి మధురమయిన వాటితో ఓ.కే అవి తలచుకోగానే మనసు ఆనందంలోతేలియాడుతుంది.మరి భాదించే వాటి పరిస్థితిఏమిటి? వాటిని పూర్తిగా మరచి పోగలమా లేదా అవి జీవితమంతా గుర్తుంచు కొంటామా తరచి తరచి ప్రశ్నించుకోండి.
                  ఇలా బాధలను,కష్టాలను,అవమానాలను,మనసును గాయం చేసిన సంఘటనలను అలా ప్రోగు చేసుకుంటూ గుర్తుపెట్టుకొని తలచుకొని బాధపడుతుంటే ఆ మనసు వర్తమానాన్నిఎలా ఆస్వాదింపగలదు బాగా ఆలోచించండి ఒక ఓటమి,ఒక  కటువయిన మాట, ఓ బాధాకరమయిన సంఘటన ఓ జారిపోయిన అద్రుష్టం  ఎందుకు మనసును పదేపదే తొలుస్తుంటాయి.చూడండీ! ఇవి ఎంత గుర్తొస్తుంటే అంతగావర్తమానాన్నిమనం కోల్పో తున్నట్లు లెక్క ఎంత త్వరగా అటువంటి వాటిని మనం మరచి పోతే మన వర్తమానానికి ,భవిష్యత్తుకు అంత మంచిది.మానసిక ప్రయోగాలలోని మరో అంశం గత కాలపు జ్ఞాపకాలు మరచిపోవటం ఎలా?మరో వ్యాసంలో దీనిని వివరిస్తాను..
     మరి మనజీవితంలో మరపుకు జ్ఞాపకం కు గల పాత్ర ఏమిటి. మనజీవితంలో ఎన్నో ఓటములు విజయాలు లభిస్తుంటాయి.ఎన్నోకష్టాలు,సుఖాలు అనుభవిస్తుఉంటాము .మరెన్నోఅవమానాలు నిందలు  మరికొన్నిప్రశంసలు లభిస్తుంటాయి.సంసారం లోమరెన్నోఅనుభవాలు ఇలా జీవితం,కొన్నిసార్లు ముళ్ళబాట,పూలబాట లాగా అనిపిస్తూవుంటుంది.మరి ఈ జ్ఞాపకాలు మనల్ని ఏమిచేస్తుంటాయి వాటినంత తేలిగ్గామరచి పోగలమా ఇందులోమధుర మయినవి బాధించేవి వుంటాయి మధురమయిన వాటితో ఓ.కే అవి తలచుకోగానే మనసు ఆనందంలోతేలియాడుతుంది.మరి భాదించే వాటి పరిస్థితిఏమిటి? వాటిని పూర్తిగా మరచి పోగలమా లేదా అవి జీవితమంతా గుర్తుంచు కొంటామా తరచి తరచి ప్రశ్నించుకోండి.
                  ఇలా బాధలను,కష్టాలను,అవమానాలను,మనసును గాయం చేసిన సంఘటనలను అలా ప్రోగు చేసుకుంటూ గుర్తుపెట్టుకొని తలచుకొని బాధపడుతుంటే ఆ మనసు వర్తమానాన్నిఎలా ఆస్వాదింపగలదు బాగా ఆలోచించండి ఒక ఓటమి,ఒక  కటువయిన మాట, ఓ బాధాకరమయిన సంఘటన ఓ జారిపోయిన అద్రుష్టం  ఎందుకు మనసును పదేపదే తొలుస్తుంటాయి.చూడండీ! ఇవి ఎంత గుర్తొస్తుంటే అంతగావర్తమానాన్నిమనం కోల్పో తున్నట్లు లెక్క ఎంత త్వరగా అటువంటి వాటిని మనం మరచి పోతే మన వర్తమానానికి ,భవిష్యత్తుకు అంత మంచిది.మానసిక ప్రయోగాలలోని మరో అంశం గత కాలపు జ్ఞాపకాలను మరచిపోవటం ఎలా? మరో వ్యాసంలో దీనిని వివరిస్తాను.

Friday 23 March 2012

ఇవన్నీ మీ అనుభవం లోకి వచ్చాయా


పూల పరిమళాన్ని కళ్ళు మూసుకుని మనస్సంతా సువాసన ఫై నే  కేంద్రీకరించి ఎప్పుడయినా ఆఘ్రానిం చారా !
ఉషోదయాన కన్నులు నిలువెల్లా తెరిచి ఆకసపు అరుణ కాంతిని  ఆస్వాదించారా
సంధ్యా సమయాన పడమర కొండల సోయగాన్ని చూశారా
పున్నమివెన్నెల తనువెల్లా స్పృశిస్తుంటే అందులోని చల్లదనాన్ని అనుభవించారా
సుప్రభాతం వీనులకు విందు చేస్తుంటే గోవులమెడలోని మువ్వల శబ్దాన్ని విన్నారా
మావి చిగురుతిని కుహుకుహు రాగాలు పలికే కోయిల  స్వరాలను ఆలకించారా
సెలయేటిలో పాదాలు వుంచి కాళ్ళ క్రింద నీళ్ళు జారిపోతుంటే వంటిపయికి ప్రాకే తిమ్మిరి తెలిసిందా
సముద్రపు ఒడ్డున అలలు కాళ్ళను తగులుతూ ఇసుకను లాగేస్తుంటే వెన్నుపూసలోకి ప్రాకే జలదరింపు ను గుర్తించారా
పూల పుప్పొడి రేణువులు చేతివేళ్ళకు తగిలే స్పర్శ నెప్పుడన్నా   అనుభవించారా 
భూమి విచ్చుకొని పొడుచుకువచ్చే మొక్కను తడిమి తన్మయత్వం చెందారా 
పిల్లి పిల్లల్ని లేగదూడలని ,కుక్కపిల్లల్ని పెంచిన అనుభవమున్నదా  
చెరువుల్లో,బావుల్లో,కాలువల్లో చేపపిల్లల్లా  ఈదిన జ్ఞాపకాలేమయినా ఉన్నాయా
మంచుతెరలు కమ్ముకున్న శీతాకాలం ఉదయాల్లోని చలిమంటల్లోని వెచ్చదనం గుర్తుందా
ప్రక్రుతి పరవశించి పోయాలా  ఆకుపచ్చ చీరకట్టుకొని నర్తించే అడవుల సౌందర్యాన్ని ఎప్పుడన్నా గ్రోలారా
వర్షం వెలిసిన తరువాత గగనాంగన కప్పుకున్న ఇంద్రధనుస్సుపయిటను మయిమరచి చూశారా 
పొద్దుతిరుగుడు పూల తోటలో తిరుగుతూ వాటి అందాల్ని  చూశారా 
చిరుజల్లుల వానలో తడుస్తూ ఎప్పుడన్నా నాట్యం చేశారా 
ఆరుబయట పక్కేసుకొని ఆకాశం లోని నక్షత్రాలను లెక్క పెట్టారా    
హరిప్రసాద్ చౌరాసియా వేణుగానాన్ని వింటూ అడవుల్లో రైలు   మార్గం గుండా ప్రయానించారా  
వేణువును ఊదుతూ,కీ బోర్డ్   లోని మీటలను నొక్కుతూ సరిగమ లెప్పుడన్నా పలికించారా 
వెండి మేఘాలు కొండల మీద ప్రయాణిస్తుంటే వాటినెప్పుడన్నా   పట్టుకున్నారా 
ఒంటరిగా నీలో నీవు గడుపుతూ నీ హృదయాంతరంగం లోని మౌనభాష నెప్పుడన్నా తెలుసుకున్నారా    
ఇవన్నీ మీ అనుభవం లోకి వచ్చాయా                    

Thursday 22 March 2012

ఉగాది

తెలుగు వారందరికీ నందననామ సంవత్సర శుభాకాంక్షలు .మనమింత స్వేచ్చగా ,స్వచ్చంగా భావ వ్యక్తీకరణ చేస్తున్నామంటే మన మాతృభాష తెలుగు కారణం.మనకెన్ని భాషలయినా  వచ్చి  ఉండవచ్చు,కాని మన అంతరంగ లోతుల్ని ఆవిష్కరించేది మన మాతృ భాషే!ఆనంద విషాదాలు ,ఆప్యాయతానురాగాలు,ప్రేమాభిమానాలు మన సమస్త భావోద్వేగాలు మన భాష లో ప్రకటించినంత స్వచ్చం గా  వేరే భాష లో ప్రకటించలేమేమో !                                                  
                                       అందుకే ఐక్యరాజ్యసమితి కూడా   ఎవరి మాతృభాష  ను  వారు  పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చింది .ప్రపంచం లోని ఇంత అభివృద్ధికి ,ఇంత నాగరికతకు భాషలే కారణం .మన భాషను మనం కాపాడుకుంటూ ఇతర భాషలను నేర్చుకుంటూ ఆ భాషల్లోకి మన సాహిత్యాన్ని తర్జుమా చేస్తూ వారి సాహిత్యాన్ని మన వారికందిస్తూ ,విభిన్న సంస్కృతుల సంగమానికి మార్గాలు  వెయ్యాలి .అప్పుడు మన భాష లోని సౌందర్యం ఇతర భాషలలోనికి వారి భాష ల లోని మాధుర్యం మనం గ్రోలటానికి అవకాశం వుంటుంది.చాలా మంది పెద్దలు ఈ ప్రయత్నం లో వున్నారు.ప్రపంచ చరిత్ర అంతా  భాషలలోనే ఇమిడి  వుంది.మనం ప్రస్తుతం ఉపయోగించే బ్లాగులు  కూడా భాషా  వికాసానికి బాగా   ఉపయోగ పడుతున్నాయి .THANKS TO GOOGLE.
 

Tuesday 20 March 2012

పోలికలోనుండి పుట్టిన ఈర్ష్యను ఎలా జయించాలి?

                   యువకులుగా వున్నప్పుడు  జీవితం గురించి  ఎన్నో కలలు  కంటాం.జీవితంలో విభిన్న వృత్తుల్లో స్థిర  పడ్డ తరువాత వెనుదిరిగి చూసుకుంటే కొన్ని నెరవేరుతాయి.మరికొన్నినెరవేరవు.మరికొంతమందికిఅసలేమి  నెరవేరవు.ఈ లోపు మీతో చదువుకున్న వాళ్ళు ,మీ బంధువులు,మీ స్నేహితులు ,మీ పక్కింటి వారు  మీకన్నా బాగా స్థిరపడి వుంటారు.అప్పుడు మొదలౌతుంది  మీలో.వారిలా మనం లేమే .వారికున్న  ఆస్తులు,హోదా,అందం  ,పలుకుబడి మనకులేవే అన్న పోలిక మొదలౌతుంది.అందులోనుండి  ఈర్ష్య పుడుతుంది.ఈ పోలిక తో ప్రారంభమయిన ఈర్ష్య మనిషిని  ఒక పట్టాన వదలదు.కొంతమంది దీన్నిఆరోగ్యకరమయిన రీతిలో తీసుకొని తాము ఎదగటానికి ప్రయత్నిస్తారు.మరికొంతమంది ఈర్ష్య స్థితిలోనే జీవితాన్ని  కొనసాగిస్తారు.ఈ మొత్తం ప్రక్రియను పరిశీలిస్తే ఎవరు ఇదంతా చేస్తుంది,అని ఆలోచిస్తే మీకు మన మనసే అని సమాధానం దొరుకుతుంది.
                       మరి ఈ ధోరణి సరి అయినదేనా !సరి అయినది కాదు అనుకుంటే దాని వాళ్ళ నష్టం ఏమిటి అని ఆలోచిస్తే ,ఈర్ష్య ఒక నకారాత్మక  మానసిక స్థితి.అది నిరంతరం మనసును మెలిపెడుతుంది.మనకు తెలిసిన ప్రతి ఒక్కరి ఉన్నత స్థితిని పోల్చుకుంటుంది.తనకు లేదని దిగులు చెందుతుంది.దాంతో వారిపట్ల వ్యతిరేక భావాన్ని
పెంచుకుంటుంది .దీని లోంచి ఎదుటివారికి ఏదయినా నష్టం జరిగితే  మనసు ఆనందిస్తుంది.ఎదుటివారు దెబ్బ  తినాలని కోరుకుంటుంది .వారికి విజయాలు లభిస్తే తట్టుకోలేనంత అసూయ కలుగుతుంది.ఇదంతా మనసు లో పేరుకునిపోయి విభిన్నమయిన వ్యాధులుగా బయటపడతాయి.ముఖ్యం గా వ్యాపారం లో వున్నవారు,క్రీడాకారులు ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారికి   ,ప్రభుత్వ స్థాయి లోని అధికార యంత్రాగం లోని వారికి ,వారు వీరని కాదు అన్ని వర్గాలలో ఇది ఎంతోకొంత వుంటుంది.,ఇంత నష్టం కలుగుతుంటే మనం దాన్ని అనుభవించాల్సిందేనా!మరి పోలిక నుండి పుట్టిన ఈర్ష్యను తొలగించు కోవాలంటే   ఎలా?
                    ఒక్క సారి మనసు చేసే ఈ ప్రక్రియను దాని ద్వారానే విశ్లేషిద్దాము.మనం మనకి పరిచయం లేని వారితో ఎందుకు పోల్చుకోము.ఇది అర్థమయితే ఈ ప్రక్రియ అంతా ఆగిపోతుంది.ఎందుకంటే మీకు వారు తెలుసుకాని వారికి మీరు తెలీదు కాబట్టి.వారెప్పుడు మీకు పరిచయం లేదుకాబట్టి.ఒక సారి ఆలోచించండి.మీరు పోల్చుకునే వారికంటే కొన్ని కోట్లమంది ఎక్కువ సంపద కలిగినవారు ఉన్నారు.ఉదాహరణకు మనకు billgates(microsoft) ను ,ముకేష్ అంబాని ని చూసినా  ఎటువంటి ఈర్ష్య కలగదు ,కాని    మన స్నేహితుడు కాస్త ఉన్నత స్థితిలో  వుంటే  అసూయ కలుగుతుంది.అలాగే మన సహోద్యోగి మన కన్నా కాస్త సంపదకలిగి వుంటే మనసు విలవిలలాడి  పోతుంది.ఈ తేడా ను జాగ్రత్తగా అంచనా వేయండి.తెలిసిన వాళ్ళయినా ,తెలియని వాళ్ళనయినా ఒకే  రకం  గా పరిగణిస్తే మనసుకు ఈ సంఘర్షణ ఉండదుకదా !అసలు ఎవరి అవకాశాలు వారివి.ఒకరివి  ఒకరికి  రావు  కదా .మనం ఆలోచించాల్సింది  మనం ఎంత సంతృప్తిగా జీవితాన్ని కొనసాగిస్తున్నాము.ఎంత ఆనందంగా  వుండగ లుగుతున్నాము అన్నది  ప్రధానం.జీవితమంటే  ఆనందం, ఒక సంతృప్తి,ప్రతిక్షణం  పరిపూర్ణం గా జీవించాల్సిన  ఒక ప్రయాణం .ఈ విధంగా ఆలోచించండి.మనసు  పోలికలు లేకుండా పరిపూర్ణంగా వుండటం మీరే  చూస్తారు.

Sunday 18 March 2012

ఇవన్నీ ప్రేమలా వుంటాయోమో!

పూల పరిమళం
వెన్నెల వర్షం
హిమపాతపు చల్లదనం
ఉషోదయ గీతం
సంధ్యా రాగం
ఇంద్ర ధనుస్సు వర్ణం
ఇవన్నీ ప్రేమలా వుంటాయోమో!  

Saturday 17 March 2012

ప్రకృతీ పదనిసలతో సరిగమలు

కురిసీ కురియని మేఘాలెన్నో వచ్చి వెళుతున్నాయి
వసంతాలు హేమంతాలన్ని కరిగి పోతున్నాయి
వెలుగు వెనుక చీకటి,చీకటి వెనుక వెలుగులెన్నో
                                                              దొర్లిపోతున్నాయి
అమావాస్యల అనురాగాలు ,వెన్నెల మందారాలు
                                                             మౌనంగా వెళ్ళిపోతున్నాయి
తీరం తెలియని నావ సంద్రంలో సంగమించి పోబోతుంది
ఉషోదయం చూసి ఉత్సాహంగా ఉందామన్నా
సంధ్య వెలుగువచ్చి చీకటికి స్వాగతమిస్తుంటే
మనసు,మమతల మకరందాలు విన్నవించ లేకున్నా
 మాటలకు రూపమిద్దామని అనుకున్నానంతలో
నీలాల గగనాన జాబిల్లి ఎందుకో ననుచుసి నవ్వుతోంది
పాటకు పల్లవి కూరుధ్ధామన్నా నా శబ్ద విపంచులు
ప్రకృతి నాదాల సవ్వడిలో కలిసిపోతున్నాయి
కవిత్వాక్షరాలను అవనిఫై  అక్షరీకరిద్దామన్నా
ఏమిటో అంతర్భాగాన అర్థం కాని నాదాలు,బాహ్యప్రపంచాన
                                                                            దుఖాశ్రువుల గీతాలు
నీ చిరునవ్వుల ముఖ సౌందర్యాన్ని   
                                            ఆకాశం కాన్వాసుమీద చిత్రిద్దామన్నా
అంతలో తెల్లని మేఘాల మాలికలు
                                             నీ చిరునవ్వులనే శ్రుతి చేస్తున్నాయి
అంటే నీవు నీవుగా లేవనుకుంటున్నాను
నీ కోసం వేచిచూసి చూసి విసుగుచెందానని భ్రమిస్తున్నాను  
ఇప్పుడర్ధమయ్యింది నీవు మౌనంగా దాచుకున్న హృదయానురాగాలను
ప్రకృతిలో మిళితం చేసావని
ఇప్పుడనుకుంటున్నాను!ప్రకృతి రూపమే నీవు,నీ రూపమే ప్రకృతని
కాని నిన్నుచూడాలని సవంత్సరాలతరబడి వేచిచూసిన  ఫలితాన్ని
ఇంత మనోహరమయిన   ప్రత్యూష నాదాలతో పల్లవించే
ప్రకృతీ పదనిసలతో సరిగమలు కూర్చావన్న మాట               

Tuesday 13 March 2012

స్నేహం అంటే ఓ ఆహ్లాదం 2

   ఎటువంటి చుట్టరికం లేకున్నా సన్నిహితంగావుంటూ కష్ట సుఖాలు ,ఆనంద విషాదాలు,సమస్యలు పంచుకోవటం ,ఓదార్పును పొందటం,ఇవ్వటం అవసరమయిన మేర సహకరించుకోవటం ఇవీ స్నేహ ధర్మాలు.బాల్య స్నేహితులు గా వుండి,విడిపోయి ఎప్పుడో మరల కలుసుకున్నా ఆ అభిమానాలు అలానే ఉంటాయి.యువకులుగా ఉన్నప్పటి స్నేహాలలో కొంచం సాంద్రత తక్కువగా వుంటుంది  ఇక జీవితాలలో స్థిరపడ్డ తరువాత ఏర్పడ్డ స్నేహాలు ఎక్కువ కాలం కొనసాగుతాయి.
         మరి ప్రస్తుత స్నేహాలు సమీక్షిస్తే ఒకప్పుడు ఉన్నంత మంచి స్నేహాలు, మిత్రులు ప్రస్తుతం ఉంటున్నారా!ఆర్థిక వ్యత్యాసాలు స్నేహానికి కొలమానం అవుతున్నాయా?అభిప్రాయ భేధాలతో స్నేహాలను వదులుకొంటున్నారా !పోటీ ప్రపంచం లోని ఈర్ష్య ,అసూయ ,పోలికలు స్నేహాలను దెబ్బ తీస్తున్నాయా?ఇవన్నీ ఆలోచిస్తే స్వచ్చమయిన      స్నేహంలోని సాంద్రత బాగా తగ్గినట్లు కనిపిస్తుంది.ఎదుటి మనిషి మనకు ఎలా ఉపయోగపడతాడా!అని ఆలోచించేవారు ఎక్కువయ్యారు.అవసరాలకోసం స్నేహాలు ఎక్కువయ్యాయి.వ్యాపార లావాదేవీల్లో స్నేహితులను మోసం చేసే వ్యక్తులు పెరిగి పోయారు.నమ్మకంగా వుంటూ మిత్ర ద్రోహం చేసే వాళ్లకు కొదువ లేదు.హోదా అంతస్తులు స్నేహాన్ని నిర్దేశిస్తున్నాయి.తమ తాహతుకు తగ్గ వారితోనే స్నేహాలు చేస్తున్నారు.ఇవన్ని గమనిస్తుంటే స్నేహం ఎలా ఉండాలో వ్రాయాలని పిస్తుంది.
         ప్రతి మనిషికి,తన భావాలు స్వేచ్చగా వ్యక్తపరచుకోవటానికి ఒక స్నేహితుడు/రాలు అవసరం.అలాంటి స్నేహం లో ఎలాంటి స్వార్థం ఉండకూడదు.ఒకరినొకరు మోసం చేసుకోకూడదు.హితము కోరేవాడే కదా స్నేహితుడు.ఆర్థిక వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకోకూడదు.స్నేహితుని చూస్తే ఆనందం కలగాలి.ఈర్ష్య,అసూయ కలుగుతున్నాయంటే ఆ స్నేహం కలుషితమవుతున్నట్లు.ఒక స్నేహంలో పరస్పరం ఎన్నో నేర్చు కోవాలి.విభిన్న అభిప్రాయాలు కలిగి వున్నా పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు వెళ్ళాలి.
       స్నేహం అంటే చంద్రుని వెన్నెలలా చల్లదనం ఇవ్వాలి.జీవితం లో అది ఒక సాంత్వన నివ్వాలి.స్నేహం అంటే ఓ నమ్మకం .స్నేహం అంటే ఓ ఆహ్లాదం.ఎటువంటి ఒడిదుడుకులు లేని ఓ ప్రయాణం.ఏమీ ఆశించని ఓ ఆనందాల హరివిల్లు.  

Saturday 10 March 2012

స్నేహం1

                       స్నేహం  గురించి వివరించేముందు దీని అర్థమేమిటో తెలుసుకుందామా! స్నేహం అంటే స్నేహితుల మధ్య ఉండే సంబంధం.మరి స్నేహితుడంటే ? a person with whom one enjoys mutual affection and regard(exclusive of sexual or family bonds)ఫై అర్థము oxford dictionary లోనిది .దానిని స్వేచ్చానువాదము చేస్తే  పరస్పర ఇష్టము కలిగి వున్న ఇద్దరు వ్యక్తులు ఒకరి సమక్షము లో మరొకరు ఆనందముగా వుంటే వారు స్నేహితులని భావించవచ్చు.(ఈ ఆనందానికి శృంగారపరమయిన ,కుటుంబ బంధాలు కారణము కాకూడదు.)
            ఇప్పుడు వివరముగా స్నేహము గురించి చర్చిద్దామా!ఫైన చెప్పుకున్నట్లు నిఘంటువుల్లో మాదిరిగా ఇది మనుషుల మధ్యనేనా?కాదు .సృష్టిలో అన్ని జీవరాశుల్లో  కూడా స్నేహము వుంటుంది.ఒకే జాతి జంతువుల మధ్య విభిన్న జాతుల మధ్య మనం చూస్తూ ఉంటాము. ఆ లక్షణమే  మనకు వచ్చింది.మనము వాటినుండి వచ్చినవారమే కదా! మనిషి బాల్యము నుండి ఇతరులతో  సంబంధాలు కలిగివుంటాడు వాటిలో ఏ  సంబంధము అయితే తనకు ఇష్టమో ,ఎవ్వరి సమక్షము లో అయితే ఆనందము కలుగుతుందో వారితో ఎక్కువగా మాట్లాడటము  ,ఎక్కువసేపు గడపటం  చేస్తుంటాడు.దానికి ప్రాతిపదిక ఎలా ఏర్పడుతుంది.అవతలి మనిషి హావభావాలు ,మాట తీరు,అతని అభిప్రాయాలు,ఇష్టా ఇష్టాలు  వంటి రకరకాల కారణాలతో ఫై సంభందము ఏర్పడుతుంది.ఇది బాల్యములో ఏర్పడవవచ్చు,తరువాత ఏర్పడవచ్చు.ఇలా ఒకరికొకరు స్నేహితులుగా వ్యవహరిస్తూ స్నేహం అనే బంధం లో వుంటారు.
స్నేహం ఫై ఇది ప్రారంభం మాత్రమే మరిన్ని వ్యాసాల కోసం వేచి చూడండి .     

Friday 9 March 2012

చర్చ వాదన

క్రితం టపాలో మనం చర్చ వాదన లోకి దిగకుండా ఎలా మనసును గమనించాలో తెలుసుకున్నాము.కాని ఇక్కడో విషయం!ఈ సందేహం మీకు వచ్చే వుంటుంది .అవతలివారు తప్పుడు సమాచారం చెబుతుంటే ఎలా?ఇక్కడ మనమో సంగతి అర్థం చేసుకోవాలి.కావాలని అలా మాటలాడుతున్నడా లేక నిజం గా తెలీక మాట్లాడుతున్నాడా అనే విషయం గ్రహిస్తే మనం సత్యం చెప్పినా వారు తమ అభిప్రాయాలు మార్చుకోరు.తెలీక పోతే తెలుసుకోవాలనే వారికి చెబుతాము కాని నటిస్తున్న వారికేమి చెబుతాము.
        సహజంగా వాస్తవం తెలిసివారు చెప్పకుండా ఊరుకోరు .కాని అవతలి వ్యక్తులను బట్టి మనం వ్యవహరించ  కలిగితే సమస్యలు రావు.సాధ్యమైనంత వరకు చర్చ ఎలా సాగుతుందో మనం గమనిస్తుంటే మన స్పందన లో లోపాలు లేకుండా సవరించుకోవచ్చు.కీలక విషయాలఫై అర్ధ వంతమయిన చర్చ ఆహ్వానించ దగిందే!కాని వ్యక్తిగత విషయాలపయికి   చర్చను మళ్ళించ కూడదు.విద్యార్థులు,యువకులు ఎక్కువగా సినిమా,క్రికెట్ ల గురించి మాట లాడుతుంటారు.ఏదో సినిమా బాగుందా లేదా అన్నంత వరకు మంచిదేకాని ఎవరుగొప్ప అన్నంతవరకు వెళ్ళకపోతే మంచిది.ఇక అభిమానం పేరుతో చేసేవన్నీ వృధానే!అలాగే క్రికెట్ ఫై చర్చ కూడా !
              మన మనసు నిరంతరం తను చేసేపనిని తనే గమనించేలాగా చేయగలిగితే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. 

Monday 5 March 2012

మనం మానసిక ప్రయోగాలు చేద్దామా !

మనం మానసిక ప్రయోగాలు చేద్దామా !
మనం రోజంతా గడిచిన తర్వాత ఇంటికి వచ్చి పడుకునేలోపు ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక్క సారి మన ప్రవర్తనను విశ్లేషించుకుంటే మనకు మనం అద్దం లాగా కనబడతాము.దీనికి ఇంకో ఉపాయం వుంది.ఇంటికి వచ్చేదాకా ఎందుకు మనం ఇతరులతో మాటలాడుతున్నప్పుడే ఒక వైపు ఈ ప్రక్రియ నడిపించగలిగితే మరీ మంచిది.సరే మీకు తోచిన సమయంలో చేయండి.
     సహజంగా మనం మాట్లాడుతున్నప్పుడు మనకు అనుకూలమయిన విధంగా ఎవరయినా మాట్లాడితే మనకు సరిపోతుంది.అలాకాకుండా వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే స్పందిస్తాము.ఆ స్పందన లో మాటలు జారుతాము.ఇక విషయం ప్రక్కదారి పట్టి మనం వాడిన భాష ఫై చర్చ మొదలవుతుంది.ఇక్కడ ఒక్క చిన్న విషయం .ఎవరికయినా తమ స్పందన తెలిపే హక్కు వారికుంటుంది.దానిలో మంచి చెడ్డలను మనం  విశ్లేషించాలే గాని స్వరం పెంచి వ్యక్తిగత విషయాలఫైకి   మల్లించాల్సిన అవసరం లేదు. ఇలాంటి  చర్చలు ప్రభుత్వ ఆఫీసులలో బాగా జరుగుతుంటాయి.పార్టీలలో,సమావేశాలలో పదిమంది కూడి ఉన్నప్పుడు ఇవి సాధారణం.మన అభిప్రాయాలు చెప్పడం వరకే మన భాద్యత .అది ఎదుటివారికి నచ్చాలని లేదు కదా.
           సహజంగా వార్తాపత్రికలలో వచ్చే విషయాలఫై  చర్చలు మొదలవుతాయి.అందులో రాజకీయాలదే కీలక పాత్ర .సినిమాలు,క్రికెట్   తరువాత !ఈ చర్చల్లో ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చవు.ఇక  వాదోపవాదాలు .అంతా అయిన తర్వాత మనం వాడిన భాష గుర్తుంటుంది .మానవ సంబంధాలు  దెబ్బతింటాయి. ఇక సామాజిక సమస్యలఫై  కూడా  ఇటువంటి చర్చలే నడుస్తుంటాయి.ఈ ప్రక్రియ నంతటిని ఒక వైపు మనసు గమనిస్తుంటే సూక్ష్మం లో చర్చ ముగుస్తుంది.ఇలా ప్రయత్నించండి.మరోసారి కలుద్దాము..   

Saturday 3 March 2012

సైన్సు@మొబైల్

సైన్సు@మొబైల్
జాతీయ సైన్సు దినోత్సవాల్లో భాగంగా విజ్ఞాన్ ప్రసార్,ఇగ్నో కలిసి సైన్సు@మొబైల్  ను ప్రవేశ పెట్టారు.సైన్సు కు సంభందించిన వార్తలు ,ముఖ్యమైన రోజులు,నిజాలు,సూక్తులు,శాస్త్ర వేత్తల వివరాలు,ఆరోగ్య చిట్కాలు ఉచితంగా sms రూపంలో అందిస్తుంది.SCIMBL అని టైపు చేసి 092230516161 కు sms పంపించాలి . లేదా  www.vigyanprasar.gov.in  లో SCIMBL  అని సెర్చ్ లో టైపు చేస్తే ఒక రిజిస్ట్రేషన్ form  వస్తుంది  అది  పూర్తి చేస్తే సరి.
దీనిని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు.అందరు దీనిని వినియోగించుకొని సైన్సు గురించి తెలుసుకోండి.